Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల సందర్భంగా ప్రజలకు సంబంధించిన అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలు చర్చకొస్తూ ఉంటాయి. అయితే, పోలింగ్ నాటికి అలా చర్చకొచ్చిన అనేక అంశాల సారాంశంగా ముందుకొచ్చిన ఒక ప్రధానాంశం ప్రజల ఓట్ల సరళిని నిర్దేసిస్తుంది. అలా ప్రధానాంశంగా ముందుకొచ్చిన అంశం ఏ పక్షానికి అనుకూలంగా ఉంటే ఆ పక్షాన్ని విజయం, ఏ పక్షానికి వ్యతిరేకంగా ఉంటే ఆ పక్షానికి అపజయం వరిస్తుంది.
అయితే, నేడు పోలింగ్ జరుగుతున్న తెలంగాణలో ప్రధానాంశంగా ముందుకొచ్చిన అంశం ఏది? ఆత్మగౌరవం- సామాజిక న్యాయం. ఈ 'ఆత్మగౌరవం- సామాజిక న్యాయం' తెలంగాణ ఆత్మ. ఈ ఆత్మ ఘోషే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్కు అధికారం. తమ ఆత్మగౌరవాన్ని నిలబెడతారని, సామాజిక న్యాయాన్ని అందిస్తారని సబ్బండ వర్ణాలు దృఢంగా నమ్మబట్టే తెలంగాణ మొత్తం కేసీఆర్ వెనుక దండై కదిలింది. సవాలక్ష కష్టాలకోర్చి, త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంది.
చేసేందుకు పని దొరికే చోట ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడరు. ఎందుకంటే పనిలోనే ఆత్మగౌరవ ముంది. సామాజిక వివక్షలకు అతీతంగా ప్రజలందరూ చేసేందుకు పని పొందడంలోనే సామాజిక న్యాయం ఇమిడి ఉంది. 'తెలంగాణలో ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు కావాల్సిన పని దొరికేందుకు సమస్త వనరులూ ఉన్నాయనీ, కేవలం పరాయి పాలకుల కారణంగానే ప్రజలకు పని దొరకడం లేదనీ, ఆ కారణంగా జనం ఆత్మగౌరవంతో బతుకలేకపోతున్నారనీ, సామాజిక న్యాయాన్ని అందుకోలేక పోతున్నారనీ ఉద్యమ సమయంలో కేసీఆర్ నాయకత్వం ఎలుగెత్తి చాటింది. దాన్ని తెలంగాణ సమాజం నమ్మింది. తెగబడి పోరాడి రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రాన్ని ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేతుల్లో పెట్టింది. కానీ కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టిన మరుక్షణం నుంచే పరిస్థితి తలకిందులవడం ప్రారంభమైంది.
నిజానికి, కేసీఆర్ సామాజిక నేపథ్యం మీద, ఆ సామాజిక నేపథ్యం వ్యక్తిత్వంపై చూపించే ప్రభావంమీదా శాస్త్రీయ అంచనా ఉన్న బుద్ధిజీవులెవరైనా ఆయన అందించబోయే పాలన ఇందుకు విరుద్ధంగా ఉంటుందని భావించలేరు. 'పరిస్థితి ఇలా అవుతుందని నేను ఊహించలేదు' అని ఇప్పుడు తెలంగాణ బుద్ధిజీవుల ప్రతినిధి కోదండరామ్ బావురుమంటే ఫలితం శూన్యం. ఒక్క కోదండరామ్నే నిందించాల్సిన అవసరం లేదు. తెలంగాణ మేథో సమాజమంతా ఉద్యమ సమయంలోనే తాము హెచ్చరికకు గురై సమాజాన్ని హెచ్చరించి ఉంటే పరిస్థితి ఇలా దాపురించేది కాదు.
అధికారం అందుకున్న మరుక్షణం ఉద్యమ నాయకుని అవతారం చాలించి, సవాలక్ష సాటి రాజకీయ నేతలలో ఒకడిగా మారిపోయిన కేసీఆర్ అత్యంత సహజంగానే సంక్షేమబాట పట్టారు. పాలకుల దృష్టిలో సంక్షేమం అంటే ప్రజల ఓట్లను ఆకర్షించే ఒక సాధనం. సంక్షేమ బాటలో ఓట్ల లెక్కలకు తప్ప ప్రజల ఇక్కట్లకు స్థానముండదు. ఓట్ల లెక్కలో ఏ పాలకునికైనా మొత్తం ప్రజలందరి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. మొత్తం ప్రజలు - అందులో ఓట్లేసేవారి శాతం - ఆ పోలైన ఓట్లలో గెలిచేందుకు తనకు రావాల్సిన ఓట్ల శాతం.. లెక్క ఇలా సాగి మొత్తం జనాభాలో 25-30శాతం మందిని తన వైపు నిలుపుకుంటే ఇక తమ అధికారానికి తిరుగుండదన్న సత్యం అర్థం చేసుకున్న పాలకులు 70శాతం మందిని గాలికొదిలేసేందుకు గర్వంగా సిద్ధపడతారు. మనిషికన్నా ఓటుకు - ఓటుకన్నా-ఓటు బ్యాంకుకూ విలువనిచ్చేందుకు నిర్ణయించు కుంటారు. సగటు రాజకీయ నాయకుడిగా మారిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆ బాటలోనే నడిచారు. దీంతో సహజంగానే ఆయన బుద్ధి జీవులకు, బతుకులేని బడుగువర్గాలకు దూరమయ్యారు. ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమడ దూరం జరిగిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటరైపోయారు. పాలకుడు ఒంటరి కావడమంటే అతనొక నియంతలా మారడమే! ప్రశ్నలను ఆహ్వానించలేని, ప్రశ్నలకు తట్టుకోలేని, ప్రశ్నలను సహించలేని ప్రజా వ్యతిరేకిగా మారడమే! దీంతో కేసీఆర్ పనులకన్నా, ప్రవర్తన ప్రజల్లో చర్చనీయాంశ మైంది. ప్రజలలో సాగుతూ ఉన్న ఈ చర్చ ఆయన్ను మరింతగా మొద్దుబార్చింది. ప్రజలను కలుసుకోలేని, ప్రజలతో మసలుకో లేని స్థితికి చేర్చి చివరకు ఫామ్హౌస్కి పరిమితం చేసింది. అయినా.. తనలో నిబిడీకృతమై ఉన్న శృతిమించిన స్వాభిమానం (అహంభావం) అటో ఇటో తేల్చుకొమ్మని పురిగొల్పింది. ఈ స్థితిలో ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తన ఎమ్మెల్యేలలో దాదాపు 65శాతం మందిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉన్నదని తెలిసినా తన అహాన్ని చల్లార్చుకునేందుకు వారిని తిరిగి బరిలో నిలిపారు. ప్రజాభిప్రాయాన్ని తాను నియంత్రిం చగలనని, తాను మాత్రమే ప్రత్యామ్నాయమన్న స్థితికి ప్రజలను చేర్చి సునాయాసంగా విజయతీరం చేరగలనని తలపోశారు.
ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. ప్రజల నాడి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కు అర్థమై వేగంగా పావులు కదిపింది. ఊహించని రీతిలో రోజుల్లోనే ప్రజాకూటమి ఊపిరిపోసుకుంది. భావోద్వేగ రాజకీయాలలో ఆరితేరిన కేసీఆర్ను తిరిగి అదే భావోద్వేగ రాజకీయంతో దెబ్బతీసేందుకు వ్యూహం పన్నింది. కేసీఆర్ తనకై తాను సృష్టించుకుని, విస్తృత పరచుకున్న ఫ్యూడల్ దొర చిహ్నంపై, ఫ్యూడల్ వ్యతిరేక చిహ్నాలను మోహరించింది. ఆ చిహ్నాలు రాజకీయంగా ఎంత శక్తిహీనమైనవయినా కావచ్చు, సామాజికంగా వాటికున్న ఒక గుర్తింపు, గౌరవం ఎన్నికల రాజకీయాలలో నిర్ణయాత్మకం. గురువారం నాడు ప్రచార చివరాంకంలో కేసీఆర్ పక్కన ఆయన అల్లుడు హరీశ్ రావు మాత్రమే కనిపిస్తే, రాహుల్- చంద్రబాబు సరసన సురవరం, కోదండరామ్, గద్దర్, ఆర్.కృష్ణయ్య, కృష్ణ మాదిగ లాంటి వాళ్లంతా దర్శనమివ్వడం జరుగబోవు పోలింగ్ సరళికి, రాబోవు ఎన్నికల ఫలితాలకు ఒక సంకేతం. సరే, ఈ సంకేతాలు, ఫలితాలు ఎలా ఉన్నా.. రేపు కేసీఆర్, ప్రజా కూటమి ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయా? అన్నది ప్రశ్న. కచ్చితంగా నెరవేరవని మహా కచ్చితంగా చెప్పవచ్చు. కారణం కేసీఆర్, రాహుల్, చంద్రబాబులు ఒకే తాను ముక్కలే కాబట్టి. ఇప్పుడు వారి చుట్టూ చేరిన 'సంకేతాలు' వారికి రాజకీయంగా ఉపయోగపడగలవే తప్ప వారి పాలనా తీరును ప్రభావితం చేయలేవు కాబట్టి.
అవును! విత్తు ఒకటి నాటితే మొక్క మరొకటి మొలకెత్తదు. ఎన్నికలలో ప్రధాన పోటీదారులుగా ఉన్న పార్టీల విత్తులన్నీ ఒక్కటే. వాటిలో ఏ విత్తును వికసింపచేసినా అది పెరిగి ప్రజల పాలిట విషవృక్షమవుతుందే తప్ప, కల్పవృక్షం కాదు. అందుకని తెలంగాణ ప్రజలు సరైన విత్తును వెతుక్కోవాలి. ఆ విత్తు బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) రూపంలో ఉందని గ్రహించాలి. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు సరైన విత్తును సరిగ్గానే గుర్తిస్తారు. అయితే, ఎప్పుడన్నదే వేయి డాలర్ల ప్రశ్న!
కోప్ర
సెల్: 6301289321