Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత ప్రతీకార రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయి. పదవి, అధికారం కోసం, కుర్చీ కోసం భారతీయ సంస్కృతికి విరుద్ధమైన ప్రతీకార ఎత్తులు.. జిత్తులు.. మాటలు.. విమర్శలు.. అరెస్టులు.. దాడులు ప్రధాని పదవిలో ఉన్న నాయకుడు చేయటం ఆశ్చర్యం.
ప్రధాని మోడీ కేరళలో పర్యటిస్తూ, 'కమ్యూనిస్టులను సిగ్గులేని వామపక్షం' అనటమేమిటి? సిగ్గులేని అనేపదం వాడటానికి నిజంగా సిగ్గుపడాలి. దేశంలోని ఒక రాజకీయ పార్టీని అందులో కమ్యూనిస్టులను 'సిగ్గులేని వామపక్షం' అని ప్రధాని వాడటం అసహ్యించుకోవల్సిన విషయం. ఈ దేశంలో ఏ రాజకీయ పక్షం ఏలాంటిది? ఎవరి కొమ్ము కాస్తుంది? ఎవరి సొమ్ము ఎవరికి ధారపోస్తోంది? ఏ కార్పొరేట్ సామ్రాజ్యానికి కాపలాకాస్తోంది? దేశాన్ని ఈ స్థితికి తెచ్చిందెవరో అందరికీ తెలుసు. కమ్యూనిస్టులేమీ భారతదేశాన్ని ఏలినవారు కాదు. అయోధ్య సమస్యకు, శబరిమలై సమస్యకు, కాశ్మీర్ చిచ్చుకు, ఈశాన్య రాష్ట్రాల పొగకు కమ్యూనిస్టులు కారణం కాదు. ఒక ప్రధాని సిగ్గులేని అనే పదం ఒక రాజకీయ పార్టీ గూర్చి వాడవచ్చా? ఎంతో సంస్కారంగా సమున్నతంగా, ఆదర్శంగా మాట్లాడాల్సిన ప్రధాని హౌదాను మోడీ బజారు స్థాయికి దిగజార్చారు.
దోపిడీ వ్యవస్థ లక్షణం సంస్కార హీనత్వం. మాటలు, చేతలు అలాగే ఉంటాయి. దోపిడీ వ్యవస్థ వైరుధ్యాలు పెచ్చరిల్లినప్పుడు అసహనం పెరిగిపోతుంది. అధికార భోగం మీద వాంఛ పెచ్చరిల్లుతుంది. అప్పుడే ఇలాంటి సంస్కారహీనమైన మాటలు వస్తాయి. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నదదే? ఉన్నత పదవులలో ఉన్నవారి విమర్శ కూడా హూందాగా ఉండాలి. ప్రజలు మెచ్చేలా ఉండాలి. మాట మధురంగా ఉండాలి. వస్తువూ వాస్తవమూ లేనప్పుడే విమర్శలో సంస్కారహీనత్వం కనిపిస్తుంది. ఏ వస్తువూ లేనప్పుడు 'సిగ్గులేదు - లజ్జలేదు' వాడు, వీడు, వీడెంత? వాడెంత? నేనే గొప్ప ఇలాంటి మాటలు వస్తాయి. రాజకీయ రంగం పూర్తిగా హేయమై పతనమవుతున్న స్థితిలో ఉన్నాం. నేను, నాది, నేనే ఉద్దరిస్తాను, అవినీతి నుంచి దేశాన్ని నేనే బయటపడేస్తాను, అవినీతి పరుల అంతం చూస్తాను, జైలు చువ్వలు లెక్కించాల్సిందే! ఇవేం మాటలు.. రాజకీయ నాయకులకు ఇంత గర్వమా? చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. ఇందులో కక్ష సాధింపు, ప్రతీకార వాంఛ, ప్రత్యర్థిని బలహీనం చేయటానికి చట్టాన్ని వాడుకోవటం ఇవి పాలక పక్షానికి సరియైనవి కాదు. పాలకపక్షం హూందాగా, ప్రేమగా, ఆదర్శంగా ఉండాలి. 'మంచి పలుకు' 'మంచిమాట' 'మంచి బాట' ఇవి ఇప్పటి రాజకీయ నాయకులలో కరువయ్యాయి. రాజకీయాలలో ఈ శతృత్వమెందుకూ? అధికారం కోసం ఈ శతృత్వం.. అధికారం అంత విలాసవంతమైనదా? అంతగా భోగవస్తువా? ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజలకు సేవ చేయటానికి పనికిరావాలి. ప్రజలను దోచుకోవటానికి కాదు. ప్రజలు తమ ఇష్టం వచ్చినవారిని ఎన్నుకొంటారు. కోట్లు ఉన్నవారు ఎన్నికలలో పోటీపడతారు. ప్రధాని మోడీ ఎలా భావిస్తున్నారంటే... ''నేను మాత్రమే ఈ దేశాన్ని ఉద్దరించగలను. నాతో సమానం ఎవరూ కాదు'' ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ఆలోచన కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. దోపిడీ వ్యవస్థ. ప్రజల సంక్షేమం ఆలోచించటం లేదు. ప్రధాని మోడీ కూడా ఆలోచించటం లేదు. దేశాన్ని ఐక్యంగా, శక్తివంతంగా, పటిష్టంగా ఉంచాల్సిన ప్రధాని కేరళ వెళ్లి అలా మాట్లాడటమేమిటి? కమ్యూనిస్టులను తిట్టి రాజకీయ అట ప్రారంభించావు. లాభమేమిటీ? దానితో బీజేపీకి ఓట్లు పడతాయా? విమర్శలతో, అరెస్టులతో ప్రతీకార దాడులతో ఓట్లు రాలుతాయని.. ప్రతిపక్షం బలహీనమవుతుందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయపార్టీని నోటికొచ్చినట్టుగా మాట్లాడి అవమానపరిస్తే ఓట్లు రాలుతాయనుకుంటే పెద్ద భ్రమ. ప్రజలు తెలివైనవాళ్లు. అన్నీ గమనిస్తూనే ఉంటారు. మేధావులే అమ్ముడుపోతున్న దేశమిది. ప్రజలు ఎవరికో ఒకరికి ఓటు వేయాలి కాబట్టి వేస్తున్నారు. కానీ, ప్రజల మనసులకు అన్నీ తెలుసు. వాళ్ల మనసులలో ఉన్నదేమిటో తెలుసా? ఈ నాయకులంతా దొంగలే! అందరూ అవినీతి పరులే. వీళ్లు తిట్టుకోగానే రాళ్లు విసురుకోగానే నమ్మేస్థితిలో ప్రజలు లేరు.
ఒక దేశ ప్రధాని అన్ని పార్టీలను, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఒకే రకంగా చూడాలి. దేశ సమైక్యతకు అవసరం.. ఓట్ల కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? ఏ రాష్ట్రానికి ప్రధాని వెళ్లినా రాష్ట్ర ముఖ్యమంత్రిని మంత్రులను అధికారులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రజలలో ఒకరుగా మారిపోవాలి. కేరళ శబరిమలలో ఉద్రిక్త పరిస్థితి ఉంది. మోడీ కేరళ వెళ్లారు. ముఖ్యమంత్రితో చర్చించి శబరిమల ఉద్రిక్తతను చల్లార్చటానికి బదులు కమ్యూనిస్టులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ప్రధాని స్థాయి నాయకుడు చేయాల్సిన పనేనా? భారతీయ చరిత్రను, సంస్కృతిని, ఆధ్యాత్మికతను కమ్యూనిస్టులు గౌరవించరని మోడీ అన్నారు. అసలు గౌరవించనిది కమ్యూనిస్టులా? దోపిడీ కార్పొరేట్ సామ్రాజ్యాలా? వాటిని పెంచి పోషిస్తున్న పాలకులా? ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం, శాంతి, ఫెడరిలిజం రాజ్యాంగ మౌలిక సూత్రాలు కమ్యూనిస్టులకు తెలుసు. ఈ దేశానికి ఏవిముఖ్యం?
ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అంగీకరించింది. ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాన్ని కేరళ కమ్యూనిస్టు ముఖ్యమంత్రి అమలు పర్చుతున్నారు. ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ సుప్రీంకోర్టు ఆదేశాన్ని అక్కడ బాహాటంగా ధిక్కరిస్తూ ఉంది. శబరిమలలో బీజేపీ పాత్రను మోడీ సమర్థిస్తూ, కేరళ ప్రభుత్వాన్ని విమర్శించట మంటే మోడీ కోర్టు ఆదేశాలను ధిక్కరించటం కాదా?
- సిహెచ్ మధు
సెల్: 9949486122