Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వం రానున్న లోక్సభ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సరిగ్గా నోటిఫికేషన్కు ముందు ప్రతిపక్షాల ఊహకు అందని అస్త్రాలను బయటకు తీస్తోందని ఆ పార్టీతో పాటు దానికి కొమ్ముకాసే మీడియా ప్రచారం చేస్తున్నది. బడ్జెట్ తాయిలాలతో ఆ పర్వం ముగిసి అస్త్రాలు అయిపోయాయని అనుకోవాలి. ఇన్ని చేసినా తమకు అధికారం దక్కదేమో అనే అనుమానం తలెత్తితే ఇంకా వేటిని బయటకు తీస్తారో తెలియదు. అమెరికా జాతీయ గూఢచార డైరెక్టర్ కార్యాలయం(ఓడీఎన్ఐ) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎన్నికలకు ముందు మతఘర్షణలు జరగవచ్చని దానిలో చెప్పినందున చివరకు ఆ మారణాస్త్త్రాలను ప్రయోగిస్తారేమో...!
బీజేపీ స్వంతడబ్బా ఎంత కొట్టుకున్నప్పటికీ కాంగ్రెస్కూ దానికీ పెద్ద తేడా లేదని, దేశంలోని వ్యవస్థలను దెబ్బతీయటం, దుర్వినియోగం చేయటం, జనానికి విశ్వాసం లేకుండా చేయటంలో కాంగ్రెస్ కంటే రెండాకులు ఎక్కువే చదివిందని ఇటీవలి కాలంలో స్పష్టంగా నిరూపించుకుంది. జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆ రేట్ల తగ్గింపు హెచ్చింపు అన్నది ఇష్టమొచ్చినప్పుడు చేసే అవకాశం ఉండటంతో పథకాల ప్రకటన మినహా బడ్జెట్కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వడ్డించేవారు మనవారైతే కడబంతిలో వున్నా మనకు అన్నీ అందుతాయన్న లోకోక్తి తెలిసిందే. బడ్జెట్ కూడా అంతే. తమకేమి ఒరగబెడతారా అని సామాన్యులు, మధ్యతరగతి ప్రదర్శించే ఆతృత ధనికులు, కార్పొరేట్లలో కనిపించదు. ఎందుకంటే ప్రభుత్వం తమది కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా తమ సింహభాగాన్ని తాము చక్కపెట్టుకొనేందుకు వారేమీ హడావుడి చేయరు.
బడ్జెట్ సమర్పణ గురించి సంప్రదాయాలు, స్వయం నిబంధనలు తప్ప ఒక నమూనా లేదు. బ్రిటిష్ వారి పాలనలో మన దేశంలో ఆ ప్రక్రియ మొదలైంది గనుక వారి పద్ధతిని, ప్రవేశ సమయాన్నే మనదేశంలో కూడా అమలు జరిపారు. సమగ్ర చర్చకు అవకాశం లేని పరిస్థితుల్లో మూడునెలలకు సరిపడా అవసరాలకు ఖజానా నుంచి నిధులు తీసుకొనేందుకు అనుమతించే ప్రక్రియను ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ఎన్నికలు జరగబోయే తరుణంలో అధికారంలోకి వచ్చే సర్కార్ ఎవరిదో, బడ్జెట్ ప్రాధాన్యతలు ఏమిటో తెలియవు గనుక ఈ పద్ధతిని అనుసరించటం ఆనవాయితీగా వచ్చింది. తొలిసారిగా నరేంద్రమోడీ సర్కార్ దాన్ని తుంగలో తొక్కి మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. నిధుల విడుదలకు ఆమోదం తెలపటం తప్ప దీని మీద జరిగే చర్చ ఏమీ వుండదు. తమ ఐదేండ్ల పాలనతో ప్రజల విశ్వాసం పొంది తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకం బీజేపీలో లేదని ఈ బడ్జెట్ స్పష్టం చేసింది. ఓట్ల కోసం రైతుల నిధి ఏర్పాటు, దాన్నుంచి చిన్న రైతులకు మూడు విడతలుగా రెండేసి వేల చొప్పున ఆరువేల రూపాయల అందచేత పథకాన్ని వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రవేశపెట్టి దాన్ని గత ఏడాది నుంచి అమలయ్యే విధంగా చూశారంటే ఇవన్నీ ఎన్నికల ఆపదమొక్కులేనని అర్థమవుతున్నది.
తాము అధికారానికి వస్తే రామాలయ నిర్మాణం చేస్తామన్నది బీజేపీ వాగ్దానం. అది సమర్ధనీయమా కాదా అన్నది ఒక అంశమైతే ఎందుకు అమలు జరపలేదో, ఎవరు అడ్డమొచ్చారో బీజేపీ చెప్పాలా లేదా? ఎప్పుడో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అయోధ్య భూమిలో వివాదాస్పదం గాని స్ధలాన్ని యజమానులకు అప్పగించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టు అనుమతి కోరుతూ సరిగ్గా ఎన్నికలకు ముందుకు కేంద్రం పిటీషన్ దాఖలు చేయటం ఎన్నికల ఎత్తుగడ కాదా? బాబ్రీ మసీదు ఉన్న స్థలంపై హక్కు వివాదంలో దాఖలైన అన్ని పిటీషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నిర్ణయం రావాల్సి ఉంది. ఆ తీర్పు ఎన్నికలకు ముందే వస్తుందన్న నమ్మకమూ లేదు. ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రయాగలో విశ్వహిందూపరిషత్ నిర్వహించిన ధర్మసంసద్లో ప్రసంగించిన ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్భగవత్ చెప్పిందేమిటి? 'వారు(బీజేపీ) రామాలయం గురించి మాట్లాడేది కేవలం ఓట్లు పొందేందుకే. అయితే విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్మాణం జరుగుతుంది. మూడు నాలుగు నెలల్లో నిర్ణయం తీసుకుంటే మంచిదే, లేనట్టయితే నాలుగు నెలల తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది' అన్నారు. దీనికి రెండు రోజుల ముందు స్వరూ పానాంద సరస్వతి అక్కడే మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అయోధ్య యాత్ర చేసి అదే రోజు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, ఇంకేమాత్రం ఆలస్యం కాకూడదని చెప్పారు. వివాదంలేని చోట రామాలయం కట్టేందుకు ఎవరూ అడ్డపడలేదే? లేదూ బాబరీ మసీదు స్థలంలోనే కట్టాలనుకుంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, కోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలి. కానీ వీరు చేస్తున్నదేమిటి? ఓట్ల కోసం నాటకాలు గాకపోతే ఏమిటిది?
ప్రపంచంలో మన రిజర్వుబ్యాంకు, మన ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థలకు ఒక ప్రత్యేకత ఉంది. 2007లో ప్రపంచ ధనిక దేశాలలో బ్యాంకులు కుప్పకూలటంతో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభానికి మన బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థ అంతగా ప్రభావితం గాకపోవటానికి, నిలబడటానికి రిజర్వుబ్యాంకు విధానాలే కారణం. దాని అధిపతితో నిమిత్తం లేకుండా ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతీసుకున్నారు. దాని వలన జరిగిన నష్టం ఏమిటో తెలిసిందే. రద్దు నిర్ణయ సమయంలో మాట్లాడటం తప్ప ఇంతవరకు మోడీ నోరు విప్పలేదు. నల్లధనమేమీ బయటకు రాకపోగా దాన్ని కలిగిన వారంతా తెల్లధనంగా మార్చుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రత్యేకించి సామాన్యులకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ప్రభుత్వం దాని మీద చర్చ జరిపేందుకు భయపడింది. అసలేమీ జరిగిందో చెప్పేందుకు కూడా ముందుకు రాలేదు. రిజర్వుబ్యాంకు సైతం తేలుకుట్టిన దొంగలా ఏడాదిన్నర తరువాత వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించటం తప్ప ఇతరంగా ప్రశ్నించటానికి అవకాశం ఇవ్వలేదు. పెద్ద నోట్ల రద్దుకు ముందు తమతో సంప్రదించగా ఆ చర్యను వ్యతిరేకించామని, తమతో సంబంధం లేకుండానే రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని రాజీనామా చేసిన తరువాత రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. రాజన్ స్థానంలో వచ్చిన గవర్నర్ ఉర్జిత్ పటేల్ను అర్థాంతరంగా పదవి నుంచి తప్పుకొనేట్లు చేసింది మోడీ సర్కార్. తాము కోరిన విధంగా పెద్ద మొత్తంలో డివిడెండ్ రూపంలో ఆర్బీఐ నిల్వనిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని వత్తిడి చేయగా తిరస్కరించిన పటేల్ రాజీనామా చేయక తప్పలేదు. గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాల్లో వున్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరికి 15లక్షల రూపాయల వంతున పంచుతానంటూ కబుర్లు చెప్పిన పెద్దమనిషి గత ఐదేండ్లలో ఏ గుడ్డి గుర్రానికి పండ్లుతోమారో తెలియదు. తాజా మధ్యంతర బడ్జెట్లో తన ప్రభుత్వం నల్లధనం వెలికితీతకు కట్టుబడి ఉందంటూ పెద్ద జోక్ పేల్చారు. విదేశాలలో మన దేశ ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, నైపుణ్యశిక్షణ కలిగించి మెరుగైన ఉపాధి కల్పించామంటూ ఊదరగొట్టిన అతి పెద్ద బెలూన్ గాలిని గత నాలుగున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిందన్న ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ తాజా నివేదిక తుస్సుమనిపించింది. నాలుగేండ్లమోడీ పాలన తరువాత ఆరున్నర కోట్ల మంది యువతీయువకులు నిరుద్యోగులుగా ఉన్నారని వెల్లడించింది. 2017జులై నుంచి 2018జూన్ మధ్యకాలంలో సేకరించిన సమాచారం మేరకు 6.1శాతం నిరుద్యో గులున్నారు. వారం వారం సేకరించే సమాచార విశ్లేషణ ప్రకారం తాజా వారంలో నిరుద్యోగశాతం 8.9గా నమోదైందంటే ఎంత వేగంగా పరిస్థితి దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికల ముందు ఇలాంటి జిమ్మిక్కులు పనిచేస్తాయా అన్నది అపూర్వ చింతామణి ప్రశ్న. గత ఏడు దశాబ్దాలుగా అధికార పార్టీలు పట్టువదలని విక్రమార్కుడిలా జిమ్మిక్కులకు పాల్పడినా మట్టి కరచిన ఉదంతాలే ఎక్కువ. తాజాగా బీజేపీ నాయకత్వ తీరు తెన్నులను, జరుగుతున్న పరిణామాలను చూస్తే కారల్ మార్క్స్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి. ''దోపిడీ స్వభావం కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల కోసం వస్తువులతో పాటు తన గోరీ కట్టే కార్మికులను కూడా తయారు చేసుకుంటుంది'' అన్నారు మార్క్స్. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే మార్క్స్ చెప్పినట్టు నరేంద్రమోడీ తన పదవిని పదిల పరుచుకొనేందుకు కొన్ని అస్త్రాలను బయటకు తీయటంతో పాటు తన మీద సంధించే బలమైన అస్త్రాలను కూడా ప్రత్యర్థు లకు అందిస్తున్నారు అని చెప్పక తప్పదు.
- శారద