Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి కాలం చెల్లదు
కమ్యూనిజానికీ అంతే..
ప్రశ్న ఉన్నంతవరకూ
సమాధానం ఉంటుంది
సమస్య ఉన్నంత వరకూ
పరిష్కారం ఉంటుంది
ఆకలికి పరిష్కారం కమ్యూనిజం
దోపిడీకి సమాధానం కమ్యూనిజం
ఆకలి- దోపిడీ అంతం కావాలని కాంక్షించేవాడు
కమ్యూనిజాన్ని కాంక్షించడం అనివార్యం- కాబట్టి
కమ్యూనిజం అజరామరం..!
ప్రపంచ వ్యాప్త పరిణామాలు, దేశంలో హిందూత్వ శక్తుల విజయాల నేపథ్యంలో కమ్యూనిస్టుల భవితవ్యంపై ప్రజావ్యతిరేక శక్తుల దాడుల పరంపర కొనసాగుతున్న కాలమిది. కమ్యూనిస్టు క్యాడర్ను నిస్సహాయతలో, నైరాశ్యంలో ముంచి, కార్యక్షేత్రం నుంచి వారి నిష్క్రమణే థ్యేయంగా ఆర్థికం (పెట్టుబడిదారులు), ఆథ్యాత్మికం (మతతత్వ శక్తులు), అధికారం (పాలకులు) కలిసి ముప్పేటదాడి సాగిస్తున్న సందర్భమిది. ఎన్నికల విజయాలే కమ్యూనిస్టుల బలానికి చిహ్నాలుగా భ్రమిస్తూ, పార్లమెంట్ ఎన్నికల్లో దేశం మొత్తం మీద కమ్యూనిస్టు పార్టీలు కేవలం 5సీట్లకు మాత్రమే పరిమితమవ్వడాన్ని చూపిస్తూ చంకలు గుద్దుకుంటున్నారు వ్యతిరేకులు. తమ కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారహౌరులో ప్రజలను అయోమయంలో పడవేసేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. అయితే, ఎన్నికల విజయాలను కమ్యూనిస్టుల బలానికి సాక్ష్యాలుగా గుర్తించేటంతటి అవివేకులు కారు జనం. వారికున్న అనివార్యతల నుంచి తమ అయిస్టులను ఎన్నికల విజేతలుగా నిలబెట్టినప్పటికీ తమకు నిజమైన మిత్రులెవరో ప్రజలకు తెలుసు. కీలక సమయంలో ఒక్క కమ్యూనిస్టులు మాత్రమే తమ పక్షాన నిలుస్తారన్న సత్యమూ వారెరుగుదురు. అయినా మన ఎన్నికల వ్యవస్థ సృష్టించిన అనివార్యతల నుంచి ప్రజలు తమ నిర్ణయాలకు బద్ధులవుతున్నారు.
ఎన్నికలలో కమ్యూనిస్టుల అపజయం, చట్టసభలలో వారి ప్రాతినిధ్య రాహిత్యం మన ప్రజాస్వామ్యానికే పెనుప్రమాదం. మరో మాటలో చెప్పాలంటే ఎన్నికలు జరుగుతున్న తీరుకు కమ్యూనిస్టుల ఓటమి ఒక నిదర్శనం. సాధారణ ప్రజలు కేవలం ఓట్లేసేందుకు మాత్రమే పరిమితమై, 'పోటీ' వ్యవహారం అపరకుబేరుల సొంతమవుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు తాత్కాలికంగా ఓటమికి గురవుతున్నారు. అయినా కమ్యూనిస్టులకు ఓటములు కొత్తకాదు. వొడిదుడుకులు కొత్తకాదు. దోపిడీదారులు, బూర్జువా పాలకులను ఓటమిపాల్జేసేందుకు ప్రజల తరపున పోరాడుతున్న కమ్యూనిస్టులకు గెలుపు ఓటములు పాఠాలు, గుణపాఠాలే తప్ప వ్యర్థ ప్రయత్నాలు కాదు. కాబట్టే, నేటి ఓటమిని రేపటి గెలుపునకు ఒక హామీగా స్వీకరిస్తాడు కమ్యూనిస్టు. కమ్యూనిస్టుల గెలుపు ప్రజలది, ప్రజల ఓటమి కమ్యూనిస్టులదని అర్థం చేసుకుంటే ఎలాంటి గాబరాకు ఆస్కారం లేదు.
కమ్యూనిస్టులకు ఓట్లేయని జనం ఉద్యమాలలో ఉప్పెనలా వారివెనుక కదలబారుతుండటం కండ్ల ముందటి సత్యం. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు.. ఒక్కరనేమిటి ఈ దేశంలో తమ సమస్యల పరిష్కారం కోసం కదలబారుతున్న ప్రతి సమూహం వెనుక కమ్యూనిస్టులు ఉన్నారు. మతతత్వ, బూర్జువా పార్టీలకు చెందిన ప్రభుత్వాలు అనుసరించే ప్రతి ప్రజావ్యతిరేక విధానాన్నీ కమ్యూనిస్టుల నాయకత్వంలోనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎదిరిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుల మెడలువంచి తమ సమస్యలను సాధ్యమైనంతగా పరిష్కరించుకోగలుగుతున్నారు. మరోవైపు సామాజిక అణచివేతలకు గురవుతున్న సమూహాలకు, కుటుంబ, లైంగిక హింసకు గురవుతున్న మహిళలకూ అండగా నిలుస్తున్నదీ వారి తరపున నిందితులు, నేరస్తులతో కలబడుతున్నదీ కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులు లేని నిలదీతను, కమ్యూనిస్టులు లేని ఎదురీతను, కమ్యూనిస్టులు లేని కార్యసాధనను కలనైనా ఊహించలేని పరిస్థితి.
జీవితం అనేక వైరుధ్యాలమయం. ప్రజాజీవితం ఒక వైరుధ్యాల పుట్ట. ఆర్థికం ఒక వైరుథ్యం, ఆథ్యాత్మికం ఒక వైరుథ్యం, సామాజికం ఒక వైరుథ్యం, సంసారం ఒక వైరుథ్యం... అన్ని వైరుధ్యాలూ అన్ని వేళలా ప్రధాన వైరుధ్యాలు కావు. ఒకో సమయంలో ఒకో వైరుధ్యం ప్రధాన వైరుధ్యంగా ముందుకొస్తుంది. తమ ముందుకొచ్చిన ప్రధాన వైరుధ్యం మీదే అప్పటికి ప్రజల కేంద్రీకరణ ఉంటుంది. కాగా, ప్రజాజీవితంలోని అప్రధాన వైరుధ్యాలను ప్రధాన వైరుధ్యాలుగా ముందుకు తీసుకొచ్చేందుకు దోపిడీ వర్గం ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రజల ఆలోచనలను అప్రధాన వైరుధ్యాల మీద కేంద్రీకరింపచేసి, తద్వారా వారి ప్రతిఘటనా శక్తిని నిర్వీర్యంచేసి తమ దోపిడీని నిరాటంకంగా సాగించేందుకు నిరంతరం యత్నిస్తుంది. ఇందులో భాగమే మన దేశంలో ఇప్పుడు మతతత్వం ఒక ప్రధాన వైరుధ్యంగా ముందుకు రావడం. ప్రజల భౌతిక జీవితాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయలేని మతాన్ని ఒక ప్రధాన సమస్యగా, దాని పరిష్కారాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు తేవడం జరిగింది. మతం పేరుతో ముందుకు తేబడిన సమస్య పరిష్కరించబడ్డా, పరిష్కరించబడకున్నా ప్రజలకు వొరిగేదేమీ లేదు. అలాగే, దాన్ని పరిష్కరించడం దాన్ని సృష్టించిన వారి చేతుల్లోనూ లేదు. నిజానికి అదొక అభూత కల్పన. ఎండమావి. ఆ ఎండమావి నీళ్లకోసం ప్రజలను పరుగులెత్తించడంలోనే దోపిడీశక్తుల కుతంత్రం దాగి ఉంది. ప్రజలు ఆ ఎండమావి వెంట పరిగెడుతూ ఉండాలి, వారి దృష్టిలో పడకుండా తమ దోపిడీ సాఫీగా సాగిపోతూ ఉండాలి- ఇదీ వ్యూహం. ఈ వ్యూహంతో దోపిడీ వర్గం సాధిస్తున్నది ఇప్పుడు విజయం. అయినా, పెట్టుబడిదారీ దోపిడీవర్గ విజయాలు తాత్కాలికం. ఎందుకంటే తన సహజ లక్షణాలైన ఆకలి, అభద్రత, నిరుద్యోగాలలోనే తన పతనాన్ని ఇమడ్చుకుని ఉంది దోపిడీ వర్గం. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటూ ఉన్న ఆకలి, అభద్రత, నిరుద్యోగ సమస్యలను తీర్చడం దానికి అసాధ్యం. ప్రజలను ఈ మూడింటిలో ముంచడం ద్వారానే తన ఉనికిని నిలుపుకుంటున్న పెట్టుబడిదారీ వర్గం ఈ సమస్యలు పరిష్కారమైన మరుక్షణం నిర్రనీల్గి చస్తుంది. కాబట్టి తన ఉనికిని నిలుపుకునేందుకోసం ఈ సమస్యలను సజీవంగా నిలిపేందుకు తుదకంటా ప్రయత్నిస్తుంది. అయితే ఆ ప్రయత్నాలు కూడా విఫలమవుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించబట్టే భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ 'సమాన అవకాశాలు కల్పించకపోవడం వలన పెట్టుబడిదారీ వ్యవస్థ విచ్చిన్నమవుతోంది. అది సమాన అవకాశాలు కల్పించడం లేదు. వెనుకబడుతున్న జనం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ (క్యాపిటలిజం) వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగడం ఆగిపోయింది. ఫలితంగా మెజారిటీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు.. పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడింది' అని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా రఘురాం రాజన్ లాంటి మేథావులు అనేకమంది (వీళ్ళు కమ్యూనిస్టులు కాదు సుమా!) పరిస్థితిని చక్కదిద్దుకోకుంటే మొదటికే మోసమొస్తుందని, పెట్టుబడిదారీవ్యస్థ సామాన్య జనం చేతిలో కూల్చబడటం ఖాయమనీ పెట్టుబడిదారులకు హితవు చెబుతున్నారు. కానీ, లాభాలు, అధిక లాభాలు, అనంతలాభాలు అంటూ కలవరించే క్యాపిటలిస్టులకు ఈ హెచ్చరికలు, హితబోధలూ చెవికెక్కవు. వాళ్ళు తమ దారిలో మరింత దూకుడుగా దూసుకెళుతూనే ఉంటారు.
ప్రజలు బతకాలి. తమ లాభాలు పెంచేందుకు మాత్రమే ప్రజలు బతకాలి. తాము ఆధిపత్యం చెలాయించేందుకు మాత్రమే సామాన్యజనం శ్వాస పీల్చుకోవాలి. ప్రజలు జీవించాలి. తమ దోపిడీని ప్రతిఘటించనంతవరకు మాత్రమే ప్రజలు జీవించి ఉండాలి.. అని ఆకాంక్షించే దోపిడీదారులు అందు కోసం మతాన్ని, హింసనూ ప్రయోగిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయేకొద్దీ మతం, సైన్యాల పాత్ర పెరిగిపోతుంది. మరో మాటలో పెరుగుతున్న మతం, సైన్యాల పాత్ర పెట్టుబడిదారీ వర్గ సంక్షోభాన్ని సూచిస్తోంది. కచ్చితంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, మరీ ముఖ్యంగా మన దేశంలో ఇదే జరుగుతోంది. మున్నెన్నడూ లేనంతగా ఎన్నికలలో మతం, సైన్యం పాత్ర కీలకం కావడం మనం చూస్తున్నాం. ప్రజల ప్రధాన భౌతిక సమస్యలు కేంద్రంగా సాగాల్సిన ఎన్నికలను మతం, సైన్యం ఆక్రమించిన నేపథ్యంలో కమ్యూనిస్టులు తాత్కాలికంగా వెనుకబడుతూ ఉండవచ్చు. కమ్యూనిస్టుల సిద్ధాంతాలు, ఆశయాలకు దూరంగా ఎన్నికల 'బరి' సృష్టించబడిన స్థితిలో కమ్యూనిస్టుల పాత్ర అప్రధానంగా కనిపించవచ్చు. కానీ ఎన్నికలు, ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాల పరిధికి మాత్రమే ప్రజల జీవితం పరిమితమై లేదు. ఉండదు. ఆ పరిధికి వెలుపల అనంతమైన బతుకు పోరాటం ఉంది. ఆ పోరాటంలో అణువణువునా కమ్యూనిస్టుల పాత్ర ఉంది. ఉంటుంది. కాబట్టి, తమకు యుద్ధరంగం లేదని కమ్యూనిస్టులు చింతించాల్సిన పనిలేదు. తమ కమ్యూనిస్టులు యుద్ధరంగంలో లేరని వారి అభిమానులు గాబరా పడాల్సిన అగత్యం లేదు. కమ్యూనిస్టుల బలానికి ఎన్నికల విజయం మాత్రమే కొలమానం కాదు.
సమస్త జీవన రంగాలలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి ఎర్రజెండా నాయకత్వాన కదులుతున్న కోట్లాది కష్టజీవుల కాలి గుర్తులే కమ్యూనిస్టుల బలం. ఈ ఉద్యమ బలాన్ని ఎన్నికల యుద్ధానికి కూడా సన్నద్ధం చేయడం అవసరం. ఆ కర్తవ్యంలో నిమగమవుదాం.
- కోప్ర
సెల్:6301289321