Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుందరయ్య వర్థంతి అనగానే సుందరయ్య గొప్పతనం గురించి చెప్పుకుంటాం. మనం చెప్పుకోకపోయినా ఆయన గొప్పవాడే. చెప్పుకుంటే వర్ధంతిరోజుకే పరిమితం. ఇప్పుడు కావాల్సింది సుందరయ్య వారసత్వం. సుందరయ్య బాటనడిచేవారు కావాలి. ఆయనను స్తుతించటం ఆయనెప్పుడూ ఒప్పుకోలేదు. భజనపరులను అనుమానించే వారు. పొగడటం, పొగిడేవారిని పోగేసుకోవటం కాదు. ప్రజల కోసం ప్రజల స్థాయికి దిగి పనిచేసేవారు కావాలి. సుందరయ్య ఏం చేసినా సరైందేనన్న గుడ్డి విశ్వాసం, భక్తి కాదు కావాల్సింది. సుందరయ్య పొరపాటు నిర్ధారణలు కూడా చేసారు. పొరపాటు అంచనాలూ వేసారు. వాటిని అంగీకరించటం, సరిదిద్దు కోవటమే ఆయన గొప్పతనం. 1952 ఎన్నికల్లో వచ్చిన విజయాలతో తమలో అహంభావం పెరిగిందనీ, దానివల్లనే 1955లో ఒంటెత్తు పోకడలు పోయి నష్టపోయామని చెప్పడానికి ఆయన వెనుకాడలేదు.
పార్టీ విజయ పరంపర సాగిస్తున్నప్పుడు, అప్రతిహతంగా ముందుకే పోతున్నప్పుడు నేనున్నాననేవారు చాలా మందే ఉంటారు. అది సహజం. ప్రస్తుతం పూలమ్మిన చోట కట్టెలమ్ముతున్నాం. ఇప్పుడు కావాలి నేనున్నాననే వారు. ఎన్నికల్లో కూడా అనేక అనుభవాలున్నాయి కదా! గెలిచే అవకాశం ఉన్నప్పుడు పోటీకి ముందుకొచ్చేవారు కోకొల్లలు. తమ అర్హతలను ఏకరువుపెడతారు. డిపాజిట్ కూడా రాదని తెలిసినప్పుడు 'త్యాగం' చేసేవారు చాలామంది. పోటీకి తమకంటే ఎదుటివారు ఎంత అర్హులో చెబుతారు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నప్పుడు నాయకత్వం వహించడానికి ఎప్పుడూ సిద్ధమే. ప్రజల దగ్గరికే పోవాల్సివస్తే... కష్టపడి సమీకరించవల్సి వస్తే... అందుకే అనేకమంది సుందరయ్యలు కావాలిప్పుడు. పదవుల కాలం చూసి, ప్రజలు తమదగ్గరికే రావటం చూసి... ఇప్పుడు ప్రజల దగ్గరికే పోవాల్సి రావటం పరీక్ష! కారెక్కటం సులభం. ఇప్పుడు దిగి నడవటమే సమస్య! సుందరయ్య కాలం నాటితో పోల్చితే ప్రజల సంఖ్య బాగా పెరిగింది. సుందరయ్యల సంఖ్య మాత్రం తరిగింది. 'వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరో చెప్పుడీ' అన్నాడో ప్రజాకవి. ఇప్పుడా వీరగంధం సుందరయ్యల కోసమే ఎదురు చూస్తున్నది.
సుందరయ్యలు కావాలని ఎందుకంటున్నాం? సుందరయ్య ప్రజల మనిషి కాబట్టి. ప్రజల మనుషులే ఇప్పుడు కావాలి కాబట్టి. ప్రస్తుతం మనం... మనకున్న ప్రజాజీవితం ఎంతో ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. సుందరయ్య జీవితంతో పోల్చుకున్నప్పుడే అది సాధ్యం. సుందరయ్యకు వ్యక్తిగత జీవితమంటూ ఉన్నట్టు కనిపించదు. ప్రజలే ఆయన కుటుంబం. ప్రజలే ఆయన జీవితం. అనుక్షణం ప్రజాసేవలోనో, ప్రజలను కదిలించటంలోనో, ప్రజల జీవితాల అధ్యయనంలోనో గడిపారు. మరోపని లేదు కదా! కుటుంబాన్నీ, బంధుమిత్రుల సంబంధాలనూ ప్రజల కోసమే ఉపయోగించారు. కుటుంబం కోసం బంధువుల కోసం ప్రజల పని పక్కన బెట్టలేదు. మానవతా దృక్పథం, సేవాతత్పరత, వర్గదృక్పథం, వివక్ష పట్ల ప్రతిఘటన, కుల రహిత, వర్గ రహిత సమాజం కోసం కృషి, క్రమశిక్షణ ఆయనకు మారుపేర్లు. వీటి కోసమే కదా మనమిప్పుడు వెతుకుతున్నాం.
ప్రజాసేవ కోసం ఏ చిన్న అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. ధరలు పెరిగి బతుకు భారమైన పేదల కోసం సహకార దుకాణం నడిపారు. అక్షరజ్ఞానం లేని వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, వారి పిల్లలకోసం పాఠశాల నడిపారు. యువత కోసం గ్రంథాలయం నిర్వహించారు. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న బడుగుజీవులకు చేతనైన వైద్యం చేసారు. బందరు కాల్వ పూడిక తీసి స్వచ్ఛంద సేవ అంటే ఏమిటో చూపించారు. ఉన్నత చదువులు చదివితే హౌదా ఉంటుందన్నప్పుడు, ''తోటి ప్రజలకు తోడ్పడుతున్నాను. అంతకన్నా హౌదా ఏం కావాలి?'' అన్నారు. ఉన్నత డిగ్రీల కోసం చూడవల్సిన అవసరం లేదనీ, ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయడానికి మించిన డిగ్రీలేదన్న సందేశమే ఆయన జీవితం. స్వయంగా వర్గ సంఘాలు నిర్మించారు. వ్యవసాయ కార్మిక సంఘం, కర్షక రక్షణ సమితి, కార్మిక సంఘాలు నిర్మించారు. యువత కోసం యూత్ లీగ్ నడిపారు. సాయుధ రైతాంగ పోరాటానికి సారథ్యం వహించారు.
ఆస్తుల కోసం ఆరాటపడే కాలంలో ఉన్నాం. డబ్బుతోనే గౌరవం దక్కుతుందన్న వ్యాపార సామ్రాజ్యంలో కొట్టుమిట్టాడుతున్నాం. కానీ ప్రజలే తన ఆస్తిగా భావించిన సుందరయ్య, తన వాటా ఆస్తి కూడా ప్రజా ఉద్యమానికే ఖర్చుచేసారు. అందుకే ప్రజల మనిషి అయ్యారు. తనదే కాదు... తన అన్నదమ్ముల ఆస్తి కూడా ప్రజల కోసం ఖర్చుపెట్టించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్మి ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. ప్రజలే ఆస్తిగా భావించినప్పుడు ప్రజా ఉద్యమమే పోషించుకుంటుందన్న స్ఫూర్తి నింపారు. పెండ్లైన తర్వాత లీలను ఇంకో రెండేండ్లు ఉద్యోగంలో ఉండనిస్తే పెన్షన్, పీఎఫ్ ఎక్కువ వచ్చేది. అంతకన్నా ప్రజా ఉద్యమమే మిన్న అనుకున్నారు. రాజీనామా చేసి పూర్తికాలం కార్యకర్తగా రమ్మన్నారు. ఆమె కూడా అంగీకరించారు.
కమ్యూనిస్టులకు అత్యంత ఇష్టమైంది విప్లవం. విప్లవానికి అవసరమైన ప్రతిపనీ ఇష్టమే కావాలి. అది సుందరయ్యలో ఉన్నది. విప్లవమంటే ఇష్టపడుతున్నాం. కానీ ఫలానా పని లేదా బాధ్యతనే చూస్తానంటున్నాం. మన ఇష్టానికీ, ఉద్యమ అవసరానికీ వైరుధ్యం ఎందుకు కనిపిస్తున్నది? ఇష్టపడటం వేరు... ఇష్టపడ్డ విప్లవం సాధించటం కోసం పట్టుదల ప్రదర్శించటం వేరు. సాధించాలనుకున్నప్పుడు ఉద్యమాని కవసరమైన బాధ్యతలు నిర్వహించడానికి వెనుకాడవద్దు. సుందరయ్యకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు. ఉద్యమానికి ఏది అవసరమైతే అదే చేసారు. పనిపట్ల అంకిత భావం ప్రదర్శించారు. ఉప్పుబస్తా మోసారు. సరుకుల సంచులూ మోసారు. సభలకు దాడుల నుంచి రక్షణ ఏర్పాట్లు చేసారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు చేసారు. ఆఫీసు కేంద్రాల ఏర్పాటూ, నిర్వహణా చూసారు. పత్రిక ముద్రణ, పత్రికల పంపకం చేసారు. పార్టీ నేతలను రహస్యంగా దాటించే బాధ్యతలూ చేపట్టారు. గెరిల్లా దళాల శిక్షణ పర్యవేక్షించారు. పార్టీ విస్తరణ, పార్టీ నిర్మాణం చేసారు. సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు. ఈ పనీ ఆ పనీ అన్న తేడాలేదు. అవసరమైన ప్రతిపనీ చేసారు. చేయగల్గిన ప్రతిపనీ చేసారు. ఎంత చేయగల్గితే అంత చేసారు. హౌదా సమస్య రాలేదు. దళంతో కలసి అడవిలో నడిచినప్పుడు అందరూ అలసిపోయారు. అందుకని అందరితో పాటు తానూ వంటపనిలో సహకరించారు. అందరూ అలసిపోయినప్పుడు తానొక్కడినే ఎందుకు విశ్రాంతి తీసుకోవాలన్నదే ఆయన ప్రశ్న.
ప్రజలలో కలసిపోయారు. ప్రజలు సుందరయ్యను తమలో భాగంగా చూసారు. సాధారణ జనం కన్నా తాను భిన్నంగా కనిపించాలన్న తపన లేదు. ప్రజలది కాలినడక. సుందరయ్యదీ కాలినడకే. దొరికితే సైకిలు. ఎన్ని మైళ్ళైనా అంతే. ప్రజలు నిత్యజీవితంలో నడిచారు. సుందరయ్య కూడా నడిచారు. ఇప్పుడు కారు లేకపోతే నాయకుడు కాదన్నది బూర్జువా పార్టీల నమ్మకం. కారే కాదు, కారుతో కాన్వాయి కూడా ఉండాలి. కారు ఆగగానే తలుపు తెరవాలి. అప్పుడు నాయకుడు బయటకు దిగాలి. దశాబ్దాల పాటు వీరితో కలసి పని చేసిన ఫలితమేమో! కమ్యూనిస్టుల్లో కూడా వాహనం హౌదాకు చిహ్నంగా చూసే ధోరణి చొరబడలేదని చెప్పలేము. సుందరయ్య కారులో కూడా ప్రయాణించారు. రైల్లో మొదటిశ్రేణిలో కూడా ప్రయాణించారు. వాటికి వ్యతిరేకమేమీకాదు. అవసరాన్ని బట్టి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను బట్టి వాడారు. వాహనం ఉంటే ఎక్కారు. కానీ వాహనం లేకుంటే నడవలేననలేదు. హౌల్టైమర్లకు అలవెన్సులు సమస్య అయినా, రాజకీయ విద్యకు నిధులు లేకపోయినా, వాహనం కావాలని కోరుకోలేదు. ప్రజా ఉద్యమాలకు, పార్టీ కార్యకర్తలకు ప్రధమ ప్రాధాన్యత. ప్రజలతో మమేకం కావటమే లక్ష్యం. హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి శాసనసభకు ప్రత్యేక బస్సు నడిపేవారు. శాసనసభ్యులంతా ఆ బస్సులో వెళ్లేవారు. ఇప్పుడా బస్సులేదు. ఎక్కేవారు లేరు. కాబట్టి బస్సు రద్దు చేసారు. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకు కనీసం ఒక కారు. కాలినడక దూరంలో ఉన్నా కారులోనే వెళ్లాలి. అది ఎమ్మెల్యే హౌదాకు సంబంధించిన సమస్య. సుందరయ్య పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు పార్లమెంటుకు నడిచిపోయారు. అప్పుడప్పుడు సైకిలూ వాడారు. ఆదర్శం కోసం కాదు. కాలినడక దూరంలోనే పార్లమెంటు భవనం ఉన్నప్పుడు నడిచే పోవచ్చు కదా అని. వందలమైళ్ళు నడిచిన సుందరయ్యకు రెండు మూడు కిలో మీటర్లు లెక్కకాదు కదా! కానీ సున్నం రాజయ్య మోటారు సైకిల్ మీద సచివాలయానికి పోతేనే పోలీసు ఆపాడు. నేను ఎమ్మెల్యేనంటాడు సున్నం రాజయ్య. ఎమ్మెల్యే అయితే కారులో వస్తారు కదా అన్నాడు పోలీసు. పొరపాటు గ్రహించి పోలీసే వెనక్కి తగ్గాడు. కాబట్టి కారులోనే వెళ్ళాలా? ఇక్కడ సున్నం రాజయ్య విలువ పెరిగిందే కానీ తరగలేదు. ఈ మధ్య కొందరు మేథావులు హైదరాబాద్లో ముగ్గురు మాజీశాసనసభ్యులు కుంజా బొజ్జి, కొండిగారి రాములు, గుమ్మడి నర్సయ్యలను సన్మానించారు. వారినే ఎందుకు సన్మానించారు? వారు శాసనసభ్యులైనా సాధారణ ప్రజలుగానే జీవించారు కనుక. అట్లానే జీవిస్తున్నారు కాబట్టి. అందుకే సుందరయ్య వైద్యం కోసం రష్యా వెళ్ళినప్పుడు ''ఎక్కడ చనిపోతే నేమిటి? ఎట్లా జీవించామన్నదే ముఖ్యం'' అన్నారు. అందుకే ఆయన ప్రజల మనిషయ్యాడు. నిరాడంబరత, సుందరయ్య ఆదర్శం అంటే కొందరి దృష్టిలో చాదస్తం. ''ఎట్లా ఉన్నామని కాదు... ఏమి చేస్తున్నామన్నదే ముఖ్యం'' అంటారు. అందుకోసం మార్క్సిస్టు మహౌపాధ్యాయుల రచనల నుంచి కొటేషన్లు వెతుకుతారు. సౌకర్యాలు అనుభవించేందుకు సాకులే ఇవి. అందుకే సుందరయ్య ''కొటేషన్ల దేమున్నది? ఎన్నైనా చెప్పవచ్చు'' అన్నారు.
మనుషుల మధ్య వివక్ష సహించలేదు సుందరయ్య. కులవివక్ష, లింగవివక్షలను ప్రతిఘటించాడు. ఇంట్లోనైనా.. బయటనైనా అదే వైఖరి. 1930వ దశకంలోనే సహపంక్తి భోజనాలు నిర్వహించారు. హరిజనుల బావి నుంచి నీరు తెచ్చి వంటలు చేసారు. స్వయంగా తన పేరులోని రామిరెడ్డి పదాలు తొలగించుకున్నారు. సుందరయ్యగానే ఉండిపోయారు. ఏ కులం నుంచి వచ్చిన నాయకులైనా హరిజనులతో (ఇప్పుడు దళితులంటున్నాం) కలసిపోయిన తీరే వారిని ఉద్యమబాట పట్టించిందన్నారు. స్త్రీలను చిన్నచూపు చూడడాన్ని ఒప్పుకోలేదు. స్త్రీ పురుష సమానత్వం కోసమే నిలబడ్డారు. వర్ణాంతర వివాహాలు చేసారు. మహిళలు కోరుకుంటే విడాకులను సమర్థించారు. అవసరమైతే సూచించారు. ఆ రోజుల్లో ఇది చిన్న విషయం కాదు.
అధ్యయనం విషయంలోనూ ఆదర్శప్రాయులే. ఇంటర్ చదివేటప్పుడే కమ్యూనిస్టు ప్రణాళికను సోవియట్ గురించి ఠాగూర్, నెహ్రూ రచనలు, ఆదర్శ మహిళల జీవిత చరిత్రలు చదివారు. జైలులో కూడా సహచరులకు రాజకీయ పాఠాలు బోధించారు. పార్లమెంటు సభ్యుడుగా ఉండి ప్రజాసమస్యలు లోతుగా అధ్యయనం చేసి సభలో లేవనెత్తేవారు. వ్యవసాయ సంబంధాలు, సాగునీటి సమస్యల అధ్యయనంలో అగ్రగణ్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ, శ్రామికుల సంబంధాలు అధ్యయనం చేసి కార్మికోద్యమానికి దిశానిర్దేశం చేసారు. ప్రజాజీవితం ప్రారంభించిన నాటి నుంచే అట్టడుగు వర్గాలను సంఘటితం చేసే కృషిలో నిమగమయ్యారు. ఆంధ్రలో 1939 నాటికే కార్మికరంగంలో, వ్యవసాయ కార్మికులలో కమ్యూనిస్టులే ప్రధానశక్తి. 1946 తర్వాత వీరతెలంగాణ విప్లవ పోరాటంతో ప్రజా ఉద్యమం మలుపు తిరిగింది. కౌలు సమస్యను నిర్దిష్టంగా అధ్యయనం చేసి తగు నినాదం రూపొందించటంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ కార్మికులు, రైతాంగంలోనే కాదు, కార్మికరంగంలోనూ కృషిచేసారు. ట్రాన్స్పోర్టు, మున్సిపల్ కార్మికులను సంఘటితం చేసారు. ఉమ్మడి మద్రాసులో ఏఐటీయూసీకి నాయకత్వం వహించారు. ట్రాన్స్పోర్టు కార్మికుల అఖిలభారత ఫెడరేషన్కు నాయకత్వం వహించారు. సిద్ధాంత అధ్యయనంలోను, సామాజిక, ఆర్థిక సమస్యలు, కష్టజీవుల సమస్యలు అధ్యయనంలో ముందున్నారు.
పార్టీ విస్తరణ కోసం, కార్యకర్తల కోసం పర్యటనలు చేసారు. జిల్లాలు, రాష్ట్రాలు తిరిగి సంబంధాలు సంపాదించారు. జైళ్ళలో ఏర్పడ్డ పరిచయాలనూ, బంధు మిత్రుల సంబంధాలను కూడా కార్యకర్తలుగా మలుచుకునే ప్రయత్నం చేసారు. కరపత్రాలు పంచిన సందర్భాలలో నూతన సంబంధాల కోసం వెతికారు. 1936లోనే కాంగ్రెస్ సభలో కరపత్రాలు పంచి కమ్యూనిస్టుల వైపు కొందరిని ఆకర్షించారు. నాయకత్వ బృందాన్ని తయారు చేసుకోవటంలో తొలినుంచి ప్రాధాన్యత నిచ్చారు. ఉప్పు సత్యాగ్రహం సందర్భంగానే నాయకత్వ బృందం ఆవశ్యకతను నొక్కి చెప్పటం గమనించవచ్చు. సాయుధ రైతాంగ పోరాటంతో మమేకమైన తీరే ఆయనను నాయకుడుగా మలిచిందని చెప్పకనే చెప్పారు. తెలంగాణ ప్రాంత కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును కాకుండా సుందరయ్యనే నిర్ణయించడానికి కారణం చెప్పారు. అనేక స్థావరాల గురించీ, కార్యకర్తల గురించీ చండ్ర రాజేశ్వరరావుకు తెలిసింది పరిమితమే. ఆ కారణం చేతనే సుందరయ్యను ఎన్నుకున్నారు. పార్టీ కేంద్ర అభివృద్ధీ, నాయకత్వం బృందం ప్రాధాన్యతా నొక్కి చెప్పారు.
బూర్జువా పార్టీలతో సంబంధాల విషయంలోనూ విలువైన పాఠాలు సుందరయ్య జీవితానుభవాల నుంచి నేర్చుకోవచ్చు. స్వాతంత్య్రోద్యమ కాలంలో కమ్యూనిస్టు కార్యకర్తలు కాంగ్రెసులోనూ, కాంగ్రెసు సోషలిస్టు పార్టీలోనూ పనిచేసారు. అది ఒక ఎత్తుగడగా నిర్ణయించి అమలు చేసారు. అమలులో భాగంగానే సుందరయ్య కూడా పనిచేసారు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడుగా పనిచేసారు. ఏఐసీసీ సభ్యునిగా కూడా ఉన్నారు. ఆంధ్రప్రాంతంలో కొన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు కమ్యూనిస్టులు నాయకులయ్యారు. కాంగ్రెసులో ఉంటూ... ఆ రోజుల్లోనే వందలాది మందికి 15 రోజుల నుంచి నెల రోజుల వరకు రాజకీయ పాఠశాలలు నిర్వహించి మార్క్సిజం బోధించారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి భోగరాజు పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోస్ను గెలిపించటంలో కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ కార్మిక, రైతు, కార్మికోద్యమాలు నిర్మించారు. అంతిమంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి అనేక మందిని కమ్యూనిస్టు ఉద్యమంవైపు ఆకర్షించారు. మనతరంలోనూ గత మూడు దశాబ్దాలుగా అనేక బూర్జువా పార్టీలతో కలసి పనిచేసాం. కానీ ఇక్కడ కమ్యూనిస్టు శ్రేణులు బలహీనపడి బూర్జువా వర్గం లాభపడింది. ఎందువల్ల? ఆనాడు దేశీయ బూర్జువావర్గం చేతిలో రాజ్యాధికారం లేదు. సామ్రాజ్యవాదంతో బూర్జువావర్గం కూడా పోరాడుతున్నది. పోరాడే బూర్జువావర్గం రాజకీయ ప్రతినిధిగా కాంగ్రెసు పనిచేసింది. ఇప్పుడు బూర్జువా వర్గం చేతిలోనే రాజ్యధికారం ఉన్నది. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నది వీరే. ఈ మార్పు గమనించటంలో కమ్యూనిస్టు శ్రేణులు వెనుకపడ్డాయి. ప్రజా వ్యతిరేక విధానాల పట్ల రాజీలేని పోరాటానికి మిత్రపక్షం అన్న భావన ఏదో ఒక మేరకు అడ్డు తగిలింది.
ఆనాడు కాంగ్రెస్లో ఉంటూనే కమ్యూనిస్టుల ప్రత్యేకతలు చాటుకున్నారు. ఇప్పుడు మిత్రపక్షాల పేరుతో విభజన రేఖ చెదిరింది. ప్రజల దృష్టిలో కమ్యూనిస్టుల ప్రత్యేకత పలుచనైంది. బ్రిటిష్ పాలనలోనే స్థానిక ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. బాట్లేవాలా ఏపీ పర్యటనలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. కాంగ్రెస్ ఎందుకు అరెస్టు చేయాలని కమ్యూనిస్టులు ఎండగట్టారు. స్వాతంత్య్ర సమరయోధులను విడుదల చేయాలని కమ్యూనిస్టు పార్టీ పోరాడింది. 1946లో ఏపీలో ప్రకాశం ప్రభుత్వం అరెస్టు చేసిన వారిని విడుదల చేసింది. విడుదల చేయాలని డిమాండు చేసిన కమ్యూనిస్టులను మాత్రం జైలులోనే ఉంచింది. రాజ్యాధికారం చేతికి రాకముందే బూర్జువా పార్టీ కమ్యూనిస్టుల పట్ల అనుసరించిన వైఖరి ఇది. ఇది బూర్జువా వర్గ లక్షణం. రాజ్యాధికారమే బూర్జువావర్గం చేతిలో ఉన్న ప్రస్తుత దశలో ఇంకా కమ్యూనిస్టు శ్రేణులలో బూర్జువా పార్టీల పట్ల తరతమ స్థాయిలలో భ్రమలు, అవగాహనా లోపాలు వ్యక్తమవు తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాట దశ నుంచి, స్వతంత్ర భారతదేశ పాలనాధికారం చేజిక్కించుకునే క్రమంలో కాంగ్రెస్పార్టీ బడా బూర్జువావర్గ ప్రతినిధిగా ఎట్లా ఎదిగిందో గ్రహించటంలోనే సుందరయ్య వంటి మహనీయుల గొప్పతనం ఉన్నది. అట్లాంటి కాంగ్రెస్ లక్షల కోట్ల ఆస్తిపరులైన బడా బూర్జువావర్గ ప్రతినిధిగా మరింత స్థిరపడిన నేడు, సామ్రాజ్యవాదులతో మరింతగా పెనవేసుకున్న నేటి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పట్ల సానుకూల ధోరణులు వ్యక్తమవుతున్నాయి.
1982 నాటికే సీపీఐ(ఎం) కార్యక్రమం సరైందని రుజువైందనీ, అందుకు సీపీఐ(ఎం) బలపడిన తీరే నిదర్శనమనీ సుందరయ్య చెప్పారు. అది నిజమే! తర్వాత మూడున్నర దశాబ్దాల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడింది. అంతర్జాతీయ పరిస్థితులలో వచ్చిన మార్పు కూడా ఇందుకు దోహదపడింది. కానీ ఈ కాలంలో బూర్జువాపార్టీల పట్ల కమ్యూనిస్టు ఉద్యమం అనుసరించిన వైఖరిని కూడా పరిశీలించుకోవాలి కదా! పార్టీ బలపడినప్పుడు మన విధానం కారణమైనప్పుడు, బలహీనపడినప్పుడు కూడా మన విధానంలో లోపాలు కారణం కావాలి కదా! విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) మహాసభ ఈ విషయాల పట్ల దిశా నిర్దేశం చేసింది. ఆ దిశలో కమ్యూనిస్టు ఉద్యమంలో అవగాహన మరింత పరిపుష్టం కావాల్సిన సమయమిది. శాంతియుత మార్గాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోగలమా అన్న విషయంలో కమ్యూనిస్టు ఉద్యమంలో 1956 తర్వాత విభేదాలు మొదలైనాయి. ఆ విభేదాలు పెరిగి పెద్దవై సీపీఐ(ఎం) ఏర్పాటుకు దారితీసాయి. ప్రజా ఉద్యమం, విప్లవ పోరాటాలు, విప్లవపార్టీ నిర్మాణం మీద ఆధారపడి ముందుకు సాగాలన్నది సీపీఐ(ఎం) కార్యక్రమం ఆదేశిస్తున్నది. ఇప్పుడు బూర్జువా పార్టీలతో పొత్తులూ, అవగాహనలూ, పదవులుంటేనే ఉద్యమం ముందుకు పోతుందా? సుందరయ్య పేరు చెప్పి గర్వపడటం కాదు. సుందరయ్య వారసత్వం అంటే ఏమిటో పరిశీలించాల్సిన సమయమిది. అందుకే... సుందరయ్యలు కావాలిప్పుడు. అవును.. సుందరయ్యలే కావాలిప్పుడు.
- ఎస్. వీరయ్య