Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగుల ఒత్తిడి, పోరాట ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు శాసనసభలో వేతన సవరణలో 30శాతం ఫిట్మెంట్ను ప్రకటించారు. సుదీర్ఘకాలం పాటు ఆలస్యం చేసి ప్రకటించిన ఈ పీఆర్సీ పట్ల ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు. అలాగని కొన్ని ప్రధాన సంఘాలు బహిరంగంగా విమర్శించే సాహసమూ చేయడం లేదు. కానీ ఈ పీఆర్సీలో ఉద్యోగులకు నష్టం చేసే అనేక అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించకుండా వదిలేయడం వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఈ అంశాల పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 1-07-2018 నుంచి రావాల్సిన 32నెలల బకాయిలను 12నెలలకు మాత్రమే చెల్లిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం వల్ల 20నెలల బకాయి వేతనాలు ఉద్యోగులు కోల్పోతున్నారు. గత 10 పీఆర్సీలలో ఎప్పుడూ జరగని అన్యాయం ఇది. బకాయి వేతనాల సాధన కోసం ఉద్యోగులు పోరా డాల్సిన అవసరం ఉంది. ఇది ఉద్యోగుల హక్కు.
అలాగే ఇంటి అద్దె అలవెన్స్ను తగ్గించిన విషయం కూడా ప్రస్తావించలేదు. నగరంలో ఉన్న 30శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి కుదించడం, మున్సిపల్స్లో 20శాతాన్ని17శాతానికి, మండల కేంద్రాల్లో 14.5శాతం నుంచి 13శాతానికి కుదించడం, గ్రామీణ ప్రాంతాల్లో 12శాతాన్ని 11శాతానికి కుదించడం జరిగింది. ఇంటి అద్దెలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరింతగా తగ్గించడం అనేది అన్యాయం. దీనిపై కూడా ముఖ్యమంత్రి స్పష్టతనివ్వలేదు. కనీస వేతనం పీఆర్సీ నివేదిక ప్రకారం రూ.19,000, అత్యధిక వేతనం రూ.1,62,070గా నిర్ణయించారు. దీనిపై కూడా ప్రకటన లేదు. గత 10వ పీఆర్సీలోని కనీస వేతనం రూ.13,000కు ఈ ఐదేండ్ల కాలంలోని డీఏ 30.392ను, 30శాతం ఫిట్మెంట్ను కలిపి సవరించి లెక్కిస్తే రూ.20,920లు అవుతుంది. అంటే సుమారు రూ.2,000లు తక్కువగా కనీస వేతనం నిర్ణయించారు. హెచ్ఆర్ఏను కూడా కలుపుకుంటే నగరంలో రూ.27,000లు, ఇతర ప్రాంతాల్లో రూ.25,000లు వేతనం చెల్లిస్తేనే న్యాయం జరుగుతుంది. పెరుగుతున్న ధరలకను గుణంగా కనీస వేతనం డా|| ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం రూ.26,000లకు తక్కువ కాకుండా ఉండాలని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే గత పీఆర్సీ ఆధారంగా జీఓ నెం.14 విడుదల చేసి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు 3 స్లాబులు నిర్ణయించి రూ.12,000లు, రూ.15,000లు, రూ.17,500 లుగా ఇచ్చారు. ప్రస్తుతం పిఆర్సి రిపోర్ట్ ప్రకారం రూ.19,000లు, రూ.22,900లు, రూ.31,040 లుగా పెంచాలి. కానీ దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పష్టతనివ్వలేదు.
పీఆర్సీ వల్ల 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు 2,90,389 మంది, పెన్షనర్లు 2,88,416, కాంట్రాక్ట్ ఉద్యోగులు 62,239, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 58,128, వీరితో పాటు గవర్నమెంట్ ఎయిడెడ్ ఉద్యోగులు, వర్క్ ఛార్జ్డ్, డైలీవేజ్ వర్కర్స్, ఫుల్ టైమ్ కంటింజెంట్ వర్కర్స్, పార్ట్ టైమ్ కంటింజెంట్ వర్కర్స్, హోంగార్డ్స్, వీఆర్ఓ, విఆర్ఏ, అంగన్వాడీ, ఆశా, విద్యా వాలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు కూడా కలిపి చెప్పారు. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల పైనే పీఆర్సీ కమిటీ ప్రధానంగా కేంద్రీకరించి నివేదిక ఇచ్చింది. సంబంధిత ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకొని చర్చించారు. మిగిలిన వారితో చర్చించలేదు. కానీ 30శాతం వేతనాలు అందరికీ పెంచుతామని ప్రకటించారు. ఇందులో గౌరవ వేతనం, దినసరి, పారితోషికాలు, సీజనల్ ఎంప్లాయీస్ తదితరులు ఉన్నారు. కనీస వేతనాల పద్ధతిలో పనిచేయని అనేకమందికి వేతనాలు ఎలా పెంచుతారనేది ప్రశ్న. ముందుగా అందరినీ కనీస వేతనాల పద్ధతిలోకి తీసుకొచ్చి, ఉద్యోగ భద్రత కల్పించి జీతభత్యాల నిర్ణయం చేసి దానిపై 30శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే ఎవరికైనా న్యాయం జరుగుతుంది. అలా కాకుండా ప్రకటించట మంటే అందరినీ భ్రమలకు గురిచేయడం, చివరికి మొండిచేయి చూపడమే అవుతుంది.
అలాగే ఈ పీఆర్సీలో ఇంకా అనేక కీలక రంగాలను విస్మరించడం శోచనీయం. ముఖ్యంగా స్థానిక సంస్థలకు చెందిన గ్రామ పంచాయతీ వర్కర్స్ రూ.8,500లు, మున్సిపల్ కార్మికులు రూ.12,000లతో వెట్టిచాకిరీ చేస్తున్నారు. వీరి గురించి ప్రస్తావించకపోవడం అన్యాయం. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులు, స్వచ్ఛ కార్మికులతో పాటు ఆర్టీసీలోని 49 వేల మంది కార్మికులకు కూడా అన్యాయం జరిగింది. వీరికి 2017లో వేతనం సవరణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం 2021లో మరో వేతన సవరణ కూడా జరగాలి. కానీ ముఖ్యమంత్రి ఈ పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల గురించి ప్రకటించకపోవడం దారుణం. అలాగే 2020 మార్చి నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి కుటుంబాలను వీధిపాలు చేశారు. వీరికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నా ప్రకటించలేదు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం, 104, 108, 102, టిసాక్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, హాస్పిటల్ వర్కర్స్ గురించి కూడా ప్రస్తావించలేదు. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా వీరి సేవలు, త్యాగాలు దేశ ప్రజలందరూ చూశారు. మన రాష్ట్రంలో వైద్య రంగంలోనే కరోనా వల్ల సుమారు 25 మంది ప్రాణ త్యాగం చేశారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకపోవడం శోచనీయం. కరోనా కాలంలో ఇస్తామన్న 10శాతం ఇన్సెంటీవ్లు కూడా ఇవ్వలేదు. అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్న వీరికి న్యాయం జరగాలంటే పర్మినెంట్ ఉద్యోగుల యొక్క కనీస బేసిక్ను ఆధారం చేసుకొని ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ జీతాలు పెంచడం అవసరం. ఈ దిశగా ప్రయత్నించకుండా ఉన్న వేతనం మీద 30శాతం పెంచడమంటే తీవ్ర అన్యాయం జరుగుతుంది.
రాష్ట్రంలో ఇప్పటికే తాత్కాలిక ఉద్యోగుల మీద విపరీతమైన పనిభారం ఉంది. పీఆర్సీ నివేదిక ప్రకారం 3.52 కోట్ల జనాభాకు గాను 4,91,304 శాంక్షన్డ్ పోస్టులున్నాయి. ఇందులో వాస్తవంగా 3,00,178 మంది పనిచేస్తున్నారు. 1,91,126 ఖాళీలున్నాయి. ఈ పనిభారమంతా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై పడింది. ప్రభుత్వం వేతనాల ఖర్చు కూడా తగ్గింది. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే పేరిట జీతభత్యాల్లో కోతలు విధించడం అన్యాయం. 2015లో ప్రకటించిన 10వ పీఆర్సీలో 43శాతం ఫిట్మెంట్ ఇచ్చి, 2021 సంవత్సరం 11వ పీఆర్సీలో 30శాతం ఫిట్మెంట్ అంటే 13శాతం తగ్గించారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2019 నుండి 29శాతం ఐఆర్ ఇస్తున్నారు. ఈ రకంగా ప్రతినెలా తెలంగాణ ఉద్యోగి సుమారు రూ.10 వేల రూపాయల వేతనం కోల్పోయారు. ఏవిధంగా చూసినా ఈ పీఆర్సీలో ఉద్యోగులకు అన్యాయమే జరిగింది.
- భూపాల్
సెల్:9490098034