Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు దీస్కోని ఒక్కపారి గవ్విటిని గొట్టి జూస్కుండు. బారత దేసంల లోక్సబ ఎలచ్చన్లయితున్నయి. గీ పారి ఏడు సార్లు ఓట్లు ఏసుడును బెట్టిండ్రు. గియ్యాల ఏడోసారి ఓట్లు ఏస్తురు. గా దాని గురించి ఎర్క జేస్కోవాలంటె యాడిక బోతె బాగుంటదని నారదుడు జెరసేపు సోంచాయించిండు. గీ పారి కల్కత్తా కాలికదేవి తాన్కి బోతె బాగుంటుదని గాయిన అన్కుండు. అన్కోని చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట మొగులు మీదికెల్లిండు. గాయిన కల్కత్తా దిక్కు రాబట్టిండు. సక్కగ గాయిన కాలికాదేవి తాన్కి బోయిండు.
''నారాయన, నారాయన'' అన్నడు.
''నువ్వా నారదా! గిట్టొచ్చిన వేంది?'' అని కాలికాదేవి అడిగింది.
''లోక్సబ ఎలచ్చన్ల ఏడోసారి ప్రచారం ఎట్ల జేసిండ్రో ఎర్క జేస్కునేతందుకు వొచ్చిన అమ్మా!''
''ఇయ్యాల ఓట్లు ఏస్తున్నరు. అయిపోయిన పెండ్లికి బాజ బజంత్రి ఎందుకు నారదా''
''నివొద్దే గని పెండ్లి ఎట్లయ్యిందని అడ్గుతున్న అమ్మా''
ఏడోసారి 59 లోక్సబ నియోజకవర్గాలకు ఎలచ్చన్లు అయినయి. పశ్చిమ బెంగాల్ల 9 నియోజక వర్గాలకు ఎలచ్చన్లు అయినయి. కడ్మ రాస్ట్రాలల్ల 50 లోక్సబ నియోజకవర్గాలల్ల ప్రచారం కన్న ఒకదినం ముందుగాల్లనే బెంగాల్ల ప్రచారంను ఎలచ్చన్ల సంగం బందు బెట్టింది''
''ఎందుకమ్మా!''
''కల్కాత్తాల బిజెపి ప్రెసిడెంట్ అమిత్ షా ర్యాలీ దీసిండు. ఒకతాన తృనమూల్ కాంగ్రెసోల్లు ఎదురయ్యిండ్రు. గాల్ల వీద్కి బిజెపోల్లు రాల్లు ఏసిండ్రు. గాల్లు గీల్ల మీద్కి రాల్లు ఏసిండ్రు. గీల్లు స్కూటర్లు, మోటర్లు దల్గ బెట్టిండ్రు. ఈశ్వర చెంద్ర విద్యాసాగర్ బొమ్మను కూలగొట్టిండ్రు. ఉల్టా చోర్ కొత్వాల్ కొడాంటే అన్న తీర్గ తృనమూలోల్లే విద్యాసాగర్ బొమ్మను కూలగొట్టిండ్రని అమిత్షా అన్నడు. గీ లొల్లితోని ఒక దినం ముందుగాలనే ఎలచ్చన్ల సగం బెంగాల్ల ప్రచారం బంద్ బెట్టింది''
''ఒక దినం ముందు ముందుగాలనే ఎలచ్చన్ల సంగం బంద్ బెడ్తె పశ్చిమ బెంగాల్ ముక్యమంత్రి మమతా బెనర్జి ఏమన్నది''
'' మోదీ బారత పౌజు; మతం పేరు మీద ఓట్లు అడిగినా రైటేనని ఎలచ్చన్ల సంగం అంటది. అమిత్ షా తందాన అంటె ఎలచ్చన్ల సంగం తానె తందాన అంటది. మా రాస్ట్రంల గాల్లిద్దరి ప్రచారం గాంగనే ఒక దినం ముందుగాల్లే ప్రచారం బంద్ బెట్టి బిజెపికి ఎలచ్చన్ల సంగం ఇనాం ఇచ్చింది. గిట్లు ఒకదినం ముందుగాలనే మన దేసంల ఎలచ్చన్లను బందు బెట్టుడు గిదే మొదటి సారి. బాబ్రిమసీదు కూలగొట్టిన బిజెపోల్లకు ఈశ్వర చెంద్ర బొమ్మ ఒక లెక్కనా? గాల్లే కూలగొట్టి మా మీద్కి నూక్తున్నరు. ఎవరు కూలగొట్టిండ్రో ఎర్కజేసేటి వీడియోలు మా తాన ఉన్నయి. ఈశ్వర చెంద్ర బొమ్మను కొత్తగ బెట్టిస్తమిన మోదీ అంటున్నడు. గాయిన ఏసేటి బిచ్చంను దీస్కునేతందుకు మేము రడీగ లేము అని మమతాబెనర్జి అన్నది''
''మోదీ మల్ల ప్రతాని కుర్సి మీద గూసుంటదని అంటున్నడట''
''అవ్. మమతాముకర్జి మొకంను మార్ఫింగ్ జేసి పేస్బుక్ల బిజెపి లీడర్ గింత కోపమా. మీకు బొమ్మలు ఎయ్యొస్తది. నా బొమ్మ చెడ్డగెయ్యుండ్రి. నేను మల్ల మోదీ అన్నడు. 25 ఏండ్లు మోదీ ప్రతాని కుర్సి మీద గూసుంటడు అని యూపి సీఎం యోగి ఆదిత్యనాత్ అంటున్నడు''
''మోదీ ఏమన్న జ్యోతిబసు అసువంటోడా?''
''గాయినేడ మోదీ ఏడ. మోదీ జెప్పేటి యన్ని అబద్దాలేనాయె. పోయినసారి లోక్సబ ఎలచ్చన్ల ఛారు వాలాను నేను అన్కుంట మోదీ ఒక్క తీర్గ ప్రచారం జేస్కుండు. ఛారు పే చర్చా అన్నడు. మోదీ ఎన్నడు ఛారు అమ్మలేదు. ఓట్ల కోసం ఛారు వాలానని అబద్దం జెప్పిండు అని ఆర్ఎస్ఎస్ లీడర్ తొగాడియా అన్నడు. గీపారి మోదీ చౌకీదార్ నని జెప్పుకుంటున్నడు. బీదోల్లకు చౌకీదార్లుండరు. ఉన్నోల్లకే చౌకీదార్లు ఉంటరు. అంబానీ, అదానీ అసువంటి ఉన్నోల్లకే మోదీ చౌకీదార్''
''రొండు కోట్ల మందికి కొల్వులు ఇస్తమని మోదీ అన్నడు. ఇచ్చిండా అమ్మా!''
''యాడిచ్చిండు నారదా! పకోడిలు జేసి అమ్మితె దినంకు రొండు నూర్లు రూపాలొస్తయి. గది గూడ కొల్వే. సదువుకున్నోల్లు గసువంటి కొల్వులు జేస్కుంట బత్కాలె అని ప్రతాని అన్నడు. లోక్సబ ఎలచ్చన్ల ప్రచారం జేసుంకట మోదీ చండీగడ్ బోయిండు. గాడ బిజెపోల్లు మీటింగ్ బెట్టిండ్రు. గా మీటింగ్ల మోదీ స్పీచ్ గొడ్తుంటె కొంతమంది సద్వుకున్న పోరాగాల్లు పకొడిలు దీస్కోని వొచ్చిండ్రు. మోదీ పకోడిలు అన్కుంట గవ్విటిని అమ్మబట్టిండ్రు. గాల్లను సూబెట్టుకుంట పకోడి యోజన కింద గీల్లకే గాకుంట మస్తుమందికి కొల్వులు దొర్కినయని మోదీ అనంగనే బిజెపోల్లు లాసిగ సప్పట్లు గొట్టిండ్రు''
''బిజెపికి మెజార్టీ రాదని ఎర్కగాంగనే మోదీ అడ్డగోల్గ మాట్లాడుతున్నడని అంటున్నరు. నివొద్దేనా''
''నివొద్దే మోదీ నెహ్రూను దిట్టిండు. ఇందిరాగాందీ, రాజీవ్ గాందీని గుడ్క దిట్టిండు. నెహ్రూ ప్రతాన మంత్రిగ ఉండంగ అయిన కుంబమేలాల కొంతమంది సచ్చిండ్రు. గిప్పుడు యుపికి మా యోగి ఆదిత్యనాత్ ముక్యమంత్రి గిప్పుడు గుడ్క కుంబమేలా అయ్యింది. గని గీ కుంబమేలాల ఒక్కడు గుడ్క సావలేదు. నెహ్రూ కన్న యోగి ఆదిత్యనాతే గొప్పోడు అని మోదీ అన్నడు''
''గట్లయితె బోపాల్ కెల్లి పోటీ జేస్తున్న ప్రగ్యా టాకూర్ ఇందిరా గాందీ కన్న గొప్పదని మోదీ అంటడేమో''
''అన్నా అంటడు. ప్రగ్యా టాకూర్ మాలేగావ్ బాంబు పేలుడు కేసుల జేల్ల ఉన్నది. బెయిల్ మీద ఇవుతలకు వొచ్చిన గామెకు బిజెపి ఎంపి టికిట్ ఇచ్చింది. గాడ్సే హిందూ ఉగ్రవాది అని కమల్హాసన్ అన్నడు. దీని మీద మీరేమంటరు అని విలేకరులు ప్రగ్యాటాకూర్ను అడిగిండ్రు. 'నాధూరాం గాడ్సే దేశ్ భక్త్్ తా; హై, ఔర్ రహేంగే, అని గామె జెప్పింది. గాడ్సె దేసబక్తుడైతె గాందీ దేసద్రోహ? అని అపొజిసన్ పార్టీలు అడిగినయి. గాడ్సేకు బారత రత్న అవార్డు ఇయ్యాలని బిజెపోల్లు అంటరేమోనని అసదుద్దీన్ ఒవైసీ అన్నడు''
''ఎర్కలేకున్నా అన్ని ఎర్కున్నట్టు మోదీ అసదుద్దీన్ ఒవైసి అన్నడు''
''నివొద్దే నారదా! మొగులు మీద నల్లమబ్బు లున్నయి. వాన గుర్సెటట్లున్నది. బాల్ కోట మీద గాలిమోటర్లతోని హమ్ల చేద్దామా వొద్దా అని ఎయిర్ ఫోర్స్ సోంచాయించబట్టింది. గడ్డం సాటున ఉన్న మొకం మీది గుంతలు గండ్లబడయి. గదే తీర్గ ఎయిర్ ఫోర్స్ బాల్కోట మీద హమ్ల .జేసింది. పున్నమి నాత్రి చెంద్రుడు పెద్ద గుంటడు. గప్పుడు చెంద్రుని మీద్కి రాకిట్ పంపితె పున్నమి నాత్రి చెంద్రుడు పెద్దగుంటమనుకుంటున్న అని మోదీ అన్నడు. నిజం జెప్పాలంటె మంచి బాగుంటదని ఇస్రోకు జెబ్దామను కుంటున్న అని మోదీ అన్నడు. నిజం జెప్పాలంటె మొగులు నిండ మబ్బులుండగా గాలి మోటర్లు బోయినా రాడార్కు గండ్లబడ్తయి'' అని కాలికాదేవి జెప్పింది.
''వొస్తనమ్మా!'' అన్కుంట నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
తోక : - మాపటీల చౌరస్తల ఉన్న ఇరానీ హోటల్కు బోయిన. గాడ వన్ బై టూ ఛారులు దాక్కుంట మా దోస్తులు ముచ్చటబెడ్తున్నరు.
''అబ్కీ బార్ 300 పార్ అని బిజెపి అంటున్నది. మల్ల మోదీ ప్రతాని అయితడా? అని సత్నారి అడిగిండు.
''మోదీ గుజరాత్ ముక్యమంత్రిగా ఉండంగ గోద్రా అల్లర్లు అయినయి. గవ్విట్ల మోదీని ముక్యమంత్రి కుర్సి మీద కెల్లి దించుతనని వాజపేయి అంటె అద్వాని అడ్దం దల్గిండు. ఇగ దాంతో మోదీ బచాయించిండు. గిప్పుడు ఓట్లేసిన జెనం ప్రతాని కుర్సి మీది కెల్లి మోదీని దించుతున్నది. గని గీ పారి అద్వాని లెక్క అడ్డం దల్గెటోడు ఒక్కడు గూడ లేదు'' అని యాద్గిరి అన్నడు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491