Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పోరాటానికి తొమ్మిదేండ్లు. 2009లో ప్రారంభమై 2018 డిసెంబర్లో ముగిసింది. స్సాంగ్యాంగ్ మోటారు కంపెనీ 2011లో మహీంద్రా గ్రూప్లో అంతర్భాగమైంది. దాని సబ్సిడియరీ కంపెనీ అయ్యింది. సీఐటీయూ మహారాష్ట్ర కమిటీ ముంబై, పూనె, నాసిక్లలోని మహీంద్రా యూనిట్ల కార్మికులను కామ్గార్ సంఘటన సంయుక్త కృతి సమితి (ట్రేడ్ యూనియన్ జేఏసీ)గా ఏర్పాటుచేసి సంఘీభావంగా నిలిపింది. స్సాంగ్యాంగ్ కార్మికుల పోరాటంలో ఈ సంఘీభావమూ తనవంతు పాత్ర పోషించింది.
2009 జూన్లో ఆనాటి చైనా కంపెనీ షాంఘై మోటార్స్ 2400మంది కార్మికులకు ఏకపక్షంగా టెర్మినేషన్ నోటీసులిచ్చింది. ఆ తర్వాత కంపెనీ యాజమాన్యం దక్షిణ కొరియాకు చెందిన స్సాంగ్యాంగ్ మోటార్స్గా మారింది. యాజమాన్యం చర్య దురుద్దేశమైందని కార్మికులు కంపెనీని ఆక్రమించుకున్నారు. కొరియా పోలీసులు ఆహారాన్నీ, నీటి సప్లై కట్చేశారు. కార్మికులు కంపెనీని ఆక్రమించుకున్న 77రోజుల్లో తీవ్ర నిర్భందాన్ని ఎదుర్కొన్నారు. టేజర్గన్స్తో కాల్చారు. (టేజర్గన్లతో కాలిస్తే చెప్పనలవిగాని బాధ ఉంటుంది.) భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. వీటన్నిటిని కార్మికులు ఎదుర్కొన్నారు. కేసీటీయూ నాయకత్వంలో దక్షిణ కొరియా వ్యాపిత సంఘీభావం కూడగట్టారు. జూలై 22, 23, 24 తేదీల్లో దేశవ్యాపిత సంఘీభావ సార్వత్రిక సమ్మె జరిపారు. అంతర్జాతీయ సంఘీభావం వెల్లివిరిసింది. చివరికి ఆగష్టులో పోలీసులు, ఆర్మీ హెలీకాఫ్టర్ల ద్వారా కెమికల్స్ కలిపిన నీటిని చిమ్మి కార్మికుల్ని ఖాళీ చేయించారు. 600మంది గాయపడ్డారు. ఒక కేఎండబ్ల్యూయూ నాయకుని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ కంపెనీ కార్మికనాయకులు సంతకం చేసిన ఒప్పందం ప్రకారం 52శాతం కార్మికులు కంపెనీ వదిలేశారు. 48శాతం కార్మికుల్ని తిరిగి పనిలోకి తీసుకున్నారు. తొలగించబడ్డ 180మందికార్మికులు తమను కూడా విధుల్లోకి తీసుకోవాలని సుదీర్ఘ పోరాటం చేశారు. ఇది పదేండ్లు సాగింది. వత్తిడి భరించలేక మరో 14మందికార్మికులు చనిపోయారు.
2011లో మహీంద్రా స్సాంగ్యాంగ్ కంపెనీని తీసుకున్న తర్వాత మరో విడత సుదీర్ఘ పోరాటాలు జరిగాయి. 70మీటర్ల పొడవు ఉండే పొగగొట్టాన్ని గడ్డకట్టే చలిలో 2014 డిసెంబర్లో సెక్రటరీ జనరల్ కామ్రేడ్ కిమ్ జంగ్ ఊక్, మరో కామ్రేడ్ కల్సి 101 రోజులు దానిపై కూర్చొని నిరసన తెలిపారు. 2015 జనవరిలో దక్షిణ కొరియా సందర్శించిన ఆనంద్ మహీంద్రా కార్మికులందర్నీ పనిలోకి తీసుకుంటానని వాగ్దానం చేశారు.
స్సాంగ్యాంగ్ - ఇండియా యాత్ర(లు)
2015లో మొట్టమొదటసారి స్సాంగ్యాంగ్ కార్మికుల బృందం మహీంద్రాలో ఉన్నతస్థాయి అధికారులను కలవడం కోసం మనదేశానికి వచ్చింది. తొలగించిన కార్మికులందర్నీ పనిలోకి తీసుకునేందుకు ఒక కాలపరిమితి నిర్ణయం చేసుకోవాలని వారి కోరిక. అప్పుడే పైన చెప్పినట్టు సీఐటీయూ ముంబై కమిటీ 'కామ్గార్ సంఘటన సంయుక్త కృతి సమితి' ఏర్పడింది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలను కూడా అంతర్భాగం చేసింది సీఐటీయూ 2015 డిసెంబర్లో స్సాంగ్యాంగ్ మేనేజింగ్ కమిటి, కేఎండబ్ల్యూయూ లతో యాజమాన్యం మీటింగ్ కొరియాలో జరిగింది. దాన్లో తొలగించిన 179మందిని దశలవారీగా పనిలోకి తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. కార్మికులపై పెట్టిన కేసులన్నింటిని ఉపసంహరించుకుంది యాజమాన్యం. తొలగించిన కార్మికుల కుటుంబాల కోసం 15లక్షల డాలర్ల ఫండ్ ఏర్పాటుచేసింది. 2017 ఏప్రిల్లో 19మందిని పనిలోకి తీసుకుంది. ఈ ప్రాసెస్ చాలా నిదానంగా సాగుతుండటంతో రెండవసారి స్సాంగ్ యాంగ్ ప్రతినిధి బృందం 2017 డిసెంబర్లో ముంబై వచ్చింది. 2018 జనవరి 6న ముంబై, నాసిక్, పూనాల్లోని కార్మికులతో సదస్సు నాసిక్లో జరిగింది. స్సాంగ్ యాంగ్ కార్మికుల పునర్నియామకాలు వెంటనే పూర్తిచేయాలని మహీంద్రా యాజమాన్యానికి అప్పీలు చేశారు.
తాజా పరిణామాలు
తివోలి బ్రాండ్ ఎస్.యూ.వి. అంతర్జాతీయ మార్కెట్లో బాగా పేరు సంపాదించడంతో స్సాంగ్ యాంగ్ కంపెనీ లాభాల్లోకొచ్చింది. మరో ప్రాధాన్యతున్న అంశం కొరియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్జే తెచ్చిన కొత్త చట్ట ప్రకారం పనిగంటలు, ఓవర్టైమ్ల నిడివి కుదించబడింది.
2018 ఫిబ్రవరి 28 నుండి ఏప్రిల్ 1వరకు కేఎండబ్ల్యూయూ నాయకుడు కిమ్ డ్యూక్ జంగ్ నిరవధిక దీక్ష జరిపారు. ఏప్రిల్ 2న మరికొందరు తొలగించిన కార్మికుల్ని పనిలోకి తీసుకున్నది యాజమాన్యం. రెండు షిప్టులు ప్రారంభమైనాయి. జూన్ 2018లో మరో తొలగించిన కార్మికుడు కిమ్-జు-జంగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని సియోల్లో జులై నుంచి నిరవధిక ధర్నా ప్రారంభమైంది. ఆ నెల్లోనే కొరియా అధ్యక్షుడు మూన్ జే భారతదేశం సందర్శించారు. ఆ సమయంలో తపన్సేన్ ఆయనకి ఉత్తరం రాసి కొరియా రాయబారికి అందించారు.
కొరియా వెళ్ళిన మరుక్షణం 9ఏండ్ల వివాదంలో ఆ దేశాధ్యక్షుడు జోక్యం చేసుకున్నారు. యూనియన్లు, యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయి. 2018 సెప్టెంబర్ 20న చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. తొలగించిన కార్మికుల్లో మిగిలిన వారిని 60శాతం మందిని 2018 డిసెంబర్ లోపు, మిగిలిన 40శాతాన్ని 2019 జూన్లోపు పనిలోకి తీసుకుంటామన్నారు. సీఐటీయూ ప్రతినిధి మహారాష్ట్ర కార్యదర్శి వివేక్ మాంటిరో 2018 డిసెంబర్లో కొరియాలో పర్యటించారు. వారి పోరాటంలో వారి వెన్నంటి నిలిచిన సీఐటీయూను ఆ కార్మికులు గుండెలకు హత్తుకున్నారు. స్సాంగ్ యాంగ్ కార్మికుల పోరాట పటిమ, సీఐటీయూ సంఘీభావ కార్యక్రమం, సీఐటీయూకున్న అంతర్జాతీయ తత్వం స్సాంగ్ యాంగ్ కార్మికులకు విజయం చేకూర్చాయి.
- ఆర్ సుధాభాస్కర్.