Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏదైనా ఒక సమాజం పురోగమన దిశలో ఉందా, తిరోగమన దిశలో ఉందా, స్తబ్దతలో ఉందా నిర్ధారించడానికి సామాజిక శాస్త్రాలు, రాజకీయార్థ శాస్త్రం కొన్ని ప్రమాణాలను, ప్రాతిపదికలను, గణాంక సూచికలను తయారు చేశాయి. ఆ సమాజ నాయకులు ఎన్ని ప్రగల్భాలు పలికినా, అతిశయోక్తులు ప్రకటించినా వాటిని దాటి, ఈ ప్రమాణాలు, ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఆ సమాజ స్థితిని నిర్ధారిస్తాయి. పరిశీలిస్తున్న సమాజంలో విద్యారంగం ఎలా ఉన్నదనేది అటువంటి ప్రమాణాలలో ఒకటి. తాము తమ సమాజాన్ని భూతల స్వర్గంగా, స్వర్ణసీమగా, అరచేతిలో వైకుంఠంగా మార్చేశామని నాయకులు, నిర్వాహకులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ, ఆ సమాజంలో విద్యారంగం ఎలా ఉన్నదనే సూచికలు ఆ గొప్పల నిజాల నిగ్గు తేలుస్తాయి. మరీ ముఖ్యంగా, మొత్తం విద్యారంగం కూడ చూడనక్కరలేదు, కనీస ప్రాథమిక విద్యారంగం స్థితి ఏమిటనేది ఆ సమాజపు ప్రాధాన్యతలేమిటో, ఆ సమాజ నిర్వాహకుల పనితీరు ఏమిటో వాస్తవాలు తెలియజేస్తుంది.
దేశంలో ప్రాథమిక విద్యారంగ స్థితి గురించి స్వయంగా ప్రభుత్వాధినేతలు వెల్లడించే సమాచారంలో, గణాంకాలలో, విశ్లేషణల్లో ఎన్నో అవకతవకలు, అసమగ్రతలు, అబద్ధాలు, అతిశయోక్తులు, పొంతనలేనితనం ఉంటుండడం వల్ల వాటిని యథాతథంగా విశ్వసించలేని స్థితి ఏర్పడింది. కాని, దేశంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో 1995లో ఏర్పాటయిన ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ, 2005 నుంచి ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఎఎస్ఇఆర్ - అసర్) పేరిట ఒక ప్రామాణిక వార్షిక సర్వే ప్రచురిస్తున్నది. ఇది నమూనా సర్వేనే అయినప్పటికీ, పకడ్బందీగా, సూక్ష్మస్థాయిలో వివరంగా, నిశితంగా తయారవుతుంది గనుకనే గత ఇరవై ఏండ్లుగా వెలువడుతున్న ఈ నివేదిక ప్రభుత్వ నివేదికల కన్న ఎక్కువ ప్రామాణికమైన, వాస్తవికమైన నివేదికగా ప్రసిద్ధికెక్కింది. వారు పొగిడారు, వీరు పొగిడారు, వారు అవార్డ్ ఇచ్చారు, వీరు అవార్డ్ ఇచ్చారు అని ప్రతిరోజూ విడుదలవుతున్న ప్రభుత్వ ప్రకటనల అల్లాటప్పా అనామక సంస్థల వంటిదో, ఏదో ప్రయోజనం కోసం ప్రశంసా పత్రాలు ఇచ్చేదో కాదీ సంస్థ. దాని నివేదిక కఠోరమైన పరిశోధనా సంవిధానంతో తయారయినది. గతేడాదికి సంబంధించి గ్రామీణ పాఠశాలల స్థితిని విశ్లేషిస్తూ మూడు వారాల కింద వెలువడిన నివేదిక అసర్ 2018 తెలంగాణలో ప్రాథమిక విద్యారంగపు ప్రమాణాల గురించి సంతోషపడవలసిన సంగతులైతే చెప్పడం లేదు.
పాఠశాలలో చేరుతున్న బాలల సంఖ్య, పాఠశాల విద్యార్థుల కనీస పఠన, అంకగణిత నైపుణ్యాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్డి వసతి, బాలికల మరుగుదొడ్డి వసతి, గ్రంథాలయం, విద్యుత్తు, కంప్యూటర్, వ్యాయామ విద్యా, క్రీడా సౌకర్యాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడామైదానం, పాఠశాల నిర్వహణా కమిటీ వంటి పదిహేడు పరిశీనాంశాల ప్రాతిపదిక మీద ఈ సర్వే జరుగుతుంది. ఈ పరిశీలనాంశాల్లో తెలంగాణ ప్రాథమిక విద్యారంగం మెరుగైనస్థితిలో లేదని, ఈ ప్రభుత్వపు తొలి విడత పాలనలో ఆ అంశాల్లో ఎక్కువ తిరోగమన దిశను చూపెడుతున్నాయని అసర్ నివేదిక చెపుతున్నది. పాఠశాల వయసు వచ్చిన బాలబాలికలందరూ పాఠశాలల్లో చేరుతున్నారా లేదా, ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న గణాంకాలు సరైనవేనా అనే చర్చ అలా ఉండగా, అసర్ 2018నివేదిక బాలబాలికలు వయసుకు తగిన తరగతిలో ఉండడం లేదనే కొత్త అంశాన్ని వెలికి తీసింది. తెలంగాణలో ఆరేండ్ల వయసు గల బాలలు ప్రాథమిక పాఠశాలలో ఉండవలసి ఉండగా, ఆ వయసుగల బాలల్లో 40శాతం మంది ఇంకా ప్రాథమిక పూర్వ దశలో ఉన్నారని ఈ నివేదిక చెపుతున్నది. ఇందులో ఎక్కువమంది ప్రయివేట్ పాఠశాలల్లో ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నవారి సంఖ్య కనీస స్థాయిలో కూడ లేదనేది మరొక ఆందోళనకరమైన అంశం.
అలాగే తెలంగాణలో ఆరో తరగతి విద్యార్థులు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా చదవలేని స్థితిలో ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో 2014లో పాఠశాల విద్యార్థుల్లో 5.6శాతం మందికి కంప్యూటర్ అందుబాటులో ఉండగా, 2018నాటికి కంప్యూటర్ వాడుతున్న విద్యార్థుల సంఖ్య 3.1శాతానికి పడిపోయిందని నివేదిక చెపుతున్నది. ప్రథమ్ తయారు చేసిన బోధనా ఫలితాలు (లర్నింగ్ ఔట్ కమ్స్) అనే సూచికలో 2014 నాటికి ప్రశంసనీయంగా ఉన్న రాష్ట్రాలలో ఒకటిగా ఉండిన తెలంగాణ, 2016లో మూడుశాతం పెరుగుదలను చూపి, 2018నాటికి మళ్లీ అంతే తరుగుదలను చూపింది. అలాగే, తెలంగాణలో తరగతులకూ ఉపాధ్యాయులకూ ఉన్న నిష్పత్తి 2014లో 66.7శాతం ఉన్నదల్లా, 2016లో 73శాతానికి పెరిగి, 2018లో మళ్లీ 68.5శాతానికి పడిపోయింది. ఇక రాష్ట్రంలోని పాఠశాలల్లో 40శాతం పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2014లో 61.2శాతం పాఠశాలల్లో ఉండిన మంచినీటి సౌకర్యం, 2018 నాటికి 57.2శాతానికి పడిపోయింది.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిలో క్రీడాసౌకర్యాల కల్పన కీలకమైనదని శాస్త్రీయ అధ్యయనాలు, అధికారిక ప్రకటనలు ఎన్నో చెపుతుండగా, క్రీడాస్థలం ఉన్న పాఠశాలల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నది. అలాగే పాఠశాలల్లో గ్రంథాలయాలు, పుస్తకాల అందుబాటు కూడా తిరోగమన దిశలో ఉంది. గురుకులాలు ఏర్పాటు చేసి, నివాస సౌకర్యాలతో సహా భోజనసౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, 2014లో 99.6శాతం ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం అందుతుండగా, 2018 నాటికి అది 95.8శాతం పాఠశాలలకు పడిపోయిందని అసర్ 2018 తెల్పుతున్నది.
ఆరేండ్ల నుంచి పద్నాలుగేండ్ల ఉన్న బాలల్లో 57.4శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా, 41.8శాతం ప్రయివేటు పాఠశాలల్లో ఉన్నారని ఈ నివేదిక చెపుతున్నది. ఈ గణాంకాన్ని మరి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏడు నుంచి పదేండ్ల లోపు ఉన్న బాలల్లో 49.8శాతం ప్రయివేటు పాఠశాలల్లో ఉన్నారు. ఈ వయోబృందపు కనిష్ట గరిష్ట వయసులు చూస్తే దాదాపుగా వీరందరూ తెలంగాణ ఏర్పడినాక ప్రాథమిక పాఠశాలల్లో చేరినవారై ఉంటారు. అంటే తెలంగాణ ఏర్పడినాక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు చెప్పుకోదగినట్టుగా లేవని, పాఠశాల విద్య ప్రయివేటీకరణ ఈ ప్రభుత్వ హయాంలో వేగవంతంగా జరుగుతున్నదని, ఈ ధోరణిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టడం లేదని అర్థమవుతుంది. మరొకవైపు 11-14 వయోబృందంలో 65.5శాతం, 15-16 వయోబృందంలో 63.5శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండగా 11-14వయోబృందంలో 33.3శాతం, 15-16 వయోబృందంలో 31.3శాతం ప్రయివేటు పాఠశాలల్లో ఉన్నారు. మరో మాటల్లో చెప్పాలంటే పదిహేనేండ్ల పిల్లల్లో ఎక్కువ మంది, పదకొండేండ్ల పిల్లల్లో కాస్త తక్కువ మంది, ఏడేండ్ల పిల్లల్లో ఇంకా తక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని నిర్ధారణకు రావలసి ఉంటుంది. ఈ అంకెలు గత పది, పన్నెండేండ్లుగా ప్రభుత్వ పాఠశాలల పట్ల నిరాదరణ, ప్రయివేటు పాఠశాలల పట్ల మోజు ఎలా పెరుగుతున్నాయో చూపుతున్నాయి. ప్రభుత్వరంగంలో నాణ్యమైన విద్య అందించడానికి, ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి, ప్రజలను ప్రభుత్వ విద్యారంగం వైపు ఆకర్షించడానికి ప్రభుత్వం చేయవలసిన పనులు చేయడం లేదని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
మొత్తం మీద పాఠశాలల్లో బాలికల చేర్పు, బాలికల మరుగుదొడ్డి సౌకర్యం అనే రెండు అంశాలలో మాత్రం తెలంగాణలో కాస్త మెరుగుదల కనబడుతున్నదని అసర్ 2018 చెపుతున్నది. వీటికివిగా ఆహ్వానించదగిన అంశాలే కాని, బాలికల ప్రవేశాల అంకెల్లో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల మధ్య ఉన్న తేడా బాలికల పట్ల అమలవుతున్న వివక్షను సూచిస్తున్నది.
అయితే అసర్ నివేదిక సమగ్రమైనదేమీ కాదు. అది విద్యా స్థితి మీద వార్షిక నివేదిక అనే పేరు పెట్టుకున్నప్పటికీ, విద్యార్థుల పఠన, అంకగణిత ప్రమాణాలకు, పాఠశాలలో కొన్ని సౌకర్యాలకు మాత్రమే పరిమితమయింది. ఆ అంశాలు ముఖ్యమైనవే గాని అవే సంపూర్ణం కావు. విద్యారంగం పట్ల మొత్తంగా ప్రభుత్వ వైఖరి, సమాజ వైఖరి, ఉపాధ్యాయుల వైఖరి, విద్యార్థుల వైఖరి అనే నాలుగు అంశాల విశాల చట్రంలో మాత్రమే విద్యారంగ స్థితిని వీలైనంత సమగ్రంగా అధ్యయనం చేయడం వీలవుతుంది.
విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ప్రజాధనాన్ని వివిధ రంగాల మధ్య పంపిణీ చేసే అధికారం ఉన్న సంస్థగా ప్రభుత్వం విద్యారంగానికి అందజేస్తున్న నిధులు, ఆ నిధులతో రూపొందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాల భవనాలు, క్రీడాస్థలాలు, విద్యా బోధనా పరికరాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది వంటి ఎన్నో అంశాలు ప్రభుత్వ వైఖరిలో భాగమవుతాయి. అది ప్రధానంగా నిధుల కేటాయింపులో వ్యక్తమవుతుంది. గత నాలుగేండ్ల బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే సగటున వార్షిక పెరుగుదల ఐదు-ఆరు శాతానికి మించి లేదు. ఏటేటా పెరుగుదల ద్రవ్యోల్బణం రేటు కన్న తక్కువ ఉంది. అంటే వాస్తవంగా పెరిగినదేమీ లేదన్నమాట. నిజానికి, విద్యారంగాన్ని ప్రాధాన్యతారంగంగా గుర్తిస్తే అదనపు నిధులు కేటాయించాలి. భవనాలు, క్రీడాస్థలాలు, విద్యాబోధనా పరికరాలు వంటి మౌలిక సాధన సంపత్తి ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, పదవీ విరమణ చేస్తున్నవారి ఖాళీలు భర్తీ చేసేట్టుగా ఉపాధ్యాయుల నియామకాలు జరగాలి. తెలంగాణ ప్రభుత్వం గత పాలనలో నాలుగున్నరేండ్లలో వీటిలో ఏ ఒక్కటీ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతున్నా ప్రభుత్వం ఏర్పడినట్టే లేదు. చేయవలసిన పనులు ఇన్ని ఉండగా కేవలం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అదే మహాభాగ్యం అనే ప్రచారార్భాటం సాగించింది. నిజానికి అరవై లక్షల పైబడిన పాఠశాల విద్యార్థులలో ఐదు లక్షల కన్న తక్కువ మందికి మాత్రమే అవకాశం ఇచ్చిన గురుకులాల మీద శ్రద్ధ విద్యారంగం మీద శ్రద్ధకు ప్రత్యామ్నాయం కాదు.
ఇక సమాజ వైఖరి అన్నప్పుడు, ప్రభుత్వ విద్య పట్ల ఆదరణ పెరిగే సామాజిక, సాంస్కృతిక విలువలు రూపొందడం. ఆ పనిని ప్రోత్సహించవలసిన ప్రభుత్వమూ, ఆ పనికి పూనుకోవలసిన పౌరసమాజమూ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్న దాఖలాలు కూడా కనబడడం లేదు. సాధారణంగా విద్యారంగ దుస్థితి గురించి చింతించే చాలమంది ఉపాధ్యాయులను, విద్యార్థులను తప్పుపట్టి తమ పని అయిపోయిందనుకుంటారు. అసర్ నివేదిక కూడా కొంతవరకు అంతే. కానీ విద్యారంగ పురోభివృద్ధి పట్ల ఉపాధ్యాయుల, విద్యార్థుల వైఖరులు పూర్తిగా ప్రభుత్వ, సమాజ వైఖరుల పునాది మీద ఆధారపడి మాత్రమే ఎదుగుతాయి.
అసర్ నివేదిక అనే అద్దంలో మన వికృత ముఖం కనబడుతున్నది. ఇప్పటికైనా దీన్ని కనీస ప్రదర్శనయోగ్యంగా మార్చుకుంటామా?
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028