Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిరసనలు నిజానికి ప్రజాస్వామ్యానికి సంకేతాలు. నిరసనల ద్వారా ప్రజలు పేదరికం, నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, ఆందోళన, భయం, దిక్కుతోచనితనం నుంచి విముక్తం కావాలని కోరుకుంటారు. ఈ నిరసనలు ఎదుటివారికి నచ్చచెప్పడానికి, తమ వాదన వినిపించడానికి ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నిరసన పాఠ్య పుస్తకాల నుంచి, ఇతర గ్రంథాల నుంచి రాకపోవచ్చు. కానీ నిరసన సత్యం చెప్పడానికి ఉపకరిస్తుంది. అత్యవసరం కూడా. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు మురికి కాలవల్లోకి దిగుతారు. ఆ పని చేయడం వారి నిస్సహాయతకు నిదర్శనం. వారు అలాంటి పని చేస్తున్నారంటే గౌరవప్రదమైన ఉపాధి దొరకనందువల్లే. కనీసం ఆ మాత్రం ఉపాధి అయినా లేకుండా పోతోందని వారి భయం.
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పౌరులకు స్వేచ్ఛ ఉండేట్టు చూడడం ఆ ప్రభుత్వ విధి. ఆ స్వేచ్ఛ సంపూర్ణమైంది, వ్యధ లేనిది కాకపోవచ్చు. పౌరులకు స్వేచ్ఛ కల్పిస్తామని చెప్పే ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్య నియమాలకు కట్టుబడి ఉండాలి. ప్రభుత్వ వాదనల్లోనూ, పని చేసే తీరులోనూ ప్రజాస్వామ్య లక్షణం ఉండాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి హేతుబద్ధత ఉండాలి. వాదనలు వినిపించుకోవాలి. జనం వాదనలు వినిపించు కునే ప్రభుత్వానికి ప్రజల మద్దతు మరింతగా పొందే అవకాశం ఉంటుంది. ఓటర్ల దగ్గరకు వెళ్లేటప్పుడు వారి వాదన వినడం అత్యవసరం. కానీ ప్రభుత్వం తాము బ్రహ్మాండమైన 'విజయం' సాధించామని, రక్షణ దళాలు సాధించిన విజయాలను తాము సాధించిన విజయాలుగా చెప్పుకోవడం, తమ తప్పిదాలను, వాగ్దాన భంగాలను కప్పి పుచ్చుకోవ డానికి చేసే ప్రయత్నంగానే మిగిలిపోతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం వాదనల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. గత ఐదేండ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం వాదనలను వినిపించుకోకుండా ఎలా తప్పించుకుంది అని ప్రశ్నించాల్సిందే. ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం కట్టుబడి ఉంది అని నిలదీయాల్సిందే.
ప్రజలతో పరస్పరం సంభాషించడం. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు చిహ్నం. అయితే ప్రధానమంత్రి రేడియోలో 'మన్ కి బాత్' పేరిట చెపుతున్న మాటలకు ప్రజాస్వామ్య లక్షణం ఉందని చెప్పలేం. కానీ ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని చెప్పే మాటలు వినే అవకాశం ప్రజలకు ఉంది కానీ జనం మాట ప్రధాని వినిపించుకునే అవకాశం లేదు. ప్రధాని కనీసం పత్రికా విలేకరుల సమావేశాల్లో కూడా మాట్లాడడం లేదు. అలా జరిగితే విలేకరులు ప్రజల తరఫున ప్రధానిని ప్రశ్నించే వీలుండేది. ప్రధాని తన మాట చెప్తున్నారే తప్ప ప్రజల గోడు పట్టించుకోవడం లేదు. ఇందులో 'సంభాషణ'కు అవకాశం లేదు.ప్రజలతో సంవాదానికి ప్రజాస్వామ్యంలో అవకాశం ఉండాలి. నిజానికి ప్రతిపక్షాలతో సంవాదానికి వీలు కల్పించాలి. ఈ ఐదేండ్లలో వాదాలకు, సంవాదాలకు వీల్లేకుండా చేశారు. పైగా సామాజిక మాధ్యమాలలో విమర్శించే వారిని తూర్పారబడుతున్నారు. వాదించే వారిని అంత మొందిస్తున్నారు. 'నేను చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు', 'నా మాటలను అసందర్భంగా ఉటంకించారు' అంటున్నారు. అయితే ఇలాంటి మాటలు అనైతికమైనవే తప్ప చట్టరీత్యా శిక్షించడానికి ఉపకరించవు. పదే పదే ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల ఇతరుల నైతికత దెబ్బ తీస్తున్నారు.
ప్రజలు ఎంత బలంగా ఉంటే దేశం అంత పటిష్టంగా ఉంటుంది. ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు, విద్య, ఉపాధి, గృహ వసతి అందుబాటులో ఉన్నాయా లేదా అనే అంశం మీద జాతి జనాన్ని పట్టించుకుంటోందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.
(ఈపీడబ్ల్యు సౌజన్యంతో)