Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భయానకంగా ఆరేండ్లుగా సాగిన రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 74ఏండ్లు గడిచింది. ఆ తరం దాదాపు అంతరించినట్టే. మొదటి ప్రపంచ యుద్ధం కన్నా రెండో ప్రపంచ యుద్ధం గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నది. మొదటి ప్రపంచ యుద్ధం నాలుగేండ్లు సాగితే ఇది ఆరేండ్లు పట్టింది. ఆ యుద్ధంలో కన్నా ఈ యుద్ధంలో పాల్గొన్న, లాగబడ్డ దేశాల సంఖ్య ఎక్కువ. ప్రాణనష్టం ఎన్నో రెట్లు ఎక్కువ. వీటన్నింటి కన్నా ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి - ఫాసిజం, దాని ప్రతి రూపమైన హిట్లర్. అతను సృష్టించిన మారణకాండ. రెండోది - అమెరికా యుద్ధం ముగిసినా కూడా వదలకుండా జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై వేసిన రెండు అణుబాంబులు తద్వారా 4లక్షలమంది పౌరుల మరణం. రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధానమైన జర్మనీ - ఇటలీ - జపాన్ ఫాసిస్ట్ కూటమిని సోషలిస్టు రష్యా మట్టి కరిపించింది. కానీ 70ఏండ్ల అనంతరం నేటి ప్రపంచంలో అనేక దేశాల్లో ఫాసిస్టు ధోరణులున్న పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద అనుకూల ప్రభుత్వాలు రాజ్యాలేలుతున్నాయి. అలాగే అణుబాంబులకు, యుద్ధాలకు కొదవేవిూ లేదు. మరో వైపు అనేక కారణాలరీత్యా సోషలిస్టుశక్తులు బలహీనపడి వున్నాయి. అమెరికాలో ట్రంప్, భారత్లో మోడీ ప్రకటనలు చాలు ఈ పరిస్థితి అర్థం చేస్కోవడానికి. ట్రంప్ ఉత్తర కొరియాని హెచ్చరిస్తూ ''మిలటరీ పరిష్కారాలు సిద్ధంగా వున్నాయి. తుపాకులు లోడయ్యి, లాక్ చేయబడి వున్నాయి'' అంటాడు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోడీ ''ఢిల్లీ ఇస్లామాబాద్ బెదిరింపులకు లొంగే విధానం పక్కనబెట్టింది. మా దగ్గర వున్న అణ్వాయుధాలు దీపావళి టపాసుల్లా వుంచము'' అంటే యుద్ధానికి కాలు దువ్వటమే. అనేక దేశాలలో మితవాద అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయి లేదా ఆ శక్తులు బల పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో ప్రపంచ యుద్ధం దాని ముగింపు నేర్పుతున్న గుణపాఠాలు తెల్సుకోవడం చాలా అవసరం.
ఇరవై ఏండ్లలోనే...
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన (1914-18) 20ఏండ్లల్లోనే మరో భయానకమైన ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందన్నది కీలకమైన ప్రశ్న. 1. భూమండలాన్ని తమ లాభాల కోసం తిరిగి పంచుకోవడానికి సామ్రాజ్యవాదుల మధ్య ఏర్పడిన వైరుధ్యం మరల పరాకాష్టకు చేరడం. 2. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు కాలంలో (1917) రష్యాలో విప్లవం ద్వారా ఏర్పడిన తొలి కార్మికవర్గ రాజ్యం - సోషలిస్టు వ్యవస్థ ఏర్పడటం - బలపడటం.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన పదేండ్లకే పెట్టుబడిదారీ ప్రపంచం యావత్తూ కనీవినీ ఎరుగని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి (1929) కూరుకుపోయింది. అప్పటికే వివిధ దేశాలలో అమానుషంగా సాగుతున్న వలస విధానానికి తోడు, సామ్రాజ్య, ఇతర దేశాలను క్రూరంగా ఆక్రమించు కున్నాయి. తమ భూ భాగాలను విస్తరించుకున్నాయి. 1932లో (జపాన్) మంచూరియాను ఆక్రమించుకున్నది. ఇటలీ 1939లో అల్బేనియాను 1935-41 కాలంలో ఇథియోపియాను 1940లో గ్రీస్ను 41లో యుగస్లేవియాను ఆక్రమించు కున్నాయి. ఇటలీకి తోడు జర్మనీలో మరింత క్రూరమైన ఫాసిస్టు శక్తులు నాజీల రూపంలో హిట్లర్ నాయకత్వాన 1933లో అధికారం చేపట్టాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి దరిమిలా ఒప్పందంలో జర్మనీకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న జాతోన్మాదానికి ఫాసిజం ప్రేరేపించింది. ''జర్మనీకి ఊపిరి పీల్చుకునే స్థలం కావాలి. అంటే ప్రపంచం యావత్తు జర్మనీ పాదాక్రాంతం కావాలి. యూదులు తదితర జాతులను ఓడించడమే కాదు భౌతికంగా నిర్మూలించి ఆ ప్రాంతాలూ పరిశ్రమలూ జర్మనీలతో నింపుకోవాలి'' అన్నది హిట్లర్ రూపొందించిన పధకం. జర్మన్ ఫాసిస్టు ప్రభుత్వం ఏకంగా ఐక్యరాజ్య సమితి నుంచి బయటకు వచ్చేసింది. 1936 పోలెండ్ పొలిమేరలు ఆక్రమించుకున్నది. 1938లో ఆస్ట్రియా, జకోస్లేవేకియాలను జర్మనీ పాదాక్రాంతం చేస్కున్నది. జర్మనీలో మొదలు పెట్టిన మారణకాండ కొద్ది కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రభలడానికి జర్మనీ ఇటలీ జపాన్లు ఫాసిస్టు కూటమిగా ఏర్పడి 1939లో ప్రపంచ యుద్ధానికి దారి తీసాయి. స్పెయిన్లో ఫాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వం ఏర్పడింది. 1940 జర్మన్ నాజీ సైన్యం, నార్వే, డెన్మార్క్. హాలాండ్, బెల్జియం, లక్జెంబర్స్లను ఆక్రమించి ఫ్రాన్స్ వంటి సామ్రాజ్యవాద దేశంపైకి దండెత్తింది. దీనితో ప్రక్కనే వున్న మరో అగ్రరాజ్యం ఇంగ్లాండ్ ఠారెత్తింది. 1934 సోవియట్ కమ్యూనిస్టు పార్టీ 17వ మహాసభ స్టాలిన్ ఇచ్చిన నివేదికలో ''నానాజాతి సమితి నుంచి జర్మనీ వైదొలగడం, జాత్యహంకార ధోరణులు పెరగడం, విభేదాలు పెరగడానికి యూరప్లో మారణాయుధాల సేకరణ పెరగడానికి దోహదపడ్డాయి. 1914మాదిరిగా సామ్రాజ్యవాద దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. యుద్ధోన్మాద శక్తులు పగతీర్చుకోవాలనే జాత్యహంకార శక్తులు బరిలో ముందు శ్రేణిలో నిలబడుతున్నాయి. కొత్తగా యుద్ధం రావడం ఖాయం అని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి'' అని పేర్కొంది. ఫాసిజం స్వభావం, జర్మనీలో అధికారంలోకి వచ్చిన ఫాసిస్టు హిట్లర్ యుద్దోన్మాదం ప్రపంచం మొత్తాన్ని జయించాలన్న అతని దురాశను గ్రహించిన సోవియట్ కమ్యూనిస్టు పార్టీ దాని అధినేత స్టాలిన్ 1933లోనే ఒప్పందం చేసుకొని యుద్ధ సన్నాహాలు ప్రారంభించుదామని ఇంగ్లండ్, అమెరికాకు ప్రతిపాదన పంపితే వారు అంగీకరించలేదు. జర్మనీ ఫాసిస్టు కన్నా రష్యాలో బలంగా అభివృద్ధి చెందుతున్న కార్మిక వర్గ రాజ్యం, సోషలిస్టు వ్యవస్థే కంటగింపుగా వుండింది. మాజీ అమెరికా అండర్ సెక్రటరీ సమ్మర్ వెల్స్ తన పుస్తకంలో యుద్ధం ముందు సం||రాలలో పశ్చిమ దేశాలలోని అతిగొప్ప ద్రవ్య, వాణిజ్య వర్గాలలోనూ, అమెరికా సహా హిట్లర్ జర్మనీ, సోవియట్ యూనియన్ల మధ్య యుద్ధం జరిగితే తమకే లాభమన్న నమ్మకం వుంది. జర్మనీ, రష్యాని కచ్చితంగా ఓడిస్తుందనీ దానితో కమ్యూనిజం ధ్వంసం అయిపోతుందని వారి అవగాహనగా వుండింది.'' యుద్ధం ముందు కాలంలోనే కాదు, యుద్ధం మొదలై మిత్రరాజ్యాలుగా అమెరికా, ఇంగ్లండులు రష్యాతో చేతులు కలిపిన తరువాత కూడా వారి ఆశ అదే. అయితే హిట్లర్ ఆలోచన మరో రకంగా వుంటుంది. 1940 జూలై 31న హిట్లర్ ''రష్యాని అణిచేస్తే బ్రిటన్ చివరి ఆశ ఆవిరైపోతుంది. అంతేకాదు రష్యాపై ఆతని ఆగ్రహం వెళ్లగక్కుతూ ''మాస్కో నగరం ఎలా ముట్టడి చేయాలంటే ఒక సైనికుడు, ఒక పౌరుడు-ఆడ మగ పిల్లలు సైతం తప్పించుకోవడానికి వీలుండకూడదు. మొత్తాన్ని నీటితో ముంచేయాలి. తరువాత కాలంలో అక్కడ సముద్రం తప్ప మాస్కో కనపడకూడదు'' అని సైనికాధికారులను హెచ్చరించాడు. రష్యా విూద హిట్లర్ 1941లో అర్థంతరంగా యుద్ధాన్ని తిప్పిన తరువాత కూడా అమెరికా నాటి ప్రముఖ నాయకుడు, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడైన హారీ ట్రూమన్ ''జర్మనీ గెలుస్తుందనుకుంటే రష్యాకి మద్దతిద్దాం. లేదా రష్యా గెలుస్తుందనుకుంటే జర్మనీకి మద్దతిద్దాం. ముందు వాళ్ళు ఒకర్నొకరు ఎంతమందిని చంపుకోగల్గితే అంత మందినీ చంపుకోనిద్దాం.'' అనడం చూస్తే సామ్రాజ్యవాదుల నిజస్వరూపం అర్ధమవుతుంది. అయితే మన దేశంలాగే పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్న దేశాలలోనూ, హిట్లర్, ముసోలినీ (ఇటలీ) ఫాసిస్టుల అండతో అనేక యూరప్ దేశాలలో పెరిగిన ఫాసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల నుంచి సోవియట్ రష్యాకు గొప్ప ఆదరణ పెల్లుబికింది. స్వాతంత్రోద్యమ నేత జవహలాల్ నెహ్రూ ''అభివృద్ధి నిరోధక శక్తులన్నింటినీ, సామ్రాజ్యవాదు లనూ సవాలు చేసే శక్తిగా వున్న రష్యాను బలహీనపర్చడమే బ్రిటిష్ విధాన లక్ష్యం. చిట్ట చివరి నిముషం వరకూ వాళ్ళు హిట్లర్ను, ముస్సోలనీని సంతృప్తి పరచే విధానాలనవలంబించి వారు బాగా బలం పుంజుకోవడానికి తోడ్పడ్డారు. మనం సోషలిస్టు రష్యా విధానాలతో అంగీకరించవచ్చు, అంగీకరించక పోవచ్చుగాని సోషలిస్టు రాజ్యం విధ్వంసం కావడం విపత్కర సంఘటన కాగలదు'' అని స్పష్టంగా ప్రకటించారు.
ఈ పరిణామాల పర్యవసానంగా రెండో ప్రపంచ యుద్ధం 1939లో ఆరంభమైంది. ముందుగా చెప్పుకున్నట్టు మొదటి లక్ష్యం కన్నా రెండవ లక్ష్యం - సోషలిస్టు రష్యాను నాశనం చేయటం అనేది యుద్ధం గడిచేకొద్దీ ప్రముఖంగా ముందుకు వచ్చింది. 18నెలలు సాగిన ప్రపంచ యుద్ధం 1941జూన్లో రష్యా విూదకి హిట్లర్ యుద్ధం తిప్పడంతో ప్రజాయుద్ధంగా మారింది. మిగిలిన నాలుగున్నరేండ్లు ప్రత్యక్షంగా యుద్ధం సోషలిస్టు రష్యాకు ఫాసిస్టు కూటమి రాజ్యాలకు మధ్యే సాగింది. 1944 జూన్లో గాని బ్రిటన్, అమెరికాలు పూర్తిస్థాయిలో యుద్ధంలోకి దిగలేదు. ఏమైనా రష్యాలోని ఎర్రసైన్యం ఆ దేశ ప్రజలు నిరుపమ త్యాగాలతో 2కోట్ల మంది బలిదానంతో హిట్లర్ను స్టాలిన్గ్రాడ్ నుంచి బెర్లిన్ (జర్మనీ రాజధాని) నడిబొడ్డువరకు తరిమి తరిమి కొట్టింది. హిట్లర్ - ముస్సోలినీ ఫాసిస్టు కూటమి ఆక్రమించుకున్న యూరప్ దేశాలన్నింటినీ ఎర్రసైన్యం విముక్తి చేసింది. లక్షలాదిమందిని నిర్బంధాల నుంచి విడుదల చేసింది. పదేండ్లు హిట్లర్ రాక్షసమూకల ఘోరమైన వికృత చేష్టలకు బలైన లక్షల కుటుంబాలకు ఫాసిజం పీడ విరగడైంది.
ఓ వైపు సంతోషం మరో వైపు దుఖంతో..
''నా జీవిత కాలంలో అనేక యుద్ధాల్లో పాల్గొన్నా. అనేక యుద్ధాలు చూసా. అనేకమంది యుద్ధ నిపుణుల గురించి చదివా. ఓటమి ఎరుగని మహా ప్రచండ సైన్యం దాడిని యింత సమర్ధవంతంగా ప్రతిఘటించడం, వారిని చిత్తు చిత్తు చేసే ప్రతీఘాత దాడితో వాళ్ళ ఇంటివరకు తరిమి కొట్టడం ఇదే చూస్తున్నా. ఇది చరిత్రలోనే ఓ అద్భుతమైన ఘటన అనుకుంటున్నా.'' అని అమెరికా సైన్యాధిపతి జనరల్ డౌగ్లాస్ మాక్ ఆర్ధుద్ 1942లో రాసారు. నాజీ సైన్యాధికారులు కూడా దిమ్మతిరిగి ''యుద్ధాల చరిత్రలో ఇంత ప్రతి దాడి కనీవినీ ఎరుగము.'' ''ఇన్నేండ్ల యుద్ధంలో ఎన్నడూ ఒక దేశంలో (రష్యాలో) ఇంతమంది జనం, ఇంత ఆయుధాల వాడకం అసాధారణంగా వుంది'' అని వాపోయారు. ఎట్టకేలకు ప్రపంచం ఊపిరిపీల్చుకుంది. 1945 మే 9న బెర్లిన్ పార్లమెంటుపై రష్యా ఎర్రసైన్యం ఎర్రజెండా ఎగరేసింది. దేశ దేశాల్లో సంబరాలు వెల్లివిరిసాయి. ఫాసిస్టు వ్యతిరేకతా సోషలిస్టు భావజాలాల వ్యాప్తీ విస్తరించింది. వలసదేశాల విముక్తి పోరాటాలకు ప్రాణవాయువు అందింది. వలస వ్యవస్థ కుప్పకూలింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ గమనాన్నే ఈ విజయం ప్రభావితం చేసింది.
కానీ ఈ పరిణామాలు యుద్ధానంతరం రష్యా ప్రపంచవ్యాప్తంగా అందుకుంటున్న జేజేలు, ప్రత్యేకించి సోషలిస్టు భావాలకు పెరుగుతున్న ఆదరణ అసలే ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కున్న సామ్రాజ్యవాద దేశాలకు మింగుడు పడలేదు. అప్పటికే సామ్రాజ్యవాద దేశాలకే మొనగాడుగా తయారవుతున్న అమెరికా ఈ పరిస్థితిలో మార్పు తెచ్చే బాధ్యత తీసుకున్నది. ఫాసిస్టు కూటమిలోని మరో అగ్రరాజ్యం జపాన్ పూర్తిగా లొంగిపోవడానికి మొరాయిస్తోంది, కాబట్టి దానికి బుద్ధి చెప్పాలని రష్యా దౌత్యంతో లొంగిపోవడానికి జపాన్ సిద్ధపడుతున్నా ఖాతరు చేయకుండా అమెరికా 1945 ఆగష్టు 6, 9 తేదీలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు ప్రయోగించింది. 4లక్షలమంది పైగా సామాన్య జనం మలమల మాడిపోయారు. ఫాసిజం పీడ విరగడయ్యిందని సంతోషంలో వున్న ప్రపంచం ఉలిక్కిపడింది. దుఃఖించింది. ఫాసిజం పోయినా ఆ పాత్ర నేను తీస్కుంటున్నానని అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని ఈ అణుబాంబు ద్వారా హెచ్చరించింది.
ఫాసిజం ద్రవ్య పెట్టుబడి కావలికుక్క!
జర్మన్ కమ్యూనిస్టు యోధురాలు క్లారా జట్కిన్ అన్న మాటలివి.. ద్రవ్య పెట్టుబడి సామ్రాజ్యవాదం బతికి వున్నంతకాలం ఫాసిస్టు ప్రమాదం పొంచే ఉంటుంది. అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థను ఎదుర్కోకుండా ఫాసిస్టు ధోరణులను, ఫాసిస్టు ప్రమాదాన్ని నిలవరించలేము. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు ప్రపంచ బలబలాల్ని సోషలిజం వైపు మొగ్గేలా చేస్తున్నదన్న దుగ్దతో సామ్రాజ్యవాదం రెచ్చిపోయింది. యుద్ధోన్మాదాన్ని తారాస్థాయికి చేర్చింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చడం వాటి స్థానంలో తమ తొత్తులుగా ఉన్న నియంతల్ని కూర్చోబెట్టడం అమెరికా తన విధానంగా చేసుకున్నది. పచ్చి మితవాద మతోన్మాద ధోరణులను పెంచి పోషిస్తున్నది. సోషలిస్టు దేశాలైన చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలపై కక్ష కట్టి వాటిని ఆర్థిక దిగ్బంధనం చేయడానికి పడరాని పాట్లు పడుతున్నది. రష్యాలో సోషలిజం కూలిన అనంతరం మరింత పెట్రేగిపోతున్నది. మనలాంటి దేశాల్లో బీజేపీ వంటి మతోన్మాద రాజకీయ పార్టీలను తన పంచన చేర్చుకుని ఫాసిస్టు ధోరణులు యుద్ధ ప్రేలాపనలు పెరగడానికి ఊతమిస్తున్నది. తద్వారా తమ వర్గ ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో సామ్రాజ్యవాద అనుకూల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలు మరింత సమరశీలంగా సాగించాలి. ఇందుకు రాజకీయ సైద్ధాంతిక పోరాటాలను మిళితంజేయాలి. సోషలిజం లక్ష్యంగా గమ్యంగా సాగే పోరాటాలే ఫాసిజాన్ని దాన్ని పెంచిపోషిస్తున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణను తుదముట్టించగలవు.
- ఆర్. రఘు