Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ను ఒకప్పుడు అందరూ సీరియస్గా తీసుకునేవారు. అది ప్రభుత్వ వర్గ పక్షపాతాన్ని చూపించేదనటంలో సందేహం లేదు. అయితే ఈ వర్గ పక్షపాతం వివిధ బడ్జెటరీ ప్రతిపాదనలలో ఎలా ప్రతిబింబించిందనే విషయాన్ని పరిశీలించిగానీ చెప్పటం కుదిరేది కాదనే వాస్తవానికి ప్రాధాన్యత ఉంది. గతంలో కూడా పటాటోపాలుండేవి. అయితే అవి అంచులకే పరిమితం అయ్యేవి. బడ్జెట్లోని ప్రధానాంశాలన్నీ దగ్గరగా పరిశీలించవలసిన విషయాలుగా ఉండేవి. మోడీ ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి ఏమాత్రం లేకుండా పోయింది. అత్యంత ప్రాధాన్యతగల బడ్జెట్ ప్రతిపాదనలకు కూడా విలువ లేకుండా పోయింది.
2019-20 సంవత్సర బడ్జెట్లో ఐదు ఎకరాలు, అంతకంటే తక్కువ భూమిగల కుటుంబానికి రూ.6000 ఇవ్వాలనే అత్యంత ప్రాధాన్యతగల ప్రతిపాదన పరిశీలిద్దాం. ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న పీయూష్ గోయల్ బడ్జెట్లో ప్రకటించిన తరువాత ఈ ప్రతిపాదనకయ్యే వ్యయంలో రాష్ట్రాలు 40శాతం(కేంద్రం భరించే 60శాతానికి తోడుగా) భరించాలని కేంద్రం కోరనున్నదని అసలు ఆర్థిక మంత్రిగావున్న అరుణ్ జైట్లీ చెప్పారు. వాస్తవంలో ఈ పథకానికి నిధుల కేటాయింపు చేసి వున్నట్టయితే జైట్లీ అలా ప్రకటించి ఉండేవారు కాదు. అంటే ఈ పథకానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు వాస్తవంలో లేవు. అంటే బడ్జెట్లో చూపిన అంకెలు మోసపూరితమైనవన్నమాట.
2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్ అంచనాలకు కూడా ఈ లెక్కల బూటకం వర్తిస్తుంది. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్లో సీజీఎస్టీ 5.04లక్షల కోట్లు(ఇది అసలు బడ్జెట్లో చూపిన దానికి 1లక్ష కోట్లు తక్కువ) వస్తుందని అంచనా వేయగా వాస్తవంలో ఈ పన్ను ఈ మాత్రం కూడా వసూలు కాదని స్వతంత్ర పరిశోధకులు తేల్చారు. ఏప్రిల్-జనవరి మధ్యకాలంలో ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయం సగటున నెలకు 37,635కోట్లు. వార్షికంగా చూసినప్పుడు ఈ మొత్తం 3.77లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అంటే సంవత్సర కాలంలో వచ్చే ఆదాయం మొత్తం 4.52లక్షల కోట్లకు మించదు. ఇది సవరించిన అంచనా కంటే కూడా 52,000కోట్లు తక్కువ. ఇదేవిధంగా కార్పొరేట్ పన్ను, ప్రభుత్వరంగ వాటాలను అమ్మగా వచ్చిన మొత్తాలు కూడా అంతిమంగా 2018-19 సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలకంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.
నయా ఉదారవాద శకంలో ద్రవ్య పెట్టుబడికున్న ప్రాధాన్యత దృష్ట్యా విత్తలోటు నిర్దేశింపబడిన పరిమితిలోనే ఉందని(లేకపోతే ద్రవ్య పెట్టుబడి బెదిరిపోయి దేశాన్ని వీడుతుంది) చెప్పటానికి ప్రభుత్వం అనేక కపటోపాయాలను ఉపయోగిస్తుంది. తాను చేస్తున్న అప్పులను(లేకపోతే అవి విత్తలోటు పెంచుతాయి) ప్రభుత్వరంగ సంస్థలపైన రుద్దటం, రిజర్వ్బ్యాంకు, ఇతర జాతీయ బ్యాంకుల నగదు నిల్వలను డివిడెండ్ ఆదాయం పేరుతో వాడటం వంటి చర్యలు ఈ కపటోపాయాలకు ఉదాహరణలు. నిజానికి విత్తలోటును దానికి అదిగా చూసినప్పుడు అది ప్రపంచీకరింపబడిన ఫైనాన్స్, నయా ఉదారవాద ఆర్థికవేత్తలు చెబుతున్నంత ప్రమాదకరమైన దేమీ కాదు. అయితే ఇక్కడ రెండు విషయాలను గమనంలో ఉంచుకోవాలి. మొదటిది, పన్ను ద్వారా వస్తున్న ఆదాయం భారీగా క్షీణించటం ఆందోళనకరం. అది భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. రెండవది, బడ్జెట్ లెక్కల పైగల నమ్మకాన్ని అది వమ్ముచేస్తుంది.
2019-20 సంవత్సర బడ్జెట్లో పన్నులపై వస్తుందని చూపిన అంచనాలకు కూడా ఇదే అతిశయోక్తి వర్తిస్తుంది. 2018-19 సంవత్సరానికి చెందిన సవరించిన అంచనాల ప్రకారం చూపిన 6.71లక్షల కోట్ల ఆదాయం వాస్తవరూపం ధరించే అవకాశంలేదు. దీనినే తిరిగి 2019-20 సంవత్సర బడ్జెట్ అంచనాలో పెద్ద ఎత్తున 7.6లక్షల కోట్లుగా చూపారు. ఇంతకుముందు చూపినవిధంగా సీజీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 2018-19 సంవత్సరానికి 4.52లక్షల కోట్లకు మాత్రమే చేరే అవకాశం ఉంది. దీనినే 2019-20 సంవత్సర బడ్జెట్ అంచనాలో 6.10లక్షల కోట్లకు పెరుగుతుందని చూపారు. ఆదాయంవైపు చూపుతున్న అంచనాలలో వున్న బూటకమే సహజంగా వ్యయంవైపు కూడా ఉంది. అంతేకాకుండా 2019-20 సంవత్సర బడ్జెట్లో పేదల సమస్యలపట్ల ఏమాత్రం ఆసక్తి చూపకపోవటం నిజంగా సిగ్గుమాలిన విషయం. జాతీయ ఉపాధిహామీ పథకానికి చేసిన కేటాయింపులు 2018-19 సంవత్సరంలో కంటే వర్తమాన బడ్జెట్లో 1000కోట్లు తక్కువ. 2018-19 సంవత్సర బడ్జెట్లో చేసిన కేటాయింపులు మూడవ త్రైమాసికం ముగిసేలోపే అడుగంటాయి. అదికూడా జాతీయ ఉపాధి హామీ చట్టం కింద పనికోసం చేసే డిమాండ్ను రిజిష్టర్ చేయకుండా ఉండటం అలవాటుగా మారిన పరిస్థితులలో ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో చేసిన దానికంటే తక్కువ నిధులను కేటాయించటం ఈ పథకంపట్ల దానికున్న చిన్నచూపును తెలుపుతుంది. అలా ఈ పథకంతో లాభపడుతున్న కోట్లాది పేదల సంక్షేమాన్ని గాలికొదిలింది. అదేవిధంగా ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ఉద్దేశించిన పథకాలకు చేసే కేటాయింపులలో కూడా నిరపేక్ష కోతలను విధించింది.
అంతేకాకుండా వ్యవసాయ కుటుంబాలకు చేయదలచిన నగదు బదిలీ పథకం కూడా మొదటి నుంచీ అత్యంత పేలవంగా ఉంది. ఈ పథకం కేవలం భూమిని కలిగివున్నవారికే వర్తిస్తుంది. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఈ పథకంలో చోటులేదు. భూమి యజమానులకే తప్ప కౌలు రైతులకు కూడా ఈ పథకంలో చోటులేదు. ఈ విధంగా వ్యవసాయ రంగంలో పేదలైన వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు నగదు బదిలీ పథకంలో ఏమాత్రం స్థానంలేకుండా పోయింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి ప్రభుత్వ పథకాలకు చేసే కేటాయింపులలో కూడా పేదలపట్ల ఈ కాఠిన్యం కనపడుతుంది.
ఈ కోతలన్నీ బడ్జెట్లో ప్రతిబింబించాయి. అయితే ఇక్కడ గమనించవలసింది వేరే ఉంది. ఒకవేళ బడ్జెట్లో రానున్న ఆదాయాన్ని అతిగా చూపితే బడ్జెట్లో వాస్తవంగా చేసిన కేటాయింపులలో కూడా కోత పడటం అనివార్యమవుతుంది. ప్రభుత్వరంగ సంస్థల గురించి ప్రభుత్వం ఎన్ని సాకులు చూపినా పరిస్థితి ఇలానే ఉంటుంది.
ఈ సందర్భంగానే 2019-20 సంవత్సర బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు 40శాతం భరించాలని జైట్లీ చేసిన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2019-20లో కొనసాగించదని దీనినిబట్టి మనకు అర్థమౌతోంది. ఎన్నికల ముందు ప్రచారానికి ఉపయోగపడటానికి దీనిని రూపొందించినట్టుగాఉంది. అయితే ఒకవేళ ఎన్నికల తరువాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకివస్తే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించటంలేదనే నిందమోపి ఈ పథకాన్ని ఎత్తేయగలదు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం అయినందున కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ పథకానికి నిధుల్ని సమకూర్చటానికి సిద్ధంగా లేకపోవటాన్ని సమర్థించుకోవటానికి ఈ వాస్తవాన్ని ఉపయోగించు కుంటుంది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో నగదు బదిలీ కోసం 20000కోట్లు ఖర్చు పెట్టాలి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోల్చినప్పుడు పన్నుల ద్వారా సమకూరే ఆదాయం తగ్గినప్పటికీ ఎలాగో ఇందుకు కావలసిన అదనపు వ్యయాన్ని భరించే అవకాశం ఉంది. దీనితో లాభపడే అవకాశం ఎవరికి ఉంది? అనేది ఇక్కడ ప్రశ్న. దేశంలో భూమి యాజమాన్యాలకు సంబంధించిన రికార్డుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరు ఏ భూమికి యజమాని అనేది తేలటం దాదాపు అసాధ్యం. కాబట్టి లబ్దిదారులను ఎంపిక చేయటం చాలా నిరపేక్షంగా ఉండబోతోంది. భూమి ఉన్నప్పటికీ పేద రైతులు మినహాయింపబడే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసే సామర్థ్యమున్న పలుకుబడి గల రైతులకు(లేక బీజేపి మద్దతుదారులకు) ఈ నగదు బదిలీ పథకం డబ్బు చేరుతుంది.
దీనితోపాటుగా ఆదాయ పన్నులో వార్షికంగా 5లక్షలవరకు మినహాయించటాన్ని చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి మద్దతు కోసం ప్రయత్నిస్తూ పేదలను పూర్తిగా విస్మరిస్తున్నది. దీనికి సమాధానంగా బడ్జెట్లో అసంఘటిత కార్మికుల కోసం పించను పథకాన్ని ప్రవేశపెట్టటం జరిగిందని ఎవరైనా చెప్పవచ్చు. అయితే ఈ పథకం ఇప్పటికేవున్న వృద్ధులకు ఉపపయోగపడదు. ఈ పింఛను ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న కనీస వేతనంలో సగం కూడా ఉండదు. అంతేకాకుండా వాస్తవంలో కాంట్రిబ్యూటరీ అంటే కార్మికుడు తన వంతును చెల్లించటంపై ఆధారపడే స్వభావం దీనికుంది. 29ఏండ్లు నిండిన వ్యక్తి తనకు 60ఏండ్లు వచ్చేదాకా నెలకు రూ.100 జమ చేస్తే ఆ తరువాత అతనికి నెలకు రూ.3000 పింఛను వస్తుంది. అయితే ఇలా తన 60వ ఏటవరకూ ఒక మగ కార్మికుడు కట్టే మొత్తాన్ని 8శాతం కాంపౌండ్ వడ్డీతో లెక్కగట్టినప్పుడు రూ.1,50,000 అవుతుంది. పురుషుల జీవిత పరిమాణం 65ఏండ్లుగా ఉన్నప్పుడు 60ఏండ్ల తరువాత అతను అందుకోబోయే పింఛను అతని చేసిన పొదుపు నుంచే వస్తుంది. కాబట్టి ఈ కాంట్రిబ్యూటరీ పథకంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. అంటే అసంఘటిత కార్మికులను తమ వృద్ధాప్య అవసరాల కోసం పొదుపు చేయాలని అడగటంగా ఈ పథకం ఉంది.
ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు రకరకాల 'ప్రలోభాల'ను ముందుకు తెస్తాయి. అయితే నూతన ఆర్థిక సంవత్సరం ఆరంభమైన రెండు నెలలలోనే ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుండగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టటం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాకుండా ఈ బడ్జెట్లో పేర్కొన్న అంచనాలకు సంబంధించిన అంకెలు వాస్తవాలను ప్రతిబిం బించటం లేదు. జనాభాలోని మధ్యతరగతికి ప్రకటించిన కొన్ని రాయితీలను మినహాయిస్తే వీటి వెనుకగల ప్రధా నోద్దేశం ఎన్నికలముందు అతిశయోక్తులను సృష్టించటమే. మొత్తంగా చూసినప్పుడు ఇవేమీ ప్రజలకు ఉపయోగపడవు.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్: 8886396999