Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్స్ఫామ్ ఇండియా భారతదేశంలోని ఆర్థిక సామాజిక అంశాలపై ఈ మధ్యనే తన నివేదికను విడుదల చేసింది. భారతదేశంలోని అసమానతలను, ఆదాయాలలోని అంతరాలను అలాగే వినియోగితలోని తీవ్రమైన తేడాలను ఈ నివేదిక విపులంగా చర్చించింది. ఆర్థిక సామాజిక శాస్త్రవేత్తలనేకులు ఈ నివేదిక బయట పెట్టిన అంశాలకు తమ సమ్మతిని తెలియజేశారు. కొంతమంది విభేదించారు. జాతీయ స్థాయిలో పేరున్న ఓ ప్రముఖ జర్నలిస్టు నివేదికతో విభేదించడమే కాకుండా అదొక పనికిమాలిన రిపోర్ట్ అని తీసి పారేశారు. రిపోర్టు తప్పుల తడకగా ఉన్నదని సైద్ధాంతిక భావజాలంతో ప్రేరేపితమై ఉన్నదని ఆయన విరుచుకుపడ్డారు. సంపద సృష్టించడం చాలా ముఖ్యమని, సంపద సృష్టించేవారిని విమర్శించడం, సంపద సృష్టించే విధానాలను అడ్డుకోవడం మూర్ఖత్వమని, అలా చేస్తే భారతదేశం ఆర్థికాభివృద్ధిలో అవకాశాలను సృష్టించడంలో వెనకంజ వేస్తుందని, మార్కెట్ ఆధారిత విధానాల ద్వారానే దేశం ప్రగతిబాటలో నడవగలుగుతుందని ఇలాంటి మేధావులు అభిప్రాయపడుతుంటారు. ఆక్స్ఫామ్ నివేదిక దీనినే ప్రశ్నించింది. సంపదను సృష్టించే సమయంలో అసమానతలు ఎంత తీవ్రంగా పెరుగుతున్నాయో తెలియజేసింది. సంపద సృష్టి సామాజిక విధ్వంసానికి దారితీసే పరిస్థితులు వచ్చినప్పుడు సంపద సృష్టి న్యాయమైన పద్ధతిలో జరుగుతుందా అని ప్రశ్నించింది.
అసమానతలు పెరగకుండా, పెరిగిన అసమానతలు వినాశకరంగా పరిణమించకుండా సంపదను సృష్టించుకోవచ్చు. కానీ సంపద సృష్టించబడితే చాలు పెరిగిన సంపద అందరికి లాభం చేకూరుస్తుందన్న భావన నయా ఉదారవాద ఆర్థికవేత్తలది. ఇది తప్పు అని నివేదిక వెల్లడించిన అంశాలు తెలియజేస్తున్నాయి. అసమానతలు ఎక్కువగా ఉన్న సమాజాలలో ప్రజలకు పబ్లిక్ సర్వీసుల అందుబాటు, వాటి నాణ్యత తక్కువగా ఉంటుంది. మన దేశంలో విద్య, వైద్యంపై ప్రభుత్వం చాలా తక్కువగా నిధులను ఖర్చు చేయడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పెరుగుతున్న అసమానతలను పబ్లిక్ పాలసీల ద్వారా కొంత మేర తగ్గించవచ్చు. కానీ 1990 తర్వాత అమలవుతున్న నయా ఉదారవాద విధానాలు అసమానతలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఆర్థికవ్యవస్థ పెరుగుతున్నప్పుడు అసమానతలు అనేది ఒక సమస్య కాదన్న విశ్వాసం కూడా దీనికి కారణం. అందుకనే మార్కెట్ ఆధారిత విధానాల వల్ల పెరుగుతున్న అసమానతలను ప్రభుత్వంతో పాటు సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు అంతగా పట్టించుకోలేదు. అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వాల నిబద్ధతకు సంబంధించిన సూచికలో భారతదేశం 152 దేశాలలో 132వ స్థానంలో ఉంది. ప్రాథమిక అంశాలైన విద్య, వైద్యం, పోషణలాంటివి కూడా ప్రజలకు అందేట్టుగా చూడటంలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం దీనికి కారణమని చెప్పాలి.
అసమానతల యొక్క ప్రతికూల ప్రభావం గురించి, అలాగే అసమానతలను సృష్టించే ఆర్థిక వ్యవస్థ స్వభావం గురించి అవగాహన పెరుగుతున్నది. ఉద్యోగాలు, ఉపాధిలేని అభివృద్ధి జరుగుతున్న సమయంలో అసమానతల గురించి అధ్యయనం చాలా అవసరం. ముఖ్యంగా సృష్టించబడుతున్న ఉద్యోగాలు అసంఘటిత రంగంలో ఉన్నప్పుడు లేదా సంఘటిత రంగంలో తాత్కాలిక స్వభావపు ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడుతున్నప్పుడు అసమానతల గురించిన విశ్లేషణ మరింత ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.
ఆక్స్ఫామ్ రిపోర్టు ప్రపంచ వ్యాప్తంగా ఈ పనిని గత కొన్నేండ్లుగా చేస్తున్నది. నయా ఉదారవాద ఆర్థికవేత్తల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ ఆక్స్ఫామ్ నివేదిక ఆర్థికాభివృద్ధి, సంపదల పెంపు యొక్క ప్రతికూల పార్శ్వాన్ని తెలియ చేస్తున్నది. పెరుగుతున్న అంతరాలు- భారతదేశ అసమానత రిపోర్టు అన్న పేరుతో ఆక్స్ఫామ్ ఇండియా ఇచ్చిన నివేదిక సరళీకరణ విధానాల వల్ల ఉద్యోగాలు లేని అభివృద్ధి, అలాగే ఉద్యోగాలను హరించే అభివృద్ధి జరిగిందని తెలియజేసింది. వేతనాల్లో తరుగుదల, కఠినమైన పని పరిస్థితులు, సాంఘిక భద్రత సౌకర్యాల తొలగింపు వల్ల అసమానతలు పెరిగాయని నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభాలో 17శాతం మంది పేదలు భారతీయులని, అలాగే ప్రపంచ పేదలలో (రోజుకు1.90 డాలర్ల ఆదాయం) అధిక సంఖ్యాకులు భారతీయులేనని నివేదిక తెలిపింది.2003-04 తరువాత భారత జీడీపీలో గణనీయమైన వృద్ధి ఉన్నా అది ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేదని నివేదిక పేర్కొన్నది.
ఆదాయాలలో అసమానతలు: ఇండియన్ హ్యుమన్ డెవలప్మెంట్ సర్వే ఇచ్చిన సమాచారం ప్రకారం ఆదాయాల్లో అసమానతలను అంచనా వేశారు. 2004-05లో 0.54గా ఉన్న సూచిక 2011-12 నాటికి 0.55 కి పెరిగిందని నివేదిక తెలిపింది. ఎన్ఎస్ఎస్ఒ ఇచ్చిన సమాచారం కూడా ఆదాయాలలో పెరుగుతున్న అసమానతలను తెలియపరిచింది. జీడీపీలో వేతనాల వాటా తగ్గుతుండగా కార్పొరేట్ లాభాల వాటా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నది. ఇవన్నీ ధనిక, పేదల మధ్య ఆదాయాల్లో అసమానతలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఆదాయాల్లో అసమానతలతో పాటు భారతదేశంలోని వ్యవస్థీకృత అసమానతలు కుడా కొనసాగుతున్నాయి. దేశంలోని మెజారిటీ పౌరులు ఈ అసమానతల వల్ల విద్య, వైద్యం, పారిశుధ్యం, పోషకాహారం, ఇతర ప్రాథమిక సౌకర్యాలు పొందలేక పోతున్నారు. దళితులు గిరిజనులు, మైనార్టీలు ఈ రకమైన అసమానతలకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ విషయాలలో తీవ్రమైన వివక్షను అసమానతలను ఎదుర్కొంటున్నారు. నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం బాగా పడిపోయింది. మహిళలకు ఇచ్చే వేతనాలు కూడా పురుషుల కన్నా తక్కువ ఉండడం సాంఘిక అసమానతలను మరింత వ్యవస్థీకృతం చేస్తున్నది. జాతీయ ఆదాయంలో ప్రయివేటు, వ్యవసాయేతర రంగాల వాటా పెరుగుతున్నది. పబ్లిక్ రంగ సంస్థల వాటా తగ్గుతున్నది. సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. వ్యవసాయ కూలీల వేతనాలు తగ్గుతున్నాయి. ఉద్యోగాల కల్పన లేదు. ప్రయివేట్ సెక్టార్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 66శాతం మంది తాత్కాలిక, క్యాజువల్ ఉద్యోగులే. ఉపాధి కల్పనకు సంఘటిత రంగం ఏ మాత్రం తోడ్పాటునందించడంలేదు. ఈ పరిణామాలన్నీ ఆర్థిక అసమానతలు పెరగడానికి కారణమవుతున్నాయి.
సంపదలో అసమానతలు: 1990 తర్వాత సంపదలలో అసమానతలు తీవ్రంగా పెరిగాయని నివేదిక తెలియజేసింది. సంపదలో అసమానతలు జన్మించిన కులాన్ని బట్టి, చేస్తున్న వృత్తులను బట్టి విపరీతంగా పెరిగాయని నివేదిక తెలిపింది. సంపదలో అసమానతలు ఆదాయం, వినియోగిత అసమానతల కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. గత పదేండ్లలో శత కోటీశ్వరుల సంపద పది రెట్లు పెరిగింది. జీడీపీలో ఇదివరకు 10శాతం ఉన్న శత కోటీశ్వరుల వాటా ఇప్పుడు 15శాతానికి పెరిగింది. పైనున్న 10శాతం మంది దగ్గర 77.4శాతం సంపద ఉంటే, అందులో టాప్ ఒకశాతం మంది దగ్గర 51.53శాతం సంపద ఉందని నివేదిక అంచనా వేసింది. అలాగే క్రింది 60శాతం మంది కేవలం 4.8శాతం సంపదను కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత ఇండియాలోనే శతకోటిశ్వరుల సంఖ్య ఎక్కువ. పేదలు, ఆకలితో ఉన్నవారు, సరైన పోషకాహారం లేని వారి సంఖ్య కూడా భారతదేశంలో ఎక్కువ. పర్యావరణ సూచీలో, పిసా స్కోర్లో, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం చివరి స్థానంలో ఉంటుంది
సంపాదన మార్గాలను రెంట్ థిక్ సెక్టార్, నాలెడ్జ్ సెక్టార్, ఇతర రంగాలుగా విభజించుకుంటే సంపద కేంద్రీకరణ ఎందుకు జరుగుతుందో సులభంగా అర్థమవుతుంది. రెంట్ థిక్ సెక్టార్కు సంబంధించిన కోటీశ్వరులు ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు, పర్మిట్ల ద్వారా తమ సంపదను పెంచుకుంటున్నారు. ఇందులో రియల్ఎస్టేట్, మౌలిక వసతులు, నిర్మాణరంగం, మైనింగ్, సిమెంటు, టెలికాం లాంటి రంగాలు ఉంటాయి. నాలెడ్జ్ ఆధారిత రంగాలుగా ఐటీ, ఫార్మాసూటికల్ తయారీ రంగం ఉంటాయి. రెంట్ థిక్ సెక్టార్ బిలియనీర్ల సంపద 132 బిలియన్ డాలర్లు కాగా నాలెడ్జి బేస్డు సెక్టార్ బిలియనీర్ల సంపద 55 బిలియన్ డాలర్లు. సర్వీస్ సెక్టార్ బిలియనీర్ల వాటా 20శాతం మాత్రమే. ఇందులో పరిశోధన, సర్వీసులను అందించడం ద్వారా సంపదను పెంచుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం బిలియనీర్లలో 43శాతం మంది రెంట్ థిక్ సెక్టార్ నుంచి రాగా వారి సంపద మొత్తం బిలియనీర్ల సంపదలో 60శాతంగా ఉన్నది. అంటే పెరుగుతున్న బిలియనీర్ల సంపదకు కారణం వారి తెలివితేటలు, సృజనాత్మకత, మార్కెట్ నియమాలకు అనుగుణంగా వ్యాపారం చేయడం కాదన్నమాట. ప్రభుత్వ విధానాలను తమకు అనుకూలంగా మలచుకోవడం రాజకీయ నాయకులతో వ్యాపార దోస్తీలు చేయడం, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలను అవలంభించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మాత్రమే వారు తమ సంపదలను పెంచుకో గలుగుతున్నారన్నది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ప్రస్తుతం బ్యాంకుల్లో పెరుగుతున్న ఎన్పీఏలను, బయట పడుతున్న వ్యాపార స్వామ్య అవినీతి భాగోతాలను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అలాగే కార్పొరేట్లు ప్రభుత్వాలకు తాము చెల్లించాల్సిన పన్నులు కట్టకుండా తమ సంపదను పెంచుకుంటున్నాయి. ఉదాహరణకు 2005-06లో 2,06,700 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోగా(రెవెన్యూ ఫొర్ గాన్) 2014-15 లో అది 589285 కోట్లకు చేరింది. అంటే పదేండ్లలో ఇది మూడురెట్లు పెరిగింది. పేదలకు ఇచ్చిన సబ్సిడీల కన్నా కార్పొరేట్లకు ఇచ్చిన రాయితీలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇవన్నీ సంపద కేంద్రీకరణకు కారణమవుతున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థవంతంగా పని చేయాలంటే అసమానతలు తొలగించాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నవారు ఆర్థిక వనరులు ఎక్కువగా ఉన్న వారితో పోటీ పడలేరు. ఆర్థికంగా బలంగా ఉన్న వారు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసి ప్రభుత్వాలను తమకు అనుకూలంగా ఉండేట్టుగా చేసుకోగలుగుతున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు అలాగే సామాజిక సంబంధాలకు విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ప్రభుత్వ విధానాల ద్వారా అసమానతలను తగ్గించే చర్యలను ప్రభుత్వాలు తీసుకోవాలి. పన్ను విధానంలో మార్పులు, వారసత్వ ఆస్తి బదలీపై టాక్స్ అలాగే సంపదపై టాక్స్ విధించడం ప్రభుత్వాలు చేయాలి. ఆస్తులు, ఆదాయాల పంపిణీలో ఉన్న అసమానతలు తొలగించే ప్రయత్నాలను చేపట్టాలి. 1991తర్వాత వచ్చిన విధానాలు అన్ని రంగాలలో ప్రయివేటు రంగానికి పెద్దపీట వేశాయి. ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత పెరగాలి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం నుంచి అలాగే మార్కెట్ ఆధారిత విధానాల నుంచి ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే సమ్మిళిత అభివృద్ధి విధానాలను ప్రభుత్వం పాటించినప్పుడు అసమానతలు కొంతమేరకయినా తగ్గుతాయి.
- కె. వేణుగోపాల్
సెల్: 9440244277