Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతానికి చెందిన సంస్క త శ్లోకాలు చెప్పించటాన్ని సవాల్ చేస్తున్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) సుప్రీంకోర్టులో 2018 జనవరి నుంచి విచారణలో ఉంది. విషయ ప్రాధాన్యత దృష్ట్యా ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా ఈ ఏడాది జనవరి 28న తీర్మానించారు. ఆ సందర్భంలో ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ''సుప్రీంకోర్టు ఎంబ్లమ్ పైనున్న 'యతో ధర్మస్తతో జయః' అనేదీ సంస్క త శ్లోకం గనుక, దానినీ తొలగించాలని రేపు ఎవరైనా సవాల్ చేస్తే తొలగిస్తారా?'' అని మెహతా ధ్వజమెత్తారు. ఇలాంటి కీలక విషయాలు ముందుకొస్తున్న నేపధ్యంలో లౌకిక రాజ్యం, అందులో విద్యారంగం పాత్రను పరిశీలించాలి.
''లౌకిక రాజ్యంలో అధికారిక మతం అనేది ఉండదు. ప్రభుత్వం ఏ మతానికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ వ్యవహరించ కూడదు. మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల తటస్థంగా ఉండాలి. ఏ మతానికీ ప్రాధాన్యత గానీ, ప్రోత్సాహం గానీ, అవకాశం గానీ కల్పించకూడదు. మత సంస్థలకు, మతపరమైన కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులను వెచ్చించకూడదు.'' ఇదీ సెక్యులర్ స్టేట్ గురించి వికీపీడియాలో ఉన్నది. లౌకికరాజ్యం అంటే మతంతో, ఆధ్యాత్మికతతో సంబంధం లేనిదని ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి తదితర ప్రామాణిక నిఘంటువుల నిర్వచనం. ప్రపంచంలో అత్యధిక దేశాలు లౌకిక రాజ్యాలుగానే పరిగణింపబడుతున్నవి. భారత దేశంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్, సింగపూర్, దక్షిణ కొరియాతో సహా 96దేశాలు లౌకిక రాజ్యాలుగా ఉన్నవి. మతపరమైన విశ్వాసాలతో కూడిన రాజ్యాంగం, చట్టాలు, పరిపాలనా పద్ధతులు గల దేశాలు 51ఉన్నవి. అవి ఇంగ్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, స్విట్జర్లాండ్, పాకిస్థాన్, ఇరాక్, ఇరాన్, ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్ మున్నగునవి.
సెక్యులర్ స్టేట్సుగా చెప్పుకుంటున్న కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా వివిధ సందర్భాల్లో ఆయా దేశాల్లోని మతాచారాలు పాటించడం, మతాల అవసరాలు తీర్చడం జరుగుతోంది. అలాంటి వాటిలో మన భారతదేశం చెప్పుకోదగింది. అధికారిక కార్యక్రమాల్లో మతాచారాలు పాటించడం, మత సంస్థల నిర్వహణలోని విద్యాలయాలకు గ్రాంట్స్ యివ్వడం, ప్రభుత్వ స్థలాలు కేటాయించడం మొదలైనవి. మరోవైపు అలాంటి చర్యలకు నిరసనలు, ప్రతిఘటనలు కూడా జరుగుతూనే ఉన్నవి. సెక్యులర్ విలువలను పాటించాలనే ఉద్యమాలు కూడా ఊపందుకుంటున్నవి. ఆ కోవకు చెందినదే కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతాచారాల పాటింపుపై సుప్రీంకోర్టులో నడుస్తున్న న్యాయపోరాటం. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్ పూర్ నివాసి అడ్వకేట్ వీనాయక్ షా పిల్లలు కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు. ఆయనే సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ వేసింది. పాఠశాల ప్రార్ధనా సమయంలో విద్యార్థులతో ''అసతోమా సద్గమయా, తమసోమా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగ మయా, ఓం శాంతి శాంతి శాంతిః'' అనే బృహదారణ్యక ఉపనిషత్తులోని శ్లోకాన్ని చెప్పిస్తున్నారు. అది విద్యార్థుల్లో మత విశ్వాసాన్ని జొప్పించటమేనని, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందనీ, రాజ్యాంగం ఆర్టికల్ 28(1)కి విరుద్ధమైందనీ అందువలన ఆ పద్ధతిని నిషేధించాలని షా కోరారు. పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ఏ మతానికి సంబంధించిన విషయాలనూ బోధించకూడదని రాజ్యాంగ ఆదేశం. కేంద్రీయ విద్యాలయాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తున్నవి. దేశంలో ఎక్కడికైనా బదిలీ జరిగే అవకాశం గల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రక్షణ, పారా మిలిటరీ సిబ్బంది పిల్లల చదువు కోసం ఈ పాఠశాలలు ఏర్పాటు చేయబడినవి. ఇవి దేశవ్యాప్త పాఠశాలలు కావటం వలన సిలబస్, యూనిఫామ్, ప్రార్ధన, ఎకడమిక్ కేలండర్ ఒకే విధంగా ఉంటాయి.
కేంద్రీయ విద్యాలయాల వలెనే కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కూడా అలాంటి ప్రార్థనలే చేయిస్తున్నారు. నవోదయ విద్యాలయాలకు ''సెంటర్స్ ఆఫ్ ఎక్సులెన్స్'' అనే పేరుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య అందివ్వబడుతోంది. వసతులు, ఆహారం, చదువు నాణ్యతగానే ఉంటాయి. అంతర్లీనంగా హిందూ మత ప్రచారం కూడా జరుగుతుందని ఆ పాఠశాలలో చదివిన అలోకానంద బిసోరు యిటీవల 'యూత్ కీ ఆవజ్.కామ్' అనే ఆన్ లైన్ పత్రికలో రాశారు. భోజనం చేసే ముందు ''ఓం సహనావ వతు, సహ నవ్ భునక్తు, సహ వీర్యం కరవావహవ్, తేజస్వి నావ్ అధితమ్, అస్త్ మా విద్విస్సావహవ్, ఓం శాంతి శాంతి శాంతిః'' అనే క్రిష్ణ యజుర్వేద తైత్తరీయ ఉపనిషత్తులోని శ్లోకం చెప్పిస్తారు. పాఠశాల ప్రారంభ సమయంలో జరిగే ప్రార్థనలో రోజుకో విద్యార్థితో మైకులో నేటి సూక్తి పేరుతో భగవద్గీత లేదా వేదాల్లోని ఒక శ్లోకాన్ని, దాని అర్థాన్ని చెప్పిస్తారు. మిషనరీ స్కూల్సులో క్రైస్తవ మతం గురించి, మదర్సాల్లో ఇస్లాం మతం గురించి చెబుతున్నట్టు ఎప్పుడైనా పత్రికల్లో వార్తలు వస్తే అదేమి పని అని చాలామంది ప్రశ్నిస్తుంటారు. అవి ప్రయివేట్ యాజమాన్యం లోని కొద్దిమంది విద్యార్థులు ఉండే పరిమిత సంఖ్యలోని పాఠశాలలు. ముస్లిం విద్యార్థుల్లో కేవలం మూడుశాతం మంది మాత్రమే మదర్సాల్లో చదువుతన్నట్టు సచార్ కమిటీ నివేదిక పేర్కొన్నది. కానీ 13కోట్లమంది విద్యార్థులు చదివే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల్లో జరుగుతున్న హిందూమత ప్రచారం గురించి ప్రశ్నించరేమి అని బిసోరు అడుగుతున్నాడు.
నిజమే, ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా హిందూమత ఆచారాలు, పద్ధతులు పాటించడం జరుగుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉత్సవాల్లో మహాత్మాగాంధీ ఫోటోకి కుంకుమబొట్లు పెట్టడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరొత్తులు వెలిగించడం చేస్తున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాల్లో కూడా భోజన సమయంలో ఓం శాంతి శ్లోకాలు చెప్పిస్తారు. వినాయక చవితి రోజుల్లో విగ్రహాలు పెట్టి పూజలు చేయడం కూడా కొన్ని స్కూల్స్, హాస్టల్సులో జరుగుతోంది. యోగా నేర్పడం కోసం ఈషా ఫౌండేషన్, మధ్యాహ్న భోజనం పేరుతో అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటి హిందూత్వ సంస్థలకు అవకాశం కల్పించటం జరిగింది. సరస్వతీ విగ్రహాలు ప్రతిష్టించడం షరా మామూలే. మధ్యప్రదేశ్, హర్యానా తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులతో ఉదయం సూర్య నమస్కారాలు చేయిస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠాలు చేరుస్తున్నారు. మహారాష్ట్రలోని కాలేజీల్లో భగవద్గీత పుస్తకాలు పంచిపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ జిల్లాలోని మూడవ తరగతి విద్యార్థులకు 'సెయింట్స్' అనే పాఠంలో ఆశారామ్ బాపూ గురించి కూడా చేర్చారు. అతను తన ఆశ్రమంలో 16ఏండ్ల అమ్మాయిపైన అత్యాచారం చేశాడనే కేసులో 2013నుంచి జైల్లో ఉంటున్నాడు. ఆ పుస్తకాలను చత్తీస్ఘడ్ రాష్ట్రం బస్తరు జిల్లాలో కూడా పంపిణీ చేశారు. అన్నిటికీ మించి సైన్స్ కాంగ్రెస్ సభల్లోనే ప్రధానమంత్రి, విద్యాశాఖ మంత్రులు, వైస్ ఛాన్సలర్లు రామాయణం, మహాభారతం గురించి కీర్తించడం తెలిసిందే.
విద్యాలయాలు సమాజానికి సూక్ష్మ రూపాలంటారు. రాజ్యాంగ ఆదేశమైన లౌకిక విలువలను విద్యార్థి దశ నుండే నేర్పాలి. మతాచారాలు, పద్ధతులను నిరత్సాహపర్చాలి. మత సంబధిత పాఠాలను నిషేధించాలి. ఈ పని చేయగలిగే అవకాశం అందరికంటే ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉంటుంది. కానీ సమాజంలో హిందూమత ఆధిపత్య ప్రభావం వలన ఆ పని సరిగా చేయలేక పోతున్నారు. అభ్యుదయ, లౌకిక భావజాలం గల ఉపాధ్యాయులు గణనీయంగానే ఉన్నా పరిస్థితిని పెద్దగా ప్రతిఘటించలేక పోతున్నారు. వినాయక్ షా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చే తీర్పు విద్యారంగంలో లౌకిక రాజ్యం పునాదులను బలపర్చటానికి తోడ్పడాలని ఆశిద్దాం.
- నాగటి నారాయణ
సెల్: 9490300577