Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులలో పదవీ విరమణ తరువాత వచ్చే పింఛను గురించిన ఆలోచనలు ఆందోళన ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. మొన్న 26 నవంబర్ దేశవ్యాప్తంగా నేషనల్ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలన్న డిమాండ్తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. నవంబర్ 16న రైల్వే ఉద్యోగులు నిరసన కేంద్ర మంత్రి పియుషో గోయల్ ప్రత్యక్షంగా చవిచూడాల్సి వచ్చింది. తెలంగాణ ఎన్నికలలో సీపీఎస్ రద్దు ఒక కీలకమైన ఎన్నికల ఎజెండాగా మారింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో గాని ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల ప్రణాళికలో దాదాపు అన్ని ప్రధానమైన రాజకీయ పార్టీలు సీపీఎస్ రద్దు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం దేశవ్యాప్తంగా ఈరోజు ఉద్యోగులలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ పట్ల ఉందని తీవ్ర వ్యతిరేకత చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులే కాక ఈరోజు ఆర్బీఐ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, ఇతర పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు ఎన్పీఎస్ రద్దు డిమాండ్ చేస్తున్నారు. పాత పద్ధతిలో డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఉద్యోగులే కాక నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ కింద నెలకు 200 పెన్షన్ పొందుతున్న సీనియర్ సిటిజన్స్ రూ.3000 కనీస పెన్షన్ డిమాండ్ చేస్తున్నారు. వచ్చే జనవరి 8-9 జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ రద్దు ఒక ప్రధాన డిమాండ్గా ఉంది.
ఉద్యోగులంతా ఈరోజు ఇదివరకు ఉన్న డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ కోరుకుంటున్నారు. అసలు ఎందుకు డిఫైన్డ్ బెనిఫిట్ పెన్షన్ స్కీమ్ రద్దు చేశారు. నూతన ఆర్థిక విధానాలలో భాగంగా అన్ని రంగాలలో సంస్కరణలు వచ్చినట్టే పెన్షన్ సంస్కరణలను కూడా ప్రపంచ బ్యాంకు రుద్దింది. రోజురోజుకు పెరుగుతున్న పెన్షన్ భారాలు ప్రభుత్వాలు వనరులను హరించి వేస్తున్నాయని చెప్పి ప్రభుత్వాలు పెన్షన్ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకోవాలని ప్రపంచబ్యాంకు ఆదేశాలను ఇచ్చింది. 2001లో ఆనాటి వాజ్పాయి ప్రభుత్వం పెన్షన్ సంస్కరణలను అధ్యయనం చేయడానికి భట్టాచార్య కమిటీని నియమించింది. భట్టాచార్య కమిటీ సిఫారసుల మేరకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏర్పరిచి 1-1-2004 తర్వాత ప్రభుత్వ సర్వీసులలో చేరిన ఉద్యోగులకు డిఫైన్డ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (డీసీపీ) ద్వారా పెన్షన్లను చెల్లించాలని నిర్ణయించారు. దీనిని కొనసాగించాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్సు జారీ చేసింది. కానీ వామపక్షాల వ్యతిరేకత వల్ల బిల్లును పార్లమెంటు ఆమోదానికి తీసుకు రాలేదు. తర్వాత యూపీఏ-2 ప్రభుత్వం బీజేపీ సహకారంతో పీఎఫ్ఆర్డీఏ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసుకొని డీబీఎస్ స్థానే డీసీపీ స్కీమ్ అమలులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు డీసీపీని అమలు చేస్తున్నాయి. మొదట్లో వామపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, కేరళ, త్రిపురలో పాత డీబీఎస్అమలులో ఉండేది. యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక డీసీపీ స్కీమ్ అమలులోకి తెచ్చింది. కేరళ వామపక్ష ప్రభుత్వం దీనిని సమీక్షించి డీబీఎస్ స్కీమ్ను మళ్లీ అమలులోకి తేవాలని యోచిస్తోంది. త్రిపురలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కంట్రిబ్యూషన్ స్కీమ్ అమలులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఉద్యోగుల ప్రయోజనాలను హరించడంలో ప్రపంచ బ్యాంకు విధానాల అమలులో పోటీ పడుతున్నాయని చెప్పాలి.
జనవరి 1 2004 తర్వాత ప్రభుత్వోద్యోగాలలోకి వచ్చిన వారందరికీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా మాత్రమే పెన్షన్ కల్పించబడుతుంది. ఉద్యోగి వేతనం నుంచి 10శాతం పెన్షన్ ఫండ్కి కంట్రిబ్యూట్ చేయబడుతుంది. మరో 10శాతం ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ రకంగా కంట్రిబ్యూషన్ మొత్తం ఎంత ఉంటుందో నిర్ధారింప బడింది. కానీ ఉద్యోగి పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ మాత్రం డిఫైన్ కాలేదు. డీబీఎస్ కింద ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు విరమణ నాటి వేతనంలో సుమారు 50శాతం పెన్షన్గా వచ్చే అవకాశం ఉండేది. కానీ డీసీపీ స్కీమ్లో ఉద్యోగి, ప్రభుత్వ కంట్రిబ్యూషన్ పీఎఫ్ఆర్డీఏ యాక్ట్ ద్వారా అనుమతి ఇవ్వబడిన పెన్షన్ ఫండ్లలో జమవుతాయి. పెన్షన్ ఫండ్లో జమయిన సొమ్మును షేర్ మార్కెట్లలో పెట్టుబడిగా పెడతారు. ఉద్యోగి పదవి విరమణ చేసిన నాడు షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల యొక్క మార్కెట్ విలువ ఆధారంగా జమ చేయబడిన మొత్తం విలువ నిర్ధారిస్తారు. ఇందులో 60శాతం మొత్తాన్ని ఉద్యోగికి వాపస్ చేయగా మిగతా 40శాతంతో annuity policy కొనుగోలు చేసి దాని ద్వారా ఉద్యోగికి పెన్షన్ అందిస్తారు. ఉద్యోగికి పదవీ విరమణ తరువాత వచ్చే సొమ్ము కానీ పెన్షన్ కానీ, పదవీ విరమణ చేసిననాడు స్టాక్ మార్కెట్లోని పెట్టుబడుల విలువను బట్టి ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఇంత పెన్షన్ వస్తుందని చెప్పలేం. 2008లాంటి ఆర్థిక సంక్షోభాలు వస్తే పెన్షన్ మొత్తం జీరో అయిపోతుంది. 30-35 ఏండ్లుగా జమ చేసిన మొత్తంపై ఉద్యోగులకు ఏ రకమైన నియంత్రణ ఉండదు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉద్యోగికి వచ్చే పెన్షన్ ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత జీవితం పూర్తిగా అస్థిర పడే అవకాశాలుంటాయి. ఎన్పీఎస్లో టైర్ టు కింద సాధారణ ప్రజలు కూడా పెన్షన్ ఫండ్లో పెట్టుబడులు పెట్టవచ్చు. టైర్ టులో ప్రభుత్వ కంట్రిబ్యూషన్ ఉండదు. టైర్ టులో కూడా ప్రజల కంట్రిబ్యూషన్లు స్టాక్ మార్కెట్లోకి వెళ్తాయి. ప్రజల సొమ్ము కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు ఉపయోగపడతాయి. కానీ ఉద్యోగులకు ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్పై మాత్రం స్పష్టత ఉండదు. అసలు ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు. కార్పొరేటు లాభపడతారు. ప్రజలకు మాత్రం శఠగోపం పెట్టే అవకాశాలు ఎక్కువ. పెన్షన్ చెల్లించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకొని ప్రజల సొమ్మును పెన్షన్ ఫండ్స్కు తరలించి షేర్ మార్కెట్లో పెట్టుబడులను పెంచడమే డిఫైన్ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ముఖ్య లక్ష్యం. నయా ఉదారవాద విధానాల వల్లే డీసీపీ స్కీమ్ అమలులోకి వచ్చిందని తెలుసుకోవాలి.
ఐక్యరాజ్యసమితి 1948లో మానవ హక్కుల మీద ఒక పత్రాన్ని విడుదల చేసింది. ఇది సాంఘిక భద్రతను ప్రాథమికమైన మానవ హక్కులు గుర్తిస్తుంది. రాజ్యాంగం ప్రకారం కూడా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నది. సుప్రీంకోర్టు తన తీర్పులలో జీవించే హక్కు అంటే మగాలు లాగా బతకడం కాదని మానవీయ విలువలతో గౌరవంగా జీవించగలిగినప్పుడే జీవించే హక్కును నిజంగా అమలు చేసినట్టు అని చాలా సందర్భాలలో పేర్కొన్నది. కానీ వీటికి విరుద్ధంగా ఈరోజు సాంఘిక భద్రత కలిగించే పెన్షన్పై తీవ్రమైన దాడి జరుగుతున్నది. మన దేశంలోనే కాక చాలా దేశాలలో ఈరోజు పెన్షన్ రహిత వాతావరణాన్ని సష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెన్షన్తో పాటు ఇతర సాంఘిక భద్రతా పథకాలపై కూడా ఉద్దేశపూర్వక దాడులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉదారవాద విధానాల అమలులో భాగంగా జరుగుతున్నాయి. ప్రపంచ యుద్ధాల తరువాత సంక్షేమ రాజ్య భావనలు పెరిగి కొన్ని ప్రభుత్వ విధానాలు పేదలకు మధ్యతరగతికి అనుకూలంగా అమలయ్యాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత పొదుపు చర్యల పేరుమీద కార్మిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పెన్షన్ సౌకర్యాలు తగ్గిపోతున్నాయి. పదవీ విరమణ వయస్సు పెంచుతున్నారు. విరమణ తరువాత జీవించే కాలాన్ని తగ్గించి పనిచేసే కాలాన్ని పెంచడమే పదవీ విరమణ వయస్సు పెంపు ఉద్దేశం. తెలంగాణ ఎన్నికలలో పార్టీలన్నీ పోటీపడి పదవీ విరమణ వయస్సును పెంచడానికి వాగ్దానాలు చేసాయి. వాగ్దానాలు వెనక అసలు మతలబును కార్మికవర్గం అర్థం చేసుకోవాలి.
ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ సార్వజనీనమైన సాంఘిక భద్రత కల్పించడానికి అవసరమైన వనరులు ప్రభుత్వాల వద్ద లేవు. అలాగే ప్రభుత్వాలు ఈ భారాలను మోయలేని పరిస్థితులలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏర్పరచినట్టు ఉదారవాద ఆర్థికవేత్తలు మాట్లాడుతుంటారు. నిజానికి ప్రభుత్వాల దగ్గర వనరులు లేవు అని అనడం వాస్తవం కాదు. అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడానికి ప్రభుత్వాల దగ్గర వనరులు ఉన్నాయి. వీటిని ప్రజలకు బదిలీ చేయడానికి రాజకీయ పార్టీలు ఒక దఢ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీలను నియంత్రిస్తున్న తరుణంలో ఇది సాధ్యం కాని పరిస్థితి. ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి కానీ ప్రజల కోసం కాదు. పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకోవడం వల్ల ప్రయోజనాలు కలిగేది కార్పొరేట్లకే కాబట్టి కార్పొరేట్ల ప్రయోజనాలకు అనుగుణంగానే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఏర్పరచారు. ప్రధానమంత్రి జన జ్యోతి బీమా యోజన, ప్రధాని సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన లాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవి ప్రజలకు సరైన భద్రత కల్పించలేకపోతున్నాయి. నిజానికి ఈ పథకాలకు ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. ఈ పథకాల లబ్దిదారులే తమ పెన్షన్లను ఫండింగ్ చేసుకోవాలి. ప్రభుత్వ సహాయం ఏమీ ఉండదు. పదవీ విరమణ తరువాత లేదా ఆక్టివ్ వర్కింగ్ లైఫ్ తర్వాత ఇవ్వబడే రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలతో ఈ పథకాలను పోల్చలేం. సీనియర్ సిటిజన్స్కు కల్పించాల్సిన సౌకర్యాల బాధ్యత నుంచి ప్రభుత్వం క్రమంగా తప్పు కుంటున్నది. సీనియర్ సిటిజన్ల బంధువుల మీద ఈ బాధ్యత మోపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్, సీనియర్ సిటిజన్ (అమెండ్మెంట్) బిల్లు 2018 తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నది. దూరపు బంధువులను కూడా సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి బాధ్యులను చేయాలని ప్రభుత్వ ఆలోచన. ప్రభుత్వ బాధ్యతలను ప్రజల మీదకు నెట్టేసి చేతులు దులుపుకోవాలని ఈనాటి ప్రభుత్వాల ఆలోచనగా ఉన్నది.
2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏండ్లు దాటిన వారు మన దేశంలో పదికోట్లగా ఉన్నారు. రానున్న ఐదేండ్లల్లో వీరి సంఖ్య 18 కోట్లకు చేరనున్నది. 60ఏండ్ల వయసు దాటిన వారు మరో 20ఏండ్ల వరకు జీవిస్తారని ఒక అంచనా. 93శాతంమంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి ఏ రకమైన సాంఘిక భద్రతా ప్రయోజనాలు లేవు. ఇట్లాంటి పరిస్థితులలో 60ఏండ్ల తర్వాత ఉన్న కొద్దిపాటి ఆదాయాలను కోల్పోయి ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం ఒక పెద్ద సాంఘిక విస్పోటనానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రభుత్వ విధానాలు ప్రజలకు జీవనాధారాన్ని కలిగించేట్టుగా ఉండాలి. అట్లాగే ఆర్టికల్41 ముసలితనంలో, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకునేట్టు ప్రభుత్వ విధానాలు ఉండాలని శాసిస్తుంది. కాబట్టి సార్వజనీనమైన సాంఘిక భద్రత ద్వారా ప్రజలందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పాలి.
సాంఘిక భద్రత కోసం ప్రభుత్వం వెచ్చించేది చాలా తక్కువ. స్థూలజాతీయోత్పత్తిలో 0.07శాతం మాత్రమే సాంఘిక భద్రతపై ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. ఇతర పెట్టుబడిదారీ దేశాలతో పోల్చినా ఇది చాలా తక్కువ. ఉదాహరణకి ఫ్రాన్స్లో జీడీపీలో 11.5శాతం అట్లాగే జర్మనీలో జీడీపీలో 8.5శాతం సీనియర్ సిటిజన్ల పెన్షన్, ఇతర సాంఘిక భద్రత సౌకర్యాలపై ఖర్చుపెడతారు. నెలకు రూ.3 వేల చొప్పున యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అమలు చేసినా జీడీపీలో అది 2శాతం మాత్రంగానే ఉంటుంది. ఎన్నికలలో సీపీఎస్ రద్దుతో పాటు ఓల్డేజ్ పెన్షన్లపై కూడా వాగ్దానాలు హామీలు వెల్లువలా వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నిటిని అమలు చేస్తాయన్నది వేచి చూడాలి.
అట్లాగే ప్రజలందరికీ కనీస పెన్షన్ అందేట్టుగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. జీడీపీలో సాంఘిక భద్రతకు కేటాయింపులు పెరగాలి. జనవరి 8,9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అమలు ప్రధానమైన డిమాండ్లు. కాబట్టి కార్మికవర్గం ఈ సమ్మెను సంపూర్ణంగా విజయవంతం చేయాలి. అప్పుడే ప్రభుత్వాలు తలొగ్గి కార్పొరేట్ల ప్రయోజనా లకు భిన్నంగా సాధారణ, కార్మిక వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే విధానాలను అమలుచేసే అవకాశాలు పెరుగుతాయి.
కె. వేణుగోపాల్
సెల్:9440244277