Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ.. హరీంద్ర గర్జన ఆగిపోయింది.
ఓ..పర్జన్య శంఖం మూగపోయింది.నీవు చల్లిన విత్తనాలు - నీవు చెప్పిన పాఠాలు
మీరందించిన నిర్మాణ అనుభవాలు -పోరుమంటలై పొర్లుతూనే ఉన్నారు...
పోరుపేట రత్నమా! కామ్రేడ్ బుచ్చిరాములు... జనం జెండావు నీవు....
అది సూర్యపేట, అదెప్పుడూ పోరుపేట. పోరాట జల మట్టిరేణువుల్లో నిప్పుల అల. చెట్టుకు, పుట్టకు ఇక్కడ చరిత్ర ఎందరెందరో ఎర్ర సూర్యుళ్లు ఉదయించిన ఊరు. గోల్కొండ కింద గోరీలు కట్టే తెగింపు. 1964లో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికల్లో 60పైగా గ్రామ పంచాయతీలను గెలిచి రెండు సమితి ప్రెసిడెంట్ స్థానాలను కైవసం చేసుకున్నది. సూర్యపేట, తుంగతుర్తి అసెంబ్లీ స్థానాలు సీపీఐ(ఎం) గెలుచుకున్న గడ్డ సూర్యపేట.
అటువంటి సూర్యపేటకు కూతవేటులో తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెంలోని నిరుపేద గీతకార్మిక కుటుంబంలో మైసయ్య, దుర్గమ్మ దంపతులకు పుట్టిన వర్థెల్లి బుచ్చిరాములు. చదువు 7వ తరగతి మాత్రమే. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో బాలల సంఘం సభ్యులుగా చేరారు. అప్పటికే భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి, మల్లుస్వరాజ్యం, భీమిరెడ్డి కుశలవరెడ్డి, భీమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకులుగా ఎదిగిన గ్రామం. అది పోరాటాల కాలం. నాయకుల అడుగులో పోరుబాట పట్టారు. ఒకవైపు వ్యవసాయం, మరోవైపు తాళ్లు ఎక్కి కల్లు అమ్ముతూ... కరివిరాల కొత్తెగూడెం గ్రామకార్యదర్శిగా ఎన్నికై ఉద్యమాలు పోరాటాలు చేస్తునే మార్క్సిస్టు సాహిత్యం చదవడం ఆరంభించారు.
సీపీఐ(ఎం) ఏర్పడిన తర్వాత కూడా సూర్యపేట ఏరియాలో 35గ్రామ పంచాయతీలు, నాగారం, సమితి ఏరియాలో 32గ్రామ పంచాయతీలను గెలిపించుకున్నారు. 1964 డిసెంబర్లో సూర్యపేట పార్టీ ఆఫీస్ కార్యిదర్శిగా వచ్చాడు. పార్టీ ఇచ్చే అలవెన్సు రూ.60తో అనేక ఇబ్బందులు పడుతూ కూడా పార్టీ అప్పగించిన పనులలోనే ఉండేవాడు. భార్య కుట్టుమిషన్ ద్వారా పిల్లలను చదివిస్తూ కూడా పార్టీ పట్ల, ఎర్రజెండాపట్ల అచంచల విశ్వాసంతో ఉండేవాడు. దాదాపు 9 ఏండ్లు తాలుకా, జిల్లా ఆఫీసు కార్యదర్శిగా 21ఏండ్లుగా సీపీఐ(ఎం) తాలుకా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. నిరంతరం సూర్యపేట, తుంగతుర్తి ప్రాంతంలో ఘర్షణలు ఉద్రిక్తతలు, హత్యలు, జైళ్లు, ఎప్పుడూ ఏదో ఒక వార్త అర్థరాత్రి, అపరాత్రి అనకుండా కార్యకర్తలను గ్రామాలను కంటికి రెప్పలా కాపాడుకునేది. అయినా అక్కడి భూస్వాములు నాన్బెయిలబుల్ కేసులో ఇరికించేవారు. అయినా ప్రతిఘటన పద్ధతిని విడనాడలేదు. కార్యకర్తలను నిబ్బరంగా నిలబెట్టడానికి కర్రసాము శిక్షణ ఇప్పించి మిలిటెంట్ గ్రామాలుగా తీర్చిదిద్దేది. ఈ ప్రతిఘటన పోరాటానికి పార్టీ అప్పుడున్న పరిస్థితుల్లో అది నాయకత్వం ఆమోదం, ప్రోత్సాహం ఉండేది. మిలిటెంట్ క్యాడర్ ఉండటం మూలంగా దౌర్జన్యకారులను వెనక్కుకొట్టి ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనడానికి, కమ్యూనిస్టు శ్రేణులు స్వేచ్ఛగా సంచరించటానికి అవకాశం ఉండేది. ప్రతీ గ్రామంలో అతి పెద్ద బహిరంగసభలు చుట్టుముట్టు గ్రామాలు, సాంస్కృతిక దళాలు నాయకుల ఉపన్యాసాలతో భూస్వాములను హడలెత్తించేది. బుచ్చిరాములు మంచి వక్త. సరళమైన భాషలో అర్థవంతంగా ఉపన్యసించేవారు. తుంగుతుర్తి, సూర్యపేట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కల్లుగీత కార్మికులున్నారు. ఆ సంఘం నాయకులుగా తోట్ల మల్సూర్, బుచ్చిరాములు, బిక్షం కృషితో మెజార్టీ గీత కార్మికులు ఎర్రజెండా వెనుక ఉండేవారు. పెద్దఎత్తున కల్లుగీత ఉద్యమాలు జరిగాయి.
1968లో సీపీఐ(ఎం) నుంచి ఎంఎల్ పార్టీ చీలికల వల్ల చిలుపకుంట్ల ముకుందాపురం, పెన్పహాడ్ గ్రామాల్లో నిత్యం ఘర్షణలు ఉండేవి. అయినా పార్టీని కాపాడుకున్నారు. భూస్వామ్య విష సంస్కృతికి వారసులైన ఏబీవీపీ, ఎస్ఎస్యూ దురాగతాల్ని, దౌర్జన్యాలను, గుండాయిజాన్ని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని సమీకరించి తిప్పికొట్టేలా అండగా నిలిచారు. నిత్య నిర్బంధంలో పోలీసులు తీవ్రంగా వేధిస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటూ మెలకువలు జాగ్రత్తలు బోధించేవారు. వ్యవసాయ కార్మికసంఘం పెట్టి భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించి కూలీ రేట్లు, జీతగాళ్ల జీతాలు పెంచే పోరాటాలు నడిపారు. ఆ సంఘంలో రాష్ట్ర నాయకుడుగా ఉన్నారు. 1975లో ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సూర్యపేటలోనే జరిగింది. సాంస్కృతికోద్యమ నిర్మాణ బాధ్యతలు బుచ్చి రాములు చూసేవారు. సమకాలీన అంశాలపై వర్థెల్లి మురళితో ''రాబందులు'' డా|| విఠల్తో ఉక్కు మనిషి అబ్చగాని బిక్షం తోట్ల మల్సుర్తో వీధి భాగవతం, పల్లె సుద్దులు పల్లెల్లో ప్రదర్శించేవారు. అక్షర కళాయాత్ర, చదువు వెలుగు కార్యక్రమాల్లో కోఆర్డినేటర్గా సూర్యపేట కళాకారులే ప్రధాన పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధపోరాటంపై వీధినాటిక, బండి యాదగిరిపై షార్ట్ఫిలిమ్, హాల్లాబోల్ అప్పా అమ్మకమా నాటికలు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ప్రజాసంఘాల సభ్యత్వం, నిధుల సేకరణ, అన్నీ మండలాల్లో కళాబృందాలు పార్టీ సభ్యత్వ క్యాంపెయిన్ ఒక ఉద్యమంగా జరిగేది. జిల్లాలోనే ప్రజా సంఘాల సభ్యత్వం, నిధి వసూళ్ళల్లో సూర్యపేట ప్రథమస్థానంగా ఉండేది.
బుచ్చిరాములు భార్య అనారోగ్యంగా ఉండేవారు. ఆమె పనులు, తన పనులు, భోజన సదుపాయాలు సైతం తానే అన్నీ చూసుకుంటూ ఆ బాధనుగాని, కార్యాచరణకు అడ్డంకిగా గానీ ఏనాడు లేడు. కచ్చితంగా ఉదయం 9గంటలకు ఆఫీసుకు వచ్చి అన్ని పేపర్లు చూసుకొని, అన్ని ప్రజా సంఘాలకు బాధ్యతలు అప్పగించి తాను ఒక గ్రామానికి వెళ్లేవారు. నిరాడంబరుడు, సాహిత్యం చదవడంలోనే కాదు, ఎత్తుగడలలోను నిష్ణాతుడే. బుచ్చిరాములు ఏ పనీ ఆషామాషీగా చేసేవాడు కాదు. అన్ని వివరాలు సేకరించి ఫైల్ తయారు చేసేవాడు. సూర్యపేట పార్టీకార్యాలయ అవసరాన్ని గుర్తించి అప్పటికప్పుడు రూ.37వేలకు కొనుగోలు చేశారు. చక్కటి భాష, మంచి ఉచ్ఛారణ, వాగ్ధాటితో తోటి వాళ్ళను ఆకట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో మంచి నేర్పు ఉన్నవాడు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1994లో తుంగతుర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేసి కేవలం వేెయి ఓట్ల తేడాతో ఓడిపోయారు. పార్టీ క్రమశిక్షణ చర్యకు గురయినా... స్వయంగా బుచ్చిరాములుగారే తన పుస్తకంలో.. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తాను మాత్రం బూర్జువా పార్టీలోకి వెళ్లడం సరైంది కాదని భావిస్తూ తిరిగి మాతృసంస్థలోకి వచ్చి తనకు నాయకత్వ బాధ్యతలున్నా లేకున్నా కార్యకర్తలకు ప్రజలకు కమ్యూనిజంపై విశ్వాసం ప్రోది చేస్తూనే ఉండేది. అనునిత్యం సమాజం గురించి సత్యం గురించి అన్వేషిస్తూ, స్వార్థం గురించిన చింత లేదు. ''కమ్యూనిజానిదే విజయం అది తిరుగులేని సత్యం'' అని ప్రకటించిన బుచ్చిరాములూ..! నువ్వు జనం ఎదపై ఎర్రజెండావైనావు.
- భూపతి వెంకటేశ్వర్లు
వర్థెల్లీ... జనంలో వర్థిల్లు...
సెల్: 9490098343