Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మతమేదైనా, దేవుడెవరైనా అన్నీ ఆదిమ సమాజంలో రూపుదిద్దుకున్న భావనలే. అలాగే మతమేదైనా సరే, కష్టజీవుల్ని ఎప్పుడూ ఎక్కడా గుర్తించలేదు. సరికదా వారిని బానిసలుగా మార్చి హింసించింది. ఆ బాధపడలేక వారు ఒక మతంలోంచి మరో మతంలోకి మారుతూ వచ్చారు. అయినా వారికి ఎక్కడా ప్రశాంతమైన జీవితం లభించలేదు. ఆధిపత్యం నెరపేవారికీ, అణగదొక్కబడిన వారికీ మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూనే వచ్చింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. పైపైన కొన్ని మార్పులు వచ్చినట్టు కనబడుతున్నా, మనుషుల మెదళ్ళలో విభజనలు అలాగే ఉన్నాయి. అనాదిగా అన్ని మతాలకు సంబంధించిన విగ్రహాలు, ప్రతిమలు, రూపాలు కొన్ని కోట్లలో తయారవుతూ వచ్చాయి కదా? మరి వాటిని రూపొందించిన శ్రామికుల గురించి ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? గుడ్డిగా గుండంలోనో, పుష్కరిణిలోనో, నదిలోనో మునిగి, గుడిలో దేవుడి ప్రతిమకు తమ కోర్కెల చిట్టా సమర్పించుకుని రావడం తప్ప, ప్రతి అడుగునూ అందంగా తీర్చిదిద్దిన శ్రామికుల కృషి గురించి, వారు ధారపోసిన స్వేదం గురించి ఎవరూ ఎందుకు ఆలోచించరూ? అవన్నీ ఉన్న ఫళాన ఏ దేవుడూ సృష్టించినవి కావు. అసలు ఏ దేవుడూ తన ప్రతిమను / విగ్రహాన్ని / శిల్పాన్నీ తానే తయారు చేసుకోలేదన్నది నిజం. గోపురాలు, ఆలయాల, శిల్ప సౌందర్యాల శోభ మన పూర్వీకుల గొప్పకృషి అని క్షణమాత్రమైనా ఆలోచించరు కదా? వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభినందించరు కదా? ఇవన్నీ ఆలోచించగలవాడు విజ్ఞుడు. వీటిని పట్టించుకోకుండా మూఢత్వంలో మునిగే జనమే ఎక్కువ! ఈ పరిస్థితి మారాలి!!
ఆది మానవుడి ఒక అజ్ఞానపు భావనకు వంగి దండం పెడతారు. ఆ భావనకు ఒక రూపాన్నిచ్చిన శిల్పకారుడి 'శ్రమ'ను మాత్రం కనీసం గుర్తించరు. అంటే ఏమిటీ? పట్టించుకోవాల్సింది పట్టించుకోరు. అవసరం లేనిది విపరీతంగా పట్టించుకుని, తమను తాము భక్తుల జాబితాలో చేర్చుకుంటారు. మనిషి ఏకాలంవాడైనా, అతని కృషి ఏ రూపంలో ఉన్నా గుర్తించ గలిగినవాడే మానవవాది! దైవదర్శనం చేసుకున్నామని కాకుండా, 'స్థలాల విహార యాత్ర' అని అనుకుంటే.. వందల, వేల యేండ్ల నాటి మన పూర్వీకుల సౌందర్య దృష్టికి, సాంకేతిక పరిజ్ఞానానికి అబ్బురపడినట్టు, దాన్ని అర్థం చేసుకున్నట్టూ వాటి చుట్టూ అల్లుకున్న సంగీత, సాహిత్యాల గూర్చి తెలుసుకోవడం మరొక శోధన.
ఆదిమ సమాజంలో రూపుదిద్దుకున్న ఒక అమాయకపు లేదా అజ్ఞానపు ఆలోచన దైవ భావన అయితే, దాని చుట్టూ మహా మహా సంగీత, సాహిత్య పండితులంతా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఒకరకంగా వారు ఆయాకాలాలకు తగినట్టు ప్రవర్తించారేమో కానీ, ఇప్పటి తరం ఏం చేయాలీ? ఆయా కళాకారుల ప్రతిభను గుర్తించి అందులో నిక్షిప్తమైన భక్తిని, దైవ భావనని వదిలేయాలి. పండు తిని టెంక వదిలేస్తున్నాం కదా? అలాగే మనిషి ప్రతిభ మనకు ముఖ్యం. రాగల కాలాలలో మానవ విజయ దుందుభిని శ్లాఘించే సంగీత, సాహిత్యాలు వస్తాయి. ఇంకా రామాయణాలు రాసి జ్ఞానపీఠాలు తెచ్చుకున్న పండితులున్నారు. మళ్లీ అది వేరే విషయం. ఏమైనా, కాలానికి అనుగుణంగా ఎదగని సంగీత సాహిత్యాన్ని జనం వదిలేసి ముందుకు వెళతారు. తప్పదు.
మనిషి జీవనయానంలో, సామాజిక పరిణామ క్రమంలో వచ్చిన వాటిని కాదనలేం. కానీ, ప్రతి అంశంలో మానవుడి శ్రమ, సౌందర్య పిపాసను అర్థం చేసుకుంటూ వస్తే, ఆధునిక ఆలోచనా ధోరణికి అనుగుణంగా ఎదిగి ఆలోచిస్తే, మూఢభక్తిలో కృంగి కృశించి పోవడానికి వీలుండదు. ఏ విగ్రహానికీ ఏ మహత్తూ ఉండదు. ఏ దేవుడూ ఎవరి కోర్కెలూ తీర్చలేడు.. అనేది గట్టిగా నమ్మిన వారి ఆలోచన వేరుగా ఉంటుంది. ''మాకు దైవశక్తి మీద విశ్వాసముంది'' అని అనుకునే వారితో మనకు పేచీలేదు. వారి నమ్మకం వారిది. పురాతన కాలంలో ఎప్పుడో మనిషి గీసుకున్న సరిహద్దుల్ని దాటి, బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆలోచిస్తామన్న వారిని ఆలోచించనీయాలి. వారిపై దాడులు చేయకూడదు. మీ విశ్వాసం మీకున్నప్పుడు వారి ఆలోచనా విధానం వారికి ఉంటుంది కదా? నిజానికి సమాజంలో ప్రగతి, స్వేచ్చా ఆలోచనాపరులతోనే సాధ్యమవుతూ వచ్చింది. కృషిలేని ఉట్టి విశ్వాసం వల్ల ప్రగతి సాధ్యం కాలేదు. కాదు కూడా!
ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి స్మృతి చిహ్నంగా సమాధి కట్టడం వాడుకలో ఉంది. షాజహాన్ చక్రవర్తి గనక, భార్య ముంతాజ్ మహల్ స్మృతిలో అద్భుతమైన కట్టడం తాజ్మహల్ నిర్మించాడు. ఆర్థిక స్థోమతలను బట్టి కట్టడాలు ఉంటాయి. అలాగే అన్ని మతాల అన్ని పుణ్యక్షేత్రాలూ స్మృతి చిహ్నలే. ఒక మహానుభావుడి స్మృతిలో మ్యూజియం ఏర్పాటు చేస్తే అందులో ఏముంటాయి? ఆయన చిత్రపటాలు, వాడిన వస్తువులు, జీవనశైలికి, వ్యక్తిత్వానికీ సంబంధించిన అంశాలూ ఉంటాయి. ఆయన మాత్రం ఉండడు. అలాగే ఏ దేవుడికి సంబంధించిన ఏ క్షేత్రంలో నైనా దేవుడు ఉండడు. ఆయన ఉన్నాడన్న భావన చుట్టూ అల్లుకున్న సరంజామా-సంరంభం మాత్రమే ఉంటాయి. మనిషి తన ప్రాథమిక దశలో దేవుడి పట్ల ఏర్పరుచుకున్న ఊహలకూ భ్రమలకూ ప్రతిరూపాలు మాత్రమే అక్కడ ఉంటాయి. దైవ 'భావన' మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ భావనవల్ల జనానికి జరిగే మేలు ఏమీ ఉండదు. ఏమతానికి సంబంధించిన ఏ దేవుడి మీద ఎంత భక్తిపెంచుకున్నా ఒరిగేది శూన్యం. అద్భుతాలేవీ జరగవు. ఎవడి తిండి వాడు సంపాదించుకోవాల్సిందే. ఎవడి వ్యక్తిత్వాన్ని వాడు తీర్చిదిద్దుకోవాల్సిందే. దైవశక్తితో జరిగాయని ప్రచారం చేసుకున్నవన్నీ నిరూపణ కాలేదు. కావు కూడా! జరిగినవి, జరగబోయేవి అద్భుతాలేవైనా ఉంటే అవి మనిషి తన సైన్సు - సాంకేతిక పరిజ్ఞానంతో సాధించుకున్నవే. ఇక ముందు సాధించుకోబేయేవే. అందువల్ల అన్ని మతాల అన్ని దైవక్షేత్రాల్నీ స్మృతి చిహ్నాలనుకుంటే గొడవే ఉండదు. పైగా విశ్వనరుడి ఆవిర్భావం జరుగుతుంది.
ఒక మత కేంద్రానికి లేదా ప్రార్థనా స్థలానికి లేదా పుణ్యక్షేత్రానికి వెళ్లి మీరు మొక్కుతున్నారంటే అర్థం ఏమిటీ? ఎప్పుడో వేల వేల ఏండ్ల క్రితం మన పూర్వీకులు ఏర్పరుచుకున్న 'భావన'కు నమస్కరిస్తున్నారన్న మాట! పూర్వీకుల్ని, వారి భావనని గౌరవించుకుంటున్నారన్న మాట. అంతేగానీ నిజంగా దేవుడనే వాడు అక్కడ ఉన్నట్టు కాదు. ఆయన మీ గొంతెమ్మ కోర్కెల్ని తీరుస్తాడనీ కాదు. కాలక్రమంలో ఆ దైవ భావన చుట్టూ అభివృద్ధి చెందిన వ్యాపారం ఇతోధికంగా కొనసాగడానికి మీ వంతు కృషి మీరు చేస్తున్నారన్నమాట! మనుషుల్ని వర్ణాలుగా వర్గాలుగా విభజించిన మనువాదానికి మీరు చెక్కభజన చేస్తున్నారన్న మాట. కొందరిని లోనికి రానిచ్చి మరికొందరిని బహిష్కరించే అమానవీయ సంస్కృతికి మీరు వంత పాడుతున్నారన్న మాట. సంపూర్ణ మానవుడు, పరి పూర్ణ మానవుడు ఎప్పుడైనా మానవశక్తినే నమ్ముకుంటాడు. మానవీయ విలువలకే ప్రాధాన్యమిస్తాడు. ఇది కాక, మరేదో అతీంద్రీయ శక్తుల గురించి మాట్లాడేవారు ఎలాంటి అసంపూర్ణ జీవులన్నది మనం ఆలోచించాలి. మనుషుల్ని కులాలుగా, మతాలుగా, లింగపరంగా, ప్రాంతాల పరంగా విభజించేవాడు రాజకీయ నాయకుడవుతాడు లేదా మత బోధకుడవుతాడు. అంతేకాని పరిపూర్ణ మానవుడెలా అవుతాడు? వీరికన్నా జంతువులు, పక్షులు నయం కదా? అవి తమని తాము విభజించుకోవు. ప్రఖ్యాత కన్నడ కవి గోపాలకృష్ణ ఆడిగ అంటారు..
నీరు మరిగి ఆవిరవుతుంది /
విద్యుత్తు అవుతుంది /
వర్షంగా హర్షిస్తుంది /
నదినీరా? చెరువునీరా /
బావిలోని మంచినీరా?
చెరువులోని ఉప్పునీరా? /
కుంటలోని మురికినీరా? ఏమో../
అనంతకాశంలో కలుసుకున్నప్పుడు /
నీరంతా ఒక్కటే - తేడాలేదు /
ఇప్పుడు చెప్పండి ఇందులో
కుల ప్రసక్తి ఎక్కడుంది? /
అది మీరు మట్టిలో నాటి /
మీ ఇష్టప్రకారం పెంచి పోషించింది కాదూ?
అన్నది ఆయన కవితాత్మకంగా వెలిబుచ్చిన ఆవేదన! మనుషులు విడిపోవడమే కాదు, ప్రార్థనా స్థలాల్ని విడగొట్టుకోవడం, మళ్ళీ వాటి కోసం పోట్లాడుకోవడం.. మన గొప్ప సంస్కృతిలో భాగమా? ఆలోచించుకునే పనేలేదా?
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త
బయాలజీ ప్రొఫెసర్, మెల్బోర్న్ నుంచి.
- డాక్టర్ దేవరాజు మహారాజు