Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతి, అసమర్థ పాలనతో జాతికి తీరని నష్టం కలిగించిన బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి హిందూత్వ, విద్వేషపూరిత రాజకీయాలను అస్త్రాలుగా వాడుకుంటున్నది. ఐదు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ, బీజేపీ నేతలు సాగించిన ప్రచారమే ఇందుకు నిదర్శనం. కేంద్రంలోనూ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో తిరిగి రామమందిరాన్నే నమ్ముకుంది. మతం పేరుతో సమాజంలో విద్వేషాలను రగిల్చి మెజార్టీ మతస్థుల మద్దతుతో తిరిగి అధికారాన్ని అందుకోవడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యం. వాస్తవానికి ఇవేమీ బీజేపీకి కొత్త కాదు.
''గొప్ప స్వాప్నికుడు, పాలనాదక్షుడు, వికాస పురుషుడు, తేజోమయుడు, దార్శనికుడు, ధీరోదాత్తుడు.'' అంటూ 2014 ఎన్నికల ముందు మోడీ గురించి బీజేపీ, సంఫ్ుపరివార్ శక్తులు ఊదరగొట్టాయి. అంబానీలు, టాటా, మిట్టల్, బజాజ్ వంటి బడా పారిశ్రామికవేత్తలు మోడీని ఆకాశానికెత్తేశారు. జాతీయ మీడియాలో కథనాలకు కొదవలేదు. బీజేపీ మాత్రమే దేశానికి విశ్వాసం కల్పిస్తుందని ఆ పార్టీ నేతలు గొప్పలు పోయారు. కానీ, చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ చేసిన అభివృద్ధి బడా పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు, కారు చౌకగా భూమి, విద్యుత్ వంటి మౌలిక వనరులనేకం సమకూర్చడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. విస్తృత జనబాహుళ్యం తాలూకు జీవన ప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గిరిజనులు, దళితులు, మైనార్టీలు, మహిళలు, ఇతర అణగారిన వర్గాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. విద్య , ఆరోగ్యం వంటి రంగాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ప్రధాని అయినా చేసింది శూన్యం.
నాలుగున్నరేండ్ల మోడీ పాలనలో మోడీపై ప్రజలకున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటీ లేదు. మంచిరోజులు కానరాకుండా పోయాయి. ప్రజల ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షలు వ్యాపారుల ఖజానాల్లోకి చేరాయి. బడా పారిశ్రామికవేత్తలు బాగుపడ్డారు. వారికి మరికొంతమంది తోడయ్యారు. బ్యాంకులను ముంచిన నీరవ్మోడీ, లలిత్మోడీ, మాల్యా లాంటి ఆర్థిక నేరస్తులను విదేశాలకు తరలించారు. కుంభకోణాలకు లెక్కేలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి అంటే రోడ్లపై ఉన్న టీ, బడ్డికొట్టు, పండ్ల దుకాణాలేనని చూపించారు మోడీ. అన్నదాతకు మొండిచేయి చూపారు. ప్రతిరోజూ రోడ్లమీదకు వచ్చి ఆక్రదించాల్సిన దుస్థితి కల్పించారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన కాస్తా విదేశాలకే పరిమితమైంది. తమ విధానాలతో సామాన్యులను ఛిన్నాభిన్నం చేశారు. పెద్దనోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో ప్రజల్ని, చిన్న, మధ్య తరగతి వ్యాపారులను దారుణంగా దగా చేశారు. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఎగుమతులు తగ్గాయి. వ్యవసాయరంగం దెబ్బతింది. ప్రశ్నించిన గొంతులపై అణిచివేతే సాగింది. ఆహారం పేరుతో ఆంక్షలు విధించారు. మూకస్వామ్యానికి అదుపులేకుండా పోయింది. ఎదుతిరిగితే హత్య చేయడం. మహిళలపై అత్యాచారాలు. పరువు హత్యలు, వ్యవస్థలను నాశనం చేయడం సరేసరి. వాటితో ఎన్నికలకు పోతే ఓట్లు రాలవు కాబట్టి తన అపారమైన తెలివితేటలతో మళ్లీ మతాన్ని తెరపైకి తీసుకొచ్చి లబ్ది పొందడానికి బీజేపీ, సంఫ్ు పరివార్ శక్తులు ఎత్తులు వేశాయి. వాస్తవానికి మోడీ పాలనాదక్షుడు అవునా కాదా అన్నది పక్కన బెడితే ఆయన కరడుగట్టిన మతోన్మాది! దాంతోనే ఆయన గుజరాత్లో ప్రతీసారి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అయోధ్య అంశాన్ని ఆధారం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
రానున్న ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే మతమే తమ అజెండాగా ముందుకు సాగాలన్నది బీజేపీ వ్యూహం. ఆ క్రమంలోనే దక్షిణాదిన శబరిమలై అంశాన్నీ, ఉత్తరాదిన అయోధ్య వివాదాన్ని భుజానకెత్తుకున్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో గానీ, తెలంగాణలో గానీ మతం తప్ప వేరే అంశాలను చర్చకు తేవడానికి సాహసం చేయలేదు. 'రామ మందిర నిర్మాణంలో ఇక జాప్యాన్ని సహించబోం' అంటూ సంఫ్ు పరివారం అయోధ్య వేదికగా ఆగ్రహావేశాలు ప్రకటించగా.. దానికి వత్తాసుగా అన్నట్టు రాజస్థాన్ ఎన్నికల సభలో ప్రధాని మోడీ గొంతు కలపడం వారి దురాలోచనకు అద్దం పడుతున్నది. తెలంగాణలో సెప్టెంబర్ 17, ముస్లింలకు రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు తప్ప తాము చేసిందేంటో చెప్పుకోడానికి ప్రధాని మోడీ సాహసం చేయకపోవడం గమనార్హం. అయోధ్య అంశం సుప్రీంలో ఉండగానే 'ఆలయమే మా లక్ష్యం- అంగుళం స్థలం కూడా వదలం' అంటూ విశ్వహిందూ పరిషత్ వంటి పరివార్ సంస్థలు నినదించాయి. న్యాయస్థానంపై నమ్మకం ఉందంటూనే తీర్పుకోసం ఆగకుండా వెంటనే ఆర్డినెన్స్ ద్వారా మందిర నిర్మాణానికి అవకాశం కల్పించాలని ఒకరు, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చట్టాన్ని తీసుకురావాలని మరికొందరు మతోన్మాదులు వేడిని రాజేస్తున్నారు. రామాలయ నిర్మాణం కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పిలునివ్వడం ముందస్తు వ్యూహమే. శివసేన కూడా ధర్మసభ వేదికగా మతఉద్రిక్తతలను రాజేయడానికి సిద్ధమైంది. ఇవన్నీ మోడీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే జరుగుతుండటం విశేషం.
ఆయోధ్య కేసును విచారణకు స్వీకరించనీయకుండా జడ్జీలను కాంగ్రెస్ అడ్డుకున్నదని రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ ఆరోపించారు. తొందరగా విచారణ జరిపితే అభిశంసన తప్పదని కాంగ్రెస్ కోర్టును బెదిరించినట్టు మోడీ ఆరోపణ చేయడం కాంగ్రెసును రామమందిర వ్యతిరేకిగా ఇరుకునపెట్టి తాము లబ్దిపొందడానికేనని తెలుస్తూనే ఉంది. రామమందిర నిర్మాణం రాజకీయ అంశం కాదంటూనే రాజకీయ లబ్ది కోసమే బీజేపీ పాకులాడుతుందన్నది వాస్తవం. అధికారం చేపట్టి నాలుగేండ్లు గడిచినా ఇప్పటి వరకూ మందిర నిర్మాణం గురించి ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, సంఫ్ు సంస్థలు ఎన్నికల ముంగిట్లోనే హడావుడి చేయడం, వేగంగా పావులు కదపడం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఆ వివాదాన్ని రాజేయడమే. రామందిరం పేరిట మత ఉద్వేగాలను ప్రేరేపించి రామస్మరణతో ఓట్లు దండుకోవడమే కాషాయ పరివార్ సంస్థల కుట్ర. గతంలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన యాత్ర అనంతరం ఎంతమంది మరణించారో అందరికీ తెలిసిందే. అలాంటి ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలని కాషాయశక్తులు ప్రయత్ని స్తున్నాయి. సామాజిక అశాంతి తలెత్తే ప్రమా దం ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు లౌకిక, ప్రజాతంత్ర, అభ్యుదయ శక్తులు సన్నద్ధం కావాల్సిన అవసరాన్ని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.
జి. వేణుమాధవరావు
సెల్:9490099023