Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 6వ బడ్జెట్ 2019-20 ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్. కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేవరకు మాత్రమే ఇది అమలులో వుంటుంది. పైగా ఇందులో కేవలం ప్రభుత్వ ఖర్చుల గురించిన ప్రతిపా దనలు మాత్రమే ఉంటాయి. ఎన్నికల కోడ్ అమలైతే ప్రకటించిన పథకాలన్నీ ఎక్కడివక్కడే. తాత్కాలిక ఆర్థికమంత్రి పీయుష్ గోయెల్ బడ్జెట్ ప్రవేశపెడుతూ మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో సాధించిన విజయాలు అంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. మోడీ సారథ్యంలో సుస్థిర పాలన సాధించాం. అవినీతి రహిత ప్రభుత్వం. సంస్థాగతమైన ఆర్థిక సంస్కరణలలో ముందుకు సాగుతున్నాం. రికార్డు స్థాయిలో దేశానికి ఎఫ్డీఐలు వచ్చాయి. జీఎస్టీ సహా పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నాం. రూ.3లక్షల కోట్ల మొండి బకాయిలు వసూలు చేశాం. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60వేల కోట్లు ఖర్చు చేశాం. పరారీలో వున్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం... ఇలా సాగింది ఆయన ప్రసంగం. ఇవన్నీ వాస్తవదూరాలేనని ఈ నాలుగేండ్లుగా దేశంలో జరుగుతున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి.
గోయెల్ దృష్టిలో సుస్థిర పాలన అంటే ఏంటి? అవినీతి రహిత ప్రభుత్వం అంటే అర్థం ఏంటి? నోట్లరద్దు, జీఎస్టీ వంటి సంస్కరణ లతో సామాన్యులను హింసించడం, జాతి వివక్ష రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించడం, మత విద్వేషాలు పెంచుతూ హిందూయేతరులను అభద్రతా భావానికి గురిచేయడం, లేక గోవు పేరుతో మానవ హననం వంటివన్నీనా! భారత్ సుస్థిర పాలనపై ఇటీవల అమెరికా నిఘా విభాగం హెచ్చరికను ఒకసారి పరిశీలిద్దాం. 'మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ మళ్లీ లోక్సభ ఎన్నికలకు వెళితే భారత్లో పెద్ద ఎత్తున మత హింస చోటుచేసు కుంటుంద'నేది ఆ నివేదిక సారాంశం. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో మోడీ హయాంలో ముస్లింలు, దళితులు మనుగడ సాగించడమే ప్రశ్నార్థకంగా మారింది. గతేడాదిలోనే 1038 ఎన్కౌంటర్లు జరిగాయి. ఎన్కౌంటర్ బాధితుల్లో దళితులు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారని తేలింది. ఈ ఎన్కౌంటర్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా యూపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
మోడీ హయాంలోనే రాజ్యాంగం ప్రసాదించిన పౌరుల ప్రాథమిక హక్కు భావ స్వేచ్ఛ హరించుకుపోతోంది. ప్రభుత్వ అవినీతి పాలనను ప్రశ్నించినందుకే కల్బుర్గీ, దబోల్కర్, గౌరీలంకేశ్ వంటి సామాజికవేత్తలను హత్యలు చేయించారు. ఇప్పుడో అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టులు చేయిస్తున్నారు. శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించి కేరళలో బీజేపీ చేసిన హింసాకాండ అంతా ఇంతా కాదు. దేశంలో రోజురోజుకూ మహిళలపై లైంగిక హింస పెరుగుతోంది. లైంగిక దాడులు చేసిన వారిలో బీజేపీ మంత్రులే స్వయంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. కథువా ఘటనలో నిందితులకు అండగా నిలబడింది మోడీ అనుయాయులే! ఇదేనా మోడీ హయాంలో మహిళా భద్రత!
సంస్కరణలను వేగవంతం చేయడంలో తామే ముందున్నాం అంటున్నారు. అవును అర్థరాత్రి అప్పటికప్పుడు దేశం తన సొంత జాగీరైనట్టు మోడీ నోట్లరద్దు ప్రకటించారు. దాని ప్రభావంతో ఇప్పటికీ సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీఎస్టీ వంటి సంస్కరణల వల్ల చిన్న వర్తకులు కుదేలయ్యారు. గతేడాదిలోనే కోటీ పది లక్షల ఉద్యోగాలు నోట్లరద్దుకు బలైపోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ స్వతంత్ర సంస్థ అధ్యయనం తెలిపింది. ఎన్నడూ లేనంతగా ఈ నాలుగేండ్లలో దేశంలో తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. ఇటీవల ఆక్స్ఫామ్ నివేదికే ఇందుకు ఉదాహరణ. దేశ జనాభాలో ఒక్క శాతం గా తేలిన అత్యంత ధనవంతుల సంపద 2018 నాటికి 39శాతం పెరిగింది. పది శాతమైన 13.6 కోట్లమంది అత్యంత నిరుపేదలు పద్నాలు గేండ్ల నుంచీ అప్పుల ఊబిలోనే కూరుకుపో తున్నారు.
ఇక లక్షల కోట్లు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పిస్తామని గోయల్ అన్నారు. అసలు విజరుమాల్యా, నీరవ్మోడీ, చోక్సీ వంటి వారందరూ ప్రభుత్వానికి తెలియకుండానే దేశం విడిచిపెట్టి పోయారా? వారిపై తీసుకోవాల్సిన సంస్థాగత చర్యలు తీసుకోలేదు సరికదా ఇటువంటి బడా కార్పొరేట్ల పారుబకాయిలు 10లక్షల కోట్లను రద్దు చేసిన ప్రభుత్వం బీజేపీయే కదా! ఈ సొమ్మంతా ఎవరిది? పేదలది కాదా? ఈ కార్పొరేట్ల మొండి బకాయిల వల్ల బ్యాంకింగ్రంగం కుదేలైపోతోంది. సామాన్యుల సొమ్ముతో కుబేరులు రోజు రోజుకూ వారి సంపద పెంచుకుంటుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇంకా ఈ నాలుగేండ్లలో ఎఫ్డీఐలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రభుత్వరంగాల్ని నిర్వీర్యం చేస్తూ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ఎంతవరకు సబబు? రాఫెల్ డీల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసు కున్నాయో మనందరికీ తెలిసిందే!మధ్యతరగతిని ఆదుకున్నాం, రైతులకు అండగా నిలబడ్డాం అంటూ తన ప్రసంగంలో మోడీని ఆకాశానికెత్తారు గోయెల్. వాస్తవానికి మోడీ అధికారంలో వరుసగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లను పరిశీలిస్తే.. సామాన్యులకు చుక్కలు చూపెడుతూ, కార్పొరేట్లకు కొమ్ముగాసినవే. జన్ధన్ పథకంతో లాభపడింది ఎవరు? ఆ ఖాతాలలో పోగుబడ్డ 20వేల కోట్ల పేదల సొమ్ము కార్పొరేట్ల ఖాతాలకు బదిలీ అయ్యిందని నివేదిక లు కోడై కూస్తున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కాదా!
2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతేడాది బడ్జెట్లో ప్రకటించారు. ఇంతవరకు అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందించలేదు. పైగా మోడీ పాలనలో మొదటి మూడేండ్లలో 36వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలోనే 11,956మంది బలవన్మరణం చెందారు. 2013-14లో 5.6శాతంగా ఉన్న వ్యవసాయ వృద్ధి 2014-15 నాటికి -0.2శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ వృద్ధిరేటు జీడీపీలో 2.5శాతం ఉంది. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే మరో మూడేండ్లలో ఈ వృద్ధి రేటు 14.86శాతం కంటే ఎక్కువగా ఉండాలని ఆర్థిక వేత్తల అంచనా. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు గత బడ్జెట్లో రూ.20వేల కోట్లు కేటాయించామని, ఆ మొత్తాన్ని ప్రస్తుత బడ్జెట్లో గణనీయంగా 75వేల కోట్లు పెంచామని గప్పాలు కొట్టుకుంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చినప్పుడు స్వామినాథన్ కమిషన్ సూచన మేరకు ఉత్పత్తి వ్యయంపై 50శాతం లాభాలను కలిపి అందజేస్తామని హామీ ఇచ్చారు. దాన్ని పక్కనబెట్టి కేవలం బడ్జెట్ మొత్తాలను పెంచితే వారి ఆదాయం రెట్టింపు అవుతుందా? 2014-15లో రూ.8.5 లక్షల కోట్లుగా వున్న వ్యవసాయ రుణమాఫీని 2018-19నాటికి రూ.11లక్షల కోట్లకు విస్తారించామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఇవ్వాల్సిన 8శాతం రుణాలను కూడా బ్యాంకులు ఇంతవరకు చేరుకోలేదు. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలను తెలియజేస్తున్నారు. ఇంతటి వ్యవసాయ సంక్షోభానికి కారణమైన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు ఏడాదికి రూ.6000 లబ్ది చేకూరిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా?
ఒక పక్క విద్య, ఉపాధి లేక ప్రజా జీవనం స్తంభించింది. నిరుద్యోగ భారతాన్ని జాతీయ గణాంక వ్యవస్థ తేటతెల్లం చేసినా మోడీ అనుయాయుల డప్పాలు తగ్గలేదు. ఇది ఓట్ల కోసం బడ్జెట్. మాయమాటలకు ప్రజలే చరమ గీతం పాడాలి.
- ఎం. అభినవాచారి
సెల్: 8332925496