Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘ్ పరివార్ సిద్ధాంతం ప్రజలను బానిసలుగా ఉంచుకోవాలని చూస్తోంది. శాస్త్రీయ భావాలకు సమాధికట్టి, భౌతిక సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాన్ని సూచిస్తోంది. ప్రజలు పడుతున్న కష్టాలకు పూర్వజన్మ సుకృతమే కారణమని ఊదరగొడుతోంది. ఈ జన్మలో పడుతున్న కష్టాలను, అవమానాలను ప్రతిఘటన లేకుండా అనుభవిస్తే రాబోయే జన్మలో సుఖమయ జీవితం ఖాయమనీ చెబుతోంది. ఇలాంటి భావజాలం కలిగిన సంఘ్ పరివార్కు రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య యుగంలో అధికారంలోకి రావడమే పెద్ద ఆశ్చర్యం. అయినా అది సాధ్యమైంది. ఎందుకు-? బతుకు బాధల పరిష్కారానికి తన ముందున్న భౌతిక మార్గాలన్నీ మూసుకుపోయినపుడు మనిషి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఈ నిస్సహాయతను దోపిడీ వర్గం సొమ్ముచేసుకుంటుంది. ఇందుకు మతాన్ని ఒక సాధనంగా వాడుకుంటుంది. మతాధారిత కర్మ సిద్ధాంతపు ఎండమావులను కనుచూపు మేరా సృష్టించి, ఆ ఎండమావుల వెంట మనుషులను పరుగులుపెట్టించి మెదడును మొద్దుబార్చేస్తుంది. అణువణువునా పిరికితనాన్ని జొప్పించి మనిషిని మరింతగా లొంగదీసుకుంటోంది.
అబద్ధ మాటలతో ఒక మాయాజగత్తును సృష్టించి అందులో బతికేయమంటుంది. తను మాత్రం తన దోపిడీ కార్యక్రమంలో నిమగమవుతుంది. ఈ దేశంలో సంఘ్ పరివార్ సరిగ్గా ఇప్పడు ఇదే చేస్తున్నది. తన కార్యసాధనకోసం మోడీని ముందుపెట్టి, అతని చుట్టూ పెద్ద పరివారాన్ని మోహరించి పెట్టుబడి అండతో పెట్రేగిపోతోంది. పరివార్ చేతిలో పదునైన ఆయుధంగా సరిగ్గా ఇమిడిపోయారు మోడీ. అధికారం కోసం ఆయన చెప్పిన మాటలు.. అధికారం చేజిక్కిన తరువాత అతని చేతలు గమనిస్తే దేశ ప్రజల జీవితాలకు పూచీ పడవలసిన ఒక పాలకుడు ఇంత నిస్సిగ్గుగా, నిర్భీతిగా ప్రజలను వంచించడం మానవ లక్షణాలు ఉన్న మనిషికి సాథ్యమేనా ? అన్న అనుమానం కలుగుతుంది. నోరు తెరిస్తే అబద్ధం, కలం కదిపితే కర్కశత్వం, గుప్పెడుమంది పెట్టుబడి దారులకు తప్ప కోట్లాది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని నిర్ణయాలు, సాటి మనుషుల మధ్య శతృత్వాలను పెంచే చర్యలు, బలహీనుల మీదికి బలవంతులను, మైనారిటీల మీదికి మెజారిటీలనూ ఉసిగొల్పే ఉపన్యాసాలు.. దేశమంతా ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ, సామాజిక సంక్షోభం.' అధికారం కోసం రాజకీయం - అనుయాయుల కోసం అధికారం' ఇదీ కమలనాథుల అంతర్గత ధ్యేయం. వారి ఎజెండాలో 'ప్రజ' అన్న పదానికి అసలు స్థానమేలేదు. శ్రమకు, శ్రామికులకు వారి భావజాలంలో విలువే లేదు. వారి ఆచరణ కేవలం పీడనకు, అణచివేతకు, ఆధిపత్యానికి మాత్రమే పరిమితం. అక్కడ స్వేచ్ఛకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికీ చోటే లేదు.
మన దేశ ఎన్నికల గణితం ప్రకారం అధికారం చేజిక్కించుకోవాలనుకున్న పార్టీ మొత్తం ప్రజలలో 25 శాతం మందిని ఆకర్షించగలిగితే చాలు. ఎన్నికలలో మొత్తం పోలయ్యే ఓట్లు.. ఆ ఓట్లలో ఇతర పార్టీలకు పోలయ్యే ఓట్లను మినహాయించి అధికారం చేజిక్కించుకున్న పార్టీకి పడ్డ ఓట్లను లెక్కించితే ఈ 25 శాతం ఓట్ల లెక్క సరిపోతుంది. ఈ లెక్కను అర్థం చేసుకున్న పరివార్ ప్రారంభం నుంచీ చాపకింద నీరులా పని మొదలుపెట్టింది. తన పనికి గుడిని కేంద్రబిందువుగా చేసుకుంది. మన దేశంలో బడిలేని ఊరు ఉంటుంది కానీ గుడిలేని ఊరు ఉండదు. అమ్మలేని ఇల్లు ఉంటుంది కానీ దేవుని బొమ్మలేని ఇల్లు ఉండదు. చెట్టు కింది కాపురానికి సైతం దేవుని ప్రతిమే రక్షణ కవచం! హిందూ మతంలో ముక్కోటి దేవుళ్లు కొలువుదీరి ఉన్నా గానీ శ్రీరామ్దే అగ్రస్థానం. అందుకే జై శ్రీరామ్ నినాదాన్నందుకుంది సంఘ్ పరివారం.
సంఘ్ పరివార్కు హిందువులను సమీకరించడంలో ఉన్న పెద్ద అడ్డంకి కులం. హిందూత్వవాదులు 'మనమంతా హిందువులం - గంగ సింధు బిందువులం' అని ఎంతగా గగ్గోలు పెట్టినప్పటికీ హిందువులలో కుల స్పృహ తప్ప మత స్పృహ కనిపించదు. కులానికొక్క దేవుడు, గోత్రానికొక్క ఆచారం, ఇంటిపేరుకొక సాంప్రదాయం ( ఇంతేనా.. ఇంకా ఎక్కువ) కొలువుదీరిన మతం హిందూమతం. ఈ నేపథ్యంలో ఇన్ని చీలికలు, పేలికలుగా ఉన్న జనాలను ఒకే మత గుర్తింపు కింద సమీకరించడం సాధ్యం కాదు. అలా సమీకరించాలంటే మొదటగా దేవుళ్ల సంఖ్య తగ్గించాలి. అప్పుడు ఆచార, సంప్రదాయాల వైరుధ్యం తగ్గిపోయి జనం చేరువవుతారు. ఇందుకోసం శూద్ర, అతి శూద్ర, గిరిజన దేవుళ్లను కబళించడం మెదలు పెట్టారు. బ్రాహ్మణీయ భావజాల ఆధిపత్యం ఉండే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, గణేశుడు... లాంటి దేవుళ్లకు విపరీత ప్రచారమిచ్చి ప్రజల దగ్గరకు చేర్చారు. ఇందుకు గ్రామంలోని భూస్వామ్య ఆధిపత్యాన్ని, స్వాతంత్య్రానంతరం రాజ్యాన్నీ వాడుకున్నారు. ఆర్థిక ఆధిపత్య శక్తులు, ఆ శక్తుల చేతుల్లో రాజ్యం కలిసి తమకు అనుకూలమైన ప్రజలను అజ్ఞానులుగా ఉంచే ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రజల మెదళ్లలో జొప్పించి తమకు ఆధ్యాత్మిక బానిసలుగా మార్చుకున్నారు. ఈ ఆధ్యాత్మిక బానిసత్వం మీదుగా, ఆర్థిక బానిసత్వం, ఈ రెండింటి మీదుగా రాజకీయ బానిసత్వం.. ఇదీ పన్నాగం.
ఈ పన్నాగాలన్నీ ఫలించి సంఘ్ పరివార్ రాజ్యానికొచ్చింది. అయినా తన స్వభావసిద్ధ ప్రజా వ్యతిరేక భావజాలం బీజేపీని మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగానే నిలుపుతూ ఉంది. ఎన్నికల ముందు ఎన్ని ఆర్థిక తాయిలాలు ప్రకటించి, ఎంత ఆధ్యాత్మిక మత్తు చల్లి ఓట్లు దండుకున్నా, అధికారంలోకి వచ్చిన అనంతరం మెజారిటీ ప్రజలను పీడించకుండా మనుగడ సాగించలేని పరిస్థితి. కుల దురహంకారులు, క్యాపిటలిస్టుల మేలుకలయికతో పాలనకొచ్చిన పార్టీ తన వారికి మేలు చేయాలంటే సాధారణ ప్రజలకు కీడు చేయక తప్పదు. తమవారికి మేలు చేయలేని అధికార మెందుకు? తమ భావజాలాన్ని వ్యాప్తి చేసుకోలేని, తమ భావజాలాధారిత రాజ్యాన్ని ఏర్పరచుకోలేని అధికారం తమకెందుకు? ఒక్కమాటలో చెప్పాలంటే ప్రజలకు సంఘ్ పరివార్కూ మధ్య ఉన్న సంబంధం పులి- మేకకు మధ్య ఉన్న సంబంధం. పులి ఏనాటికీ మేకల మేలు కోరలేదు. అలా కోరితే అది మనుగడ సాగించలేదు. అయితే పులి ఒక పని చేస్తుంది. అది మేక రంగు పులుముకుంటుంది. మేకల గుంపులో చేరి నేనూ మేకనే అని నటిస్తుంది. శ్రామికులు, అణగారిన కులాలు, మైనారిటీ మతాలకు చెందిన మేకల ముందు చేరి మోడీ అనే పులి అదే నటన చేస్తోంది. అయినా, పాలకుడు ఇచ్చిన అభయం ప్రజల అనుభవం అనే పరీక్షలో పల్టీ కొడుతోంది. నేను బీసీనని, చాయ్ వాలానని, చౌకీదారుననీ.. ఎన్ని కమ్మటి పలుకులు పలికినా పాలకుడిగా మోడీ నిర్ణయాలు తమ కడుపులు నింపుతున్నయా? మాడ్చుతున్నాయా? అన్నదే కదా ప్రజల నిర్ణయానికి గీటురాయి.
'అభివృద్ధి - హిందూత్వం - అవినీతిపై యుద్ధం' ఈ మూడింటిపై ఆధారపడి 2014 ఎన్నికలను ఈదిన బీజేపీ 2019లో నినాదం కోసం అర్రులు చాస్తోంది. వాస్తవాలమీద ఆధారపడని, వాస్తవ రూపం దాల్చని నినాదాలు తాత్కాలి కంగా ప్రజలను ప్రేరేపించగలవేమో గానీ, దీర్ఘకాలికంగా కదిలించలేవు. అభివృద్ధి, అవినీతిపై యుద్ధం-ఇవి రెండూ ఈ ఐదేండ్లలో పూర్తిగా అభాసుపాలయ్యాయి. అభివృద్ధిపై యుద్ధం, అవినీతికి ప్రోత్సాహం అన్నట్టుగా తారుమారయ్యింది పరిస్థితి. ఇక హిందూత్వం పేరుతో విజృంభించే మతోన్మాదం ఎంతటి విషతుల్యమో దళితులు, ముస్లింలు, పీడితులకు అనుభవ పూర్వకంగా తెలిసొచ్చింది.
ప్రజా వ్యతిరేకతను ముందుగా పసిగట్టే అవకాశం మిగిలిన అందరికన్నా పాలకునికే అధికంగా ఉంటుంది. మోడీ కూడా ఈ వ్యతిరేకతను పసిగట్టినట్టే ఉంది. అందుకే ఒక్కో విడత పోలింగ్ పూర్తవుతుంటే ఆయన నాలుక అనేక వంకర్లు పోతూ ఉంది. తిరుగులేని నేతగా తన అనుయాయుల చేత కీర్తించబడ్డ వ్యక్తిలో తడబాటు అధికమవుతోంది. బాహుబలి ఇప్పుడు కాటికి కాలుచాపిన ముదుసలిగా కనిపిస్తున్నాడు. కోట్లాది యువతలో ఐదేండ్ల క్రితం కోటి ఆశలు నింపిన మాటల మరాఠీ ఇప్పుడు పిట్టలదొరగా తేలిపోయి అపహాస్యం పాలవుతున్నాడు. మోడీ గారడీకి ముగింపు తథ్యమన్న వాతావరణం అలముకోవడంతో కొత్త పాత్రధారునికోసం అన్వేషణ మొదలుపెట్టింది పరివారం. భౌగోళిక విస్తరణ కోసం భావజాలాన్ని, అనైతిక అధికారంకోసం నైతికతను కోల్పోయిన పరివారం ఇప్పుడు ఎన్ని వక్రమార్గాలు తొక్కయినా తన పట్టు నిలుపుకునేందుకు పాకులాడుతూ ఉంది.
అయితే, 'రాజకీయాలను హిందువీకరిద్దాం - హిందువులను సైనికీకరిద్దాం' అంటూ హిందూత్వ భావజాలానికి ఉగ్రరూపమిచ్చిన సావర్కర్ భావజాలానికి నిబద్ధమైన సంఘ్ పరివార్ ఎన్నికలలో ఓడినంత మాత్రాన తన మార్గాన్ని మార్చుకుంటుందనుకోవడం కల్ల. అధికారంలోకి వస్తే అది లోపలినుంచి బలి పెడుతుంది. రాకుంటే అధికారం వెలుపలి నుంచీ వేటాడుతుంది. సమస్త జీవన రంగాలలోకి చొచ్చుకుపోయి అణగారిన కులాలను, మైనారిటీ మతాలను, సమస్త పీడితులనూ పట్టి పీడిస్తూ ఉన్న హిందూత్వ ఉగ్రవాదం పీచమణచడం నిరంతర ప్రజా జాగరూకతతోనే సాథ్యమవుతుంది. సంఘటిత ప్రతిఘటనతోనే దాని పీడ విరగడవుతుంది.
- కోప్ర