Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా, ఆస్ట్రేలియా వంటి ధనిక దేశాలు దౌత్యపరంగా మనకు మిత్ర దేశాలే. ఎక్కడయినా బావే కానీ వంగతోట దగ్గర కాదన్నట్టు, మీ ఇంటికొస్తే మాకేం ఇస్తావ్, మా ఇంటికొస్తూ మాకేం తెస్తావ్ అన్నట్టుగా ఉండే తమ దేశాల కార్పొరేట్ల ప్రయోజనాల విషయంలో మనకు అవి శత్రుదేశాలే. ఇప్పటికే మన పాలకులు ఒక్కొక్క వలువ తీసివేసి చివరకు గోచి మీద నిలబెట్టినట్టు మన రైతాంగానికి నామ మాత్ర రాయితీలు మిగిల్చారు. ఇప్పుడు మిగిలిన ఆ గోచిని కూడా తీసేయాల్సిందేనని ధనిక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. నవంబరు 26 నుంచి ఆ పంచాయితీ ప్రపంచ వాణిజ్య సంస్థలో నడుస్తోంది. అమెరికా - చైనా మధ్య జూలైలో ప్రారంభమైన వాణిజ్య యుద్ధం గురించి మాత్రమే మనకు తెలుసు. ఆ యుద్ధంలో దెబ్బతినే తన రైతాంగానికి ఇప్పటికే ఇస్తున్న సబ్సిడీలకు తోడు అదనంగా పత్తి, సోయా వంటి అనేక ఎగుమతి పంటలకు 12బిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించింది అమెరికా. అలాంటి దేశం గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటిఓ) వర్ధమాన దేశాలకు నిర్ణయించిన పదిశాతం సబ్సిడీ పరిమితిని మించి వరి, గోధుమలపై ఇప్పుడు పత్తి రాయితీలు పరిమితికి మించి ఇస్తున్నారంటూ కనీస మద్దతు ధరకు ఎసరు పెట్టింది. చెరకు రైతులకు, పంచదార ఎగుమతులకు ఇస్తున్న సబ్సిడీలు తమ రైతాంగాన్ని, మొత్తంగా ప్రపంచ పంచదార మార్కెట్ను దెబ్బతీశాయంటూ ఆస్ట్రేలియా కూడా అదే పని చేసింది.
దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మన దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పత్తి విలువ వెయ్యికోట్ల రూపాయలు అనుకుందాం. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, ధనిక దేశాల వాదన ప్రకారం పత్తి సబ్సిడీ మొత్తం విలువలో పదిశాతం అంటే వంద కోట్ల రూపాయలకు మించి ఇవ్వకూడదు. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే కనీస మద్దతు ధరల పెంపుదల వందకోట్ల రూపాయలకు మించకూడదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉనికిలోకి రాకముందు దాని విధి విధానాలను రూపొందించే కసరత్తులో భాగంగా 1986-88లో ప్రపంచ మార్కెట్లో వున్న సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకొని ధనిక దేశాలు ఐదుశాతం, అభివృద్ధి చెందుతున్న దేశాలు పదిశాతానికి మించి సబ్సిడీలు ఇవ్వకూడదని నిర్ణయించారు. మన గోధుమలు, వరికి ప్రకటిస్తున్న మద్దతు ధర పదిశాతం పరిమితికి మించి 60, 70శాతం ఉందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ దేశం తన రైతాంగానికి 82శాతం, ఐరోపా యూనియన్ 66శాతం ఇస్తున్నది.
మన దేశం 53-81శాతం మధ్య పత్తికి సబ్సిడీ ఇస్తున్నట్టు అమెరికా ఆరోపించింది. 2015-16లో 120 కోట్ల రూపాయలు చెల్లించినట్టు ప్రపంచ వాణిజ్య సంస్ధకు భారత్ తెలిపిందని అయితే 50,400 కోట్ల రూపాయలు చెల్లించినట్టు అమెరికా ఆరోపించింది. అంటే మొత్తం పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేసినట్టు రైతులకు సబ్సిడీ ఇచ్చినట్టు చిత్రించింది. తాము నిర్ణయిస్తున్న మద్దతు ధరలను డబ్ల్యూటీఓ ఏర్పాటుకు ముందు 1986-88 నాటి ధరలతో పోల్చి ఎక్కువగా ఉంటున్నట్టు అమెరికా తప్పుడు లెక్కలు వేస్తోందని మన దేశం గతంలోనే సమాధానమిచ్చినా ఖాతరు చేయకుండా ఫిర్యాదు చేశారు. అంతర్జాతీయ పత్తి సలహా సంస్థ 2018 నవంబరులో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం కనీస మద్దతు ధరలు, ప్రత్యక్ష ఉత్పాదక సబ్సిడీ, బీమా, తదితర రాయితీలన్నింటినీ కలిపి మొత్తంగా పత్తి సబ్సిడీలని పిలు స్తున్నారు.
పత్తి ధరల విషయానికి వస్తే 2013-14లో సగటున పౌనుకు 91సెంట్లు లభిస్తే 2014-16లో 70కి తగ్గి 2016-17లో 83కు, 2017-18లో 88 సెంట్లకు పెరిగింది. 1998-2008 మధ్య ప్రత్యక్ష, ఇతర సబ్సిడీల మొత్తం సగటున 55శాతం పెరిగింది. మరుసటి ఏడాది 83శాతానికి చేరింది. 2010-14 మధ్య 48శాతానికి తగ్గింది. తదుపరి రెండేండ్లలో సగటున 75శాతానికి పెరిగి తదుపరి రెండేండ్లలో 47శాతానికి తగ్గాయి. ఈ పూర్వరంగంలో చూసినపుడు మన దేశం గురించి అమెరికా చేసిన ఫిర్యాదు దురుద్దేశపూరితం. అంతర్జాతీయ పత్తి సలహా సంస్థ నివేదికలో మన దేశం గురించి పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 'భారత్లో కనీస మద్దతు ధర పద్ధతి ఉంది. 2014-15, 2015-16 సంవత్సరాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు తక్కువగా ఉన్నందున కొద్ది కాలమైనా ప్రభుత్వం నేరుగా పత్తి కొనుగోలు చేసింది. 2016-17, 2017-18లో మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నందున మద్దతు ధరల వ్యవస్థ కొనుగోలు అవసరం లేకపోయింది. మధ్యరకం పింజ రకమైన జే34 రకానికి 2017-18లో మద్దతు ధరగా క్వింటాలుకు రూ.4,020 నిర్ణయించారు. అది పౌను దూది ధర 83సెంట్లకు సమానం. భారత్లో పత్తి రైతులు ప్రభుత్వ రుణమాఫీ, ఎరువుల సబ్సిడీ వలన లబ్ది పొందారు. పంటల బీమా ద్వారా కూడా కొంత మేర మద్దతు ఇచ్చారు. అయితే దీని విలువ ఎంతో తెలియదు. ఇది కాకుండా నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించటం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. టెక్నాలజీ మిషన్ ద్వారా జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్ల నవీకరణకు, పత్తి మార్కెటింగ్కు ఇటీవల తోడ్పడింది. వీటి గురించి బహిరంగంగా తెలిపే సమాచారం లేదు. ఇవి గాకుండా జౌళి రంగానికి ప్రత్యక్ష మద్దతు, చౌక రుణాల ద్వారా కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తోంది.' రుణాల రద్దును, నూలు, వస్త్ర మిల్లులకు ఇస్తున్న రాయితీలను కూడా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీగా చిత్రించారు. చైనా పత్తి రైతులకు ఇస్తున్న రాయితీల గురించి చూద్దాం. దిగుమతి చేసుకున్న పత్తి ధర, చైనా మిల్లులకు చేరిన ధరకు మధ్య వున్న వ్యత్యాసం రైతులకు నష్టదాయకంగా ఉండకుండా చూసేందుకు చెల్లించిన లబ్ది మొత్తం 201-17లో ఒక బిలియన్ డాలర్లు ఉండగా, మరుసటి ఏడాది అది 1.5బిలియన్లకు పెరిగింది. మన కనీస మద్దతు ధర మాదిరి ఒక లక్షిత ధరను ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ ఏడాది మార్కెట్లో వచ్చిన సగటు ధరతో దానిని పోల్చి తక్కువ వస్తే ఆ మేరకు రైతులకు ప్రభుత్వం నేరుగా చెల్లిస్తుంది. 2018 సంవత్సరానికి ఒక టన్నుకు 18,600 యువాన్లుగా నిర్ణయించింది. ఇది పౌనుకు 130 సెంట్లకు సమానం. దాని ప్రకారం అంతకు ముందు సంవత్సరం చెల్లించిన 1.6బిలియన్ల నుంచి 2.1బిలియన్లకు మొత్తాన్ని పెంచింది. అంతే కాదు ప్రతి ఏటా 15కోట్ల డాలర్ల మేర నాణ్యమైన విత్తన సబ్సిడీ, మరో 15కోట్ల డాలర్లను దూర ప్రాంత రవాణా ఖర్చుల కింద రైతాంగానికి చెల్లించింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వార్షిక నివేదిక పేర్కొన్నదాని ప్రకారం 2014-15 సంవత్సరానికి పత్తి కనీస మద్దతు ధర పెంచింది రూ.50, ఇది ఒక శాతానికి దగ్గరగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోయిన కారణంగా ఆ ఏడాది దేశీయ మార్కెట్లో ముడిపత్తి ధరలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19 నుంచి 30శాతం వరకు, అదే విధంగా దూది ధర 25 నుంచి 30శాతం వరకు పతనమైంది. ఇలాంటి సందర్భాలలో చైనా, అమెరికాలలో రైతాంగానికి ఆయా ప్రభుత్వాలు సబ్సిడీల రూపంలో నష్టం రాకుండా చూశాయి. మన దేశంలో అలాంటి విధానం లేదు.
1966 నాటి చెరకు నియంత్రణ విధానం ప్రకారం మన ప్రభుత్వాలు చెరకు ధరను సూచిస్తున్నాయి. ఈ విధానం, పంచదార ఎగుమతులకు ఇస్తున్న రాయితీల కారణంగా ధరలు తగ్గి తమతో పాటు ప్రపంచ రైతాంగానికి, వ్యాపారులకు నష్టం జరుగుతోందంటూ ఆస్ట్రేలియా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేసింది. పంచదారను ప్రభుత్వం సేకరించే విధానం లేనప్పటికీ మద్దతు ధర నిర్ణయించటమే సబ్సిడీ చెల్లించటంగా ఆరోపించింది. 2011-17 మధ్య అంగీకరించిన సబ్సిడీ మొత్తాలకు మించి చెరకు సబ్సిడీలను భారత్లో ఇచ్చారని ఆస్ట్రేలియా వాదించింది. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీల కారణంగా ఈ ఏడాది భారత్లో పంచదార ఉత్పత్తి ఏకంగా 20 నుంచి 35మిలియన్ టన్నులకు పెరిగిందని ఆస్ట్రేలియా ఆరోపించింది. తమ దేశంలో టన్ను పంచదార ఉత్పత్తికి 440-450 డాలర్ల వరకు ఖర్చవుతుండగా మార్కెట్లో 500డాలర్లుగా వున్న ధర పడిపోయి 400కు మించి రావటం లేదని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. మరోవైపు మన దేశంలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలు రైతాంగానికి గిట్టుబాటు కావటం లేదని పెంచాలని కోరుతున్నారు. దీన్నే సబ్సిడీ చెల్లించటంగా ఆస్ట్రేలియా వంటి దేశాలు చిత్రిస్తున్నాయి.
మన మార్కెట్ను బహుళజాతి గుత్త సంస్థలకు తెరిచిన కారణంగా ఇప్పటికే పత్తి, ఇతర విత్తన రంగం, పురుగు మందుల రంగం విదేశీ, స్వదేశీ గుత్త సంస్థల ఆధిపత్యంలోకి పోయింది. వారు నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. కార్గిల్ వంటి బహుళజాతి గుత్త సంస్థలు కనీస మద్దతు ధరలను దెబ్బతీసే విధంగా పరోక్షంగా పత్తి కొనుగోళ్లు జరుపుతూ మార్కెట్లను నిర్దేశిస్తున్నాయని 2017 జనవరిలో వార్తలు వచ్చాయి. కనీస మద్దతు ధరల విధానం లోపాలతో కూడినదే అయినప్పటికీ ఆ విధానం కూడా ఉండకూడదని, అప్పుడే తాము ప్రత్యక్షంగా రంగంలోకి దిగవచ్చని అవి భావిస్తున్నాయి. దానిలో భాగంనే పారిశ్రామిక రంగానికి ఇచ్చే రాయితీలను కూడా రైతుల ఖాతాలో వేసి అమెరికా వంటి దేశాలు కనీస మద్దతు ధరల విధానం మీద దాడి చేస్తున్నాయన్నది స్పష్టం.
- సత్య