Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆపద సమయంలో సమాచారం అందుకున్న వెంటనే అక్కడ వాలిపోయి అపర సంజీవనిగా పేరు పొంది, ప్రాణం పోసే ప్రాణదాతలుగా నిలుస్తున్నారు 108 సిబ్బంది. ఎందరికో ప్రాణం పోసే 108 సిబ్బంది నేడు చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 108 వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతీ జిల్లాలో విస్తీర్ణం, జనాభా పరంగా 108 వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్క వాహనానికి ఒక పైలెట్, ఒక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ను నియమించారు. ఈ సిబ్బంది గత 13ఏండ్లుగా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వీరు అనునిత్యం అత్యవసర సేవలు అందిస్తున్నా.. కనీస ఉద్యోగ భద్రతకు మాత్రం అసలు నోచుకోవడం లేదు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా 12గంటలపాటు ఏకదాటిగా విధినిర్వహణతో మానసికంగా కుంగిపోతున్నారు. కార్మిక చట్టాలు ప్రతీ కార్మికుడు రోజులో 8గంటలు మాత్రమే పనిచేయాలని చెబుతున్నాయి. కానీ, 108 సిబ్బంది మాత్రం రోజులో 12గంటలు, కొన్ని కొన్ని సమయాల్లో 2-3గంటలు అదనంగా చేయాల్సి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 108ను పబ్లిక్, ప్రయివేటు పార్ట్నర్షిప్ అనే పద్ధతిలో 2009లో జీవీకే సంస్థకు కట్టబెట్టారు. ఆ విధానమే కార్మికుల పాలిట పెనుశాపంగా మారింది. అత్యవసర కేసులను అటెండ్ చేసే అంబులెన్స్లకు స్పీడ్ లాక్లను వేసి మైలేజ్ సరిగ్గా రావడం లేదని పైఅధికారుల నుంచి ఒత్తిడి, ఆపైనా అంబులెన్స్లు రిపేర్కు వచ్చినా పట్టించుకోకుండా సిబ్బందిని మాత్రం చేస్తే చేయండి.. లేదంటే మానేయండి అన్నట్టుగా దురుసుగా మాట్లాడటం పరిపాటిగా మారింది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో 108 సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నా వారికి సంస్థ వారు ఇస్తున్న జీతం నెలకు రూ.12-15వేలు మాత్రమే. వీరు సర్వీస్ పరంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరు పనిచేసే సంస్థ కార్మిక చట్టం పరిధిలోకి రాదని, కాబట్టి వీరి సమస్యలని మేము పరిష్కరించలేమని కార్మికశాఖ వారు చేతులెత్తేసారు. త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న వీరిని వైద్యారోగ్యశాఖ పరిధిలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖకు సూచించారు. జీవో నెం.14 కింద ఈ సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించాలని తెలిపారు. కానీ, విచిత్రమేంటంటే సీఎం సిఫారసు చేసి ఏడాది దాటి ఆయన రెండవసారి ముఖ్యమంత్రైనా సంబంధిత శాఖ పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా 108 సిబ్బంది ప్రధానంగా కోరుకునేది.. ఉద్యోగులను కేడర్ల వారీగా మెడికల్ రికార్డు ప్రకారం గుర్తించి మెడికల్ అండ్ హెల్త్ చట్టం పరిధిలోనికి తీసుకురావడం. అదే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం. వైద్యారోగ్య శాఖలో వివిధ ఏజెన్సీల కింద పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించినట్టుగానే 108 సిబ్బందిని కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సమస్యలను పరిష్కరించకుంటే 108 సిబ్బంది భవిష్యత్తులో ఆందోళన బాట పట్టక తప్పదు.
- సిహెచ్. శ్రీనివాస్
సెల్ : 9603471199