Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగుల కుటుంబాల సామాజిక భద్రత దెబ్బతీసిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను ఉపసంహరించాలని, ప్రభుత్వ (డిఫైన్డ్) పెన్షన్ పథకా (డీపీఎస్)న్నే 2004 నుంచి అపాయింట్ అయిన ఉద్యోగులకు అమలు చేయాలని ఉద్యమాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద చర్చనీయాంశం కావడం మంచి పరిణామం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తాము అధికారంలోకొస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. అన్నిటికంటే ముందుగా మేనిఫెస్టో విడుదల చేసిన సీపీఐ(ఎం) నాయకత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) సీపీఎస్ వద్దు పాత పింఛన్ పథకం (ఓపీఎస్) కావాలనే ఉద్యోగుల డిమాండ్ అమలు చేస్తామని స్పష్టమైన హామీ యిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతత్వంలోని ప్రజా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో సీపీఎస్ రద్దు విషయాన్ని ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నది. బీజేపీ మేనిఫెస్టోలోనూ చందా పింఛను పథకాన్ని తొలగిస్తామని రాసింది. కానీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో మాత్రం సీపీఎస్ ఊసేలేదు.
ఎలక్షన్ మ్యానిఫెస్టోలు చూసిన తర్వాత ఎవరికి ఓటు వేయాలో సీపీఎస్ బాధిత ఉద్యోగుల కుటుంబాలు తేల్చుకోవాల్సి వచ్చింది. ఎవరు హామీ యిస్తే వారికే మా ఓటు అంటూ యిప్పటిదాకా చెబుతూవచ్చారు. ఇప్పుడు అందరూ అదే హామీ యివ్వటం పెద్ద సమస్య. పెన్షన్ సమస్య ఎన్నికల ఎజండాలో చేరటం వరకు ఒక విజయమే. దానిని అమలు చేయగల వారినే ఎన్నుకోవటం నేటి కర్తవ్యం. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఒకటికి రెండు సార్లు వెనక్కి ముందుకు చూసుకోవటం మంచిది. అనుభవాల ఆధారంగా నిర్ణయించుకోవటమే శ్రేయస్కరమని విజ్ఞుల సూచన. సీపీఎస్ తంటా తెచ్చి పెట్టింది 2004లో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. ఆ పథకాన్ని ముందుకు తెచ్చిన దస్త్రంపై సంతకం చేసింది ఆనాడు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన నేటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మధ్య కాలంలో పార్లమెంటులో సీపీఎస్పై చర్చ జరిగిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కోసం ఆ పథకాన్ని తెచ్చిందని, రాష్ట్రాల ఉద్యోగులకు ఏ పథకం ఉండాలో ఆయా ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని కేంద్రం చెబుతూ వచ్చింది. ఉద్యోగ సంఘాల వత్తిడి మేరకు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లేఖలకు కూడా అలాంటి జవాబే యిచ్చింది. ఏడాది క్రితం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగులకు సీపీఎస్ పథకమే మేలైందని చెప్పారు.
ఇక్కడ హామీ యిస్తున్న బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అక్కడా ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు. అక్కడ సీపీఎస్ పథకాన్ని ఎత్తేయకుండా యిక్కడ తొలగిస్తామనటం అబద్ధం కాదా? కాంగ్రెస్ పార్టీ పాలనలోని రాష్ట్రాల్లో కూడా అదే విధానం అమలవుతోంది. ప్రజా కూటమిలో భాగస్వామిగా వున్న టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఉద్యోగుల ఉద్యమాలను తట్టుకోలేక సీపీఎస్ రద్దు విషయాన్ని పరిశీలించటానికి అంటూ యిటీవల ఓ కమిటీవేసింది. ఇక్కడ మాత్రం రద్దు చేస్తమంటోంది. సీపీఎం అధికారంలో వున్న రాష్ట్రాల్లోనే సీపీఎస్ సమస్య పట్ల ఉద్యోగులకు భరోసా కలిగింది. ప్రపంచబ్యాంకు షరతులకు లోబడిన ఉదారవాద ఆర్థిక విధానంలో సంక్షేమ పథకాలను ఎత్తివేసే చర్యల్లో భాగంగానే ప్రభుత్వ పెన్షన్ పథకాన్ని విరమించారనే విషయం విదితమే. ఆ తప్పుడు విధానాలకు తలవంచని వామపక్షాలే ఉద్యోగులకు అండగా వుండగలుగుతున్నాయి. అవి తప్ప కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పటం ఓట్లు కోసం వేస్తున్న గాలం మాత్రమే.
రాష్ట్రంలో దాదాపు లక్షా ముప్ఫై వేలమంది సీపీఎస్ బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. వారి కుటుంబాల సభ్యులు, వారి సలహా తీసుకొనే వారు మొత్తం ఐదు లక్షల మంది ఓటర్లు ఉంటారు. వారంతా ఒక నిర్ణయానికి వస్తే చాలా నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు. అధికారంలోకి రాగలిగే అవకాశం వున్న పార్టీకే ఓటు వేయాలనే ధోరణి మన ఎన్నికల్లో గల పెద్ద బలహీనత. దానిని అధిగమించ గలిగితేనే ఉద్యోగులకు మేలు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అసెంబ్లీలో సీపీఎస్ సమస్య లేవనెత్తి ఫలితం వచ్చే దాకా నిజాయితీగా పోరాడే వారిని ఎంఎల్ఏలుగా గెలిపించుకోవాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొంటే సీసీఎస్ రద్దు కోసం జరిగే ఉద్యమాలకు మరింత ఊపు రాగలదు.
ఎన్. నారాయణ
సెల్: 9490300577