Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణులు నమ్రతగా ఉండాలని ముఖ్యమంత్రి సందేశం ఇచ్చారు. స్వాగతించదగినదే. కానీ ఆచరణలో అమలు జరిగిందా? ప్రజలకు తాము జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని పాలకులే ఖాతరు చేయటం లేదన్న విమర్శను మూటగట్టుకున్నది. ఎన్నికలు అయిపోయి రెండు నెలలు దాటిన తర్వాతగానీ మంత్రివర్గం ఏర్పాటుకు సిద్ధపడలేదు. ప్రజలకు కారణం చెప్పవల్సిన బాధ్యత తమ మీద ఉన్నదని కూడా నాయకత్వం భావించలేదు. శాసనసభా మండలి సమావేశాలను కేవలం రాజ్యాంగపరమైన తంతుగా మాత్రమే నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలతో ముగించారు. ప్రజా సమస్యలు చర్చించే అవకాశమే ఇవ్వలేదు. పూర్తి మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ ఎకౌంట్ ఎందుకు ప్రవేశపెడుతున్నారో చెప్పలేదు. కేంద్రం ఏం చేస్తే రాష్ట్రంలో అదే చేస్తామన్నారు. ఇది అర్థరహితం. ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నందు వల్ల కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టటం సాధ్యపడదు. ఓట్ ఆన్ ఎకౌంట్ రాజ్యాంగపరమైన అవసరం. ఇక్కడ అట్లా కాదు. ఎన్నికలైపోయాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టవల్సిన సమయంలో ఎందుకు దాటవేస్తున్నారో తెలియదు. శాసన మండలిలోని కాంగ్రెసు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనమయ్యారని ప్రకటించిన తీరు కూడా విస్మయం కలిగిస్తున్నది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురిపైన అనర్హత వేటు వేసిన మండలి ఛైర్మన్, టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీల మీద మాత్రం వేటు వేయకుండా విలీనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా స్పందించటం లేదు. రాష్ట్రానికి అన్యాయం చేసినా చూసీచూడనట్టుంటున్నారు. తమకు అవసరమను కున్నప్పుడే ఫెడరల్ ఫ్రంటు గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ప్రజలకు చెప్పవల్సిన బాధ్యత తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో తిరుగులేని ఆధిక్యత సాధించిన ఫలితంగా బలపడుతున్న ధోరణి ఫలితమే ఇది.
ప్రజల గోడు వినేదెవరు?
గత రెండు మాసాలుగా పూర్తిస్థాయి మంత్రివర్గం లేనందు వల్ల ప్రజల సమస్యలు పట్టించుకున్నవారు లేరు. ప్రజలగోడు ఎవరికి వినిపించుకోవాలో తెలియదు. నిజామాబాద్జిల్లాలో వేలాదిమంది పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కవల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నికలకు ముందే రావల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఇప్పటికీ అందని వారు సుమారు మూడు లక్షలమంది ఉన్నారు. దవాఖానాలలో కేసీఆర్ కిట్లు ఆగిపోయాయి. ఇతర సంక్షేమ పథకాలూ సమస్యలనెదుర్కొంటున్నాయి. బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతుకు కిలోకు రూపాయి మాత్రమే ఇచ్చి, మార్కెట్లో రూ.40కు అమ్ముతున్నారు. మధ్యదళారీలు రైతును కొల్లగొడుతున్నారు. జనవరి 8-9 తేదీలలో రాష్ట్రంలోని కార్మికులంతా సమ్మె చేసారు. అయినా కనీస వేతనాల గురించి ప్రభుత్వం స్పందించలేదు.
టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. మంత్రి లేనందువల్ల ఎవరూ బాధ్యతగా భావించటం లేదు. ఇంటర్ ప్రాక్టికల్స్ జంబ్లింగ్ చేయకుండా ఎవరి కాలేజీలో వారే నిర్వహించుకోవాలన్నారు. ఇది కార్పొరేట్ కాలేజీలకు వరం. మార్కులు వారే వేసుకుని ర్యాంకుల పంట పండించుకోవచ్చు. ప్రభుత్వశాఖల్లో వేలాది ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి.
కులవివక్ష, దాడుల పరంపర కొనసాగుతున్నది. మహబూబ్నగర్జిల్లా పొదిరిపాడు గ్రామ సర్పంచ్ బాలప్పను దళితుడన్న కారణంగా గ్రామ పంచాయతీలో నేలమీదకూర్చోబెట్టారు. ప్రభుత్వం చర్య తీసుకోలేదు. గత రెండు మాసాలుగా నిజామాబాద్జిల్లా మారంపల్లి దళితులను గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం పేరుతో సాంఘిక బహిష్కరణ అమలు చేసారు. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులుగానీ పట్టించుకోలేదు. పెద్దపల్లి జిల్లా నారాయణపూర్లో వాల్మీకిబోయ కుటుంబానికి చెందిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదనే పేరుతో అదే కులానికి చెందిన ఆరు కుటుంబాలను సంఘ బహిష్కరణ చేసారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. మహానగరం నడిబొడ్డున, ప్రతిష్టాత్మకమైన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అగ్నిప్రమాదం హౌంశాఖ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నది.
స్వప్రయోజనాలేనా?
ప్రజలు అనేక సమస్యలెదుర్కొంటున్నప్పటికీ రాష్ట్రంలో సమస్యలే లేవని దాటవేస్తున్నారు. ప్రజా సమస్యలకన్నా పాలకుల వ్యక్తిగత విశ్వాసాలూ, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హడావుడిగా శాసనసభ, మండలి సమావేశాలు ముగించి సహస్ర చండీయాగం మీదనే శ్రద్ధపెట్టారు. ఢిల్లీలో టీఆర్ఎస్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీల బృందం ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసింది. సుప్రీం తీర్పు వల్ల గ్రామపంచాయతీలలో బీసీల రిజర్వేషన్లు 34శాతం నుంచి 22.78శాతానికి పడిపోయినప్పటికీ దానిని పరిష్కరించాలని ప్రధానిని కోరలేదు. పైగా రిజర్వేషన్లు తగ్గిస్తూ తక్షణమే ఆర్డినెన్స్ జారీ చేసారు. పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న సమయమిది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తల్చుకుంటే పార్లమెంటులో చట్టం చేసి బీసీల రిజర్వేషన్లు కాపాడవచ్చు. అందుకు మాత్రం సిద్ధపడలేదు.
ధనిక రాష్ట్రంలో నిధుల కొరత!
ఇవన్నీ ఒకభాగం. పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు వాయిదాకు ఖజానాలో నిధులు లేకపోవటమేనన్నది అసలు విషయం. 'ధనిక రాష్ట్రంలో నిధుల సమస్య'కు సమాధానం చెప్పలేని పాలకులు మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయటం ద్వారా కొన్ని చెల్లింపులు వాయిదా వేసారు. మంత్రి లేనందువల్ల ఎవరిని అడగాలో తెలియని స్థితి. మంత్రివర్గం విస్తరిస్తే... వెంటనే నిధుల సమస్య ముందుకొస్తుంది. ఇదీ అసలు విషయం. ఇప్పుడు శాసనసభ, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు బాగా జరిగాయట! ఎక్సైజు, రియల్ ఎస్టేట్ ఆదాయం కొంత పోగైందట! ఆ మేరకు మంత్రివర్గ విస్తరణకు ఇప్పుడు సిద్ధపడ్డారు.
లౌకిక విలువలు గాలికి!
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి సహస్ర చండీయాగాన్ని వాడుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా యాగశాల చుట్టే తిరిగింది. అధికార పార్టీ శ్రేణులూ అదే చేసారు. పైగా రాజ్యాంగ విలువలు కూడా ఖాతరు చేయలేదు. డ్యూటీలో ఉన్న ఉన్నతాధికారులు కూడా సాష్టాంగ ప్రణామాలు చేసారు. డ్యూటీలో లేనప్పుడు వారి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ ప్రశ్నించజాలరు. డ్యూటీలో ఉండి ఈ ధోరణులేమిటన్నదే సమస్య. యాగం వ్యక్తిగతం. వ్యక్తిగత విశ్వాసాలనూ, ప్రభుత్వ వ్యవహారాలను కలగాపులగం చేస్తున్నారు. అధినేతలే రాజ్యాంగ విలువలు పాటించనప్పుడు, వారి మెప్పు పొందేందుకు తహతహలాడే అధికారులు పాటిస్తారా?
గ్రామీణ అభివృద్ధికి నిధులు
గ్రామాలలో సమస్యల పరిష్కారం రిసోర్స్ పర్సన్స్ సదస్సులో ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయి. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు, ఉపాధి హామీ నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేల నిధులు కూడా కలిపినా సుమారు 7వేల కోట్లు మాత్రమే కదా! వాటిని ఖర్చు చేసి బాగా అభివృద్ధి చేయాలన్నారు. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి ఏడాదికి సుమారు 16 లక్షల రూపాయలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ మాత్రం నిధులు ఏమూలకు సరిపోతాయి? కరెంటు బిల్లులే 2,750 కోట్లు పంచాయతీలు బకాయిపడ్డాయని ముఖ్యమంత్రే చెప్పారు. 73, 74వ రాజ్యాంగ సవరణలననుసరించి తగిన నిధులు, అధికారాలు బదిలీ చేయటం ద్వారా మాత్రమే గ్రామీణ అభివృద్ధి సాధ్యం. ఆ విషయం మాత్రం దాటవేస్తున్నారు.
తెరవెనుక...
రాజకీయంగా కేంద్రం పట్ల ముసుగులో గుద్దులాట కొనసాగుతున్నది. తెలంగాణలో సంక్షేమ పథకాలకు ఇతర రాష్ట్రాలు అభినందిస్తున్నాయనీ, కేంద్రం మాత్రం నిధులివ్వటం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని కూడా అన్నారు. ఈ సఖ్యతతో నిధులెందుకు సాధించలేకపోయారో మాత్రం చెప్పలేదు. గత నాలుగున్నర ఏండ్ల పాటు రాష్ట్ర పథకాలను మోడీ, కేంద్ర మంత్రులు ప్రశంసించారు. కేంద్రం చర్యలన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం సమర్థించింది. కేంద్రం, రాష్ట్రం పరస్పరం అభినందించుకున్నారు. నష్టపోయింది ప్రజలే!
'ఫెడరల్ ఫ్రంట్' చిత్తశుద్ధి...
కాంగ్రెసు, బీజేపీ ముక్త భారత్ గురించి రాష్ట్ర ఎన్నికల సమయంలో కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత మళ్లీ మోడీ తప్పులపై స్పందించటమే ఆపేసారు. అదేమిటని ప్రశ్నిస్తే... ఒకరిని దించటం, మరొకరిని ఎక్కించటం తమ పని కాదన్నారు. నిజమే! కానీ ఇప్పుడున్న ప్రధాని మోడీని దించకుండా బీజేపీ ముక్తభారత్ ఎట్లా సాధ్యం? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించకుండా ఫెడరల్ ఫ్రెంట్ అధికారంలోకి ఎట్లా వస్తుంది? ఫెడరల్ ఫ్రంట్ గురించి టీఆర్ఎస్ నాయకత్వం మాటల్లో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... మోడీని గద్దె దించటం ప్రథమ కర్తవ్యం కావాలి కదా! ఫ్రంట్ గురించి మమతతో మంతనాలు జరిపిన కేసీఆర్, తీరా సమయం వచ్చినప్పుడు ముఖం చాటేసారు. సీబీఐ - బెంగాల్ పోలీసుల మధ్య సమస్య తలెత్తినప్పుడు తమ వైఖరి చెప్పకుండా దాటవేసారు. ఇదే సమస్య మీద పార్లమెంటులో చర్చ వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు సభలో ఎందుకు లేరో కూడా చెప్పాలి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపారు. విభజన సమస్యలను కేంద్రం విస్మరించింది. ఇంత జరిగినా... పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సఖ్యంగా ఉన్నా ఫలితం రాలేదు. పదవీకాలం పూర్తవుతున్నది. ఈ బడ్జెట్లో కూడా తెలంగాణను కేంద్రం పట్టించుకోలేదు. అయినా ఉద్యమపార్టీ ఉదాసీనంగా ఉన్నది. ఇదెట్లా సాధ్యమైంది? కీలకమైన విషయాలలో ఇప్పటికీ మోడీ ప్రభుత్వం అభిప్రాయాలూ కేసీఆర్ అభిప్రాయాలూ దాదాపు ఒకటిగానే ఉంటున్నాయి. ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆర్బీఐ దగ్గర పదిలక్షల కోట్లున్నాయన్నారు. 'మహారత్న' ప్రభుత్వరంగ సంస్థల దగ్గర 11 లక్షల కోట్లున్నాయన్నారు. ఆ డబ్బు తీయాలన్నారు. సరిగ్గా ఇవే మాటలు మోడీ పదే పదే చెబుతున్నారు. ఆర్బీఐని డొల్ల చేయటం, లాభాల్లో ఉన్న ప్రతిష్టాత్మక ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే విషయంలో ఇద్దరిదీ ఒకే అభిప్రాయం. ఇవన్నీ బీజేపీ-టీఆర్ఎస్ల తెరవెనుక బంధం గురించి అనుమానాలకు అవకాశమిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకమున్నప్పుడు, ప్రజలకు తాము జవాబుదారీ అన్న విషయం నమ్మినప్పుడు సమాధానం చెప్పక తప్పదు.
- ఎస్. వీరయ్య