Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర హౌం శాఖ పది నిఘా సంస్థలకు అధికారమిస్తూ పౌరుల లావాదేవీలపై ఓ భూతద్దపు కన్నేసి ఎవరెవరు తమతమ మెయిల్స్లో, కంప్యూటర్లలో, ఇతర మాద్యమాలలో ఏఏ రకమైన సమాచారాన్ని పంపుకుంటున్నారో లేదా దాచుకుంటున్నారో చూడమన్నది. ఉన్న ఫళంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదో భయంతో ప్రభుత్వం వణికి పోతున్నదనేది నిగూఢంగా అర్థమౌతున్నది. కారణాలు చెప్పకుండా ఆదేశాలివ్వడం అనుమానాలకు తావిస్తోంది. వ్యక్తుల లేదా సంస్థల మధ్య ఏ సమాచార మార్పిడియైనా దేశభద్రతకు లేదా దేశ అంతర్గత కలహాలకు దారి తీసేదై ఉండరాదన్నది ప్రభుత్వ అభిమతమై ఉండవచ్చు. ఈ అభిమతాన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కానీ నిర్దేశిత లక్ష్యాలు లేకుండా ప్రయత్నిస్తే ఎలుకను పట్టుకోవడానికి కొండలను తవ్వుకుంటూ పోవడమే అవుతుంది. అయితే ఈ క్రమంలో తీవ్రవాదులకన్నా సాధారణ పౌరులే ఎక్కువగా ఇబ్బంది పడతారు. కేంద్రం ఉద్దేశం ప్రకారం నిఘా సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలపై దృష్టి పెడితే ఓకె. ఆ పరిమితి దాటి ప్రభుత్వంపై గానీ లేదా ప్రభుత్వ పెద్దలపై గానీ విమర్శలు చేసిన వారిని తీవ్రంగా పరిగణిస్తూ అరెస్టులు గట్రా వంటి వాటికి పాల్పడితే కేంద్రం యొక్క దురుద్దేశం బయట పడుతుంది. ఇప్పటి వరకూ పట్టుబడిన తీవ్రవాద కార్యకలాపాల గుట్టు ఇంటలిజెన్స్ విభాగం ద్వారానే జరిగింది గానీ సాంకేతిక మాధ్యమాల ద్వారా మాత్రం కాదు.
నిఘా పెట్టాలి
అయితే ఈ రోజు దేశ భద్రతకు ముప్పు అంతర్గత సమాచార ప్రసరణ కన్నా బహిరంగ ప్రేరేపణల వల్లనే చాలా ఎక్కువగా ఉన్నది. రాజకీయ ఉపన్యాసాలకు తాళం వేయకుండా భద్రత సాధించలేం. ఒక రాజకీయ పార్టీని మరొకరు విమర్శించే క్రమంలో వారు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టడం వల్లనే అంతర్గత కలహాలు రేగుతున్నాయి. ఈ కలహాలను సదరు రాజకీయ పార్టీల వారే అంతర్జాతీయ అంశాలను స్పశించి లేని చిచ్చును రేపుతున్నారు. ఉదా: కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, కాంగ్రెస్లు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సందర్భంలో బీజేపీ నాయకులు రాంమాధవ్ స్పందిస్తూ ''ఇన్నాళ్ళూ ప్రభుత్వ ఏర్పాటుపై ఏమీ మాట్లడని వారు ఎప్పుడు అక్రమ కూటమి కట్టడానికి వారి మాస్టర్లైన పాకిస్థానీ వారి సూచనలున్నాయేమో'' అంటు మాట్లాడటం దేశంలో అంతర్గతంగానూ, అంతర్జాతీయంగానూ చాలా ప్రభావం చూపింది. బీహార్ ఎన్నికల ర్యాలీలో అమిత్షా ప్రసంగిస్తూ లాలూ, నితీష్, కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే పాకిస్థాన్లో సంబరాలు జరుగుతాయని రెచ్చగొట్టారు. తెలంగాణలో కేసీఆర్ పశ్చిమ బెంగాల్లో మమత వంటి వారు కూడా ప్రేరేపిత ఉపన్యాసాలకు పాల్పడుతున్నారు. రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం లేని భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు కూడా విద్వేషపూరిత ప్రసంగాలిచ్చి అంతః కలహాలకు ఆజ్యం పోస్తుంటాయి. ఇలాంటి వారి వల్ల చాలా ప్రమాదం ఉంది. వీరిని అరికట్టే నిఘా ఎవరు పెట్టాలి? ఇది తక్షణ కర్తవ్యం.
ఈ అర దశాబ్దంలో అత్యంత ప్రమాదకరంగా మారి ప్రజల సంబంధాలను జీవితాలను గందరగోళ పరుస్తూ చిన్నా భిన్నం చేస్తున్న అంశం సోషల్ మీడియాలోని ఫేక్ న్యూస్. అనగా అబద్ధపు, అనవసర సమాచారం. వాస్తవాలను తమకు ఇష్టం వచ్చిన రీతిలో మార్ఫింగ్ చేసి అదనపు సమాచారాన్ని జోడించి ప్రచారంలో పెట్టడం కోసం కొన్ని సంస్థలే ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన సమాచారాన్ని ప్రచారంలో పెట్టడం కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ నడుపుతున్నాయి. స్వచ్ఛంద సంస్థలు తమను తాము ఉన్నదానికన్నా గొప్పగా చిత్రీకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచ అత్యుత్తమ ప్రధానిగా ఐక్యరాజ్యసమితి గుర్తించిందని ఒక పోస్టు విపరీతంగా చక్కర్లు కొడుతుంటది. భారత జాతీయ గీతాన్ని ప్రపంచ అత్యుత్తమ గీతంగా ప్రకటించారని దీనిని అందరికీ షేర్ చేయాలని మరో పోస్టు చక్కర్లు కొడుతుంటది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వతంత్ర యోధుల్ని కించపరుస్తూ మరో వార్త పచార్లు కొడుతుంది. వీటిల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో, దేనిని ఫార్వర్డ్ చేయాలో దేనిని చేయకూడదో తెలియక ఇబ్బందులపాలు అవుతున్నది సాధారణ ప్రజానీకం. సమాచార మార్పిడి ఎంత సులభం అయిందో అంతకు మించిన సమస్యలను ఇప్పుడున్న సోషల్ మీడియా మనకు తెచ్చి పెట్టింది. ఫేక్ వెబ్సైట్ల ద్వారా అమాయక జనాన్ని ఆకర్షిస్తూ టికెట్లు బుక్ చేస్తామని లేదా కొనుగోలుకు సహకరిస్తామని డబ్బులు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఎందరో. ప్రజలు ఏదో చేస్తారు వారి వల్ల దేశానికి నష్టం ఉంది అంటూ నిఘా పెట్టడం కాదు ప్రజలకు జరుగుతున్న అపారమైన ఈ నష్టాన్ని నివారించేందుకు పట్టుదల, ధైర్యం ప్రభుత్వానికి రావాలి. అత్యంత కీలకంగా నిఘా పెట్టవలసిన మరో అంశం కూడా ఉంది. పసిపిల్లల మనసులు చెదిరిపోతున్నాయి అంటూ లేదా తప్పుదోవ పడుతున్నాయి అంటూ పోర్నోగ్రఫీ అనగా సామాజిక మాధ్యమాల్లో అశ్లీల/సెక్స్ ప్రదర్శనను కట్టడి చేయాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ చాలా వెబ్ సైట్లలో అలాంటివన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకునే కొందరు సెక్స్ ఎడ్యుకేషన్ పేరుమీద అవగాహన కల్పించేందుకు అంటూ వావి వరసలు మరచి అక్రమ ఆకర్షణను, వీడియోలను చిత్రీకరించి మాధ్యమాల్లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు బూతు సంభాషణను ఆడియో రికార్డింగ్ చేసి యూట్యూబ్లో, ఇతర మాధ్యమాలలో అందుబాటులో ఉంచుతున్నారు. గూగుల్లో ఒక సమాచారానికి వెతుకుతుంటే ఇలాంటి అనవసర లింకులన్నీ తగిలి తప్పుడు పోకడలకు దారి చూపిస్తున్నాయి. సాధారణమైన వ్యక్తిగత బలహీనతలు, ఇతర కారణాల వల్ల అటువంటి వాటిని దర్శిస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. మరి సామాజిక బాధ్యత కలిగిన ప్రభుత్వం వీటిని నియంత్రించేందుకు నిఘా పెట్టవలసిన అవసరం లేదా! ఇలాంటి కీలకమైన వాటిపై నిఘా పెట్టకుండా ప్రజలను అనుమానిస్తూ నిఘా పెట్టడం అర్థరహితం.
వేధింపుల కోసమేనా?
కేంద్రం ఆదేశానుసారం దేశ అభ్యున్నతి కోసం తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చే వాదులంతా దేశద్రోహులేనా? కేంద్ర ప్రభుత్వం 10నిఘా సంస్థలకు ప్రజల కార్యకలాపాలపై నిఘా పెట్టాలని ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీనీ, ఆ పార్టీ పరిపాలిస్తున్న విధానాలనూ ప్రశ్నించిన వాళ్లందరినీ దేశద్రోహులుగా చూస్తున్నది. దేశంలోని 130కోట్ల మందిలో ఎంతమంది కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. ఎంతమంది తమ తమ లావాదేవీలను ఇంటర్నెట్ ద్వారా లేదా కంప్యూటర్ల ద్వారా జరుపుతున్నారు? మహా అయిటే ఐదుశాతం కూడా లేరు. కేంద్రంలోని బీజేపీ విధానా లను ప్రశ్నించడం లేదా బహిరంగపరచడం చేస్తున్నదంతా విలేకరులు రచయితలు సంపాదక వర్గం, వార్తా మాధ్యమాలు, ప్రతిపక్ష పార్టీలు, అసమ్మతి నాయకులు, విద్యార్థులు ఆచార్యులు, సదస్సుల్లో ప్రసంగించే ఉపన్యాసకులు. వీరందరి వల్ల దేశానికి ముప్పు వాటిల్లుతుందా?
గతేడాది బెంగళూరులో కాల్చి హత్యచేసిన పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ చేసిన తప్పల్లా అసత్య ప్రచారాల వెనుక దాగి ఉన్న సత్యాన్ని ప్రజలకు తన కలం ద్వారా వివరించడమే. గత నెలలో మణిపూర్లోని హరిచంద్ర వహన్ అనే విలేకరి తాను మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టినందుకు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అది కూడా ప్రివెన్షన్ యాక్ట్ కింద ఏ రకమైన విచారణ జరపకుండానే ఒకేడాది జైలుకు పంపించారు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఇదివరకే ఇరోం షర్మిల ఆధ్వర్యంలో ఏఎఫ్ఎస్పీఏ కి వ్యతిరేకంగా దాదాపు 20ఏండ్ల నుంచి పెద్ద ఉద్యమం సాగుతూనే ఉన్నది. ఎందుకంటే చట్టం చాటున అమాయక ప్రజలను హింసించి జైల్లో పెట్టడం జరుగుతున్నది. ఈరోజు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల చట్టాల పరిధిలో ఎలాంటి విచారణ లేకుండా ఒక వ్యక్తీ లేదా వ్యక్తులను ఒకేడాది వరకు అరెస్టు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ చట్టం కింద అరెస్టయినవారిలో అమాయకులే ఎక్కువ..! అసలు దోషులు ఎవరూ దొరకలేదు.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016