Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మృగశిర కార్తి వస్తోంది. మళ్లీ బత్తిన సోదరుల చేప ప్రసాద ఫలితంపై శాస్త్రీయ పరిశోధన జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) వారు కూడా ప్రభుత్వానికి సవాలు విసురుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోగా, దీనికి ఇంకా ప్రాచుర్యం, పంపిణీ కోసం మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. దీనిపై శాస్త్రీయ పరిశోధన కోసం ఇంత పట్టుపట్టడానికి కారణం 1990లో మా అమ్మగారు జూన్ 8న చేపమందు తిని జూన్ 18న మరణించారు. ఆమె చిన్నప్పటి నుంచీ ఉబ్బసం వ్యాధితో బాధపడేవారు. అలోపతి, హౌమియోపతి, ఆయుర్వేదం మందులు వాడినా ఆమె రుగ్మతకు తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత ఫలితం చేకూరలేదు. నాకిష్టంలేకపోయినా ఆమె కోరిక మేరకు 1990 జూన్ 8న ఈ చేప ప్రసాదం తీసుకొని మాకు శాశ్వతంగా దూరమైపోయింది. నేను ఆనాడే ఈ విషయాన్ని ఒక దినపత్రికకు లేఖద్వారా తెలిపాను. కాని వారు స్పందించలేదు. బత్తిన సోదరులపై ఫిర్యాదు చేయాలన్నా మనకు వారు ఎలాంటి రశీదు ఇవ్వరు. కాబట్టి మన దగ్గర ఏ ఆధారాలూ ఉండవు. మా అమ్మ కాకుండా నాకు తెలిసిన బంధువులు, స్నేహితులు ఎన్నో ఏండ్లుగా ఈ చేప ప్రసాదాన్ని తింటున్నారు. కాని ఇంతవరకు ఏ ఒక్కరు దీనివల్ల జబ్బు నయమైందని చెప్పలేదు. గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబునాయుడి అధికార సమయంలో వారితో పాటు వారి ముఖ్య అనుచరుడు దేవేందర్గౌడ్ ప్రజల సమక్షంలో చేప ప్రసాదాన్ని ఆరగించి దీనికి మరింత ప్రాచుర్యం కల్పించారు. వారు దీనిని ఓటు బ్యాంక్ కార్యక్రమంగా చేశారు. వారి తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరించింది. మేము కోరేదొక్కటే, దీని కోసం లక్షల రూపాయల ప్రభుత్వ ధనం, ఉద్యోగస్తుల ముఖ్యంగా రవాణా, పోలీసు, నీటిశాఖల పనిదినాలు వ్యర్థమవుతున్నాయి. లక్షలమంది అమాయకంగా వచ్చి రెండు మూడు రోజులు అన్నపానాధులు లేక అవస్థపడుతున్నారు. ఈ మధ్యన ఎవరో ఒకరు హైకోర్టులో దీనిపై కేసు వేస్తూ ప్రభుత్వం దీని కోసం ఎందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు తప్ప దీని శాస్త్రీయ ఫలితంపై ప్రశ్నించకపోవడం విచారకరం. హైకోర్టు కూడా లక్షల మంది వచ్చినప్పుడు వారి భద్రత కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే తప్పేమిటని ప్రశ్నించింది. కాని శాస్త్రీయ ఫలిత ప్రభావంపై దృష్టిపెట్టలేదు. కనీసం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశించాము. కానీ ఈ ప్రభుత్వం కూడా మరింత ముందుకెళ్లి వారికి అనేక సదుపాయాలు కల్పిస్తోంది. దీనిని వీరు కూడా ఓటుబ్యాంక్ దృష్టితోనే చూస్తున్నారు తప్ప వాస్తవ పరిస్థితిని గమనించాలన్న ధ్యాసలేదు. కనీసం చదువుకున్న, విజ్ఞానవంతులైన ప్రభుత్వంలోని అధికారులు, విద్యావంతులు, మేథావులనుకునే వారయినా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి చేప ప్రసాద ఫలితంపై శాస్త్రీయ పరిశోధన చేసే దిశగా చర్యలు చేట్టేలా చూడాలి. లేకపోతే గుడ్డెద్దు చేలోపడ్డట్టు ఈ కార్యక్రమం సాగుతూ లక్షల ప్రభుత్వ, ప్రజల సొమ్ము గంగపాలవుతుంది. మనకు తెలియకుండానే ఎంతోమంది ఆరోగ్యాలనూ హరిస్తుంది.
- అల్వాల్ రెడ్డి