Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఐదేండ్లుగా బీజేపీ ముస్లింల పట్ల ద్వందవైఖరి అవలంబిస్తున్నది. ఒకవైపు 'సబ్కా సాథ్ సబ్కా వికాస్' అంటూనే ముస్లింలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్న విషయాన్ని, వారి వెనుకబాటుతనాన్ని ఎక్కడా లేవనెత్తనీయకుండా చేస్తున్నది. ప్రభుత్వం ''అందరి అభివృద్ధికి'' కట్టుబడి ఉందని అంటూనే ఎవరినీ ''తృప్తిపరిచేందుకు ప్రత్యేక చర్యలు'' తీసుకోబోదని, అయితే ముస్లింల అభివృద్ధికి కూడా బాధ్యత వహిస్తామని అంటున్నది. హిందువుల ప్రతిచర్యగా చెప్పుకుంటున్న మూక దాడులతో సహా తాము చేసే ప్రతీ చట్ట విరుద్ధమైన చర్యలను సమర్ధించుకోడానికి ఈ వాదన ముందుకు తెస్తున్నది.
ఇందుకు భూమిక
మరో వైపు ఆర్ఎస్ఎస్ చేత నియంత్రించబడుతున్న బీజేపీ ప్రత్యక్షంగానే ముస్లింలను బలిపశువులను చేస్తున్నది. 2014లో బీజేపీ ఘన విజయం సాధించినప్పుడు కేవలం అధికారం కోసమే, హిందూరాష్ట్రం అంటూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు చెప్పుకుంది. తగ్గించిన పార్లమెంటు సభ్యులను, ఎమ్మెల్యేలను చూపి, ముస్లింల ప్రాముఖ్యతను తగ్గిచిందనడానికి ఇదే రుజువని చెప్పుకుంది. ముఖ్యంగా మోడీ ముస్లింల వ్యతిరేకని ప్రచారం చేసుకుంది. జాతీయత పేరుతో పూర్తిగా మత ప్రాతిపదికన విడిపోయిన సమాజంలో మనం ఇప్పుడున్నాం అనడాన్ని ఎవరూ కాదనలేరు. ఇది కేవలం జాతీయత పేరుతో పెంచి పోషించినదే. అయితే ఈ జాతీయత పరిధులను దాటి మత విభజనను విశ్లేషించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు అనుసరిస్తున్న హిందూత్వ ఉద్యమాన్ని రెండు స్థాయిలలో విడమరిచి చెప్పుకోవచ్చు. ఒకటి సచార్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ముస్లింల వెనుకబాటుతనాన్ని అధికారికంగా ఒప్పుకుంటున్న మోడీ వైనం. రెండోది జాతీయత పేరుతో ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే బీజేపీ సైద్ధాంతిక వైఖరి.
మైనారిటీల ప్రయోజనాలు
2014 రాజకీయ మ్యానిఫెస్టోలో బీజేపీ ముస్లింల వెనుకుబాటుతనాన్ని ఒక ముఖ్యమైన రాజకీయ సమస్యగా గుర్తించింది. ముస్లింల ప్రయోజనాలు కాపాడుతానని- మదరసాలను ఆధునీకరించడం, ఉర్దూని రక్షించడం, వక్ఫ్బోర్డులను సక్రమంగా ఏర్పాటు చేయడం - వాగ్దానం చేసింది. ముఖ్యంగా పార్టీ శాంతియుత, సురక్షిత వాతావరణాన్ని అందిస్తుందని, భయాన్ని పాదుగొల్పేవారు గాని బెదిరించేవారు గాని ఉండకుండా చేస్తామని నమ్మబలికింది. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో సచార్ కమిటీ పేరు లేకపోయినా మైనారిటీ మంత్రిత్వశాఖ అందులోని ప్రధానాంశాలనన్నిటిని పరిగణనలోనికి తీసుకునే కార్యక్రమాలను రూపొందించు కుంది. ప్రభుత్వం కూడా సచార్ కమిటీ మూల్యనిర్ధారణ కమిటీవేసి రిపోర్టు 2014 సెప్టెంబర్ నాటికీ ఇవ్వాలని కోరింది. మైనారిటీ మంత్రిత్వశాఖ ఇప్పటికీ, ముస్లింలు సహా మైనారిటీలందరి సంక్షేమానికి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన 15పాయింట్ల కార్యక్రమాన్ని గుర్తించి వాటినే తమకి మార్గదర్శకంగా చూస్తున్నది. నిజానికి మోడీ ప్రభుత్వం 2016లో ఈ 15పాయింట్ల కార్యక్రమ ప్రభావం అధ్యయనం చేసి సమీక్షించను కోరింది. అయితే ప్రభుత్వం యొక్క ఈ పాలనా యంత్రాంగ విధానాలను ఎక్కువ చేసి చెప్పుకోకూడదు. మంత్రిత్వశాఖ పార్లమెంటుకు సమర్పించిన సచార్ కమిటీ సిఫారసుల ''కార్యాచరణ రిపోర్ట్'' కొన్ని కీలకమైన రాజకీయంగా సున్నితమైన ప్రతిపాదనలను తొలగించింది. ఉదాహరణకి కార్యాచరణ కమిటీ ఆరిజల్ (దళిత)ముస్లింలను షెడ్యూల్ కులాల చిట్టాలో చేర్చడానికి అనుమతించలేదు. అలాగే వక్ఫ్ బోర్డుల నిర్వహణ కోసం అఖిల భారత అధికారుల నియామకాన్ని కూడా తిరస్కరించింది. అయితే బేధాభిప్రాయాలు లేని సచార్ కమిటీ నివేదనలోని అంశాలను గుర్తించింది. ఈ విధంగా బీజేపీ పాక్షికంగా సచార్ కమిటీ నివేదికను గుర్తించడం ఆశ్చర్యాన్ని కలిగించదు. నిజానికి బీజేపీకి సచార్ కమిటీ నివేదికపై పెద్దగా ఆసక్తి లేదు. ముఖ్యంగా ముస్లిం, క్రిస్టియన్ దళితులను ఎస్సీల జాబితాలో చేర్చడం అసలిష్టం లేదు. కానీ మోడీ ప్రభుత్వం సచార్ కమిటీ సిఫారసులను ఆమోదించడమే కాక వాటి అమలుకు ఒక కమిటీని కూడా వేసింది. అంటే బీజేపీ నాయకులు మోడీ సహా ''ముస్లిం లను తృప్తి పరిచే విధానాలనే'' అనుసరించారని అర్థమా?
జాతీయతకు అనుసంధానం
జాతీయతపై ప్రచార మాధ్యమాలలో జరుగుతున్న చర్చని ముస్లింల వెనుకబాటుతనంపై ప్రభుత్వ విధానానికి సున్నితంగా ముడివేసారు. గత అయిదేండ్లుగా ఇది ఏంతో జాగ్రత్తగా మలచబడింది. ఈ జాతీయతలో రెండు ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి భారతీయత అంటే ఒక కొత్త దృష్టిని ఏర్పరచే ప్రయత్నం. పాత యూరప్ సంప్రదాయంలో లాగా 'ఒకే భాష, ఒకే సంస్కతీ, ఒకే దేశం' చట్రంలో చూపాలన్న ప్రయత్నం జరుగుతున్నది. ప్రజా జీవితంలో దేశభక్తికి, భారతీయతకు హిందూత్వను పొగడడం అవసరం అన్నది స్థిరపరిచారు. ఇందుకు అవసరమైన వారు హిందువులే కాబట్టి ముస్లింల ప్రసక్తే ఎక్కడా లేదు. అయితే ముస్లింలు లేకపోవడం వలన వారి దేశభక్తిని పరీక్షించాల్సిసిన అవసరం ఉన్నదిగా ఒక భావన సృష్టించారు.
2018 సెప్టెంబర్లో మోహన్భగవత్ ఇచ్చిన మూడు ఉపన్యాసాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 'ముస్లింలు లేకుండా హిందూత్వకి అర్థం లేదని' చెప్పినప్పటికీ ఆయన ఆర్ఎస్ఎస్కి ముస్లింల పట్ల ఉన్న వైఖరి నుంచి ఏమాత్రం వైదొలగలేదు. వివాదాస్పదమైన అంశం - భారతీయత, హిందూ మతం - అంటే 'భారతదేశంలో పుట్టిన మతాలు' అనుసరించేవారు, ఇతర దేశాలలో పుట్టిన మతాలను అనుసరించేవారు అనే బేధాన్ని ఎత్తిచూపడం పైనే ఎక్కువగా కేంద్రీకరించారు.
ఈ లోపల / వెలుపల అనే భావన నిజానికి జాతీయతకు చెందిన రెండో అంశంతో ముడిపడి ఉంది. అదే దేశ 'భౌగోళిక హద్దుల రక్షణ' బీజేపీకి అనుకూలమైన ప్రచార మాధ్యమాలు. తమ వాక్చాతుర్యంతో 'విదేశీ శత్రువు' అనే సాంప్రదాయ పదాన్ని వాడటం మొదలు పెట్టారు. లేని శత్రువును కనుగొనే పనిలో పడ్డారు. ముస్లింలలో 'జిహాదిస్టులనీ', మానవతావాదులలో 'అర్బన్ నక్సలైట్లనీ' లౌకికవాదులలో 'సిక్కులర్లనీ' పేర్లు పెట్టి హిందూత్వ జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చారు.
వెనుకబాటుతనాన్ని ఉపయోగించుకోవడం
ముస్లింలను వేరుచేసే ఈ విధానానికి మరో పార్శ్వం కూడా చూడవచ్చు. గత ఐదేండ్లలో హిందూత్వ శక్తులు ముస్లింలకు సంబంధించిన అయిదు అంశాలపై ప్రయోగాలు చేసాయి. ఘర్ వాపసీ, లవ్ జిహాద్, గో రక్షణ, ట్రిపుల్ తలాక్, అయోధ్యలో రామమందిరం. వీటిలోని ప్రతి అంశం పైన హిందూత్వశక్తులు ఎన్నో రకాల కవ్వింపు చర్యలకు పాల్పడినా, ఏ రకమైన ప్రత్యక్ష కార్యాచరణకు గానీ, ప్రతీకారానికి గానీ ముస్లింలందరు పాల్గొనేట్టు ప్రేరేపించలేకపోయారు. ఈ వైఫల్యం వలననే బీజేపీ మళ్లీ హిందూత్వ కేంద్రంగానూ, ముస్లిం వ్యతిరేకంగాను జాతీయతను పునర్నిర్మించుకోవలసి వచ్చింది. ఈ ప్రయత్నంలోనే ముస్లింల ప్రాతినిధ్యం అన్ని రంగాలలో తగ్గడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.
గత రెండు దశాబ్దాలలోనే 'ముస్లిం' అన్నది ఒక ప్రధానమైన చట్టపరమైన రాజకీయ విభజనగా రూపొందిందన్నది మనం గుర్తించాలి. 1993లో మైనారిటీల జాతీయ కమిషన్ ముస్లింలను దేశంలో మైనారిటీలుగా గుర్తించింది. ఒక విధంగా అప్పటికే వాడుకలో ఉన్న హిందూ మెజారిటీ అన్నదానికి ఇది మరింత ఊతమిచ్చినట్టయింది. దీనితో హిందూత్వ శక్తులకు జాతీయ స్థాయిలో ముస్లిం మైనారిటీలను సంతృప్తి పరచడం జరుగుతున్నదని వాదించడం సులభమైంది. ఈ వాదన 1990నాటికి హిందువులే అణచి వేయబడుతున్నారనే రాజకీయ వాక్చాతుర్యానికి దారితీసింది. ముస్లింల వెనుకబాటుతనాన్ని మోడీ ప్రభుత్వం భిన్నంగా ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. అంతకు ముందటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియెన్స్ లాగానో, లేక కాంగ్రెస్ లాగానో మోడీ ప్రభుత్వం మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏం పనిచేసిందో చెప్పుకోవాలనుకోలేదు. ముస్లింల మద్దతు పొందాలని కూడా అనుకోలేదు. కేవలం ముస్లింల ప్రాతినిధ్యాన్ని తక్కువగా ఉండేటట్టు మాత్రమే చర్యలు తీసుకుంది. ఇందుకు బహుశా మూడు రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చు.
మొదటిగా ముస్లిమ్ వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపుతూ, తాను ఎంతగా సద్దుకుపోయే పార్టీనో, ఎంతగా అందరినీ ఇముడ్చుకుపోయే పార్టీనో చూపాలనుకుంటున్నది. నిజానికి 'సబ్కా సాథ్' అన్నది ఇప్పటికీ దాని నినాదమే. ఇప్పుడది 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో 'గౌరవంతో కూడిన అభివృద్ధి' అనే నినాదంగా మారిందనుకోండి! రెండోది, ముస్లింల వెనుకబాటుతనం కూడా హిందువుల దయ, దాతృత్వంగా చూపబడుతున్నది. బీజేపీ నేషనల్ రిజిస్ట్రార్ అఫ్ సిటిజన్స్ సమయంలో, సిటిజెన్షిప్ (అమెండ్మెంట్)బిల్ చర్చల సందర్భంలో, ఇతర దేశాలలోని హిందువులను ముస్లిమేతర మైనారిటీల పట్ల అవలంబించిన విధానంలో ఇది కనిపిస్తుంది. ఒక మహత్తర హిందూ గుర్తింపును, కనీసం దక్షిణ ఆసియాలోనయినా ఏర్పరచే చైతన్యపూరిత ప్రయత్నాలుగా వీటిని చూడవచ్చు. చివరిగా, ముస్లింల వెనుకబాటుతనం, దానికి తోడుగా ప్రతినిధ్యం లేకపోవడం వలన ముస్లిం వేర్పాటువాద భయం ఏర్పడింది. బీజేపీ 370అధికరణను గురించిన చర్చలలో కనిపిస్తున్నదదే. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మత ప్రాతిపదికన కేంద్రీకరించే ప్రయత్నం చేయడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2019 సాధారణ ఎన్నికల తరువాత జాతీయతకు ముస్లింల వెనుకబాటుతనానికి ఉన్న ఈ బంధం ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో తెలుసుకోవడం ఆసక్తి కరంగా ఉంటుంది.
- అనువాదం: ఉషారాణి. కె
హిలాల్ అహమద్