Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిలువరించవు!జమ్మూ కశ్మీర్లోని పుల్వామా లో తీవ్రవాదులు సృష్టించిన నరమేధానికి యావత్ భారతం విస్మయానికి గురైంది. తీవ్రవాదులు ఇంకెంతకాలం దాడులు కొన సాగిస్తారు? దీనికి అంతులేదా? అంటూ పలువురు ఆందోళన కారులు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ప్లకార్డులు, క్యాండిల్స్తో నిరసన ర్యాలీలు చేపట్టారు. మరికొన్నిచోట్ల ఆందోళనకారులు వాహనాలను ధ్వంసం చేయడం, తగలబెట్టడం ద్వారా కశ్మీరీలో జరిగిన దుశ్చర్య పట్ల తమ ఆగ్రహాన్ని చాటుకున్నారు. దేశసేవ కోసం సైన్యంలో చేరిన తమ బిడ్డలు ఈ విధంగా తీవ్రవాదుల దాడికి బలికావడం ఆయా కుటుంబాల్లో తీవ్రమైన ఆవేదన మిగిల్చింది. పట్టరాని దుఃఖంతో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. వీరి బాధను ఆపడం, ఆవేదనను చల్లార్చడం ఎవరితరమూ కాదు కూడా. ఇదే సమయంలో కొన్ని ప్రమాదకరమైన డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. పాక్పై ఏకరీతిన దాడి చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. తీవ్రవాద ఘటనలకు రాజకీయ రంగులు అలుముకుంటున్నాయి. హితం కాని ఈ విధానానికి విధానకర్తలే ఆయువు పోయడం ఆందోళనకరం. భారత్లో జరిగిన, జరుగుతున్న ఉగ్ర చర్యలకు పాకిస్థానే ప్రధాన కారణమంటున్నారు. ఇక ఆ దేశం మాత్రం తమవైపు వేలు చూపడం భారత్కు అలవాటు అయిందని బుకాయిస్తున్నది. ఆ దేశం కూడా తీవ్రవాద బాధిత దేశంగా తన బిడ్డల చావులను ఒడిల్లో మోస్తున్న భయాంకర పరిస్థితిలో ఉందన్నది సత్యం. ఇటువంటి విపత్కర సమయంలోనే దేశ ప్రజానీకం సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉందని మరో వాదన. ముఖ్యంగా యుద్ధం డిమాండ్ ఏ వర్గాల నుంచి వస్తోందన్నది మనకు తెలిసిన విషయమే. 40మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారి చర్యలు అత్యంత హేయనీయమనీ, ఇందుకు బాధ్యులైనవారిని తుదముట్టించేందుకు కఠిన వైఖరి కనబరచాలనీ, మరో సర్జికల్ స్ట్రయిక్ అవసరమనీ చెపుతున్నారు. అవును ఇది అక్షరాలా వాస్తవమే. తీవ్రవాదాన్నీ దాని మూలాలను కూడా కఠినంగా అణచివేయాల్సిందే. ఈ చర్య కేవలం సైన్యం చేస్తే సరిపోతుందా? సైన్యం మాత్రమే చేయగలదా? సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే లెక్క సెట్టవుతుందా? సామాన్యుడి మదిని ఇటువంటి ప్రశ్నలెన్నో తొలుస్తున్నాయి. ప్రశ్నలపై సోషల్ మీడియాలో కామెంట్లు, లైకులతో ఒక ఓటింగ్ పోల్ నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రశ్నపై కొంతమంది స్పందించిన తీరు ఉద్వేగ, భావోద్వేగాలను ప్రస్ఫుటింపజేస్తోంది. అయితే, ఇదే ప్రశ్నకు ఒక ఆర్మీ జవాను పుత్రుడు ఇచ్చిన సమాధానం కేవలం బుద్ధీజీవులను మాత్రమే కాకుండా సామాన్యులను కూడా తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. ఆ యువకుడు ఇచ్చిన సమాధానాన్ని కొంతమంది యువకులు షేర్ చేసుకొని తమ ఖాతాలో పోస్టుగా పెట్టుకుంటున్నారు. నిండా 25ఏండ్లు కూడా లేని ఆ యువకుడి పోస్టులో ఒక అర్థవంతమైన సమాచారం ఉంది. దేశం సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనవద్దని అతను గాఢంగా కోరుకుంటున్నాడు. కార్గిల్ యుద్ధంలో మరణించిన తన తండ్రిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అతని ఆవేదనలో న్యాయం ఉందనిపిస్తోంది. అవును, యుద్ధం ఎప్పుడూ విధ్వంసాన్నే తీసుకొస్తుంది. ఏలికల ఎత్తుగడల్లో చివరగా బలయ్యేది సైనికులు, సామాన్యులు తప్ప మరొకరు కాదు. ఇక ఈ దాడికి సంబంధించి భారత ప్రధాని మోడీ స్పందన పరిశీలిస్తే ఉద్వేగపూరితంగా సాగిందని చెప్పవచ్చు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తూ అమాయక యువతను పొట్టనబెట్టుకున్న ప్రతి ఉగ్రవాదికి తగు విధంగా సమాధానం చెబుతామని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్లోని ప్రతి యువకుడికి తాను హామీ ఇస్తున్నానని, ప్రతి టెర్రరిస్టుకు తగువిధంగా బుద్ధి చెబుతామని మోడీ అన్నారు. అంతకు ముందేమో ఇప్పటికే రాష్ట్రంలో ఉగ్రవాదుల వెన్ను విరిచామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యం కలిగించక మానవు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల దక్పథం ఆది నుంచీ ఒకే విధంగా ఉంటున్నది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన ప్రభుత్వాలను అక్కడ పరిపాలన చేయనివ్వడం లేదు. గతంలో కాంగ్రెస్ సైతం అదే పని చేయగా, తాజాగా బీజేపీ కూడా కాంగ్రెస్ విధానాలనే అవలంబిస్తున్నది. తమ ప్రాంతంపై ఢిల్లీ పెత్తనం ఏమిటన్న ప్రశ్న బలంగా అక్కడి యువతలో నాటుకుపోతున్నది. కేంద్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి ప్రకటిస్తున్న హామీలు నీటి మూటలుగా మారుతున్న పరిస్థితి ఆ ప్రజానీకాన్ని మరింత నిరాశా నిస్పహల్లోకి నెట్టివేస్తున్నాయి. ఈ అసంతృప్తే తీవ్రవాద సంస్థలకు ఊతమవుతున్నది. ఇటీవల ఓ అమెరికన్ యూనివర్సిటీ ప్రకటించిన అధ్యయనం కేవలం విద్యా, ఉపాధి, ఆర్థిక స్థితిగతులు సరైన విధంగా లేకపోవడంతోనే కశ్మీరీ యువత తీవ్రవాదం వైపు పరుగులు తీస్తున్నదన్న భయంకర నిజం నిగ్గుతేల్చింది. ఇవన్నీ కల్పించాల్సిన ప్రభుత్వాలు మాత్రం నిద్రావస్థలో మునిగి, తీరాదాడి జరిగాక రక్తాలు మరుగుతున్నాయంటే ఉపయోగమేమీ ఉండదన్న విషయం గ్రహించాలి. ఇప్పటికైనా, తీవ్రవాదాన్ని అణిచివేయాలంటే కేవలం సైన్యం, సర్జికల్ స్ట్రైక్స్ ఎంతమాత్రం సరిపోవని మోడీ సర్కారు గుర్తెరగాలి. లేనిపక్షంలో అందాల కాశ్మీరం అమానుషాలకు వేదికవుతూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, ఆ ప్రాంతమంతా శిల్ప మంజరులు లేని శిలలాగా... వసంతం చిక్కిన మోడు మాదిరి... పరిమళం కోల్పోయిన పర్వతంలా మారుతుందున్న కఠిన నిజం ఒప్పుకోక తప్పదు. అందుకే యువలోకం వాస్తవాలను గ్రహించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి...
- వి. సాగర్
సెల్: 9494041258