Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ ముస్లిం మహ్మద్ ప్రవక్త పేరు చెప్పి ఓట్లడగడు
ఏ క్రైస్తవుడు జీసెస్ పేరు చెప్పి ఓట్లడగడు
ఏ సిక్కు గురునానక్ పేరు చెప్పి ఓట్లడగడు...
బీజేపీ మాత్రం అయోధ్య రాముని పేరుతో ఓట్లడుగుతుంది.
ఆ పేరుతో దేశంలో మత మారణహోమాన్ని సృష్టిస్తుంది.'' అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఈ పోస్టు చెక్కర్ల కొడుతూ, ప్రజల్ని ఆకర్షిస్తోంది. దీన్ని ఎవరు రూపొందించారో కాని సూటిగా స్పష్టంగా వాస్తవాన్ని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్దిపొందటానికి మళ్ళీ అయోధ్య వివాదాన్ని తెరపైకి తెస్తున్నాయి బీజేపీ సంఫ్ు పరివార్ శక్తులు. మత విద్వేషాలతో మూడు దశాబ్దాలుగా మనుగడ సాగిస్తూ, చివరకు రాజకీయ అధికారాన్ని పొందినా ప్రజలకు ఏమి చేయలేకపోగా, స్వాతంత్య్రా నంతర లౌకిక స్ఫూర్తితో నిర్మించుకున్న రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేశారు. నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ), చమురు ధరల బాదుడుతో ప్రజల నడ్డివిరిచారు. ప్రతి రంగంలోనూ విఫలమై ప్రజలకు కన్నీళ్ళు మిగిల్చారు. మళ్ళీ అధికారంలోకి రావటానికి అయోధ్య రాముణ్ణే నమ్ముకున్న ఈ శక్తులు నవంబర్ 25న అయోధ్యలో ధర్మసభ పేరుతో అలజడి సృష్టించారు. ఈ మత విద్వేషాలు చల్లారకుండా ఉండేందుకు వారణాసిలో జ్ఞాన్వ్యాపి మసీదును కూల్చి విశ్వనాధాలయాన్ని నిర్మిస్తామని, ఢిల్లీలో జమ్మ మసీదునుకూడా కూలుస్తామని దేశం వీరి సొంత జాగిరైనట్టు బీరాలు పలుకుతున్నారు. బెంగాల్లో తలపెట్టిన రథయాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించటంతో పాటు కోల్కతా హైకోర్టు కూడా బ్రేకులు వేసింది. అయినప్పటికీ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రథయాత్ర చేపట్టే తీరుతామని, తమని ఎవరూ ఆపలేరని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా సవాల్ విసిరారు. రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు విచారణకు తొందరేమి లేదని జనవరి నెలకు వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అయోధ్య అంశాన్ని వాడుకొని తద్వారా రాజకీయంగా లాభపడాలనుకున్న బీజేపీ పరివారానికి సుప్రీం తీర్పు అడ్డుగా నిలిచింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంపై సైతం ఈ శక్తులు దాడి చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాము కోరుకున్న విధంగా పనిచేయాలని ఒత్తిడి చేయటం, న్యాయవ్యవస్థను నియంత్రించ పూను కోవడం వీరి దాడుల్లోకెల్ల అత్యంత ప్రమాదకరమైనది. న్యాయ వ్యవస్థను హిందూ మతోన్మాద రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయించేందుకు ఈ శక్తులు బెదిరింపులకు పాల్పడటం ఆందోళనకరం.
ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో కేంద్రం ఉందని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రకుమార్ ప్రకటించారు. మరోవైపు ''అయోధ్య విషయాన్ని కాసేపు ప్రక్కన పెట్టండి. ముందు మా అప్పులు మాఫీ చేయండి'' అంటూ రైతులు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో గర్జించారు. దేశ రాజధానిలో రైతులు భారీగా కదం తొక్కారు. రైతు రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ఉచిత విద్యుత్, స్వామినాధన్ కమిషన్ మొదలైన సిపార్సుల అమలు మొదలైన డిమాండ్లతో లక్షలాది మంది రైతులు కదలివచ్చారు. అఖిల భారత కిసాన్సభ ఆధ్వర్యంలో 70కి పైగా రైతు సంఘాలు నవంబర్ 28న ఢిల్లీలో భారీ ర్యాలీ చేసాయి. వైద్యులు, లాయర్లు, కళాకారులు, ఉపాధ్యాయులు రైతులకు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వందల మంది రైతులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతల ఆక్రందనలు ఆత్మహత్యలు వీరికి పట్టవు. రామ మందిరం కోసమే తప్ప ఈ రైతు సమస్యల పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకురావడంపై మాట్లాడరు. ప్రజల మౌలిక సమస్యలైన ఆకలి, పేదరికం, విద్య, వైద్యం, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలేవీ వీరికి పట్టవు. సమస్యలపై ప్రజలు ప్రశ్నించకుండా, ఉద్యమించకుండా మతం అనే మత్తుమందు చల్లి వలసవాదుల కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతూ దేశభక్తి ముసుగలో తమ స్వంత ప్రజలకు ద్రోహం చేసే దేశ ద్రోహులే ఈ మతోన్మాదులు అని ఎప్పుడో చరిత్ర తేల్చి చెప్పింది. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, అన్యోన్యంగా జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టి మతకల్లోలాలు సృష్టించి మనుగడ సాగిస్తూ మతాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవటమే దీని చరిత్ర. ప్రజలు తమ మౌలిక అవసరాల్లోంచి చూస్తే ఈ పార్టీ ముసుగు తొలగిపోతుంది.
'రామజన్మభూమి కాదు -
దున్నేవానికే భూమి కావాలి!''
గుడులు కాదు - బడులు కావాలి
గోపురాలు కాదు - అక్షరజ్ఞానం కావాలి
విగ్రహాలు కాదు - వైద్యలయాలు కావాలి
అన్నం కావాలి - అందుకు భూమి కావాలి.
షేక్ కరిముల్లా