Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మంది వ్యక్తులకు కొన్ని కోరికలు మాత్రమే ఉంటాయి. మహనీయులకు మాత్రం సామాజిక లక్ష్యాలు ఆశయాలు ఉంటాయి. వ్యక్తుల కోర్కెలు వారి స్వాభివద్ధికి ఉపయోగపడితే మహనీయుల లక్ష్యాలు ఆశయాలు సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. అలాంటి మహనీయుల్లో ఒకరు మహాత్మా జ్యోతిబా ఫూలే. శూద్రుల విద్యకు ఆద్యుడు, విద్య ద్వారా బడుగుల జీవితాల్లో వెలుగుదారి చూపిన మహనీయుడు జోతిబా ఫూలే. భారత దేశంలో అమలవుతున్న అమానవీయ దుర్మార్గాలను కండ్లారా చూసిన ఆయన భారత దేశాన్ని సంపూర్ణంగా సంస్కరించాలని నిర్ణయించుకున్నాడు.
జోతిబాఫూలే1827 ఏప్రిల్11న చిమ్నాబాయి, గోవిందరావు దంపతు లకు జన్మించాడు. తొమ్మిది నెలల పసివయసులోనే తల్లిని కోల్పోయిన ఫూలేను తండ్రి గోవిందరావు అల్లారుముద్దుగా పెంచాడు. చిన్ననాటి నుండే ఆయన స్వతంత్ర దృష్టి, సమగ్ర ఆధునిక అవగాహనను ఆలవర్చుకున్నాడు. అందుకే ఆయన రచనలు ఉపన్యాసాలు ఆయన నిత్యజీవితం ప్రత్యక్ష అనుభావాలచే నిండి ఉంటాయి. 1848లో ఒక బ్రాహ్మణ మిత్రుడు సదాశివ బిల్లాల్ గోవింద్ పెండ్లి ఊరేగింపులో పాల్గొన్నందుకు ఆయనకు జరిగిన అవమానంతో కులవివక్షపై కసిపెరిగింది. మాలి కులస్తుడివి బ్రాహ్మణ పెండ్లిలో ఉంటావా అని నానా దుర్భాశలాడిన తీరు ఆయన జీవితాన్నే మలుపు తిప్పింది. అప్పుడే ఆయన ఈ కులవివక్ష మూలాలు ఎక్కడున్నాయి? వాటిలోతుల్లోకి వెళదామని భావించాడు. ఓ సందర్భంలో ఆయన ఇలా పేర్కొన్నాడు. బ్రాహ్మణులు తమ మత గ్రంథాలన్నింటిని బయటకు తీయాలి. ముస్లింలు మసీదులో అందరూ కలిసి నమాజ్ చదివినట్లుగానే, క్రిస్టియన్లు చర్చిలలో అందరూ కలిసి బైబిల్ చదివినట్లుగానే ప్రజలందరికీ అర్థం అయ్యేలా బ్రాహ్మణ ధర్మం ఎందుకు లేదనీ, అలా ఉండాలనీ, అప్పుడే అందులోని అసమానతలు అన్యాయాలు వాటి బండారం బయటపడుతుందన్నాడు. ఒక మతం అంటే ఒకే గ్రంథం, ఒకే దేవుడు ఒకే దేవాలయం ఉండాలి కానీ హైందవ ధర్మం అనే వాళ్ళు కోట్లాది దేవుళ్ళు, కోట్లాది దేవాలయాలు కలిగి ఉండటం ఏమిటి? ఇది మతం కంటే కులాల అసమానతల కుంపటి వంటిదని చెప్పారు.
మహారాష్ట్రలో పీష్వాల పరిపాలన భూస్వామ్య నిరంకుశ ఆధిపత్య భావజాలంతో సకల సంపదలపై వారిదే పైచేయిగా ఉండేది. వారు ధర్మం నీతి న్యాయం అని బోధించే ప్రతి అంశం శూద్రులను అణిచి వేసే అధర్మ సూత్రమేనని ఫూలే గ్రహించాడు. ఇలాంటి మూర్ఖపు పద్ధతులపై తిరుగుబాటు చేయాలని చెప్పాడు. అందుకే ఆయన మన సామాజికోద్యమ తొలితరం వెలుగుదారి అని చెప్పవచ్చు.
మూడు వేల సంవత్సరాల మనువాద కుతంత్రాలను ఎండగట్టడానికి, చీకటి శాసనాలతో ప్రజలను దోపిడీ చేస్తున్న అమానవీయ పద్ధతులను మట్టిలో పాతలని భావించాడు ఫూలే. శూద్రులు స్త్రీలు నిరంతర అణిచివేతకు గురవుతున్న నీచపు పద్దతులపై ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించాడు.
చాలా మంది పూలే అంటే అణగారిన వర్గాల కోసమే కృషి చేశాడని అనుకుంటారు. కానీ ఆయన అగ్రకుల బ్రాహ్మణ స్త్రీల బాధలు కూడా పట్టించుకున్నాడు. బ్రాహ్మణ ఇండ్లలో వితంతువులకు శిరోముండనం చేయడం, వారిని హీనంగా చూడడం, వారిపట్ల అకృత్యాలకు పాల్పడే వారిని పూలే ధైర్యంతో ఎదుర్కొన్నాడు. అవమానాలూ, నిందలూ మోయలేని బ్రాహ్మణ స్త్రీలు ఆత్మహత్యలకు సిద్ధం అయిన సందర్భంలో ఆయన వారిని చేరదీసి ఆదరించాడు. బ్రాహ్మణ వితంతువులకు ప్రత్యేక శరణాలయాన్ని నిర్మించాడు. తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పి ఆమెను ఈ దేశ మొట్టమొదటి ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.
దేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాల ఆయన నెలకొల్పారు. అధర్మాన్ని వ్యతిరేకించడం సత్యాన్ని శోధించడం ఆయన అలవాటు. అందుకే ఆయన సత్యమేవ జయతే అని రాసేవాడు. ప్రత్యేకించి స్త్రీలు శూద్రులు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయన ప్రత్యేక కృషి నిర్వహించాడు. పెళ్ళిళ్ళలో బ్రాహ్మణ మంత్రాలకు చోటు లేకుండా పురోహితుడు లేకుండా తానే స్వయంగా దండలు మార్పించి ఆదర్శ వివాహాలు జరిపించాడు. పేదల పట్ల అమోఘమైన ప్రేమ ఆయనకుండేది. రోజువారీ రెక్కల కష్టంతో జీవించే వారు పండుగలు దేవుళ్ళ పేరుతో జరిగే భారీ ఖర్చులను తగ్గించుచుకోవాలని హితవు చెప్పాడు. బానిసత్వం నుంచి విముక్తి కావాలనీ, ఆధిపత్యం అంతం కావాలనీ ఆయన గులాంగిరి అనే పుస్తకాన్ని రచించారు. సరిగ్గా అదే సంవత్సరం సత్యశోధక సమాజ్ను స్థాపించాడు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు నారాయణ లోకండే నాయకత్వంలో సాగుతున్న బొంబాయి నూలు మిల్లు కార్మికుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు.
ఫూలే ఆశయాలను నేటి కేంద్ర బీజేపీ సర్కార్ సమాధి చేస్తున్నది. ఆయన అందరికీ విద్య అందాలని తుదిశ్వాస వరకు పోరాడితే బీజేపీ నూతన విద్యావిధానం పేరుతో పక్కా మనువాద విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టి అణగారిన పేదలకు అక్షరాన్ని దూరం చేయజూస్తున్నది. ఆయన ఏ స్త్రీల హక్కుల కోసం కృషి చేసాడో నేడు ఆ స్రీలపై జరుగుతున్న హింసను, అణచివేతను తిరిగి ప్రేరేపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి దళితులు బలహీన వర్గాల హక్కులు కాలరాయబడుతున్నాయి నిటిఅయోగ్ సాకుతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రద్దు చేశారు. కరోనా కాలంలో దళితులకు కేటాయించిన బడ్జెట్లో 41శాతం నిధులు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మురగబెట్టారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతుల మెడలో ఉరితాల్లు వేస్తున్నారు. మొత్తం ప్రభుత్వరంగాన్ని అమ్మడమే తమ ద్యేయమని చెపుతున్నారు. ఇప్పటికే 19ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణతో దళిత గిరిజన బలహీనవర్గాల రిజర్వేషన్లను తొలగిస్తున్నారు. భవిష్యత్లో సామాజిక న్యాయం అనేదే ఉండదన్నట్లుగా మోడీ పాలన సాగుతోంది. వేల ఏండ్లుగా కార్ములికులు పోరాడి సాధించుకున్న 44కార్మిక చట్టాలను 4వెజ్ కోడ్లుగా మార్చి కార్మికుల పొట్టలు కొట్టి బడా కార్పొరేట్లకు సంపదను కట్టబెడుతోంది బీజేపీ ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గించి చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంది. ప్రజాస్వామ్య దేశాన్ని మత రాజ్యాంగా మార్చజూస్తోంది. మహాత్మా జోతిబా ఫూలే దేశం అనే దేహానికి శ్రమజీవులైన శూద్రులే ప్రాణం అన్నాడు. వారు రక్త నాళాల వంటి వారన్నాడు. బీసీ ప్రధాని అనీ తమ ప్రయోజనాల కోసం కృషి చేస్తాడనీ దేశ జనాభాలో సగం మందిగా ఉన్న బీసీలు ఆశ పడ్డారు. కానీ వారి ఆశలన్నీ నీరుకార్చ బడ్డాయి. ఈ నేపథ్యంలో ఫూలే మనకు స్ఫూర్తి కావాలి. ఆయన ఆశయాలను అందిపుచ్చు కోవాలి.
సెల్:9177549646
టి. స్కైలాబ్ బాబు