Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరయంగా కర్ణుడీల్గె నార్గురి చేతన్' అని చెప్పినట్టుగా ఇవాళ తెలంగాణలో పిట్టల్లా రాలిపోయిన ఇరవై ఆరు మంది ముక్కుపచ్చలారని చిన్నారి పిల్లల బలవన్మరణాలకు మనందరి బాధ్యతా ఉన్నది. మనందరి చేతుల మీదా ఆ నెత్తురు అంటి ఉన్నది. మనలో కొందరి చేతుల మీద అది ఒక సన్నని రేఖో, కనబడని మరకో కావచ్చు, మరి కొందరి చేతుల నుంచి ఇప్పటికీ నెత్తురు ధారలు కారుతూ కనబడుతుండవచ్చు. ఎక్కువ తక్కువలే తప్ప ఈ నేరం నుంచి ఎవరమూ తప్పించుకోలేం. ఆత్మహత్యల్లా కనబడుతున్న ఆ పిల్లల మరణాలన్నీ వాస్తవానికి వ్యవస్థ చేసిన హత్యలు. వ్యవస్థాగతమైన సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంకేతిక కారణాలే ఆ పిల్లలకు ఉరితాళ్లు పేనాయి. ఆ కారణాలకు కారకులుగా, ప్రోత్సాహకులుగా, నిర్ణేతలుగా, ప్రయోజనం పొందిన వాళ్లుగా, ప్రయోజనం పొందదలచిన వాళ్లుగా, మౌన ప్రేక్షకుల్లా మనం ఎవరెవరం ఎంతెంత బాధ్యులమో మన మనస్సాక్షికి మనం చెప్పుకోవలసిందే.
విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినప్పుడల్లా పూర్తి బాధ్యతను ఆ పిల్లల మీదనో, వారి తల్లిదండ్రుల మీదనో నెట్టేసే అలవాటు మధ్యతరగతిలో చాల ఎక్కువ. ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు, ప్రభుత్వాధినేతలు ఆ పనే చేస్తున్నారు. నిజమే, ప్రాణాలు తీసుకోవడం లాంటి తెలివితక్కువ పని చేసినందుకు ఆ పిల్లలను, వారి మీద అంతగా చదువు ఒత్తిడి పెట్టినందుకు వారి తల్లిదండ్రులను నిందించవలసిందే. కానీ లోకమే ఆ సుడిగాలిలో కొట్టుకుపోతున్నప్పుడు నిలబడి ఎదురీదడానికి గడ్డిపరకల వంటి ఆ మనుషులకు అవకాశం ఉన్నదా ప్రశ్నించుకోవలసి ఉంది. మన ఇంట్లో మనం ఎంత శుభ్రం పాటించినా, మన ఇల్లు మనం రోజూ ఊడ్చుకున్నా వీథుల నిండా దుమ్ము ప్రవవహిస్తున్నప్పడు, సుడిగాలి రేగుతున్నప్పుడు మనం మాత్రం శుభ్రంగా ఉండాలని అనుకోవడమూ అనడమూ అమాయకత్వమే అవుతాయి. చదువంటే మెడిసిన్, ఇంజనీరింగులు మాత్రమేననీ, జీవితమంటే ఎంసెట్ రాంకు మాత్రమేననీ, మార్కులు మాత్రమేననీ, లోకం గురించి ఏమీ తెలియకపోయినా నూటికి తొంబై ఎనిమిదో తొంబైతొమ్మిదో మార్కులు వస్తే చాలుననీ, అవి రాకపోతే బతుకే నిరర్థకమనీ చెప్పే విలువలు సమాజంలో రాజ్యం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులూ పిల్లలూ ఎట్లా మినహాయింపు కాగలరు? అది పూర్తిగా ఆ వ్యక్తుల బలహీనత మాత్రమే కాదు. ఇంకా ఆలోచించవలసిన లోతైన, బలమైన సామాజిక అంశాలు ఉన్నాయి.
మిగిలిన చదువులన్నీ అనవసరమనీ, కేవలం మెడిసిన్ ఇంజనీరింగ్ చదువులు మాత్రమే లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగాలు ఇస్తాయనీ, విదేశాలకు వెళ్లి డాలర్లలో సంపాదించడానికి ఆ చదువు ఒక్కటే మార్గమనీ అటు ప్రభుత్వమూ ఇటు ఆ చదువులు చెప్పే కార్పొరేట్ కాలేజీలూ ప్రచారసాధనాలూ ఊదరగొట్టిన అబద్ధాలూ అతిశయోక్తులూ ఇవాళ్టి విద్యార్థుల వ్యవస్థీకృత హత్యలకు ప్రధాన వనరు. ఇంటర్మీడియట్ విద్య యాబై ఏండ్ల కిందనే మొదలయినా, మొదట ట్యుటోరియల్, రెసిడెన్షియల్ కాలేజీల రూపంలో ఉన్న ప్రయివేటు కాలేజీల వ్యవస్థ కార్పొరేట్ కొండచిలువలుగా విస్తరించడం దాదాపు ముప్పై ఏండ్ల కింద మొదలయింది. ప్రపంచీకరణ విధానాలు, ఐటీ విస్తరణ, బహుళ జాతి సంస్థల ఉత్పత్తి, సేవా చక్రాలు నిరంతరం తిరుగుతూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించి పెట్టాలంటే ఒకవైపు చౌక శ్రమనూ, మరొక వైపు టైమ్ జోన్ తేడానూ వినియోగపెట్టుకోవాలనే రెండంచుల కత్తిని బహుళ జాతి సంస్థలు భారతదేశం మెడ మీద పెట్టినప్పుడు, ఆ దురాక్రమణను చేతులారా ఆహ్వానించి ఎర్రతివాచీ పరిచిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలా చంద్రబాబునాయుడు కాలంలో ఈ కార్పొరేట్ కాలేజీల కోరలు బలిశాయి. ఎంసెట్ మీదా, ఇంటర్మీడియట్ బోర్డ్ మీదా, ప్రభుత్వం మీదా, సమాజపు లోకజ్ఞానం మీదా, తల్లిదండ్రుల, పిల్లల ఆలోచనల మీదా ఈ కార్పొరేట్ కాలేజీల గుత్తాధిపత్యం మొదలయింది. అమెరికన్, యూరపియన్ బహుళ జాతి సంస్థలలో తలెత్తిన వై2కే సంక్షోభం ఈ ఎమెసెట్ పిచ్చినీ, కార్పొరేట్ కాలేజీల వీరంగాన్నీ, ప్రభుత్వపు 'జీ హుజూర్ జో హుకుం' విధానాలకూ మరింత పెంచింది. అందువల్ల ఇవాళ పిల్లల మెడలకు బిగిసిన ఉరితాడు, ఇప్పటికీ ఇరవై ఆరుమందిని బలిగొని, బహుశా మూడు లక్షల మంది పిల్లల భవిష్యత్తును నులిమేసిన ఉరితాడు పేనడం అప్పుడే మొదలయింది.
ఈ కార్పొరేట్ కాలేజీల దుర్మార్గాన్ని అరికట్టడానికి సకల అధికారాలూ, అవకాశాలూ ఉన్న ప్రభుత్వం ఆ పనులు చేయకపోవడం మాత్రమే కాదు, ఆ కార్పొరేట్ కాలేజీలే ఇంటర్మీడియట్ బోర్డునూ ప్రభుత్వాన్నీ శాసించడం అలా ఇరవై ఏండ్ల కిందనే శిఖరస్థాయికి చేరాయి. 1990 దశకం చివర నేను ఎకనామిక్ టైమ్స్ విలేకరిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్లో వినిపించిన ఒక మాట ఈ స్థితికి అద్దం పడుతుంది. ఒక ఐఏఎస్ అధికారి దగ్గరికి ఒక కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యా సంస్థ ప్రతినిధి వచ్చి, 'మీరు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పదవి చేపట్టబోతున్నందుకు మా కాలేజీల తరఫున చిన్న కానుక' అని లక్షల రూపాయలు నిండిన సూట్ కేసు ఇచ్చాడట. అప్పటికి ఆ మార్పు గురించి జీవో రాలేదు. ఆ ఐఏఎస్ అధికారికి తన శాఖ మారుస్తున్నారనీ, తనను ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా నియమిస్తున్నారనీ కూడా తెలియదు. కార్పొరేట్ కొండచిలువల కోరలు అలా ప్రభుత్వ విధాన నిర్ణయాల్లోకి వ్యాపించాయి.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులూ, అధ్యాపకులూ, ఉద్యోగులూ ఇటువంటి దుష్ట విధానాలు, కార్పొరేట్ కొండచిలువల రాజ్యం కొనసాగగూడదని కోరుకున్నారు. ఉద్యమకాలంలో పేరు పెట్టి మరీ మూడు నాలుగు కార్పొరేట్ కాలేజీ గొలుసు సంస్థలను తెలంగాణ నుంచి వెళ్లగొడతామని ఉద్యమకారులు నినదించారు. కాని గడిచిన ఐదేండ్లలో తెలంగాణలో కార్పొరేట్ కాలేజీల రాజ్యం, దుర్మార్గం మరింత పెచ్చరిల్లాయి. వాటిని అరికట్టడానికి, అసలు మూసివేయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ దాన్ని వినియోగించడానికి ప్రయత్నించనే లేదు.
ఈ విద్యా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాలకు లోబడి, ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను పాటిస్తూ నడవవలసి ఉంటుంది. కాని ఈ క్షణం వెళ్లి పరిశీలించినా ఈ కార్పొరేట్ కాలేజీల్లో, మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ దిగ్గజాలుగా చెప్పుకుంటున్న కాలేజీల్లో ప్రభుత్వ నిబంధనలను, ఆదేశాలను నూటికి తొంబై పాళ్లు ఉల్లంఘిస్తున్నారని స్పష్టమవుతుంది. అంటే ప్రభుత్వం తలచుకుంటే నిబంధనలకు లోబడి నడపడం లేదనే ఏకైక కారణంతో ఈ కార్పొరేట్ కాలేజీలను మూసివేయవచ్చు. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే కార్పొరేట్ కాలేజీల్లో అత్యధిక శాతం కాలేజీల్లో ప్రయోగశాలలూ లేవు, పిల్లలతో ప్రయోగాలు చేయించడమూ లేదు. రాత పరీక్ష చదువుకునే కాలేజీలో కాక మరెక్కడైనా రాయాలనే నిబంధన లాగానే, ప్రయోగ పరీక్ష కూడా వేరే చోట రాయాలనే నిబంధన తేవడానికి ప్రయత్నించినప్పుడు కార్పొరేట్ కాలేజీలు పెట్టుబడులు పెట్టి ఒక కుహనా ఆందోళన నడిపించి, పిల్లలకు కష్టం అవుతుందనే దొంగ కారణం చెప్పి ఆ విధానం అమల్లోకి రాకుండా చేశారు. తమ కాలేజీల్లోనే, లేని ప్రయోగశాలల్లో, లేదా అప్పటికప్పుడు అద్దెకు తెచ్చే మేక్ బిలీవ్ ప్రయోగశాలల్లో, బైటి నుంచి వచ్చిన పరీక్షాధికారికి అన్ని ప్రలోభాలూ అందజేసి, తామే ముప్పైకి ముప్పై మార్కులు వేసుకుంటున్న భాగోతం ఎన్నో ఏండ్లుగా నడుస్తున్నది. అందరికీ తెలిసిన ఈ వ్యవహారం మీద ప్రభుత్వం గాని, బోర్డ్ గాని ఇంతవరకు నోరు విప్పలేదు. విప్పకుండా ఉండడానికి ఎవరెవరికి ఎంతెంత ముడుతున్నదో తెలియదు. ఇక హాల్ టికెట్లు నంబర్లు తీసేసి కోడింగ్ చేసినా, ఆ కోడింగ్ వివరాలు కనిపెట్టడం, కోడింగ్ సంస్థలకు, ఉద్యోగులకు భారీగా ముడుపులు చెల్లించి, కావలసిన వారికి కావలసినన్ని మార్కులు వేయించుకోవడం కూడా కార్పొరేట్ కాలేజీలు అలవాటు చేసుకున్న కళ. అందుకే కోడింగ్ సంస్థల నియామకంలోనూ వారి ప్రయోజనాలూ, అందువల్ల వారి చేయీ ఉంటూ వస్తున్నది.
కార్పొరేట్ ప్రయివేటు కాలేజీలను మూసివేస్తే పిల్లల చదువులు ఏం కావాలి అనే న్యాయమైన ఆందోళన ఎవరికైనా కలుగుతుంది. దానికి కూడా మార్గాలున్నాయి. నిరుద్యోగ విద్యావంతులు, డాక్టరేట్లు కూడా చేసి, లెక్చరర్ ఉద్యోగాలు రాక మగ్గిపోతున్న విద్యావంతులు వందలాది గానో వేలాది గానో ఉన్నారు. వారికి స్వయం ఉపాధి కింద, సహకార రంగంలో కాలేజీలు పెట్టుకోవడానికి ప్రోత్సాహకాలు, అనుమతులు ఇస్తే ఇటు విద్యార్థులకు అవసరమైన నాణ్యమైన కాలేజీలూ తయారవుతాయి, విద్యావంతుల నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుంది. అంతకన్న ముఖ్యంగా అవసరమైన ప్రతిచోటా ప్రభుత్వ రంగంలో కొత్త కాలేజీలు తెరవవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం తొమ్మిది లక్షలమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారనుకుంటే ఏ ప్రమాణాల ప్రకారం చూసినా దాదాపు ముప్పై వేలమంది లెక్చరర్లు ఉండాలి. ప్రయివేటు కాలేజీల్లో చదువుతున్న ఆరు లక్షల మంది విద్యార్థులకు ఇరవై వేలమంది లెక్చరర్లు అవసరం కాగా ఎంతమంది ఉన్నారో ఎక్కడా కచ్చితమైన, సాధికారికమైన గణాంకాలు లేవు. ఇక ప్రభుత్వ కాలేజీల్లోని మూడు లక్షలమందికి గాను పదివేల మంది లెక్చరర్లు అవసరం కాగా ప్రభుత్వం అనుమతించిన లెక్చరర్ల సంఖ్య నాలుగు వేలు. అందులో రెగ్యులర్ ఉద్యోగాలలో ఉన్నవారు కేవలం ఎనిమిది వందల మంది మాత్రమే. ఎన్నో ఏండ్లుగా నియామకాలు లేవు. మిగిలినవారిని కాంట్రాక్టు లెక్చరర్లుగా పీరియడ్ చొప్పున ప్రతిఫలం లెక్కగట్టి నియమిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఉద్యోగ భద్రత లేదు. పని పరిస్థితులలో సమానత్వం లేదు. ఒకరకమైన వెట్టిచాకిరీ నడుస్తున్నది. అటువంటి ఉద్యోగస్థితిలో వారి నుంచి బాధ్యతాయుతమైన, నిబద్ధమైన, నాణ్యమైన బోధన ఆశించడం సాధ్యం కాదు. అందువల్ల తల్లిదండ్రులు తమ బిడ్డలను ఈ కాలేజీలకు పంపడానికి ఇష్టపడని స్థితి ఉంది. ఒకవేళ పంపుదామని ఎవరన్నా అనుకున్నా ఉండవలసిన స్థాయిలో ప్రభుత్వ కాలేజీలు లేవు. రాష్ట్రంలో 2,457జూనియర్ కాలేజీలు ఉండగా అందులో 404మాత్రమే ప్రభుత్వ కాలేజీ లంటే, ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నదో అర్థమవు తుంది. అయితే ఈ పనులన్నీ చేయాలంటే మొదట ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యను పరిరక్షించాలనీ అభివృద్ధి చేయాలనీ కోరిక ఉండాలి. అది లేదని స్పష్టంగా కనబడు తున్నది. ఇంటర్మీడియట్ విద్యను ప్రయివేట్, కార్పొరేట్ ప్రయోజనాల కొరకు బలి పెట్టడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది.
ప్రభుత్వ విధానం ఇలా ఉన్నప్పుడు, అందులో భాగమైన ఇంటర్మీడియట్ బోర్డు గురించి చర్చించడమే అనవసరం. విధానపరమైన దుర్మార్గానికి తోడు ఎన్నో అవకతవకలతో, అవినీతితో, అక్రమాలతో నడుస్తున్న ఘనచరిత్ర బోర్డుది. అటువంటి స్థితిలో ఆ బోర్డును తమ స్వప్రయోజనాల కోసం ఎటుపడితే అటు తిప్పడానికి కార్పొరేట్ కొండచిలువలకు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయకులకూ అవకాశాలు పెరగడం సహజమే. ఇంటర్మీడియట్ పిల్లల భవిష్యత్తు మీద ప్రభావం వేసే పరీక్షా ప్రక్రియ, ఫలితాల క్రోడీకరణ ప్రక్రియ, ఫలితాల ప్రకటన ప్రక్రియ బాధ్యతాయుతంగా, క్రమబద్ధంగా, నిజాయితీగా, సందేహాలకు తావు లేకుండా ఉండాలి. ఈ ప్రక్రియలను చాలా కాలంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ సంస్థను కాదని, కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే ఒకానొక ప్రయివేటు సాంకేతిక పరిజ్ఞాన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం ప్రస్తుత సంక్షోభానికి ఒక ప్రధాన కారణం. ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనలు మార్చారు. ఆ సంస్థకు అవసరమైన శక్తి సామర్థ్యాలు లేవని, ఈ నిప్పుతో చెలగాటం ఆడలేమనీ సందేహాలు వ్యక్తం చేసిన అధికారులను పక్కన పెట్టారనీ, ''పైవాళ్లకు ఇంటరెస్ట్ ఉంది'' అనే మాటతో కొట్టివేశారనీ పుకార్లు వినబడుతున్నాయి. నిజాలు చెప్పకపోతే, దాస్తే పుకార్లే నిజమనుకునే స్థితి వస్తుంది. చిన్నారి పిల్లలు చనిపోయి, తల్లిదండ్రులూ సమాజమూ దుఃఖంలో ఉండగా కూడా అధికార వర్గాల ప్రతిస్పందనలు, వ్యాఖ్యలు, దుఃఖిస్తున్న గొంతులను పోలీసు దౌర్జన్యంతో ఆపాలని జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆ పుకార్లు నిజమేననిపిస్తున్నది.
ఏడ్చే, ప్రశ్నించే గొంతులను బలప్రయోగంతో నొక్కివేశా మని విర్రవీగగలరు గాని, ''ఎన్ని సముద్రాల నీళ్లు కూడా ఈ చేతులకంటిన నెత్తురును తుడిచెయ్యలేవు'' అని షేక్ స్పియర్ మాక్ బెత్ నాటకంలో అన్నట్టు, చేతులకంటిన చిన్నారి పిల్లల నెత్తురును ఏం చేయగలరు?
- ఎన్ వేణుగోపాల్
సెల్:9848577028