Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు తమ గళాన్ని వినిపించే వామపక్ష భావజాల పార్టీలు ఎన్నికల క్షేత్రంలో మెరుగైన స్థానాలను పొందలేకపోతుండడం ప్రజాస్వామ్య భారతదేశానికి కొంత నిరుత్సాహకరమైన విషయం. వామపక్షాలకు కేవలం పాలకపక్షాలు చేసే ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు పెద్దఎత్తున ప్రజల మద్ధతు లభిస్తుంది.. కానీ ఓట్లరూపంలో ఆశించినంతగా ఫలితాలు సాధించలేకపోతుండడానికి పలు అంశాలు, కారణాలు అనేకం. ప్రపంచీకరణ, నయా ఉదారవాద నిర్ణయాలు, ప్రయివేటీకరణ వంటి మౌలిక ఏకపక్ష పెట్టుబడీదారి విధానాల కారణంగా భారతదేశ ఆర్ధికవ్యవస్థలో అసమానతలు ఏడాదికేడాది పెరిగిపోతుండడం జగమెరిగిన సత్యం. ఇటువంటి విధానాల ఫలితంగా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోతున్న పేద, మధ్యతరగతి ప్రజలు మౌలిక సమస్య అయిన ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్థిక నిర్ణయాలను గుర్తించకుండా రాజకీయపార్టీలు, కార్పొరేట్ మీడియా సంస్థలు కావాలని పక్కదారి పట్టించే సున్నితమైన అంశాలైన మతం, కులం, వర్గం, ప్రాంతం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక కారణం. ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాలు, వామపక్ష భావజాల పార్టీలు విస్తతంగా ప్రజా క్షేత్రస్థాయిలో నయా ఆర్థికవిధానాల కారణంగా ఏర్పడుతున్న ఆర్థిక అసమానతల గురించి ప్రజలకు తెలియజేసే విధంగా మరింతగా వినూత్న ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రపంచీకరణ, నయా ఆర్థిక విధానాలను సమర్థించే కార్పొరేట్ మీడియాను సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా గ్రామస్థాయిలో పలు సాంస్కతిక కళా రూపాలలో ప్రజాసమస్యలపైన, వాటికి కారణమైన ఆర్థిక విధానాలపైన ప్రచారం చేసే కార్యక్రమాలను చేపట్టాలి. ప్రజావ్యతిరేక విధానాల వెనుక కచ్చితంగా పెట్టుబడీదారి వ్యవస్థ ఉంటుందన్న వాస్తవాన్ని ఆయా ప్రజలనుంచి వస్తున్న అసంతప్తులను, ఉద్యమాలను ఆసరా చేసుకొని వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ జాగృతం చేయాల్సిన బాధ్యత ప్రతి వామపక్ష కార్యకర్తకూ ఉంది. పలు వామపక్ష భావాలు కలిగిన రాజకీయ పార్టీలు ఏకీకృత లక్ష్యంతో ఆర్ధిక అసమానతలను పెంచే పెట్టుబడిదారులకు, బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వామపక్షాలకు ఉన్న గొప్పతనం ఏమిటంటే మొక్కవోని దీక్షతో నిరంతరం ప్రజా వ్యతిరేక విధానాలకు దీటుగా ప్రజా ఉద్యమాలను నిర్మిస్తూ ప్రజల పక్షాన నిలవడం. నిజానికి వామపక్ష పార్టీలకు పార్లమెంటు ఎన్నికలే పరమావధి కాదు. కానీ అన్ని బూర్జువా రాజకీయ పార్టీలకు పార్లమెంటు ఎన్నికలే పరమావధి. అందుకే ఎన్నికల గెలుపుకోసం ధన, బల, కుల, మత, వర్గ, ప్రాంతీయ విద్వేషాలను, చివరికి దేశభక్తిని కూడా జోడిస్తూ ప్రజల బలహీనతలపై ఆధారపడి ఓట్లను దండుకుంటున్నారన్నది సత్యం. వారికి ప్రజాసమస్యలకన్నా కార్పొరేట్ సంస్థలకు మేలుచేసే నయా ఉదారవాద ఏకపక్ష ఆర్థిక విధానాల అమలే ముఖ్యం. అందువల్లనే బూర్జువా రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థలు వెదజల్లే అవినీతి సొమ్ముకు దాసోహమంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వామపక్ష భావజాల సంఘాలు, ప్రజాసంఘాలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో కలసికట్టుగా కార్యాచరణను రూపొందించుకొని ప్రజావ్యతిరేక విధానాలకు దీటైన ఉద్యమాలను నిర్మించాలని ఆశిద్దాం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆకాంక్షిద్దాం.
- శ్రీవరం గుణశేఖర్
సెల్: 7382348735