Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోలతోపాటు అన్ని దేశాల కమ్యూనిస్టులూ గౌరవించబడుతున్న మరో మహా నాయకుడు, వియత్నాం విప్లవ సారథి హోచిమిన్. రష్యాలో 1917లో సోషలిస్టు మహా విప్లవ విజయం.. చైనాలో 1949లో సోషలిస్టు విప్లవం విజయం.. తర్వాత వియత్నాంలో ఫ్రెంచి, అమెరికా సామ్రాజ్యవాదుల దురాక్రమణపై విజయం.. ఇలా సుమారు 30ఏండ్లు మానవ చరిత్రలో అపూర్వమైన ధైర్య సాహసాలూ త్యాగాలూ చేసి సోషలిస్టు వియత్నాం సాధించి, ప్రపంచ పరిణామక్రమంలో మరో ప్రముఖ పురోగతికి కారణమైన మహా నాయకుడు హోచిమిన్.
హోచిమిన్ 1890 మే 19న హోంగ్ ట్రూ గ్రామంలో జన్మించాడు. దేశభక్తితో ప్రభావితుడైన హోచిమిన్ తన బాల్య దశలోనే మాతృభూమి విముక్తికి మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. హోచిమిన్ మనస్సులో నిత్యం ఓ సమస్య వేధిస్తూ ఉండేది. వలస పాలకులైన ఫ్రెంచి వాళ్లు దేశంలో 'శాంతి' నెలకొల్పే పేరుతో వియత్నాం-లావోస్లో ఉన్న సహజ సంపదలను దోచుకోవడానికి కువారవ్ రహదారి నిర్మిస్తున్నారు. దాని నిర్మాణానికి ప్రజలందరిచేత దుర్మార్గంగా వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. దీన్నుంచి ప్రజలను విముక్తి ఎలా చేయాలా అని ఆయన మనస్సును తొలుస్తుండేది. హోచిమిన్కు.. తల్లి మరణంతో తన హృదయానికి తగిలిన గాయంకంటే ఇది మరింత తీవ్రంగా గాయపరిచింది. అప్పటికి తన వయస్సు పదిహేనేండ్లే. 1906లో జపాన్ నుంచి తిరిగి వచ్చిన 'ఫాన్టిన్' అనే జాతీయ నాయకుడు ఫ్రెంచి ప్రభుత్వానికి సంస్కరణలు కోరుతూ ఓ విజ్ఞప్తి పంపాడు. అందులో అధికార వర్గాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. 'ఫ్రెంచి వారికి దేశం ఒక పెద్ద మార్కెట్టు. అందులో ప్రజలు వారికి చేపలూ.. మాంసం.. వారి నీచమైన అడుక్కుతినే బుద్ధికి అంతే లేకుండా ఉంది. సిగ్గు లేకుండా ఉంది' అని రాశాడు. ఇది ప్రజలపై మంచి ప్రభావం చూపింది. దీని వెంటనే సిఘియాథక్ అనే ఉద్యమం బయలుదేరి దేశం మొత్తం కమ్మింది. కారుచీకటిని కాంతిపుంజం వలె చీల్చివేసింది. ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా వెట్టికి, పన్నులకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనలు క్వాంగ్నామ్ రాష్ట్రంలో బయలుదేరి తర్వాత మధ్య వియత్నాంలోని అన్ని రాష్ట్రాలకూ వ్యాప్తి చెందాయి. ఫ్రెంచి పటాలాలు ప్రదర్శకులపై కాల్పులు సాగించాయి. అమాయక ప్రజలు మూకుమ్మడిగా హత్యగావించబడ్డారు. జాతీయ నాయకులనూ, విద్యావేత్తలనూ ఉరిశిక్షలకూ ప్రవాసాలకూ గురిచేశారు.
యువకుడైన హోచిమిన్.. దేశభక్తులు అకుంఠిత వీరోచిత కృత్యాలు, శత్రువు రాక్షస విధానం చూసి మరింత ఆలోచనలో పడ్డాడు. తన దేశాన్ని కాపాడుకోవాలనే దీక్ష ఇనుమడించింది. ఈలోగా తన తండ్రిని జిల్లా అధికారి బాధ్యత నుంచి తొలగించారు. కుటుంబం విచ్ఛిన్నమైంది. హోచిమిన్ చదువులకు స్వస్తి చెప్పాడు. జన్మభూమిని వదిలి విదేశాలకు వెళ్లాడు. ప్రపంచంలో అనేక దేశాలను ఆయన సందర్శించాడు. తన విప్లవ కార్యక్రమాలను కొనసాగిస్తూనే జీవనభృతి కోసం అనేక రకాల పనులు చేస్తుండేవాడు. లెనిన్ రచనలు చదవడం ద్వారా ఆ మహనీయుడిలో విప్లవాల సారథిని కనుగొన్నాడు. మానవ జాతికి అరుణోదయం అనదగిన అక్టోబరు సోషలిస్టు మహా విప్లవానికి ఆయన స్వాగతం పలికాడు. ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో పాల్గొన్నాడు. ఫ్రెంచి సోషలిస్టు పార్టీ మహాసభలో ఇతర ఫ్రెంచి మార్క్సిస్టులతోపాటు మూడవ ఇంటర్నేషనల్ స్థాపనకు దోహదపడ్డాడు. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాడు. 1930 ఫిబ్రవరి 3న వియత్నాం కమ్యూనిస్టు పార్టీ స్థాపించాడు. దానినే మళ్లీ వియత్నాం వర్కర్స్ పార్టీగా పేరు మార్చాడు. 1943లో వియత్నాంలో గెరిల్లా చర్యలు ప్రారంభమయ్యాయి. గెరిల్లా యుద్ధం ఆరంభిస్తే దాన్ని అణచివేయడానికి తమ శక్తినంతటినీ కేంద్రీకరించుతారు. విజయం పొందాలంటే అందుకు తగిన పోరాట రూపాన్ని కనుగొనాల్సి ఉందని హోచిమిన్ భావించాడు. 1944లో వియత్నాం విముక్తి ప్రచార దళాన్ని వోగియాన్ నాయకత్వాన నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు చేశాడు.
ప్రతిఘటనా యుద్ధం ప్రజలందరికీ సంబంధించినది కాబట్టి వారందరినీ సమీకరించి సాయుధులను చేయవలసి ఉంది. మొదట సైనిక దళాన్ని నెలకొల్పడానికి కేంద్రీకరించి పని చేస్తూనే రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సి ఉంది. 1945 మార్చి 9న జపాన్ సామ్రాజ్యవాదులు దాడి చేసి ఫ్రెంచి సామ్రాజ్యవాదులను పారదోలారు. వెంటనే పార్టీ కేంద్ర కమిటీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసి జపాన్ ఫాసిస్టులు, వారి ఏజెంట్లకు వ్యతిరేకంగా విశాలమైన జాతీయ ఐక్య సంఘటనా ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. అదే సంవత్సరం మే నెలలో హోచిమిన్ విప్లవోద్యమానికి ప్రత్యక్ష నాయకత్వం వహించడానికి పూనుకున్నాడు. అ సమయంలో ప్రపంచ యుద్ధం ముగింపునకు రాబోతున్నది. జర్మన్, ఇటాలియన్ ఫాసిస్టులు లొంగిపోయారు. వియత్నాంలో జపాన్ ఫాసిస్టులు కూడా ఓడిపోయే స్థితిలో పడ్డారు. ఆ స్థితిలో ఎన్నడూ లేనంత ఉధృతంగా విప్లవోద్యమాన్ని నడిపాడు హోచిమిన్. రాజధానీ నగరమైన హనోరు జపాన్ ఫాసిస్టుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అదే సంవత్సరం సెప్టెంబరు 2న బాదిన్ చౌక్లో వియత్నాం ప్రజాతంత్ర రిపబ్లిక్ అవతరణను ప్రకటించాడు హోచిమిన్. ఆ విధంగా ఆగేయాసియాలో మొట్టమొదటి జనతా ప్రజాతంత్ర రిపబ్లిక్ ఆవిర్భవించింది. ఇది ఒక వలస దేశంలో మార్క్సిజం- లెనినిజానికి మొట్టమొదటి విజయం. 1946 జనవరి 6న దేశంలో జనరల్ ఎన్నికలు జరిగాయి. హోచిమిన్ను వియత్నాం ప్రజాతంత్ర రిపబ్లిక్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. వియత్నాంలో అధికారానికి వచ్చిన తరువాత దానిని సంఘటిత పరుచుకునేందుకు ప్రజలకు వ్యవధి లేకపోయింది. ఫ్రెంచి, జపాన్ ఫాసిస్టుల చర్యల కారణంగా క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక పరిస్థితి అధ్వానమైంది. అమెరికా ఆదేశానుసారం ఛాంగై షేక్ సైనిక దళాలు ఉత్తర వియత్నాంలోకి ప్రవాహంలాగా వస్తున్నాయి. దక్షిణాదిని బ్రిటిష్ సైన్యాన్ని ముసుగుగా పెట్టుకొని ఫ్రెంచి వలసవాదులు తిరిగి వచ్చారు. వీరి దురాక్రమణ చర్యల మూలంగా అదే ఏడాది డిసెంబర్ 19కల్లా యుద్ధం దేశమంతటికీ వ్యాపించింది. ఆ మరునాడే ప్రెసిడెంట్ హోచిమిన్ ప్రజా ప్రతిఘటనకు పిలుపునిచ్చాడు. ప్రతిఘటనా యుద్ధంలో అనేక రకాల ఎత్తుగడలు అనుసరించారు. హోచిమిన్ స్వయంగా అనేక మైళ్లు నడిచి ప్రతిఘటనా చర్యలను పర్యవేక్షించాడు. ఫ్రెంచి వారి మీద విజయం సాధించాలంటే అన్ని జాతులనూ ఐక్య పరచటమొక్కటే మార్గమని భావించాడు. పార్టీ నాయకత్వాన కార్మిక-కర్షక ఐక్యత ప్రాతిపదికపై జాతీయ ఐక్య సంఘటన ఒక్కటే నిర్ణయాత్మకమైన విజయం సాధించగలదని నినాదమిచ్చాడు. ఈలోగా 1949 అక్టోబరులో చైనా విప్లవం జయప్రదమైంది. ఇది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటన. ప్రపంచం లోని బలాబలాలనే విప్లవ శక్తులకు అనుకూలంగా మార్చిన సంఘటన ఇది. చైనా విప్లవం విజయం పొందడంతో వియత్నాంను సామ్రాజ్యవాదులు చుట్టుముట్టడం అసాధ్యమైంది. వియత్నాం విప్లవానికి సోషలిస్టు శిబిరంతో సంబంధం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో వియత్నాం సైనిక దళాలు తీవ్రంగా దాడి చేయడంతో ఫ్రెంచి దళాల ప్రతిఘటన సన్నగిల్లింది. దీంతో హోచిమిన్.. రాజకీయ పరిష్కారం కోసం ఫ్రెంచి ప్రభుత్వంతో సంప్రదింపులను సాగించడానికి వియత్నాం సంసిద్ధంగా ఉందని తెలియజేశాడు. అయితే వియత్నాం నిజమైన స్వాతంత్య్రాన్ని ఫ్రెంచి వారు గుర్తించాలని కోరాడు. ఫ్రెంచివారు దిగివచ్చి ఒడంబడికపై సంతకాలు చేయక తప్పలేదు. తర్వాత హోచిమిన్ 1954లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో వియత్నాం ప్రజలకు అమెరికా సామ్రాజ్యవాదులే ప్రత్యక్ష శత్రువులయ్యారని పిలుపు నిచ్చాడు. పార్టీ, సైన్యం, ప్రజల ముందున్న కర్తవ్యాలను నిర్దేశించాడు. ఆ తరువాత వియత్నాంలో సోషలిస్టు సమాజ నిర్మాణం కోసం అనేక చర్యలు తీసుకున్నాడు. అయితే దక్షిణ వియత్నాంలో తమకు పరాజయం సంభవించనున్న దృష్ట్యా అమెరికా సామ్రాజ్యవాదులు పిచ్చిగా ఉత్తర వియత్నాంపై వైమానిక, నావికా దాడులను సాగించారు. వియత్నాంపై భయంకరమైన బాంబులు కురిపించి కనీవినీ ఎరుగని నష్టం చేకూర్చారు. మరలా హోచిమిన్ ప్రజల ప్రతిఘటనకు నాయకత్వం వహించడానికి రాత్రింబవళ్లు పని చేయవలసి వచ్చింది. అనేక పరాజయాల అనంతరం 1968 నవంబరులో ఉత్తర వియత్నాంపై బాంబింగును ఎలాంటి షరతులు లేకుండా అమెరికా నిలుపుదల చేయవలసి వచ్చింది. మొక్కవోని దీక్షతో వియత్నాం ప్రజలు పార్టీ వెనుక హోచిమిన్ నేతృత్వంలో ప్రతిఘటించి అమెరికాను మట్టిగరిపించారు. ఆ మహానేత 1969 సెప్టెంబరు 3న కన్నుమూశారు. ఆ తరువాత 1971-72లో కూడా అమెరికా సామ్రాజ్యవాదులు వియత్నాం పై బాంబుల దాడి సాగించారు. అయితే ఈసారీ అమెరికాకు ఓటమి తప్పలేదు.
- ఎస్. వెంకట్రావు
సెల్: 9490099333