Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల కాలంలో మన దేశంలో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు గొడవలు పడి విడాకులు తీసుకుంటున్నారు. పెండ్లి జరిగిన సంవత్సరంలోపే విడాకులు తీసుకోవాలని ఆసక్తి చూపుతున్నారు. స్త్రీ, పురుష సంబంధాలపై నేటి తరాలకు సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, నేడు మీడియా, వేగంగా విస్తరిస్తున్న అంతర్జాల ప్రభావం, చిన్నప్పటి నుంచి సర్దుబాటు ధోరణి, అవగాహనా లోపం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నైతిక విలువలు, ప్రేమానురాగాలు, మానవ సంబంధాలు లాంటివి తగ్గిపోవడం మొదలైనవి నేడు దంపతులు విడిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. 1955 సంవత్సరంలో ఏర్పడిన హిందూ వివాహ చట్టం, 1976లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు విడాకుల మంజూరును కాస్త కఠినతరం చేసినా దేశవ్యాప్తంగా విడాకుల సంఖ్య పెరుగుతూనే వస్తున్నది. దీనికి సంభందించి గత డిసెంబరులో జాతీయ మహిళా సాధికారత సంస్థ విడుదల చేసిన అధ్యయన నివేదికలో అనేక అంశాలు వెలువడ్డాయి.
ఈ నివేదిక ద్వారా ప్రస్తుతం మన దేశంలో 14 లక్షలమంది స్త్రీ పురుషులు విడాకులు తీసుకొని వేర్వేరు జీవితాలు గడుపుతున్నారని తెలుస్తోంది. వివాహితులలో ఈ విడాకులు తీసుకున్న వారి సంఖ్య 0.24 శాతం, అంతే మొత్తం దేశ జనాభాలో 0.14 శాతంగా ఉంది. 2010-15 సంవత్సరాల మధ్యకాలంలో విడాకులు తీసుకున్నవారి సంఖ్య గతకాలంతో పోలిస్తే 18 శాతం వరకు పెరిగింది. అదేవిధంగా విడాకులు తీసుకోకుండానే, విడిపోయిన వారి సంఖ్య 52 లక్షలుగా ఉంది. ఇందులో 12 శాతం పునర్వివాహం చేసుకోగా, 14 శాతం శాస్త్రబద్ధమైన వివాహం లేకుండా సహజీవనం లేక కలిసి గడపడమో చేస్తున్నారు.
ఈ సంఖ్య రాబోవుకాలంలో మరింతగా పెరిగే ప్రమాదముందని సామాజిక శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అయితే విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అధికులు మహిళలే కావడం గమనించదగ్గ విషయం. మన దేశంలో అత్యధిక విడాకుల కేసుల్లో గుజరాత్ ప్రథమస్థానంలో నిలవగా, అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాతి స్థానాలలో నిలిచాయి. విడాకులు తీసుకుంటున్న వారిలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న స్త్రీ, పురుషులు 56 శాతంతో అత్యధికంగా ఉండడం గమనించవచ్చు. విడాకుల సంస్కతి ఇటీవల కాలంలో పెరగడానికి కారణాలు ఏమిటి? అని పరిశీలిస్తే స్త్రీ పురుషులకు అపరిమిత స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ, ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న ఫ్యామిలీకోర్టులు, సామాజిక మాధ్యమాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావటం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. పురుషాధిక్యత కారణంగా 42 శాతం స్త్రీలు, వైవాహిక జీవితంలో సర్దుకుపోలేని మనస్తత్వం కారణంగా 21 శాతం స్త్రీలు విడాకులు తీసుకుంటున్నారని ఈ అధ్యయనం ద్వారా తెలుస్తోంది.
అయితే ముఖ్యంగా మహిళలు విడాకులు కోరడానికి కొన్ని కారణాలు ఉన్నాయట. ఈ కారణంగానే చాలామంది దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాలనే పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇటీవల 43వేల మంది మహిళలపై చేసిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆస్ట్రేలియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ స్టడీస్ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆ సర్వేలో వివాహం జరిగి పిల్లలు ఉన్న మహిళలే విడాకులు తీసుకోవాలని భావిస్తున్నారట. వారందరూ ఉద్యోగాలు చేసేవారు కావడం గమనార్హం.
భర్తలు సహాయం చేయకపోవడం వల్లే అసలు సమస్య మొదలవుతోంది. పిల్లలను చూసుకోవడం, ఇంటిపని, ఆఫీసు పని ఇలాంటి అన్ని పనులు మహిళలు ఒక్కరే చూసుకోవాల్సి వచ్చినప్పుడే విడాకుల గురించి ఆలోచన తీసుకొంటున్నారనీ, అంతేకాక పెండ్లి చేసుకున్నాక జీవితంలో తాము అనుకున్న జీవిత లక్ష్యాలను చేరుకోలేకపోతున్నపుడు అటువంటి ఫీలింగ్ కలిగినప్పుడు, తమ ఐడెంటిటీ కోల్పోయినప్పుడు, తరచూ గొడవలు జరుగుతున్నప్పుడు, మానసిక ఆందోళన, ఆలోచనలు ఎక్కువైనప్పుడు, జీవితం చాలా బోర్గా అనిపించినప్పుడు, భర్త నుంచి శారీరక, మానసిక దాడులు ఎక్కువైనప్పుడు, ఇంటి సమస్యలు, మనీ సమస్యలు లాంటివి ఎదురైనప్పుడు విడాకులు తీసుకోవాలనే ఆలోచన వస్తుందనీ వెల్లడైంది. ఈ కారణాల వల్లే మహిళలు తమ భర్తల నుంచి విడిపోయి స్వతంత్రంగా బతకాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది.
- వి. సురేష్