Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''హతవిధీ..! విన్నారా, విన్నారా! నేనొక్కడినే విన్నానా.. మీరందరూ విన్నారా? ఎంత అన్యాయం..!'' పానుగంటివారి సాక్షి సంపుటిలో ఒకానొక వ్యాసంలో జంఘాలశాస్త్రి సభలో ప్రవేశిస్తూ పలికే తొలి పలుకులివి. 'ఆంగ్లమైతే మహ బాగా మాట్లాడుతాను.. నాకు తెలుగు సరిగా రాదం'టూ గొప్పలు పోయే తెలుగు వాళ్లపై పానుగంటివారు వదిలిన వ్యంగ్య బాణమది. నేడు దేశ ప్రజలు కూడా ఇదే రీతిన విస్తుపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రాఫెల్ ఒప్పందంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పార్లమెంట్కు మొన్న.. అనగా.. 13 ఫిబ్రవరి, 2019న సమర్పించబడిందన్న వార్త మరుసటి రోజున చదివిన దేశ ప్రజలు.. జంఘాలశాస్త్రి లెవెల్లో ఆశ్చర్యపోతున్నారు. ''ఏమిటిది? ఇప్పుడు పేపర్లు చెప్తున్నది నిజమా? నాడు సుప్రీంకోర్టు చెప్పింది నిజమా..?'' అంటూ.. ఏదీ తేల్చుకోలేక.. బుర్రలు గోక్కుంటున్నారు.
రాఫెల్ ఒప్పందంపై కాగ్ నివేదిక మొన్న.. 13 ఫిబ్రవరి, 2019న పార్లమెంటుకు చేరిందన్న వార్త నిజమే అయితే.. మరి డిసెంబర్ 2018లో రాఫేల్ కుంభకోణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించబడిన కాగ్ నివేదిక సంగతేమిటి? రాఫేల్ ఒప్పందంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేటికి రెండు నెలల క్రితం వెలువరించిన తీర్పు ప్రకారం.. రాఫేల్ ధరలపై కాగ్ నివేదిక ఆనాటికే పార్లమెంటుకు సమర్పించబడింది. ఆ విషయాన్ని స్వయంగా మోడీ ప్రభుత్వపెద్దలే సుప్రీంకోర్టుకు తెలిపారు. తన ముందు ఉంచబడిన అంశాల వెలుగులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాగ్ నివేదిక అప్పటికే పార్లమెంటుకు సమర్పించబడిందన్న అంశం ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తే.. మరి ఇప్పుడు.. 13 ఫిబ్రవరి 2019న కాగ్ నివేదిక పార్లమెంటుకు చేరడమేమిటి? ఏది వాస్తవం? సుప్రీంకోర్టు నమ్మినది వాస్తవమా? నేడు జరుగుతున్నది వాస్తవమా? ఏది సత్యం? ఏదసత్యం??
రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియలో మోడీ ప్రభుత్వం అక్రమాలకు ఒడిగట్టిందని ఆరోపిస్తూ.. మొదట మనోహర్ లాల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఆ పిదప.. ఆమ్ ఆద్మీపార్టీ ఎంపీ సంజరు సింగ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హాలు సైతం ఇదే అంశంపై పిల్ దాఖలు చేసి.. కేసులో ఇంప్లీడ్ అయ్యారు. ప్రధానంగా మూడు అంశాలపై వీరు ప్రశ్నలు లేవనెత్తారు. యుద్ధవిమానాల కొనుగోలు కాంట్రాక్టును ఫ్రాన్స్ దేశపు దస్సాల్ట్ కంపెనీకి కట్టబెట్టే క్రమంలో.. నిర్ణయ ప్రక్రియలో జరిగిన లోపాల గురించి, గత ప్రభుత్వ హయాంలో ఒప్పుకున్న దాని కంటే అధిక ధరలను దస్సాల్ట్ కంపనీకి చెల్లించడం గురించి, భారత ఆఫ్ సెట్ భాగస్వామిగా అనిల్ అంబాని కంపనీ 'రిలయన్స్ డిఫెన్సు' ఎంపిక గురించి.. పిటిషనుదారులు ప్రధానంగా ప్రశ్నించారు. ఈ అంశాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి సమాధానమివ్వాల్సిందని ఆదేశించింది. యుద్ధవిమానాల కొనుగోలు ప్రక్రియ దేశరక్షణతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. మేం ఇవ్వాల్సిన సమాధానాలు సీల్డ్ కవర్లో అందజేస్తామని.. సదరు అంశాలను కేవలం న్యాయమూర్తులే చూడాలని, ప్రతివాదులకు సైతం ఆ వివరాలు ఇవ్వకూడదంటూ మోడీ ప్రభుత్వం మెలిక పెట్టింది. దేశ రక్షణ అంశాన్ని మోడీ ప్రభుత్వం లేవనెత్తిన కారణంగా.. కోర్టు సైతం అందుకు సరేనంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సమాధానాలను 31.10.2018న ప్రభుత్వ న్యాయవాదులు సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీం కోర్టుకు సమర్పించారు. వాద ప్రతివాదాలు విన్న తర్వాత.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ కే.యం. జోసెఫ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. డిసెంబర్ 14, 2018న తీర్పు వెలువరించింది. 29 పేజీలలో వెలువడిన తీర్పులో.. రాఫేల్ విమానాలకు చెల్లించే ధరలలో పెంపుదల అంశాన్ని పేరాగ్రాఫ్ 24, 25, 26లలో సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ''గత ప్రభుత్వ ఒప్పందపు ధరలు దేశానికి లాభదాయకమా.. లేక ప్రస్తుత ప్రభుత్వ ఒప్పందపు ధరలు లాభదాయకమా.. అంటూ పోలికలు చేసే పనిని కోర్టు చేపట్టదలచుకోలేద''ని తీర్పునిచ్చిన ధర్మాసనం.. ఆ నిర్ణయానికి రావడానికి గల కారణాలను ఇలా వివరించింది: ''ప్రభుత్వ పక్షం సీల్డ్ కవర్లో అందజేసిన సమాధానాల ప్రకారం.. దస్సాల్ట్ కంపనీతో ఒప్పందం చేసుకున్న ధరల వివరాలు సున్నిత అంశాలైన కారణంగా ఎవరికీ తెలుపలేదని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే సదరు ధరల వివరాలన్నింటిని కాగ్కి తెలిపామని కూడా ప్రభుత్వం చెప్పింది. ఆ వివరాలతో కాగ్ ఒక నివేదిక తయారు చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందచేసిందని, సదరు నివేదికలోని సున్నిత అంశాలను తొలగించిన తర్వాత ఒక సంక్షిప్త నివేదికను తయారు చేసి పార్లమెంటుకు సమర్పించడం కూడా జరిగిందని, సదరు సంక్షిప్త నివేదిక ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నదని ప్రభుత్వ పక్షం తెలియజేసింది. ప్రస్తుత ఒప్పందపు ధరలు వాణిజ్యపరంగా మనకు లాభదాయకమైనవేనని కూడా ప్రభుత్వ పక్షం తెలిపింది. ఈ అంశాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమున్నది కాబట్టి ఇక ఈ విషయంలో మేము చెప్పేదేమీ లేదు'' అన్న ఆ వివరణ సారాంశం.
సుప్రీంకోర్టు ఈ రీతిన తీర్పు ఇవ్వడానికి ప్రధాన కారణం.. సీల్డ్ కవర్ మాటున మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సైతం అబద్ధాలు చెప్పడమేనని నేడు స్పష్టమవుతున్నది. ఇప్పుడు తేలుతున్నదాని ప్రకారం మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజెప్పిన అబద్ధాలు నాలుగు: 1. రాఫెల్ ధరలపై కాగ్ ఒక నివేదిక తయారు చేసింది. 2. ఆ నివేదికను పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అందచేసింది. 3. కొన్ని సున్నిత అంశాలను తొలగించి సదరు నివేదికను పార్లమెంటుకు సమర్పించారు. 4. సదరు నివేదిక ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన డిసెంబర్ 14నే.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ ఖర్గే న్యూఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. రాఫెల్ ధరలపై కాగ్ నివేదిక పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీకి చేరిందనటం అబద్ధమేనంటూ కుండబద్దలు కొట్టాడు. పీఏసీ చైర్మన్ హౌదాలో కాగ్ సిబ్బందిని కూడా ఈ రోజు ఉదయమే నేను నిలదీసి అడిగానని, అలాంటి రిపోర్టేమీ ఇంకా తయారు చేయలేదనేది కాగ్ సిబ్బంది నాకు తెలిపారంటూ కూడా ఖర్గే తేల్చి చెప్పారు. ఇక.. సదరు నివేదిక పబ్లిక్ డొమైన్లో లేనేలేదని దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు.. ఫిబ్రవరి 13, 2019న రాఫేల్ ధరలపై కాగ్ నివేదిక పార్లమెంటుకు చేరడంతో కాగ్ నివేదిక ఇప్పటికే పార్లమెంటుకు సమర్పించామంటూ 31.10.2018న మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు వల్లె వేసినది పూర్తి అబద్ధమేనని బట్టబయలైంది.
''దేశ రక్షణకు చెందిన అంశాలు'' అనే నెపం మాటున అడ్డగోలుగా సుప్రీం కోర్టును బుకాయించి చేజిక్కించుకున్న తీర్పును తమకు దక్కిన ''కాండక్ట్ సర్టిఫికెట్''గా ప్రజల ముందు చూపుతూ.. ప్రజలని మోసగించాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నది. సీల్డ్కవర్లో తమకు సమర్పించిన సమాధానాలు అవాస్తవాలేనంటూ.. తదనంతర పరిణామాలు ధవీకరిస్తున్నా.. సుమోటోగా పునర్విచారణ చేపట్టాల్సిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం మిన్నకుండిపోవడం బాధాకరం. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వ పెద్దలు అబద్ధాల మీద అబద్ధాలు వల్లెవేస్తూ పోయారని నేడు దేశ ప్రజలందరికీ అవగతమవుతున్నది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులోనూ, అనిల్ అంబానీ కంపెనీకి ఆఫ్ సెట్ కాంట్రాక్టు కట్టబెట్టే క్రమంలోనూ కచ్చితంగా గోల్ మాల్ జరిగిందన్న సత్యం నేడు రూఢ అవుతున్నది. ఆ గోల్మాల్ వ్యవహారాల్ని కప్పిపుచ్చడానికే కాగ్ నివేదిక పేరుతో మోడీ సర్కార్ సుప్రీం కోర్టుకు అబద్ధాలు చెప్పింది. ''ద హిందూ'' దినపత్రిక బయటపెట్టిన రక్షణ శాఖ పత్రాల ఆధారంగా.. రక్షణ శాఖ అధికారులు దస్సాల్టు కంపెనీతో ఒప్పందం గురించి చర్చలు జరుపుతుండగా.. మోడీ కార్యాలయం స్వయంగా దస్సాల్టు కంపెనీతో సమాంతర చర్చలు జరిపిందని నేడు నిరూపితమైంది. రక్షణ శాఖను పక్కకుపెట్టి.. ప్రధానమంత్రి కార్యాలయం దస్సాల్టు కంపెనీతో సమాంతర చర్చలు నెరపిన కారణంగానే.. ఒప్పందంలో భాగంగా మనకు దక్కాల్సిన ''సావరిన్ గ్యారెంటీ'' మనకు దక్కలేదని కూడా నేడు నిరూపితమైంది. ఈ అంశంలో సైతం మోడీ సర్కారు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది. దేశ రక్షణను ప్రమాదంలో పడవేస్తూ.. రాఫేల్ ఒప్పందంలో మోడీ ప్రభుత్వం చేసిన అక్రమాలపై.. ఇక తీర్పు ప్రజా న్యాయస్థానమే చెప్పాల్సింది.
- ఆర్. రాజేశమ్
సెల్ : 9440443183