Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వరంగాల పనితీరు, ఆవశ్యకతపై ప్రధానమంత్రి ఫిబ్రవరి 23నాడు ఒక వెబినార్లో వెలిబుచ్చిన అభిప్రాయాలు దురదష్టకరం, అభ్యంతరకరం. ఇన్నాళ్ళూ భారత ఆర్థిక స్థితిగతులను ప్రభుత్వరంగం ద్వారా అభివద్ది పరుచుకుని ఇప్పుడు దానిని కించపరిచేలా మాట్లాడం దారుణం. ప్రభుత్వరంగాలలో వాటాల ఉపసంహరణ ద్వారా లక్షాడెబ్బయ్యారువేల కోట్ల నిధులను సమీకరించుకోవాలని ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదన పెట్టింది మొదలు ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. వీటిని ఎదుర్కొనే క్రమంలో నరేంద్ర మోడీ మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ''1. వ్యాపారం చేయడం ప్రభుత్వ వ్యవహారం కాదు (ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ ద్ గవర్నమెంట్ టు బి ఇన్ బిజినెస్), 2. అప్పటి పరిస్థితులు వేరు కాబట్టి ప్రభుత్వరంగం అవసరం అయివుండవచ్చు.. ఇప్పుడు దానిని కొనసాగించవలససిన అవసరం లేదు, 3. ఇప్పుడు ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ప్రభుత్వం వాటిని నడపాల్సి వస్తోంది, 4. ప్రభుత్వ రంగాల ఆస్థిపాస్తులను మానిటైజ్ చేస్తూ యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయాలి'' అని ప్రకటించారు. ఈ నాలుగు వ్యాఖ్యల్లో కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ ఆలోచన వెనుక అసలు రహస్యం ''మానెటైజేషన్ ఆఫ్ అస్సెట్స్'' ఎంత బాహాటంగా బయట పడిందో చూడండి!
మానిటైజేషన్ అంటే స్థిరాస్థులను నగదులోకి మార్చుకోవడమన్నమాట. దశాబ్దాలుగా ప్రభుత్వరంగం పోగేసి కాపాడుతున్న ఆస్థులన్నింటినీ అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే వీరి ప్రధాన ఉద్దేశం. ఈ ఆస్తులన్నీ ఆయా సంస్థలు తమ లావాదేవీల్లో సంపాదించిన డబ్బు ద్వారా సమకూర్చుకున్నవే తప్ప ప్రభుత్వం తమ ఖజానాను ఉపయోగించి కొన్నవి కాదు. ఉదాహరణకు: ఎల్ఐసీి దగ్గర ఉన్న సొంత భవనాలూ భూములూ అన్నీ మార్కెట్ ధర ప్రకారం, సంస్థ నిధుల నుంచి కొనబడినవే. విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టులు, చమురు ఇందన సంస్థల వంటి ఇతర ప్రభుత్వ రంగాల ఆస్థులన్నీ ఇలా సేకరించబడినవే. వీటన్నింటినీ అమ్ముకుని సొమ్ము చేసు కోవాలను కోవడం దుర్మార్గమైన చర్య. అయితే నిరర్దకంగా పడివున్న ఆస్థులను మార్చుకోవడంలో తప్పు లేదు కానీ, మొత్తం ప్రభుత్వరంగ ఆస్థులను తెగనమ్మడం దేశానికి ఎలా శ్రేయస్కరం?
ప్రభుత్వం చేతిలో ప్రధాన రంగాలు లేకపోతే బంగ్లా, పాక్ యుద్ధ సందర్భంలో మన యుద్ధ ట్యాంకర్లకు చమురును నింపడానికి నిరాకరించిన షెల్ కంపెనీలను ఒక సారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఇప్పుడున్న ఆస్థులన్నీ అమ్ముకోవడం ద్వారా రెండున్నర లక్షల కోట్ల రోపాయలను సేకరిస్తారట, వీటితో ఆర్థిక వ్యవస్థకున్న దరిద్రమంతా తీరి పోతుందా? ముప్పైనాలుగు లక్షల కోట్ల బడ్జెట్లో తొమ్మిది లక్షల కోట్ల మేర అప్పుల వడ్డీకే కేటాయించారు. ఇట్లాంటి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి విధానం మారితే తప్ప ఎన్ని ఆస్థులనమ్ముకున్నా సరిపోదు. ఆస్తుల విలువ పెరిగింది కదా అని నేడు అమ్ముకుంటే భవిశ్యత్తులో అవసరమైతే సేకరణకు ఎంత కష్టమౌతదో అలోచించాలిగా! ఈ దేశంలో ప్రయివేటు కంపనీల ఏర్పాటుకు అనేక రాయితీలిచ్చి..., చౌకగా భూములిచ్చి..., తక్కువ వడ్డీకి ఋణాలిప్పించి వారు ఎదిగేలా చేశారు. సదరు ప్రయివేటు కంపెనీలన్నీ అంతులేని లాభాలు గడించి ఆస్థులు పోగేసు కున్నాయి. మరి ఏదైనా ప్రయివేటు కంపెనీ తమ ఆస్థులను ప్రభుత్వం ద్వారా వేలం వెయ్యనిస్తుందా?
ప్రభుత్వరంగాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వం వ్యాపారం చేయటం లేదు, కేవలం చట్టం చేసి యాజమాన్య బోర్డులను నియమించే వరకే పరిమితమౌతుంది. మిగతా వ్యవహారారాలన్నీ అధికారులే నడిపిస్తుండటం మనకు కనిపించే సత్యం. విశాఖ స్టీల్ ప్లాంటులో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర ఏమున్నది? జయ ప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు వాదించినట్టుగా ప్రభుత్వం ఆధీనంలోని కొందరు అధికారుల సంస్థనే కావచ్చు?! కానీ పోగైన లాభాలను ఎగ వేసుకునే అవకాశమే లేదుగా! బ్యూరోక్రాట్ల అవినీతి పెరిగిందని అపవాదు వేయవచ్చు కానీ అట్టి వారిపై చర్య తీసుకునే హక్కు ప్రభుత్వానికే ఉన్నదిగా? కానీ తమ సంపదను విపరీతంగా పోగేసుకున్న కార్పొరేట్ల సంపదపై ప్రశ్నించడం కాదుగదా వారు ప్రభుత్వ బ్యాంకుల దగ్గర తీసుకున్న ఋణాలను వసూలు చేసుకుంటామంటే కూడా ఈ ప్రభుత్వం బ్యాంకులకు అనుమతివ్వడం లేదు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల్లో ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర శూన్యం. బ్యాంకుల నుంచి తీసుకున్న ఋణాలను లక్షలకోట్లు ఎగవేస్తున్న పెట్టుబడి దారుల ప్రయోజనాలకే ఈ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. కాబట్టే నిరర్దక ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి. ఇన్సూరెన్స్ రంగంలో వీరి రాజకీయ జోక్యానికి తావు లేదు కాబట్టే ప్రపంచ స్థాయి లాభాలను గడించగలుగుతున్నది.
పౌరులు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వరంగాలను ఏన్నాళ్ళని ఆదుకుంటామని చేసిన వ్యాఖ్యానం కూడా సత్య దూరం. ప్రభుత్వ రంగాల నిర్మాణం ప్రజల పొదుపులను సమీకరించడం ద్వారా జరిగనదే గానీ పన్నులను వసూలు చేసి వాటిని నిర్మించలేదు. 1944లో బాంబే ప్రణాలికా మీటింగు సందర్భంగా ఆ నాటి బడా పారిశ్రామిక వేత్తలంతా చేతులెత్తేసిన తరువాతనే గదా ప్రజల పొదుపుల ద్వారానే ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగలమన్న భావనకు పునాధి పడింది. ''అప్పుడున్న పరిస్థితులు వేరు'' అన్న ప్రధాని మాట ఒక సారి పరిశీలిస్తే- ఆ నాడు పారిశ్రామికీకరణకు పెట్టుబడిదారులు ముందుకురాలేదు, ఇప్పుడు వస్తామంటున్నారు. అయితే ఇప్పటి పెట్టుబడిదారులు కూడా నిత్యం నిలకడలేని స్టాక్మార్కెట్ ద్వారా అమాయకులకు వాటాలనమ్మడం ద్వారా, బ్యాంకుల దగ్గర చౌక రేట్లకు ఋణాలు పొందటం ద్వారా ముందుకొస్తున్నారు. వారి అవసరాలకు స్పందించడం తప్ప ప్రజల అవసరాలు ఈ ప్రభుత్వాలకు పట్టవా..? ఆర్థిక అసమానతల స్థాయి అప్పటికన్నా ఇప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువన్నది జగమెరిగిన సత్యం. కానీ కరోనా కాలంలోనూ ఈ ఏడు బిలియనీర్ల ఆస్థులను కనీవినీ ఎరుగని రీతిలో పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిది!
యువతను ప్రోత్సహించడమంటే బీఎస్ఎన్ఎల్ను భూస్థాపితం చేసి కొందరు ప్రత్యేకులను ప్రోత్సహించినట్టేనా! టెలిఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుమతించిన తరువాత అనేక స్మార్ట్ఫోన్లు ఇండియాలో అందరికీ అందుబాటులోకి వచ్చాయం టారు. అది నిజమే, కానీ ఇంతకీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండి యాలో జరుగుతున్నదా? ఎక్కువగా ఇక్కడ దిగుమతి చేయబడిన విడిభాగాలు అసెంబ్లింగ్ మాత్రమే చేయ బడుతున్నవి. అందులోనూ అత్యధికభాగం ఫారిన్ కంపెనీలవే. టెలికంరంగంలో ప్రైవేటీకరణ వేగవంతమైన తర్వాత భారత్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ఫోన్ ఉన్నదని, ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటా లభిస్తుందన్న అంశాని గమనిస్తే, ఇది పూర్తిగా స్పెక్ట్రంకు సంభంధించిన అంశం. దీనిని కేటాయించవలసినది ప్రభుత్వమే. ప్రభుత్వమే కావాలని బీఎస్ఎన్ఎల్ని పక్కనబెట్టి పరిమితిని మించి జియోని ప్రోత్సహించడమే కదా బీఎస్ఎన్ఎల్ నష్టాలకు కారణం. బీఎస్ఎన్ఎల్ ఏకస్వామ్యం ఉండకూడదని మళ్ళీ జియోకు ఏకచత్రాధిపత్యాన్ని కట్టబెట్టారు. దేశీయ ప్రయివేటు కంపెనీగా ఎదిగిన రిలయన్స్ కంపెనీ తన 40శాతం వాటాని మల్టీ నేషనల్ కంపెనీలకు ఆమ్మేయడంతో ఈరోజు రిలయన్స్ జియో సంపాదించిన ప్రతి రూపాయిలో 40పైసలు బహుళజాతి కంపెనీలకు వెళ్తుంటే ఇది ఆత్మ నిర్భరత ఎట్లా అవుతుంది? అందుచేత భారత మిలిటరీ వ్యవస్థ బయటికి కనపడే రక్షణ కవచమైతే ప్రభుత్వరంగమే అంతర్గత బలం. నేడు పుట్నాలకు అమ్ముకుంటే రేపు గడ్డుకాలాల్లో పుట్టగతులుండవ్...
- జి. తిరుపతయ్య
సెల్ : 9951300016