Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేల కోట్ల రుణాలను విచక్షణా రహితంగా తీసుకుని,చెల్లించకుండా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని బలహీనం చేసేసిన కార్పొరేటు వర్గం చింతించవలసిన అవసరమే లేకుండా, ఏకంగా వారే బ్యాంకుల్ని దుకాణాలుగా తెరచి ప్రజాధనంతో ఆటలాడుకునే వింత ప్రతిపాదనలకు తెర లేస్తోంది. ఈ దిశగానే భారత రిజర్వ్ బ్యాంక్ అంతర్గత కమిటీ ప్రతిపాదనలు ఉండడం ఆశ్చర్యంగానూ, బాధాకరంగానూ ఉంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్లు బలహీనం కావడానికి కార్పొరేట్ల మొండి బాకీలే ముఖ్యమైన కారణం. నీరవ్ మోడీ, విజరు మాల్యా, ఇంకా వార్తా పత్రికల్లో మొదటి పేజీకి ఎక్కని అసంఖ్యాకమైన కార్పొరేట్లు వందల, వేల కోట్లు రుణాలుగా తీసుకుని ప్రజల డబ్బుతోనూ, బ్యాంకు ఉద్యోగులతోనూ, తమపై బాణం సంధించలేని చట్టాలతోనూ ఎలా ఆడుకుంటున్నారో మనం చూస్తున్నాం.
పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పరిస్థితి ఇలా ఉంటే ప్రయివేటు బ్యాంకుల పరిస్థితి ఇంత కన్నా ఉన్నతంగా లేదని గతంలో ఎస్ బ్యాంకు అనుభవాలు, ఇటీవల లక్ష్మీ విలాస్ బ్యాంకు అనుభవాలు, డిపాజిటర్ల ఆందోళన, అస్థిరత మనం ఇప్పటికే చూశాం. సామాజిక నిబద్ధతను ఏ కోణంలోనూ చూపించని ప్రయివేటు బ్యాంకులు దేశాభివృద్ధికి పనికి రావడం మాట అటుంచి ఆయా కార్పొరేట్, ధనిక వర్గాలకు పూల పల్లకీలనూ, లాభాల సంచులనూ అందించాయి. రైతులకు, నిరుద్యోగులకు, బడుగు వర్గాలకు రుణాలను ఇవ్వడంలో వెనకంజలోనే ఉండి ఆర్థిక సంపదను ధనికుల మధ్యనే కేంద్రీకరించుకున్నాయి. అందుకనే బ్యాంకుల్ని 1969లో అప్పటి ప్రభుత్వం జాతీయం చేయాల్సి వచ్చింది. ఆనాడున్న ఆర్థిక అస్థిరతలకు బ్యాంకుల జాతీయకరణ అవసరమైన పరిష్కారంగా నిలిచింది. బ్యాంకుల జాతీయకరణ ఫలితంగా బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు దొరికాయి. బ్యాంకులనేవి ఫైవ్ స్టార్ హౌటళ్ల లాగా ధనికుల కోసమే అనే ఆలోచన మారి పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా బ్యాంక్ సేవల్ని అందుకునే అవకాశం దొరికింది. చాలా తక్కువ డిపాజిట్తో అకౌంట్లు లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు పెరిగి అటు బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయింది. ఇటు ఆయా రుణాలు సాధారణ ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అంది వారి సామాజిక పరిస్థితి కూడా కొంత మెరుగుపడింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు వ్యాపార ప్రయోజనాలతో పాటు సామాజిక ప్రయోజనాలను కూడా ఆయా వర్గాలకు అందించాయి. ప్రభుత్వ సంక్షేమ విధానాలకు కూడా ఇవి పనికొచ్చాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఆర్బీఐ అంతర్గత కమిటీ ప్రతిపాదనలు మన బ్యాంకుల్ని, దేశ ఆర్థిక పరిస్థితిని మళ్ళీ జాతీయీకరణకు ముందున్న పరిస్థితికి తీసుకుపోయే లక్షణాలతో ఉన్నాయి. ఎంతో శ్రమించి, ఎన్నో ఉద్యమాల ద్వారా సంపాదించుకున్న ఈ బ్యాంకులు, సంబంధిత హక్కులు ఒక్కొక్కటి రెక్కలు తెంపుకొని మరలా ముందున్న అస్తవ్యస్థతలోకి మరలే పరిస్థితి ఉంది. దీనికే స్వేచ్ఛా వాణిజ్యం అని ముద్దు పేరు. ఆనాటి బడా వ్యాపార సంస్థలకు, బ్యాంకులకు మధ్య అనైతికమైన పొత్తును విచ్ఛిన్నం చెయ్యడమే 1969 బ్యాంకుల జాతీయకరణ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. బ్యాంకులు జాతీయకరణ చెయ్యాల్సి వచ్చింది అంటేనే జాతీయకరణకు ముందు బ్యాంకుల పరిస్థితి సరిగ్గా లేదని అర్థం.
కార్పొరేట్లు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం బ్యాంకుల్ని ప్రభావితం చేసిన పరిస్థితుల్ని అప్పటి ప్రజలు చూశారు. ప్రభుత్వాలూ చూశాయి. లాభాలే వీరి ప్రథమ లక్ష్యం. పైపెచ్చు కొన్ని బ్యాంకులు ప్రత్యేక కార్పొరేట్ వర్గానికే ఎక్కువగా రుణాలను అందించే పరిస్థితి ఉండేది. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ బిర్లా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ థాపర్ కంపెనీలకు అనుకూలంగా పనిచేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సంస్థలకు అనుకూలంగా పనిచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనివర్సల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాహూ, జై గ్రూపు ఆధీనంలో ఉండేవి. ఇదంతా జాతీయీకరణకు ముందు పరిస్థితి. బడుగు వర్గాల కోసం, శ్రామికుల కోసం, సంక్షేమ పథకాల కోసం, రైతుల కోసం ముందుకొచ్చి రుణాలిచ్చి ప్రోత్సహించే పరిస్థితి లేదు. బలహీన వర్గాల కోసం బ్యాంకులు ముందుకొచ్చిన పరిస్థితి ఏదైనా ఉంది అంటే అది జాతీయకరణ తర్వాతనే. ఇలా అత్యంత పటిష్టమైన పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 1969 నుంచి సమర్థవంతంగా పనిచేశాయి. అయితే, కార్పొరేట్ల మొండి బాకీలు ఒక వైపు, ప్రభుత్వాల తప్పుడు విధానాలు మరోవైపు ప్రభుత్వ బ్యాంకుల్ని బలహీనం చేశాయి. వేలకోట్ల రుణాలు రాజకీయ ప్రాబల్యంతో బడా కార్పొరేట్ల చేతికి చేరడం, అవి తిరిగి రాకపోయినా ఎలాంటి చర్యలు లేకపోవడం బ్యాంకుల్ని బలహీనం చేశాయి. కె.వి.కామత్ కమిటీ ప్రకారం 37.72 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల రుణం ఆపదలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య విధానాలు నడుస్తున్నప్పటికీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు బలహీనమయ్యాయి. బ్యాంకుల బోర్డు నియామకాల్లో ఆర్థిక మంత్రిత్వశాఖ తీరు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నియామకాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు, గత నోట్ల రద్దు విషాదకర పరిస్థితుల నియంత్రణలో కూడా రిజర్వు బ్యాంక్ బలహీనమైన పాత్ర, మొండి బాకీలు మొదలైనవి ఏవైనా కావొచ్చు మొత్తంగా చూస్తే, ఆర్బీఐ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని బలహీనం చేసే ప్రజా వ్యతిరేక వ్యవస్థ ప్రభావంలోకి కూరుకుపోయింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం 1990ల నుండి ఎంచుకున్న ప్రజావ్యతిరేక నయా ఉదారవాద, స్వేచ్ఛా వాణిజ్యం. ఈ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణలతో ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్ అయిపోతుందనీ, మనం ప్రపంచంతో చేతులు కలపాలనీ, పాత చట్టాలు కొత్త తరానికి పనికి రావనీ మాయమాటలతో అంతవరకూ కొనసాగుతున్న సంక్షేమ విధానాలను ఒక్కొక్కటీ కొల్లగొడుతూ వచ్చారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రక్రియ కొనసాగింది. కాంగ్రెస్ ప్రభుత్వమయినా, బీజేపీ ప్రభుత్వమయినా వీరిరువురి లక్ష్యం స్వేచ్ఛా వాణిజ్యమే. బ్యాంకుల్లో సంస్కరణలను కూడా ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాదకరమైన ప్రజావ్యతిరేక విధానాలను మనం అర్థం చేసుకోకపోతే వీటిని ఎదిరించలేం.
- నాదేండ్ల శ్రీనివాస్
సెల్: 9676407140