Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనవరి 1న కేరళలో చోటు చేసుకున్న చారిత్రాత్మక ''మహిళా కుడ్యమ్'' కార్యక్రమాన్ని సమీక్షించేందుకు జనవరి 29న ఐద్వా కేరళ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విస్తృత ప్రచారం చేయటంలో భాగస్వాములైన సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అసమాన పరిస్థితులను సవాల్ చేయాలనీ, మార్చాలని కోరుకునే ప్రగతిశీల ఉద్యమకారులకు భవిష్యత్తులో ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన అనుభవాలు, గుణపాఠాలు ''మహా మహిళా కుడ్యం'' మనకు అందించింది.
శబరిమల సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినారయి విజయన్ ఏర్పాటు చేసిన మొదటి సమావేశంలోనే ఈ మహాకుడ్యం చేపట్టాలని నిర్ణయం జరిగింది. సామాజిక సంస్కరణ ఉద్యమాలు, కేరళ సంస్క తి వారసత్వాల విలువల పునరుజ్జీవం కోసం పనిచేస్తున్న వివిధ సంస్థలు, గ్రూప్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత క్రమంలో అనేకమంది భాగస్వాములు కావటానికి ఆసక్తి చూపటంతో మొత్తం 172 సంఘాలు, సంస్థలతో ''నవోధన మూల్య సంరక్షణ సమితి'' పేరుతో విశాల వేదిక రూపుదిద్దు కుంది. ఇందులో అనేక మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. వామపక్ష ప్రజాతంత్ర మహిళా సంఘాలు, ఎస్ఎన్డీపీ అనుబంధ మహిళా-సంఘాలు, కేపీఎంఎస్ ఆధ్వర్యంలోని దళిత మహిళా సంఘాలు, మొదలైన వారంతా దీన్లో ఉన్నారు. వివిధ రంగాలకు చెందిన కార్మిక, ఉద్యోగ సంఘాలు కూడా క్యాంపెయిన్లో భాగస్వాములయ్యారు. ప్రధానంగా మహిళలు చాలా చురుకైన పాత్ర పోషించారు. వీరే కాకుండా ముస్లిం మహిళల సమస్యలపై పనిచేస్తున్న నిసా వంటి స్వచ్ఛంద సంస్థలు, అన్వేషి, సఖి మొదలైన మహిళా గ్రూప్లు, మహిళా మేధావులు, కవులు, కళాకారులు, లాయర్లు, డాక్టర్లు ఇలా విభిన్నమైన సెక్షన్ల నుంచి మహిళా కుడ్యం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వ మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎన్నో సంఘాలు, ఎందరో వ్యక్తులు, అతి ముఖ్యంగా మహిళల సామూహిక కృషి, ప్రయత్నం ఫలితంగా అతిపెద్ద ప్రత్యేక సందర్భంగా రూపుదాల్చింది.
మనదేశంలోను, బయట కూడా ''మహిళా కుడ్యం'' విస్తత ప్రచారం పొందింది. అన్ని కులాలు, మతాలు, తరగతులకు చెందిన సుమారు 5.5 మిలియన్ (75 లక్షలు)ల మహిళలు కుల, లైంగిక వివక్షలకు వ్యతిరేకంగా ఒక్కటిగా నిలిచారు. మహిళా సమానత్వం అనే ప్రాథమిక భావనను, హక్కును సమున్నతంగా నిలబెట్టటానికి సంకేతంగా దృఢమైన మహిళా కుడ్యాన్ని నిర్మించారు.
సన్నాహాలు : రాజకీయ కార్యక్రమాలు విజయవంత మవటానికి నిర్మాణాత్మకమైన సన్నాహాలు చాలా అవసరం. శబరిమల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రజలలో మత భావనలను రెచ్చగొట్టే విధంగా ఎదురుదాడికి దిగుతున్న నేపథ్యంలో మహిళా కుడ్యం కోసం ప్రయత్నాలకు బీజం పడింది.
ఆరెస్సెస్ బీజేపీ లక్ష్యం సుప్రీంకోర్టు తీర్పును ఎదిరించి విశ్వాసాల పేరుతో స్త్రీ పురుష సమానత్వ ప్రాధాన్యాన్ని దెబ్బతీయటం. ''గుడ్డి విశ్వాసం'' ఎంత బలమైనదో ప్రతీఘాత శక్తులకు బాగా తెలుసు. అందుకే శబరిమలలో యథాతథ స్థితి కొనసాగించటానికి దీనిని వారు ఒక ఆయుధంగా చేసుకున్నారు. సన్నహాలలో భాగంగా ఐద్వా చేసిన పని సంబంధిత అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవటం, దానిని అంచలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లటానికి తగిన ప్రణాళిక రూపొందించటం. దీనికి మొదటి మెట్టుగా ఏరియా, జిల్లాల వారీగా కార్యకర్తలు, కమిటీ సభ్యులు, ఆఫీసు బేరర్స్తో వర్క్షాప్లు నిర్వహించి ప్రశ్నలూ సమాధానాల రూపంలో చర్చలు నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర నాయకులు ఈ వర్క్షాప్లకు హాజరై తర్ఫీదిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు, ప్రభుత్వ అఫిడవిట్, అలయ చరిత్ర, మహిళల ప్రవేశం, మహిళల బహిష్టు పట్ల పవిత్ర అపవిత్ర భావనలపై చర్చ, కుల సమస్య, కుటుంబం మొదలు పని ప్రదేశాల వరకు సామాజిక జీవితంలోని అన్ని కోణాలలో మహిళా సమానత్వం, కేరళలో సాంఘిక సంస్కరణ ఉద్యమాల చరిత్ర - ఈ విషయాలన్నింటిని వర్క్షాప్లలో చర్చించారు. ఈ క్రమంలో అనేక సందేహాలు నివృత్తయ్యాయి. క్యాంపెయిన్ మెటీరియల్ తయారయింది. సరైన సమాచారం ద్వారా ఆత్మవిశ్వాసం పెంచుకున్న కార్యకర్తలు సమానత్వ భావనను గ్రామీణ ప్రాంత ప్రజాల్లోకి తీసుకెళ్లడానికి ఉత్సాహంగా సిద్ధమయ్యారు. 24 వేలకు పైగా గ్రామాల్లో ఈ ప్రచారం చురుగ్గా సాగింది.
ఇంటింటి ప్రచారం
మొత్తం కార్యక్రమానికే కీలకమైన ఇంటింటి ప్రచారం గ్రామస్థాయి నుంచీ మొదలైంది. మహిళా బృందాలు గ్రామం, ఏరియా, జిల్లా ఈ విధంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని వార్డులు చుట్టి వచ్చారు. ఐద్వా రాష్ట్ర కమిటీ అంచనాల ప్రకారం మన మహిళా బృందాలు అద్భుతమైన రీతిలో 29.61లక్షల ఇండ్లకు తిరిగారు. ఏ రకంగా చూసినా ఇది గొప్ప రికార్డు. అయితే క్యాంపెయిన్ సందర్భంగా జరిగిన చర్చల తీరు దీనికన్నా ప్రాముఖ్యత కలిగిన విషయం. బహుశా మహిళలు తమ జీవితంలో మొదటిసారిగా రుతుస్రావం, దానిని అపవిత్రంగా చూపుతున్న మనువాద హిందూత్వ ధోరణి, కుల వ్యవస్థ, అసమానత్వం మొదలైన అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. క్రింది స్థాయి వరకు జరిగిన ప్రచారం మహిళల ఆలోచనలో ప్రకంపనలు సృష్టించింది. వారు ఇంట్లో కూడా ఇవే విషయాలు చర్చించటం మొదలుపెట్టారు. అయితే పురుషులు తరచూ వ్యతిరేకంగానే స్పందించేవారని వారు చెప్పారు. కొంతమంది మహిళలు మహిళాకుడ్యంలో పాల్గొంటే అయ్యప్పకు కోపం వస్తుందేమోనని భయాన్ని వ్యక్తం చేస్తే, మరికొందరు ఆలయంలో మహిళలు ప్రవేశించటం వల్ల దేవుడు తమ కుటుంబాలను శపిస్తాడేమోననే సందేహాన్ని వెలిబుచ్చారు. ఇంకా కొంతమంది మన సంప్రదాయాలను కాపాడుకోవటం ముఖ్యమని భావించారు. కానీ ఎక్కువ మంది మహిళలు సంపూర్ణ మద్దతు తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో మున్నెన్నడూ లేనివిధంగా క్రింది స్థాయిలో చర్చలు, చర్చాగోష్ఠులు చోటుచేసుకున్నాయి. మహిళా కార్యకర్తల నాయకత్వంలో సమాజంలోని విభిన్న తరగతులకు చెందిన లక్షలాదిమంది మహిళలను కలిసి చైతన్యవంతుల్ని చేయటం ఒక అపురూప అనుభవం.
అదే సమయంలో వివిధ కొత్త రూపాలలో కార్యక్రమాలు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో జాతాలు నిర్వహించారు. వీటిలో అనేకమంది మహిళలు ఉపన్యసించారు. మహిళల సారధ్యంలో 12వేల స్కూటర్ రాలీలు జరిగాయి. బ్యానర్లూ జెండాలూ పట్టుకుని స్కూటర్లు నడుపుతూ, నినాదాలు చేస్తూ ఉత్సాహం కలిగించారు. మహిళా కుడ్యం అంశంపై రూపొందించిన పాటతో యువతులు నగరాలు పట్టణాలలో ఫ్లాష్ మొబ్ నిర్వహించారు. అంతేకాదు. అన్ని వయసుల మహిళలు బృందాలుగా ఏర్పడి పెయింట్ డబ్బాలు, బ్రష్లు పట్టుకుని గోడలపై నినాదాలు రాస్తుంటే ప్రజలు అబ్బురపడి గుంపులుగా చేరి ప్రోత్సహించారు. డిసెంబర్ 10న ''అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం'' సందర్భంగా ''మహిళా హక్కులే మానవ హక్కులు'' అనే అంశంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించగా సుమారు 9లక్షలమంది స్త్రీలు పాల్గొన్నారు. ఇంకా జనవరి ఒకటి దగ్గరపడుతోందనగా ఉదయాన్నే లేచి ప్రభాతభేరీ నిర్వహించేవారు. దీన్లో భాగంగా రాష్ట్రమంతటా ఐద్వా కమిటీల బ్యాండ్ బృందాలు, సాంస్క తిక కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి.
మాట, కులశక్తుల కౌంటర్ ప్రచారం
భారతదేశ మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలో హిందూ కోడ్ సంస్కరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా బిల్లును సమర్థిస్తూ మాట్లాడిన కమ్యూనిస్టు మహిళా ప్రతినిధులతో సహా అందరు మహిళా సభ్యులపై మతఛాందస వాదులు దాడులకు దిగారు. వీరిలో అహల్య రంగేకర్, కనక ముఖర్జీ, గీతా ముఖర్జీ, రేణు చక్రవర్తి, పార్వతీ కృష్ణన్ మొదలైనవారు ఉన్నారు. వారు హిందూ సంస్కరణ బిల్లుకు మద్దతుగా ఇతర మహిళలను కూడగడుతున్నారన్న కోపంతో హిందూ మహాసభ నాయకుల ప్రోద్బలంతో దుర్భాషలాడారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో నజీరుద్దీన్ అహ్మద్ వంటి ముస్లిం ఛాందస వాదులు హిందూ మహాసభకు మద్దతుగా నిలిచారు.
మళ్లీ ఈరోజు మనం అటువంటి పరిస్థితి చూస్తున్నాం. మహిళా కుడ్యానికి వ్యతిరేకంగా బీజేపీ ఆరెస్సెస్, యూడీఎఫ్ కౌంటర్ ప్రచారం సంప్రదాయ తిరోగమన వాదులు ఆచరణలో ఏకమవుతారనేదానికి నిదర్శనం. బీజేపీ ఆరెస్సెస్ హిందూమతం నాశనమవుతోందని విరుచుకుపడుతుంటే మరోవైపు ముస్లింలీగ్ తామేమీ తక్కువకాదంటూ ముస్లిం మహిళలు మహిళా గోడ కార్యక్రమానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. ''మీ బురఖాలను జాగ్రత్తగా ఇంట్లో దాయండి. లేకపోతే పురుషులతో సహా ఎవరైనా వాటిని లాక్కుపోయి ధరించి మహిళా కుడ్యంలో పాల్గొంటారు. ముస్లిం మహిళలు కూడా ఇందులో పాల్గొన్నారని గొప్పగా చెప్పుకుంటారు'' అని ప్రచారం చేసారు. పైగా మహిళా కుడ్యం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని, అందువల్ల దానికి దూరంగా ఉండాలని కూడా చెప్పారు. అయితే దీన్లో అంతర్గతంగా ఉన్న సారాంశం ''మేము మా మతవిషయాల్లో సుప్రీంకోర్టు జోక్యం సహించం. కనుకనే ఈ ఆచారాలు మహిళలకు వ్యతిరేకమైనా సరే కోర్టులు వీటిలో తలదూర్చకూడదనే ఆరెస్సెస్ వైఖరిని మేము సమర్ధిస్తున్నాం'' అని.
కొన్నిచోట్ల ఎన్ఎస్ఎస్ లీడర్లు ఆర్ఎస్ఎస్ మతతత్వ నినాదాలు ఇవ్వటం ద్వారా ఆ సంస్థతో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ''ముస్లిమ్ మహిళలు బురఖాలు వేసుకుని ప్రచారంలో ఎందుకు పాల్గొంటున్నారు? వారికి సంస్కరణల పట్ల నమ్మకముంటే బురఖాలు తీసేయాలి. ఈ మహిళాకుడ్యం హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్నందు వల్లనే వారు ఇందులో పాల్గొంటున్నారు'' అన్నారు. ఇక సంఫ్ పరివార్ ఐతే ''ఎల్డీఎఫ్ ఏ ముస్లింలనైతే కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోందో వారు తమ పిల్లల్ని సున్తీ పేరుతో హింసకు గురిచేస్తున్నారు. టీచర్ పిల్లాడిని కొడితే శిక్షించే మనం పిల్లల్ని ఈ రకంగా హింసిస్తున్న తలితండ్రులను ఎందుకు శిక్షించకూడదు?'' అని ప్రశ్నించారు.
ఇక మహిళా కుడ్యానికి మద్దతుగా నిలిచిన మహిళలను అసభ్యంగా దూషించటం చాలాచోట్ల జరిగింది. వాల్ను సపోర్ట్ చేస్తున్న మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి నగంగా అశ్లీల పదజాలంతో సోషల్ మీడియాలో, వాట్సప్ గ్రూపులలో ప్రచారంలో పెట్టారు. ఐద్వా నాయకులు పి.కె.శ్రీమతి, సతీదేవి, ఎం.సి.జోసెఫిన్లను ప్రత్యేకంగా టార్గెట్ చేశారు. టీవీ చర్చాగోష్ఠులలో సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతుగా మాట్లాడినవారిని బీజేపీ నేతలు బాహాటంగానే బెదిరించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏర్పడిన శబరిమల కర్మ సమితి పేరుతో సంఫ్ పరివార్ సభ్యులు గుడిలోకి వెళ్లాలని ప్రయత్నించిన మహిళల సంగతి చూసుకుంటామని బాహాటంగానే హెచ్చరించారు
ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ మద్దతు కూడగట్టుకొనే ప్రయత్నంలో వారికి తోకలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ లీడర్లు కూడా మహిళా వ్యతిరేకులుగానే భావించాలి. కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయ తనిఖీ చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా విషప్రచారం చేయటంలో కేరళ కాంగ్రెస్ సంఫ్ పరివార్ అనుబంధ సంస్థ లాగా వ్యవహరిస్తూ నీచ రాజకీయ అవకాశవాదానికి పాల్పడింది. మహిళాకుడ్యానికి కేంద్రంలోని కాంగ్రెస్ ముందు మద్దతు తెలిపినప్పటికి వారి కేరళశాఖ ఒత్తిళ్లు తలొగ్గిన రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. చివరికి శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై తిరిగి నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిందిగా కోరుతూ కాంగ్రెసు కేంద్రప్రభుత్వాన్నీ డిమాండ్ చేసేవరకు పోయింది. కేరళలోని ప్రతీఘాత శక్తుల మధ్య జరిగిన ఈ సయోధ్యలో కాంగ్రెస్ స్వచ్ఛంద భాగస్వామి అయ్యింది.
ఐతేనేం, ఐద్వా ప్రచారం చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ పార్టీలకు చెందిన మహిళలు మహిళాకుడ్యానికి మద్దతు తెలపటమే కాదు తమ నాయకుల వ్యవహారశైలిని వ్యతిరేకించారు. ప్రత్యేకించి దళిత, ఆదివాసీ, ముస్లిం, క్రిస్టియన్ మహిళల స్పందన గుర్తించదగ్గది. మహిళాకుడ్యంలో పాల్గొనాలనుకుంటున్న మహిళలు అక్కడ జరిగే హింసకు గురైతే దానికి వారే బాధ్యులని ఆరెస్సెస్ దాని తైనాతీ సంస్థలు బెదిరించటం కార్యకర్తల దృష్టికి వచ్చింది. ఇవి వట్టి బెదిరింపులు కాదు. కాసరగోడ్ సమీపంలోని చెట్టుకుండులో పెట్రోల్ బాంబు విసరడం వల్ల అనేకమంది మహిళలు గాయపడ్డారు. మహిళాకుడ్యంలో పాల్గొని బస్సులలో తిరిగి వెళుతున్న వారిపై రాళ్లతో దాడి చేశారు. ఒక కార్యకర్త తీవ్ర గాయాలతో ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇన్ని అడ్డంకులు, బెదిరింపుల మధ్య కూడా మహిళాకుడ్యం విజయవంతమవటం నిజంగా అభినందించాల్సిన విషయం.
వర్గపోరాటం - సంఘ సంస్కరణ :
కేరళలో కమ్యూనిస్టులు సంఘ సంస్కరణను వర్గ పోరాటాలతో మిళితం చేసి వాటి పరిధి పెంచటం ద్వారా సంఘ సంస్కరణ ఉద్యమాలకు చారిత్రికంగా ఒక కొత్తరూపూ ప్రచారం కల్పించారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆర్థిక న్యాయం, పేద రైతులు వ్యవసాయ కార్మిక సమస్యలు, భూసంస్కరణలు, కార్మిక హక్కులు మొదలైన అంశాలు సామాజిక న్యాయం ఉద్యమాలతో పడుగు పేకల్లాగా పెనవేసుకు పోయాయి. ఈ ప్రభావం వల్లనే కేరళ సమాజంలో అభ్యుదయ విలువలు, వాటిని కాపాడాలనే చైతన్యం ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం కేంద్రంలోని రాజ్యాధికారం దన్నుతో ఏకమవుతున్న మితవాద శక్తులు విసురుతున్న సవాళ్లు కార్మిక పోరాటాలు సంఘ సంస్కరణ ఉద్యమాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. కార్మిక రైతు పోరాటాలకు బాసటగా ముందుపీఠిన నిలిచేవారిలో కూడా ఈ అంశం (శబరిమల) పట్ల కొన్ని సందేహాలు, ప్రశ్నలు నెలకొని ఉండటం ఐద్వా కమిటీల దృష్టికి వచ్చింది.
యజమానికీ కార్మికులకూ జరిగే వర్గపోరాటంలో విషయాలు సహజంగా చాలా స్పష్టంగా ఉంటాయి. అలాగే సమ్మె వంటి కార్యాచరణ సందర్భంగా లక్ష్యం కూడా సూటిగా ఉంటుంది. ఒకవేళ సమ్మెపై కార్మికులలో వ్యతిరేకత, అనుమానాలు ఉన్నట్టయితే వారిని కూర్చోపెట్టి ఉద్యోగ భద్రత, వేతనాల్లో కోత, యాజమాన్య వైఖరి, పోలీసు చర్యలు మొదలైన భౌతిక అంశాలపై అవగాహన కల్పించగల్గుతారు.
అదే సంఘ సంస్కరణ కోసం జరిగే పోరాటాలలో సంస్కతి, ఆచారం, సంప్రదాయం, మాటవిశ్వాసాలు మొదలైన అంశాలు ఇమిడి ఉంటాయి. అన్ని మాటలు, కులాలు, వర్గాల ప్రజలలో అత్యధికులు ఈ నమ్మకాలు చేత ప్రభావితులై ఉంటారు. సంస్కరణ ఉద్యమాలు ఛాందసవాదం ఆయువుపట్టుపై దాడి చేస్తాయి. అందువల్ల దీనిని ఎదుర్కోవటానికి వారు మతాన్ని అడ్డుపెట్టుకుంటారు. ఒక సమ్మె కార్యక్రమాన్ని, వర్గ దోపిడీని ఐక్యంగా ఎదుర్కొన్నట్టు ఇక్కడ అందరికీ వర్తించే సాధారణ బంధమేదీ ఉండదు. సమానత్వం, సామాజిక ప్రగతి అనే అంశాలు ఆధారంగా సంఘ సంస్కరణ ఉద్యమాల్లో ప్రజలను ఐక్యం చేయాల్సి ఉంటుంది. మత సంప్రదాయాల ముసుగులో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, దురాచారాలను తిప్పికొట్టేం దుకు వీలుగా శాస్త్రీయ అవగాహన వేదికలపై ఈ పని జరగాలి. ముఖ్యంగా కులం, పితృస్వామ్య విలువల్నీ ఎదిరించాలి. వర్గపోరాటంలో పాల్గొనేవారంతా సమాజంలో వేళ్లూనుకున్న కులతత్వ, పితృస్వామ్య భావజాలం నుంచి తమంతట తామే బయట పడతారనుకోవటం పెద్ద అపోహ.
వర్గపోరాటాల ద్వారా కష్టపడి సాధించుకున్న ఫలాలను వెనక్కి నెట్టేయటానికి సామాజిక ప్రతీఘాత శక్తులు ఎల్లప్పుడూ కాచుకుని ఉంటాయని, ఇందుకు మతం పేరుతో సంప్రదాయాలు, మూఢనమ్మకాలను ఆయుధంగా వాడుకుంటారనే హెచ్చరికలు శబరిమల అనుభవాలు మనకు తెలియజేస్తున్నాయి. దోపిడీకి గురయ్యే అన్ని వర్గాలను వారి ఆర్థిక సమస్యలపై పోరాటాల్లోకి దింపే క్రమంలో సామాజిక అభివృద్ధికి తోడ్పడే అన్ని అవకాశాలను, స్థానాలను అందిపుచ్చుకోవటానికి వర్గ పోరాటాలు సిద్ధంగా ఉండాలి.
మహిళాకుడ్యం ప్రచారంలో ఐద్వా కార్యకర్తలు వెళ్లిన ప్రతిచోటా శబరిమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి తీసుకున్న వైఖరిని మహిళలు ఎంతో అభినందించారు. సామాజిక సంస్కరణలు, అలాగే మహిళలల్లో అవమానపరిచే కాలం చెల్లిన సంప్రదాయాలు, కట్టుబాట్లను సవాల్ చేస్తూ ఆయన చేసిన ఉపన్యాసాలు మహిళలను ప్రత్యేకించి యువతులలో ఎంతో స్ఫూర్తి కలిగించాయి. వారు కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాయి. మహిళలపట్ల అసమానత్వం తొలగిపోయేవరకు ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించాలి.
మహిళాకుడ్యం కార్యక్రమం మొదలు నుంచి తుది వరకు మహిళలు ప్రత్యేకించి ఐద్వా నిర్వహించిన పాత్ర అమోఘం. అభినందనీయం. క్యాంపెయిన్ నిర్వహించిన తీరు, చర్చకు పెట్టిన అంశాలు మరోసారి సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు నాంది పలికాయి. ఈ బృహత్కార్యాన్ని సుసాధ్యం చేయటంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ముఖ్యంగా సీపీఐ(ఎం) మహిళా కార్యకర్తలు కీలకంగా వ్యవహరించారు. ఈ మొత్తం చర్చలకు మహిళ ప్రధాన అంశాలు కీలకమైనందున రాబోయే రోజుల్లో కూడా వాటిని తక్కువ చేసి చూడలేం, చూడకూడదు కూడా!!
- బృందాకరత్
- అనువాదం: పద్మశ్రీ,
సెల్: 9490098687