Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిప్పును చంకలో దాచుకున్నా నీళ్ళమూట నెత్తిన పెట్టుకున్నా వాటి ప్రభావం తెలియకుండా ఉంటుందా? సమాజమైనా శరీరమైనా ఒక్కటే. మన ప్రమేయాలను అవి ప్రతిభింబిస్తాయి. అంతా మంచిగానే ఉంది అంటూ భ్రమిస్తూ కల్పితాలతో కాలక్షేపం చేస్తే అవే కాలకూట విషమై కాటు వేయడం తథ్యం. అందుకేనేమో రోగం రట్టు సంసారం గుట్టు అన్నారు. రోగం వచ్చినప్పుడు దానిని బయటికి తెలియజేస్తేనే ఎవరైనా సలహాలు చెప్పి సహకరిస్తారని అర్థం. సంసారం గుట్టుగా చేసుకోవాలని ఎందుకన్నారంటే అది భార్యాభర్తలకు మాత్రమే సంబందించిన వ్యవహారం కాబట్టి. వారికి వారే సర్దుకు పోవాలని. నిరుద్యోగ సమస్య సంసార విషయం కాదు, సామాజిక అంశం. అందుకే దానిని అందరికీ తెలిసేలా ఉంచాలి. ప్రభుత్వమే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన వారు కూడా పరిష్కారాలు వెతుకుతారు. ఉపాధి, వ్యాపారాల్లో అంతా సవ్యంగా ఉందని భావించినప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలెందుకు? కోటాలకై పోరాటాలెందుకు, వాటికై రిజర్వేషన్ల పేర పార్లమెంటు చట్టాలెందుకు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గణాంకాలను గుట్టుగా మార్చుకుంటూ పోతున్నది. దేశ జీడీపీని లెక్కించే విధానాన్ని, ద్రవ్యోల్పణాన్ని కొలిచే విధానాన్ని తమకు అనుకూలంగా తిరగ రాసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నదని, లెక్కించే ఆధారిత సంవత్సరాన్ని మార్చి తమ హయాంలో ఎక్కువ జీడీపీ వృద్ధి కనబడేలా చూపించారు. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చూపించడం కంటే అసలు గణాంకాలనే బహిర్గత పరచకుంటే సరిపోలా! అనుకున్నారేమో!? ఒక అడుగు ముందుకు వేసి భారతదేశ నిరుద్యోగ రేటుపై గణాంకాల సంస్థ (ఎన్.ఎస్.ఎస్.ఒ) తయారు చేసిన అధికారిక వివరాలను ప్రకటించడానికి బదులు దాచిపెట్టాలని చూసింది కేంద్ర ప్రభుత్వం. గణాంకాలను మార్చినా లేదా దాచిపెట్టినా గుణాత్మక మార్పు సాధ్యం అవుతుందా? ఇలాంటి విధానాలన్నీ రోగాన్ని దాచి పెట్టుకుని వైద్యానికి ప్రయత్నించడమే. 2017-18 గాను నేషనల్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సేకరించిన ఉపాధి, నిరుద్యోగంపై గణాంకాలను బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెలువరించింది. 2017-18లో నిరుద్యోగిత 6.1శాతంగా ఉన్నది. 2011-12లో ఇది 2.2శాతం మాత్రమే. ఈ వివరాల ప్రకారం గత 45ఏండ్లలో ఇదే గరిష్టం. విమర్శలు వెల్లువెత్తుతాయన్న భావనతో ప్రభుత్వం వీటిని ప్రకటించడానికి సిద్ధపడలేదు. దీనికి నిరసనగా ఇద్దరు నిపుణుల కమిటీ మెంబర్లు రాజీనామా కూడా చేశారు. అందులో ప్రస్తుతం యాక్టింగ్ చైర్మన్గా ఉన్న పి.సి. మోహన్తో పాటు సభ్యులు జె.వి. మీనాక్షి కూడా ఉన్నారు. ఈ వివరాలన్నీ జులై 2017 నుంచి జూన్ 2018 వరకు సంభందించినవి. ఆ తరువాత కాలంలో అమెరికా స్వీయ రక్షణాత్మక చర్యల ఉధతి వల్ల సాఫ్ట్వేర్ రంగంలో మరింత నిరుద్యోగం పెరిగింది.
మునుపెన్నడూ లేనంతగా 2017-18లో యువత నిరుద్యోగం (యూత్ అనెంప్లాయిమెంట్) అత్యధికంగా నమోదయింది. గ్రామీణ యువకుల్లో ఉపాధి 2011-12లో ఐదుశాతం ఉంటే, 2017-18లో 17.4శాతంగా నమోదయింది. ఇవే గణాంకాలు స్త్రీల పట్ల చూసినట్టయితే 2011-12లో 4.8శాతం ఉంటే 2017-18లో 13.6శాతంగా నమోదయింది. విద్యావంతులైన గ్రామీణ మహిళలు 2004-05లో 9.7శాతం నిరుద్యోగులుగా ఉంటే 2011-12లో అది 17.2శాతంగా ఉన్నది. ఈ ఉపాధి లేమి కారణంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 39.5శాతం నుంచి 36.9శాతానికి పడిపోయింది. గ్రామీణ మహిళల్లో 2017-18కిగాను 17.3శాతం నిరుద్యోగిత నమోదయింది. ఈ వివరాలన్నీ బహిర్గతమైతే ప్రభుత్వ వైఫల్యం తేలిపోతుందని పెద్దలు భావించి ఉంటారు. అయినప్పటికీ మాధ్యమాల ద్వారా బయటికి పొక్కడంతో నేషనల్ స్టాటస్టికల్ సర్వే వారికి బదులుగా నిటి ఆయోగ్ వారు హుటాహుటిన ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదేంటి, మీరు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తే, చీఫ్ స్టాటస్టికల్ ఆఫీసర్ ప్రవీణ్ శ్రీవాత్సవ అందుబాటులో లేరని, అందుకే మేము నిర్వహిస్తున్నామని నిటి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజ్కుమార్ బదులిచ్చారు. ఇలాంటి హడావిడి ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి జరుగుతున్నప్పుడు కచ్చితంగా అనుమానాలు రేకెత్తుతాయి. స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు మాత్రమే ఈ వివరాలు ప్రకటించి ఉండవచ్చు. కానీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ గతంలోనే భారతదేశంలో 15లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇది కూడా నోట్లరద్దు వల్ల సంభవించిందని ప్రకటించింది. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి సంబందించిన ''సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయిమెంట్'' ఆధ్వర్యంలో స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా రిపోర్ట్ 2018 వెలువడింది. దీని ప్రకారం 1970 - 1980 దశకాల్లో జీడీపీ వృద్ధి మూడు నాలుగు శాతాలుగా ఉంటే ఉపాది రెండు శాతంగా ఉండేది. 2000ల సంవత్సరం తర్వాత జీడీపీ ఏడుశాతం ఉన్నా ఉపాధి ఒక్క శాతం దగ్గరే ఉన్నది. ఇప్పుడది 0.1శాతానికి తక్కువే ఉన్నది. ఇదే రిపోర్టు ప్రకారం ఉపాధి కలిగిన వాళ్ళలో సగానికిపైగా లివింగ్ వేజ్కి నోచుకోవటం లేదు. ఉపాధి దెబ్బ తింటున్నట్టు ఇన్నాళ్ళూ సదరు రంగాల సంఘాలు మాత్రమే సమాజం దృష్టికి తెచ్చేవి. ఇప్పుడు ఆక్స్ఫామ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు, దేశీయ మీడియా, స్వచ్ఛంద సంస్థల సర్వేలతో పాటు సాక్షాత్తూ ప్రభుత్వ విభాగాలే సాక్ష్యాలను బయట పెడుతున్నప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించటం లేదు.
ఏ గణాంకాలైనా పరిమిత ప్రదేశాల్లో సేకరించిన డేటాపైనే ఆధారపడి ఉంటాయి. ఉపాధి విషయంలో మారుమూల ప్రాంతాలు డేటా కూడా దొరకనంత వెనకబడి ఉన్నాయి. అంతే కాక ఉపాధి ఉంది అని చెప్పబడే ఏ పని కూడా పర్మనెంట్ విధానంలో లేకపోవడంతో అసంఘటిత రంగంలో సగటున 50శాతం మాత్రమే పని దొరుకుతున్నది. ఈ జాడ్యం ఇప్పుడు సంఘటితంగా భావించబడుతున్న సాఫ్ట్వేర్ తదితర ప్రయివేటు రంగాలకు కూడా అంటుకుని రిజర్వులో ఉంచడం లేదా బెంచ్కి పరిమితం చేయడం వంటి విధానాలతో పూర్తి కాలం పని దొరకడం లేదు. దీనినే అండర్ ఎంప్లాయిమెంట్ అంటారు. ఈ విధమైన ఉపాధి లేమిని లెక్కలోకి తీసుకుంటే ప్రచురితమైన గణాంకాలు మరింత సవరించాల్సి వస్తుంది. హెచ్ఆర్. (ఉద్యోగుల నియామకం నిర్వహణా విభాగం) ఫిలాసఫీ అంటూ ఉద్యోగుల పనితనాన్ని కొలిచేందుకు కొత్త కొత్త విధానాలు తెచ్చి విధి నిర్వహణలో కాస్త వెనక బడినా అట్టి వారిని తొలగించి కొత్త వారిని తీసుకుంటున్నారు. ''బెల్ కర్వ్ మెథడ్'' అనబడే అప్రైజల్ ద్వారా ప్రతి యేటా ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించాలట. 10శాతం అత్యుత్తమం, 70శాతం సాధారణం, 20శాతం క్రింది స్థాయి అనగా ఇంప్రూవ్ చేయడానికి కూడా వీల్లేని వారు. ఈ మూడు విభాగాల్లో మొదటి వారికి ఎలాంటి మందలింపు ఉండదు. రెండవ రకానికి కౌన్సిలింగ్తో పాటు మందలింపు కూడా ఇస్తారు. ఇక మూడవ వారిని కచ్చితంగా తొలగించాలి. ఈ పద్ధతి కింద తేలిందేమంటే ప్రతి యేటా ఓ 20శాతం మందిని కచ్చితంగా తొలగించనున్నారని! కొంతకాలం ఒక సంస్థలో పని చేసి ఉన్నఫళంగా మరో ఉపాధి వెతుక్కోవడమంటే ఎంత కష్టమో అనుభవిస్తేనే గాని తెలియదు. ప్రయివేటు సంస్థల నుంచి ఇలాంటి ఒత్తిడి ఉన్నది కాబట్టే ప్రభుత్వం ''ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్'' అంటూ కార్మిక చట్టాలను మారుస్తున్నది. ఈ విధానాల వల్ల కంపెనీలు ధైర్యంతో ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తూ ఉపాధిని హరిస్తున్నాయి. పది, పదిహేనేండ్ల క్రితం ఇంటికి క్యాబ్లు పంపించి మరీ ఉద్యోగులను తీసుకెళ్ళిన కంపెనీలు నేడు వారి గుమ్మం ముందుకెళ్ళినా మొహం చాటేస్తున్నాయి. ఉపాధి సహిత వృత్తి విద్యా విధానం అమలు చేయక పోవడం వల్ల ఒకే రకమైన నిపుణత కలిగిన మానవ వనరు ఎక్కువ మోతాదులో ఏటేటా పెరుగుతోంది. అందరికీ ఉపాధి కష్టమౌతోంది. 2008లోనే శ్యాం పిట్రోడా కమిటీ చెప్పినట్టు చదివిన చదువుకూ చేస్తున్న పనికీ కేవలం నాలుగుశాతం మాత్రమే పొంతన ఉన్నదట. సేవారంగం కన్నా ఉత్పాదకరంగ అభివృద్ది వైపు దృష్టి సారిస్తే ధీర్ఘకాలిక ఉపాధికి అవకాశాలెక్కువ. ఇలాంటి విషయాలపై పదునైన దృష్టి పెట్టాలంటే నిరంతరంగా సర్వేలు చేయడం, వాటిని నిస్సంకోచంగా బహిర్గత పరచడం, విస్తృత స్థాయిలో పరిష్కారాలకు ప్రయత్నించడం ఎంతో అవసరం. కాదంటారా?
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016