Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాదాపు పది గంటల పాటు జరిగిన రిజర్వుబ్యాంకు బోర్డు సమావేశంలో గదిలో ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కానీ రిజర్వుబ్యాంకు వెబ్సైట్లో వెలువడిన అత్యంత సంక్షిప్త పత్రికా ప్రకటనను బట్టి గత నెలరోజులుగా ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఈ సమావేశంలో విరామం ప్రకటించారే తప్ప పూర్తిగా సంధి కుదరలేదని మాత్రం చెప్పొచ్చు. భారత ఆర్ధిక వ్యవస్థను ఎవరు నియంత్రించాలి అన్న విషయంపై గత నెల రోజులుగా కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. రిజర్వు బ్యాంకు వద్ద అదనంగా పోగుపడిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు తరలించాలన్న డిమాండ్ను ఆర్బీఐ అంగీకరించనందునే ఈ సమస్య వివాద స్థాయికి చేరింది. దీనికి ఆర్బీఐ మొరాయించటంతో ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 కింద కేంద్రం కొరడా ఝుళిపించింది. ఫలితంగా సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది. మూడో దఫా సంప్రదింపులు సోమవారం ముగిశాయి.
అసలు కేంద్ర ప్రభుత్వానికి ఈ నిధులు ఎందుకు అవసరమయ్యాయి అన్న ప్రశ్న వేసుకుంటే తప్ప ఈ వివాదం వెనక ఉన్న రహస్యమేమిటో అర్థం చేసుకోలేము. మోడీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్నది తిరస్కరించలేని వాస్తవం. ఈ విషయాన్ని దాచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం, దాని వంది మాగధులు చేయని ప్రయత్నం లేదు. అధికారంలోకి రాగానే బొగ్గు గనుల వేలం విధానాన్ని సవరించటం ద్వారా కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం కోల్పోయిన లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని మోడీ ప్రభుత్వం తిరిగి సాధించిందన్న ప్రచారంతో ఒక ఏడాది గడిచిపోయింది. యూపీఏ హాయంలో ఖజానాకు 2జీ స్పెక్ట్రం ద్వారా వచ్చిన నష్టాన్ని కూడా భర్తీ చేసుకోగలిగిందన్న ప్రచారహోరుతో మరో ఏడాది గడిచింది. ఇదేసమయంలో బ్యాంకింగ్ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి అందాల్సిన రుణాలు మందగిస్తున్నాయన్న ఆందోళన మొదలైంది. ఒకవైపున ఆర్థికాభివృద్ధి సూచికలకు, కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరులకు మధ్య పొంతనలేని పరిస్థితి కండ్లకు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. పారిశ్రామికరంగం ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం అసలైన వృద్ధి రేటు నానాటికీ దిగజారాయి. 34శాతానికి పడిపోయాయి. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారమే మొత్తం రుణాల్లో ఆహారేతర రుణాలు 2013లో 54శాతంగా ఉంటే 2017 నాటికి దీని ప్రత్యక్ష ప్రభావం ఉపాధి కల్పనపై పడింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న వాగ్దానంతో అధికారానికి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చివరకు పకోడీ పొట్లాలు కట్టుకోవటం, ఆవులు మేపుకోవటం కూడా ఉపాధేనని ప్రకటించే స్థాయికి దిగజారింది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను కాచుకునేందుకు మోడీ ప్రభుత్వం కొత్త వాదన ముందుకు తెచ్చింది. దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటకు తేవాలంటే పెద్ద నోట్ల రద్దు ఒక్కటే మార్గమని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు ద్వారా కేంద్రానికి అదనంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆరెస్సెస్ ఆర్థిక వేత్త నేటి రిజర్వుబ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన గురుమూర్తి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాశారు. అందరమూ చదువుకున్నాం. ఆయన ఇచ్చిన తర్కం ఏమిటి? దేశంలో సుమారు నాలుగు లక్షల కోట్ల మేర నల్లధనం ఉంది. ఇదంతా పెద్ద నోట్ల రూపంలో మూలుగుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు ప్రవేశపెడితే పాత నోట్లు మార్చుకోవటానికి బ్యాంకు గడప తొక్కే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ వనరులు చెప్పాలి. ఆధారాలు చూపించాలి. అక్రమార్జనకు ఆధారాలుండవు కాబట్టి అలా లెక్కకు చిక్కని సొమ్మంతా ప్రభుత్వం ఖాతాలో పడుతుందని, దాన్ని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చెరిసగం పంచుకోవచ్చన్నది ఆయన, ఆయన లాంటి మేధావుల తర్కం. ఆచరణలో ఏమి జరిగింది? దేశంలో చలామణిలో ఉన్న నగదులో దాదాపు 99.9శాతం బ్యాంకులకు చేరింది. అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం మార్కెట్లో ఉన్న నల్ల ధనం కూడా బ్యాంకులకు చేరింది. వాటికి కూడా ప్రభుత్వం కొత్త నోట్ల రూపంలో ఎదురు చెల్లించాల్సి వచ్చింది. పోనీ అలా చెల్లించటానికి ఆర్బీఐ వద్ద ఉన్న నిధులు సరిపోయాయా అంటే అదీ లేదు. పైగా కేంద్రం ఆశించిన మూడున్నర లక్షల కోట్ల రూపాయల రొక్కం కండ్ల ముందు మాయమైంది. దీంతో ఆర్థిక శాఖ ఏమి చేయాలో తోచక తలపట్టుకుంది. ఇప్పుడు ఈ మొత్తం ఆర్బీఐ మిగులు నిధుల నుంచి కేంద్ర ఖజానాకు తరలించాలని ఒత్తిడి చేస్తోంది. దీన్ని తిరస్కరించినందుకే ఆర్బీఐపై గురి పెట్టింది కేంద్రం.
ఆర్థిక రంగంలో మోడీ మాయాజాలం అంతటితో ఆగలేదు. ఇప్పుడున్న పరోక్ష పన్నుల విధానంలో వ్యాపారులు లక్షల కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ దొంగలందరినీ దారికి తేవటానికి జీఎస్టీ ఒక్కటే మంత్రం అన్నది కేంద్రం. కేంద్ర ఖజానాకు జీఎస్టీ కామధేనువు అని ఒప్పించింది. అర్థరాత్రి పార్లమెంట్ తలుపులు తీసి పన్ను ఎగవేతదారులను పట్టుకోవటానికి జీఎస్టీ లైటు వెలిగించింది. దాదాపు ఏడాదిన్నర పాటు జీఎస్టీ అమలు జరిగిన తర్వాత కూడా కేంద్రం ఖజానా నిండుకోలేదు. దాంతో వచ్చే ఎన్నికలకు ముందు వరాలు ప్రకటించటానికి కొత్త దారులు వెతుక్కోవాల్సి వచ్చింది.
చివరిగా ఆర్బీఐపై కొరడా ఝుళిపించటానికి దారి తీసిన మరో తక్షణ నేపధ్యం ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీల పారుబకాయిలు. పారుబకాయిలు మోడీ పగ్గాలు చేపట్టే నాటికి 6,11,900 కోట్లు ఉంటే 2017 నాటికి 7,91,800 కోట్లకు చేరుకున్నాయి. అంటే బ్యాంకులు జాతీయం చేసిన ఐదు దశాబ్దాల్లో ఆరు లక్షల కోట్లు పారు బకాయిలు పేరుకుపోగా మోడీ నాలుగేండ్ల పాలనలోనే లక్ష 80 వేల కోట్ల పారుబకాయిలు పేరుకుపోయాయి. ప్రత్యేకించి మోడీతో బాదరాయణ బంధం కలిగిన అనిల్ అంబాని, అదానీ, టాటా వంటి దేశీయ గుత్తపెట్టుబడిదారీ సంస్థల ఆధీనంలో నడుస్తున్న ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు దివాళా తీశాయి. వీటిని జాతీయ కంపనీ లా ట్రిబ్యునల్లో విచారించి ఆస్తులు జప్తు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనికోసమే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (తక్షణ సవరణ చర్యలు) చేపట్టాలంటూ అన్ని బ్యాంకులకూ ఓ తాఖీదు కూడా జారీ చేసింది. సదరు పెద్దలందరూ బాదరాయణ బంధాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని కార్యాలయం ముందు వాలారు. చివరకు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అస్మదీయులెవరో తస్మదీయులెవరో ఆర్బీఐకి తెలీకుండా పోవటంతో అయ్యవారికి ఆగ్రహం వచ్చింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 బయటకొచ్చింది.
ఈ మేరకు జరిగిన సంప్రదింపుల్లో ఆర్బీఐని దారికి తెచ్చుకోలేకపోతే దేశాన్నేలిన ప్రధానుల్లో శక్తివంతమైన ప్రధాని 56 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధాని అని నిరూపించుకోవటం సాధ్యంకాదు కాబట్టే గుర్రు మీదున్న ఊర్జిత్ పటేల్తో సంప్రదింపులకు దొడ్డిదోవ తీశారు. ఏతావాతా కుదిరిన ఒప్పందం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా ఆర్బీఐ పరపతి ప్రమాణాల పునఃసమీక్ష (తక్షణ సవరణ చర్యలను సవరించుకోవటం), ఆర్బీఐ ఆధీనంలో ఉన్న మిగులు నిధులు, డెవిడెండ్ల పంపకం కోసం ఇప్పుడు అమలు జరుగుతున్న విధానాల సమీక్షకు మరో పెద్దల కమిటీ నియమాకం, పాతికోట్లకు లోపు ఉన్న చిన్న మధ్యతరగతి పరిశ్రమ రుణాలను పునఃనిర్మించుకోవటం (స్థూలంగా ఈ రుణాలు చెల్లించటానికి బ్యాంకింగ్ వ్యవస్థ ఇచ్చే గడువు పెంచటం). ఈ రాజీ వలన తక్షణ లబ్దిదారులు మోడీ అస్మదీయులే. తక్షణ సవరణ చర్యల కోసం ఆర్బీఐ ఇచ్చిన తాఖీదులో మార్పులు చేయటానికి తలాడించటం అంటే గుజరాత్ కేంద్రంగా ఉంటూ దివాళా తీసిన ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి కంపనీల రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టే. ఈ మూడు విషయాల్లో తిరిగి ఆర్బీఐ వెన్ను చూపింది. కేంద్రం గెలిచింది. దీని పర్యవసానాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత ఊబిలోకి నెట్టనున్నాయనటంలో సందేహం లేదు.
కొండూరి వీరయ్య
సెల్: 9871794037