Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమ దేశ ప్రముఖ పౌరులలో ఒకరు హత్యకు గురైనట్టు ఒప్పుకోవడానికి సౌదీ అరేబియా అధికారులకు దాదాపు నెల రోజులు పట్టింది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య ముందస్తు పథకం ప్రకారం జరిగినదేనని సౌదీ అరేబియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొట్టమొదటిసారిగా అక్టోబర్ 25న అంగీకరించారు. అక్టోబర్ 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయం వెళ్లిన రోజు నుంచి ఖషోగ్గి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ తెలియకుండా రెండు వారాలకు పైగా గడిచాక, దౌత్య కార్యాలయంలోనే ఖషోగ్గి హత్యకు గురయ్యాడని సౌదీ అధికారులు అయిష్టంగా అంగీకరించారు. సౌదీ కాన్సొలేట్లోనే హత్య జరిగిందనడానికి తగిన ఆధారాలను టర్కీ అధికారులు అమెరికా ప్రభుత్వానికి అందించాక వారందుకు అంగీకరించక తప్పలేదు.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సహకారంతో ఈ విషయంలో తను మొండిగా నిలబడవచ్చని సౌదీ అరేబియా మొదట భావించింది. సౌదీ అరేబియాపై అన్యాయంగా దాడి చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు మొదట్లో వెనకేసుకొచ్చారు. మళ్లీ ఆయనే 'నిర్దోషి అని నిరూపితమయ్యే వరకు నిన్ను దోషిగానే చూస్తాం' అని అక్టోబర్ మధ్యలో మీడియాతో చెప్పారు. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబిఎస్)తో ప్రత్యేక అనుబంధం కలిగిన ట్రంప్ అల్లుడు జరేద్ కుష్నేర్ ఈ అంశాన్ని కప్పిపెట్టేందుకు శక్తిమేరకు కృషి చేశాడు.
సౌదీ యువరాజు పట్ల దయ చూపి అతని తాజా నేరాన్ని చూసీచూడనట్టు విడిచిపెట్టాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా శ్వేతసౌధాన్ని కోరింది. ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు-శక్తివంతమైన యూదు లాబీకి-ట్రంప్కు మధ్య అపారమైన పలుకుబడి ఉన్నట్టు ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు తెలియ చేస్తున్నాయి. సౌదీ రాజకుటుంబంలో ఎంబిఎస్ ఎదగడానికి, అతను రాజకీయంగా బలం పుంజుకోవడానికి అబుదాబి యువరాజు, యూఏఈ పాలకుడు మహ్మద్ అల్ నహ్యా సహకరించాడని పశ్చిమాసియా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. యెమెన్లో భయానక యుద్ధానికి, ఖతార్ దిగ్బంధానికి వారిరువురే ప్రధాన సూత్రధారులు.
ఇరానియన్ నాయకత్వం మొదట ఈ విషయమై కుట్రపూరిత మౌనం వహించింది. అయితే ఇస్తాంబుల్లోని దౌత్య కార్యాలయం లోపల ఖషోగ్గి హత్యకు గురయ్యాడని సౌదీ అధికారులు అంగీకరించడంతో ఆ తర్వాత ఇరాన్ నాయకత్వం సైతం అధికారికంగా నిర్ధారించింది. తన పని పూర్తయ్యాక దౌత్య కార్యాలయం నుంచి ఖషోగ్గి ఆరోగ్యంగా, సంతోషంగా వెళ్లిపోయారని సౌదీ అరేబియా మొదట చెప్పింది. దీనిని ఖండిస్తూ టర్కీ అధికారులు వీడియో సాక్ష్యం బయటికి తీయడంతో ఆ కథ మారిపోయింది. దౌత్య అధికారులతో వాదించే సమయంలో ఖషోగ్గి ప్రమాదవశాత్తూ చనిపోయాడని సౌదీ అధికారులు తర్వాత పేర్కొన్నారు. ఆ కథ కూడా కొద్ది గంటల్లోనే మారిపోయింది. దుర్మార్గులైన తన సొంత గూఢచార ప్రతినిధుల చేతిలోనే ఖషోగ్గి చనిపోయాడని అక్టోబర్ మధ్యలో అయిష్టంగా అంగీకరించింది. ఈ హత్యకు సంబంధించి 18 మందిని అరెస్టు చేశారు. వీరిలో 15 మంది అక్టోబర్ 2వ తేదీన రియాద్ నుంచి ఇస్తాంబుల్కు పరారైన వారే.
ఇస్తాంబుల్లో జరిగినది ఘోరమైన నేరమని, అది సౌదీ వాసులందరిని నిజంగా బాధిస్తుందని యువరాజు ఎంబిఎస్ ఆలస్యంగా అంగీకరించాడు. హత్యకు కారణమైన వారందర్నీ శిక్షిస్తామని కూడా హామీ ఇచ్చాడు. ఎంబిఎస్కి తెలియకుండా ఎలాంటి నేరం జరగదని పాశ్చాత్య గూఢచార సంస్థలు కూడా ఎట్టకేలకు అంగీకరించాయి. ఘటనకు సంబంధించి ప్రతక్ష్య విచారణ చేసేందుకు అక్టోబర్ రెండవ వారంలో వచ్చిన అమెరికా స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో ప్రధాన అధికారులను సైతం యువరాజు కలిశాడు. ఖషోగ్గి హత్య పథకం ప్రకారం చేసిందేనని సౌదీ అధికారులు ఆఖరికి అంగీకరించడంతో... సీఐఏ అధిపతి గినా హాస్పెల్ టర్కీ విచ్చేసిన అనంతరం... తమ అధీనంలో ఉన్న వీడియో టేపుల ద్వారా హత్యకు సంబంధించిన వివరాలను టర్కీ అధికారులు బయటపెట్టారు. ఖషోగ్గి దౌత్య కార్యాలయంలోకి వచ్చేటప్పుడు వేసుకున్న వస్త్రాలను ధరించిన వ్యక్తి ఇస్తాంబుల్ కాన్సులేట్ బయటికి వెళ్తున్న ఫొటోలను టర్కీ మొదట విడుదల చేసింది. వీడియోలో కన్పించిన మారు వేషధారి కూడా అక్టోబర్ 2న రియాద్ నుంచి పరారైన 15 మందిలో వున్నారు.
ఖషోగ్గిని చంపిన 15మందిలో ఒక వైద్యుడు కూడా ఉన్నాడని, దౌత్య కార్యాలయంలోకి అడుగెట్టిన నిమిషాల్లోనే అతనిని చంపి వైద్యులు ఉపయోగించే రంపంతో ముక్కలు చేశారని టర్కీ పరిశోధక బృందం గమనించింది. 15మంది నిందితుల ఫొటోలు టర్కీ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరిలో యువరాజుకు సన్నిహితంగా మెలిగే వారు అధికంగా ఉన్నారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డొగాన్ తన దగ్గరున్న సాక్ష్యాన్ని బైట పెట్టకుండా... సౌదీ అరేబియాకు సరిపడా సమయాన్నిచ్చాడు. ప్రపంచమంతా చూస్తుండగా ఘటనకు సంబంధించిన రక్తపు మరకలను కడుక్కోవడానికి నెలకు పైగా సమయం లభించింది.
ఈ నేపథ్యంలో యువరాజుతో సహా సౌదీ నాయకత్వం మామూలు పద్ధతులను కూడా తోసిరాజని ఎర్డొగాన్ పట్ల ఎంతో సాదరంగా ప్రవర్తించింది. ఖషోగ్గి కేసుకు సంబంధించి తమను అప్రదిష్టపాలు చేసేందుకు గాను ఖతార్ పథకం వేసిందని రెండు వారాల క్రితం వరకు సౌదీ అరేబియా ఆరోపిస్తూ వచ్చింది. ఖతార్కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం టర్కీ. సౌదీ అరేబియా దాన్ని దిగ్బంధించినపుడు తన సైన్యాన్ని పంపి ఖతార్ రక్షణకు ప్రయత్నించింది. సిరియాలో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకై ఈ రెండు దేశాలు ఏండ్ల తరబడి పరస్పరం సహకరించుకున్న మాట నిజమే. సూటిగా చెప్పాలంటే ఎర్డొగాన్కు గల్ఫ్లో సౌదీ కూటమికి మధ్య ఎలాంటి అనుబంధాలు లేవు. టర్కీలోని ఎ.కె పార్టీకి ముస్లిం బ్రదర్హుడ్తో సత్సంబంధాలున్నాయి. బ్రదర్హుడ్ నేతలు అనేక మంది టర్కీలో ఆశ్రయం పొందుతున్నారు. బ్రదర్హుడ్కి, ఎర్డొగాన్కు వ్యక్తిగతంగా సన్నిహితుడైన ఖషోగ్గి కూడా టర్కీలో స్థిరపడాలని ఆలోచన చేశారు. అరబ్ ప్రపంచంలో ప్రజాస్వామిక సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆఖరిసారిగా ప్రచురితమైన తన వ్యాసంలో ఖషోగ్గి గట్టిగా వాదించారు.
ఖషోగ్గి హత్యలో సౌదీ రాజకుటుంబ పెద్దల ఉదాసీనతను తెలియచేసే సాక్ష్యాలను సీఐఏ డైరెక్టర్కు ఎర్డొగాన్ ప్రభుత్వం అందించినట్టుగా మీడియాలో వచ్చింది. ఖషోగ్గి హత్యలో ఎలాంటి ప్రత్యక్ష పాత్ర లేదని యువరాజు సల్మాన్ ఖండిస్తూనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న రాజు మామూలుగానే పాలన చేయగల స్థితిలో లేడు. దాంతో తను ఎంచుకున్న వారసుడికి రాజ్య నిర్వహణా అధికారాన్ని అప్పగించాడు.
ఇలా ఉండగా సౌదీ ప్రభుత్వంపై ఎర్డొగాన్ ఒత్తిడి పెంచాడు. ఖషోగ్గి హత్యకు ఎవరు ఆదేశం ఇచ్చారో రియాద్ తెలియచెప్పాలని అంకారాలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఎర్డొగాన్ డిమాండ్ చేశారు. హతుడు ఖషోగ్గీ శరీర భాగాలను ఎక్కడ పూడ్చిపెట్టిందీ బహిర్గతం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 'సమయం వచ్చినప్పుడు' ఖషోగ్గి హత్యకు సంబంధించి తన దగ్గర వున్న ఆధారాలను బహిర్గతం చేస్తానని కూడా అన్నారు. నేరం చేయించిన సూత్రధారిని బయటికి లాగే ఆధారం తన దగ్గర ఉందని కూడా అన్నారు.
యువరాజుకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు పోగుబడుతున్నప్పటికీ సౌదీ రాజరికానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ట్రంప్ సుముఖంగా లేడు. అధ్యక్షుడు గనక దీనిపై ఇలా కాలం వెళ్లబుచ్చుతుంటే సౌదీపై తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికన్ కాంగ్రెస్ హెచ్చరించింది. మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్లో డెమోక్రాట్లు ఆధిక్యత పొందేట్టయితే యువరాజు పరిస్థితి మరింత దిగజారవచ్చు.
యెమన్పై మొదలైన ఘోర యుద్ధంలో యువరాజు కీలక పాత్ర... ఖషోగ్గి హత్య ఉదంతం తర్వాత మరింతగా బయిటకు వస్తున్నది. యెమెన్లో సౌదీ బాంబుదాడుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య పెరుగుతూనే వుంది. సౌదీ వల్ల ఏర్పడిన యుద్ధం, దేశం మీద విధించిన దిగ్భంధనం కారణంగా యెమెన్ను తీవ్రమైన అతి పెద్ద కరువు చుట్టేయనుందని ఐక్యరాజస్యసమితి తాజా నివేదిక అంచనా వేసింది. 80లక్షల మంది యెమెన్ వాసులు అత్యవసర ఆహార సహాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరి సంఖ్య 140లక్షలకు పెరగనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. సౌదీ ప్రభుత్వ ప్రతిష్ట సరిదిద్దలేనంతగా దెబ్బతింది. అదేవిధంగా యువరాజు స్థాయి ఎంతగానో దిగజారి పోయింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరిరితో బలవంతంగా రాజీనామా చేయించడం, యెమెన్పై ఆటవిక బాంబు దాడులు, ఇజ్రాయిల్తో సాన్నిహిత్యం వంటి ఆయన గత తప్పిదాలన్నీ కలసి ఇప్పుడు సౌదీ భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
ఖషోగ్గి హత్య యువరాజు చేసే చివరి తప్పు కావచ్చు. సౌదీ చరిత్ర చాలా స్వల్పమే అయినా ఈ కాలంలో దాన్ని పశ్చిమ దేశాలు అనేకసార్లు ఆదుకున్నాయి. 1979లో ఇస్లామిస్టులు మక్కాను గుప్పిట పట్టుకున్నప్పుడు రాచరికాన్ని కాపాడేందుకు విదేశీ శక్తులు జోక్యం చేసుకుని రాచరికాన్ని కాపాడ్డం అలాంటి ఒక చివరి తీవ్ర సవాలు.
అధికారం కోసం రాజ కుటుంబ ముఠాల మధ్య జరిగిన అంతర్గత పోరులో బ్రిటన్, అమెరికా సాయం చేశాయి. 1964లో బ్రిటిష్ వారి సాయంతో యువరాజు ఫైసల్ తన సోదరుడు సౌద్ను పక్కకు నెట్టేశాడు. అమెరికా, బ్రిటన్ కనుక అదే కోరుకుంటే ఇప్పుడు కూడా అలా జరిగే అవకాశముంది.
- జాన్ చెరియన్