Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం దేశం అనుసరిస్తున్న పార్లమెంట్ ప్రజాస్వామ్య విధానంలో రాజకీయ పార్టీలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ విధానం స్థానంలో ప్రపంచంలో అనేక దేశాల్లో అమల్లో ఉన్న దామాషా ఎన్నికల పద్ధతికి వెళ్లినా రాజకీయ పార్టీలే ప్రధాన పాత్ర వహిస్తాయి. నిజం చెప్పాలంటే ఇప్పటికంటే దామాషా ఎన్నికల విధానంలో రాజకీయ పార్టీల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాగా ఎన్నికల్లో, ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ ప్రమేయం ఉండరాదని, రాజకీయం పార్టీలకు అతీతంగా ఉండాలనే వాదన తెలంగాణలో ముందుకు తెస్తున్నారు. పోలింగ్ ముంగిట్లోకి వచ్చాక ఈ వాదన తెరమీద కొచ్చింది. పార్టీలకు అతీతంగా పార్టీలతో నిమిత్తం లేకుండా గెలవగల బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్యాధికారంలో బహుజనులకు న్యాయమైన వాటా దక్కాలి అన్న నినాదంతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడి ముందుకు దూసుకెళ్తున్న పూర్వరంగంలో పార్టీయేతర రాజకీయం అన్న వాదన తెర ముందుకొచ్చింది.
మన ఎన్నికల విధానం పూర్తిగా రాజకీయ పార్టీల ప్రాతిపదికనే నడుస్తోంది. రాజకీయ పార్టీల ప్రాతిపదికపైనే ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఇండిపెండెంట్గా పోటీచేసి ఇండిపెండెంట్గా చట్టసభల్లో కొనసాగే అవకాశం పౌరుడికి ఉన్నా ఒక పార్టీకి జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో గుర్తింపునివ్వడం, కొన్ని సౌకర్యాలు, హక్కులు కల్పించడం, పరిధులు, పరిమితులు విధించడం పార్టీల ప్రాతిపదిక మీదే జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కూడా పార్టీల ప్రాతిపదికనే జరుగుతోంది. ఆయా ప్రభుత్వాల ఇష్టాయిష్టాల మేరకే అమలవుతున్న ఫిరాయింపు నిరోధక చట్టానికి ప్రాతిపదిక రాజకీయ పార్టీనే. రాష్ట్రపతి, గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానాలు పంపడం పార్టీల ప్రాతిపదికనే జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం క్లెయిమ్ చేయడం కూడా రాజకీయ పార్టీల ప్రాతిపదికపైనే జరుగుతోంది. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా చట్ట సభలకు ఎన్నికైన వారు ప్రభుత్వ ఏర్పాటుకు క్లెయిమ్ చేసే అవకాశం హక్కు లేదా అని అడిగితే తప్పకుండా ఉంది. కాని ఏ పరిస్థితుల్లో అది సాధ్యం అన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ పరిశీలనలో ఊహాజనిత ఆలోచనల వల్ల ఫలితం ఉండదు. అందుకు ఇది సమయం కూడా కాదు.
తెలంగాణలో బహుజన ఫ్రంట్ (బీఎల్ఎఫ్) అన్నది దేశంలోనే ఒక కొత్త మార్గానికి పునాదులు వేసింది. అది ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఊడిపడినది కాదు. కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక ఉద్యమాల ప్రసవ వేదనల మధ్య ప్రాణం పోసుకొని ఉనికిలోకి వచ్చింది బీఎల్ఎఫ్. సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, పింఛన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, స్కాలర్షిప్పులు మాత్రమే కాదు, రాజకీయ ప్రాతినిధ్యం సాధించడం కూడా సామాజిక న్యాయ పోరాటంలో భాగమే అని బీఎల్ఎఫ్ నమ్ముతోంది. దాని ఎన్నికల ప్రణాళిక కూడా ఆ నమ్మకాన్ని అడుగడుగునా చాటుతోంది. కుల వివక్ష వ్యతిరేక ఉద్యమం, వివిధ వృత్తి సంఘాల ఏర్పాటు, పోరాటాలు, ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ చట్టం అమలు కోసం పోరాటం, బీసీ సబ్ప్లాన్ చట్టం రూపొందించి అమలు చేయాలని పోరాటం, వెనుక బడిన తరగతుల్లోనే అత్యంత వెనుకబడిన కులాలను సంచార కులాలను ఎంబీసీలుగా గుర్తించాలని పోరాటం. ఎంబీసీల సంఘాన్ని ఏర్పాటు చేయడం, వీటన్నింటి మేల్కలయికగా టీ-మాస్ రూపుదిద్దుకోవడం. ఆ మార్గంలోనే అధికారంలోనూ బహుజనులకు న్యాయమైన వాటా లభించాలనే నినాదంతో తెలంగాణలో బీఎల్ఎఫ్ ఏర్పడింది. బీఎల్ఎఫ్ ఆవిర్భావానికి ముందు సామాజిక అంశాలపై నిర్విరామ కృషి జరిగింది. ఈ కృషిలో అనేకమంది నాయకులు, కళాకారులు, ప్రజా ఉద్యమాల హితైైషులు, సామాజిక న్యాయాన్ని ప్రగాఢంగా కోరుకొనే వారు ఎందరో కలిసి వచ్చారు. వారిలో కొందరు మధ్యలో కనుమరుగు కావచ్చు. లేదా భిన్నమైన ఆలోచనలు చేయవచ్చు. ఎన్నికల దశలో ఎలాంటి ఆలోచనలు చేసినా సామాజిక న్యాయాన్ని రాజకీయ మార్పును ఆత్మసాక్షిగా అభిలషించే వారికి నేడు బీఎల్ఎఫ్ చూపుతున్న మార్గం తప్ప మరొకటి లేదు.
ఈ సామాజిక ఉద్యమాల్లో సీపీఐ(ఎం) కీలక పాత్ర వహించింది. సామాజిక న్యాయం పట్ల ఏ పార్టీకి, పలువురు మేధావులకు లేని స్పష్టత సీపీఐ(ఎం)కు ఉంది. సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం వర్గ పోరాటాలలో ఒక విడదీయలేని భాగమని సీపీఐ(ఎం) విశ్వసిస్తోంది. సామాజిక న్యాయం అంటే సమాన సామాజిక హోదా, గుర్తింపు, రిజర్వేషన్లు, ప్రాతినిధ్యం వున్న స్పష్టత సీపీఐ(ఎం)కు ఉంది. కాగా తాము కూడా సామాజిక న్యాయాన్ని కోరుకొంటున్నామని బయటికి చెప్తూ అవసరాన్ని బట్టి పైపై చర్యలతో సరిపెడుతూ వర్గ పాలనను కొనసాగించడానికే ప్రధాన పార్టీలుగా చెలామణి అవుతున్న రాజకీయ పార్టీలన్నీ కోరుకొంటున్నాయి. సామాజిక ఉద్యమాలు. ఆర్థిక పోరాటాలు లేకుండా ఉంటే నేడు రాష్ట్రంలో దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ఊసు కూడా ఉండేది కాదు. టీఆర్ఎస్ కపట నీతివల్ల పనిచేయగల స్థితి లేకున్నా ఎంబీసీ కార్పొరేషన్, బీసీ కమిషన్ అనేవే ఏర్పడి ఉండేవి కావు. కండ్లెదుట కన్పించే ఈ సత్యాన్ని చూడలేకపోతే అది కబోది తనమే అవుతుంది.
వివిధ పార్టీల టికెట్ల కేటాయింపుపై బీఎల్ఎఫ్ ప్రభావం ఏమిటో మనం గమనించవచ్చు. టీఆర్ఎస్ మొదటి దశలో ఫిరాయింపుదార్లతో సహా సిట్టింగ్లకు టికెట్లు ప్రకటించింది. ఆ తర్వాత ప్రకటించిన టికెట్లలో బీసీల నిష్పత్తిని టీఆర్ఎస్ పెంచక తప్పలేదు. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో అంటే ఏడింటిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తానని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇచ్చిన మాటను నిలబెట్టుకొనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని టికెట్ల కేటాయింపులోనూ తేలిపోయింది. బీఎల్ఎఫ్ ఆవిర్భావం నోరులేని అణగారిన కులాలకు గొంతునిచ్చింది. కాంగ్రెస్ కూడా తప్పని స్థితిలో బీసీలకు ఈ మాత్రం టికెట్లయినా యివ్వవలసి వచ్చింది. జనగామలో పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వక తప్పని స్థితిని తెలంగాణలోని సామాజిక ఉద్యమాలు కల్పించాయి. తనకు ఏ మాత్రం సంబంధం లేని మిర్యాలగూడాకి ఆర్.కృష్ణయ్యను పంపడంలో కూడా ఇదే ఒత్తిడి పని చేసింది. చివరిదాకా కృష్ణయ్యను లెక్కలోకి తీసుకోని కాంగ్రెస్ ఆయన బీఎల్ఎఫ్లోకి ఎక్కడ వెళ్తాడేమోననే తత్తరపాటుతో మిర్యాలగూడెం టికెట్నిచ్చింది. ఆ సీటును కృష్ణయ్య అంగీకరించడమూ ఒక విడ్డూరమే. బీజేపీ కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత నిస్తామని చెప్పుకోవాల్సి వచ్చింది.
ఈ పార్టీలేవి అత్యంత వెనుకబడిన బీసీ కులాల వారిని పరిగణనలోకి తీసుకోలేదు. బీసీల్లో కూడా డబ్బు, ఓ మేరకు రాజకీయ ప్రభావం చూపగల కులాల వారినే లెక్కలోకి తీసుకొన్నాయి. అందుకు భిన్నంగా బీఎల్ఎఫ్ టికెట్లను కేటాయించింది. చట్టసభలకు పోటీ చేయగలం అన్న ఊహకూడా చేయలేని కులాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకొంది. మహిళలకు కూడా ఎక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయించింది. ఒక ట్రాన్స్ జెండర్ను పోటీలోకి దించింది. జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీలు పోటీ చేయడానికి వీలులేదు అన్న రీతిలో మిగతా పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్ ఒక జనరల్ సీట్లో ఎస్సీని నిలబెట్టినా అదొక మినహాయింపు మాత్రమే. కాని బీఎల్ఎఫ్ జనరల్ సీట్లలో ఎస్సీ, ఎస్టీలకు గణనీయంగా టికెట్ల నిచ్చింది. తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని కూడా చేస్తామని ప్రకటించింది. సామాజికంగా తీవ్ర వివక్షకు గురవుతున్న వారిని ఎన్నికల్లో పోటీకి సిద్ధం చేయడం చిన్న విషయం కాదు. బహుముఖ ఒత్తిడులను ఎదుర్కొని అభ్యర్థులు రంగంలో నిలబడ్డారు. కింది కులాలు తమ ముందు కూర్చున్నా నోరుమెదిపినా పైకులాలవారు లోలోపల మండిపడే స్థితిలో ఎన్నికల్లో పోటీకి సిద్ధపడటం ఆషామాషీ కాదు. షాద్నగర్లో బీఎల్ఎఫ్ అభ్యర్థిపై టీఆర్ఎస్ భౌతిక దాడికి పాల్పడింది. ఒక రజకుడు పోటీకి దిగడం సహించరానిదైంది. పట్టు విడుపులు లేని సీపీఐ(ఎం) కృషితోనే సంచార కులాలతో సహా ఎంబీసీలు పోటీలో నిలవడం సాధ్యమైంది. వాటమైన పార్టీతో జతగట్టి ఒకటి రెండు సీట్లు పొంది రాజకీయ ఉనికిని చాటుకోవాలన్న దగ్గరి దారిని సీపీఐ(ఎం) ఎంచుకోలేదు. ఈ విషయాన్ని గుర్తించకుండా చేసే వాదనలు సారం లేనివి.
సీపీఐ(ఎం)తో భేదాభిప్రాయాల పేర సీపీఐ(ఎం)పై అపనమ్మకం పేర బహుజన లెఫ్ట్ఫ్రంట్ను, లాల్నీల్ మధ్య ఐక్యత కోసం సాగుతున్న కృషికి ఈ సందర్భంగా నష్టం కల్గించే పనికి పూనుకోవడం సామాజిక న్యాయం కోరుకొనే వారు చేయాల్సిన పనికాదు. గొప్పగొప్ప సంస్థలు అనుభవజ్ఞులే నేడు గెలుపోటములపై ఒక నిర్ణయానికి రాలేపోతున్నారు. కాగా గెలిచే బీసీ అభ్యర్థి అనే పేర, గెలిచే మహిళా అభ్యర్థి అనే పేర కొందరిని ఎంచుకొని వారికి మద్దతు ప్రకటించడం ఎంతవరకు తగిన పని. ఏ పార్టీకి చెందిన వారయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలను ఒక చోటికి చేర్చి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న తలంపు స్వీయమానసిక ధోరణిగా మిగిలిపోదా? బహుజనులకు పరిపాలనలో తగిన పాత్ర ఉండాలని కోరుకొనే వారు ఆలోచించాలి. పొసగని, సందర్భరహిత వాదనలు సామాజిక ఉద్యమాలకు తోడ్పడవని గమనించాలి.
ఎస్. వినయకుమార్