Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా తలెత్తినన్ని ప్రశ్నలు గత రెండు దశాబ్దాల్లో తలెత్తలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటం మొదలు నిన్న మొన్నటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల తరలింపు వరకు ఎన్నికల సంఘం అనేక కీలకమైన ప్రశ్నలకు అర్థవంతమైన సమాధానాలు చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారమే 370 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకూ లెక్కించిన వాటికీ మధ్య తేడా ఉన్నది. ఈ తేడా కూడా ప్రతిపక్షాలు శక్తివంతంగా ఉన్న రాష్ట్రాల్లో పోలైన ఓట్లకంటే తక్కువ ఓట్లు లెక్కించగా బీజేపీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో పోలైన ఓట్లకన్నా ఎక్కువ ఓట్లు లెక్కించారు. ఈ తేడాలు ఎందుకు వచ్చాయి అన్న ప్రశ్నలు తలెత్తగానే సదరు సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్ నుంచి తీసేసి చేతులు దులిపేసుకుంది. అటువంటి అనేక చర్యల కారణంగా ఈ రెండు నెలల్లో ప్రజాస్వామ్యం పట్ల ఎన్నికల సంఘం నిబద్దతను ప్రశ్నార్థకం చేసిన కొన్ని ముఖ్యమైన పరిణామాలను పరిశీలిద్దాం. ఎన్నికల సంఘం పనితీరును, ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలని చర్చిస్తున్నంత మాత్రాన ఇదే ఎన్నికల వ్యవస్థ ద్వారా సమూల మార్పులు సాధించాలన్న భ్రమలున్నాయని విమర్శించబూనుకోవటం వాస్తవికతను గుర్తించ నిరాకరించటమే అవుతుంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ వరుసగా నైతిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ వచ్చారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో చనిపోయిన సైనికుల పేరు మీద ఓటు వేయాలని కోరటం నుంచి తన ఎన్నికల ప్రచారానికి కావల్సిన రీతిలో ఆయా రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకోవటానికి ప్రధాని కార్యాలయాన్ని దుర్వినియోగిం చేయటం వరకూ అనేక ఉల్లంఘనలు జరిగాయి. మత విశ్వాసాల ప్రాతిపదికన ఓట్లు అడగరాదని ప్రజా ప్రాతినిధ్య చట్టం స్పష్టంగా ఆదేశిస్తోంది. బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల్లో సగానికిపైగా అభ్యర్థులు కేవలం మత విశ్వాసాలనే తమ ఎన్నికల ప్రచారంలో పావులుగా వాడుకున్నారు. అనైతిక ఎన్నికల ప్రచారానికి పాల్పడ్డారు. కానీ ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఎన్నికల సంఘం ఈ ఉల్లంఘనలను అడ్డుకోవటంలో దారుణంగా విఫలమైంది.
ప్రధాని విషయంలో ఎన్నికల సంఘం వైఫల్యం మరింత స్పష్టంగా కనిపించింది. దీన్ని వైఫల్యం అనేకంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఉల్లంఘనల్లో ఎన్నికల సంఘం భాగస్వామి అయ్యిందని చెప్పాలి. తద్వారా తన స్వతంత్ర ప్రతిపత్తిని పాలక పార్టీకి కుదవపెట్టింది. ఈ సందర్భంగానే మరో విషయాన్ని గుర్తు చేయాలి. ప్రతి పోలింగ్ తేదీకి ముందు 48గంటల పాటు ఎటువంటి ప్రచారం చేయకూడదన్న ఆంక్షలు ఉన్నాయి. కానీ ఈ నలభై ఎనిమిది గంటల సమయంలో బీజేపీ ఫేస్బుక్ ద్వారా వేలాది ప్రచార ప్రకటనలు ఇచ్చింది. కనీసం ఈ విషయాన్ని కూడా నిరోధించటానికి ఎన్నికల సంఘం ప్రయత్నం చేయకపోవటం గమనిస్తే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీ ఎన్నికల ప్రచార విభాగంగా పని చేసిందని విమర్శించకుండా ఉండలేము. ఈ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి చెందిన కేంద్ర ఎన్నికల కమిషనర్లలో ఒకరు ఈ నిర్ణయాలు తీసుకున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తన అభ్యంతరాలు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయినా ప్రధాన ఎన్నికల కమిషనర్కు ఈ మాత్రం ప్రజాతంత్రయుతంగా వ్యవహరించాల్సిన ఇంగితం కనిపించలేదు.
మరో కీలకమైన అంశం వీవీపాట్లకు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు సంబంధించింది. ఎన్నికల ప్రచారం సాగుతుండగానే ప్రతిపక్షాలు ఈ విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశవ్యాప్తంగా వేలాది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. అనేక చోట్ల విచిత్రమైన రీతిలో ఏ బటన్ నొక్కినా బీజేపీకి ఓటు వెళ్తుందని కూడా వీడియోలు విడుదలయ్యాయి. కానీ ఎన్నికల సంఘం ఈ మొత్తం వ్యవహారాన్ని సాదాసీదాగా కొట్టిపారేసింది. కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్ల్రాల్లో అడ్డగోలుగా మొరాయించిన ఓటింగ్ యంత్రాలు బీజేపీ ఆధిపత్యం కలిగిన రాష్ట్రాల్లో రాముడు మంచి బాలుడు అన్నట్టు పనిచేసాయి. ఈ వ్యత్యాసాన్ని గమనించినప్పుడు కాంగ్రెస్ నేత రషీద్ ఆల్వీ వ్యాఖ్యలకు బలం చేకూరుతుంది. గత ఐదేండ్లలో బీజేపీ ఓటింగ్ యంత్రాలతో రిగ్గింగ్కు పాల్పడిందనీ, ప్రజలకు మరీ ఎక్కువ అనుమానాలు రాకుండా ఉండేందుకే మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ యంత్రాల్లో జోక్యం చేసుకోలేదని రషీద్ ఆల్వీ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో కూడా బీజేపీయే గెలిస్తే ప్రజలకు ఓటింగ్ యంత్రాలపై నమ్మకం పోతుందని, సుప్రీం కోర్టు కూడా బ్యాలెట్కు మళ్లమని ఆదేశిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన బీజేపీ వ్యూహకర్తలు ఈ లోక్సభ విజయం కోసం మూడు రాష్ట్రాలు త్యాగం చేశారన్నది రషీద్ ఆల్వీ మాటల అంతరార్థం.
ఇక వీవీపాట్ల లెక్కింపు విషయానికి వద్దాం. వీవీపాట్ల లెక్కింపునకు, ఓటింగ్ యంత్రాల లెక్కింపునకు మధ్య తేడా వచ్చినప్పుడు వీవీపాట్ల లెక్కింపునే ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ఎన్నికల సంఘం కూడా అంగీకరించింది. ఈ తీర్పును గమనించినప్పుడు మనకు ఓ విషయం స్పష్టమవుతుంది. ఓటింగ్ యంత్రాల లెక్కింపునకు, వీవీపాట్ల లెక్కింపునకు మధ్య తేడా వచ్చే అవకాశం ఉందన్న విషయం స్పష్టం. మరి అలాంటప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల్లోని వీవీపాట్లను లెక్కిస్తే తప్ప తేడా ఉందా లేదా అన్నది నిర్ధారించలేము. కానీ ఏప్రిల్లో ఇచ్చిన మరో తీర్పులో సుప్రీం కోర్టు ఒక్కో నియోజకవర్గానికి ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీవీపాట్లు లెక్కిస్తే సరిపోతుందని చెప్పింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో లక్షల ఓట్లు ఉంటాయి. ఒక్కో బూత్లో మహా అయితే వెయ్యి ఓట్లు పోలవుతాయి. ఐదు వేల ఓట్లు మాత్రమే ఓటింగ్ యంత్రంతో సరి చూసినప్పుడు తేడా లేదు. కాబట్టి మొత్తం నియోజకవర్గంలో మరే బూత్లోనూ పోలింగ్లో అవకతవకలు, అక్రమాలు జరగలేదు అని నిర్ధారించటం ఏ రకంగా సబబు? ఈ చిన్నపాటి సూత్రం సుప్రీం కోర్టుకు అర్థం కాలేదని భావించలేము. అయినా నూరుశాతం వీవీపాట్లు లెక్కించాలన్న ప్రతిపక్షాల విన్నపాన్ని తిరస్కరించింది. ఏ ఒక్క అనుమానానికి తావు లేకుండా పోలింగ్ప్రక్రియను పూర్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ప్రవర్తన ఇన్ని సందేహాలకు తావిచ్చేదిగా ఉండటం మొత్తంగా పోలింగ్ ప్రక్రియ మీదనే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే స్థితికి నెడుతోంది. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు ఉన్నావో ఎంపీ సాక్షి మహారాజ్ మరో సారి మోడీ అధికారానికి వస్తే దేశంలో మళ్లా ఎన్నికలతో పని లేదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సంఘం ప్రవర్తనను మరింతగా వీధిపాల్చేసే రీతిలో సాగిన ఓటింగ్ యంత్రాల వివాదానికి పైన పేర్కొనట్టు ఓటింగ్ యంత్రాలపై అనుమానాలకు మధ్య సంబంధం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సమాచార హక్కు కింద వెల్లడించిన సమాచారం ప్రకారం దాదాపు 20లక్షల ఓటింగ్ యంత్రాలు ఎన్నికల సంఘం ఆధీనంలో లేవు. ఈ యంత్రాలు తయారు చేసిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద ఉన్న లెక్కకు ఎన్నికల సంఘం స్వాధీనంలో ఉన్న ఓటింగ్ యంత్రాల సంఖ్యకు మధ్య 20 లక్షలు తేడా ఉన్నాయి. దేశంలో పది లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో నాలుగు యంత్రాలు ఉపయోగించాల్సి ఉంటుందన్న అంచనా ప్రకారం లెక్కించినా మొత్తం 40 లక్షల ఓటింగ్ యంత్రాలు ఈ ఎన్నికల్లో అవసరం అవుతాయి. కానీ 20 లక్షల ఓటింగ్ యంత్రాలు ఫ్యాక్టరీ గేటు దాటి పోయాయి కానీ ఎన్నికల సంఘానికి చేరలేదు. మరి ఈ 20 లక్షల యంత్రాలు ఎక్కడున్నాయి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? వీటి గురించి ఎన్నికల సంఘం కనీసం కేసు కూడా నమోదు చేయకుండా ఎందుకు చేతులు ముడచుకుని కూర్చుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది ఎన్నికల సంఘమే. నిజంగా ఈ 20లక్షల ఓటింగ్ యంత్రాలు రాజకీయ పార్టీల స్వాధీనంలో ఉంటే పోలింగ్ అయ్యాక వీటితో పోలింగ్ జరిగిన యంత్రాలను తారుమారు చేయరన్న నమ్మకం ఏమిటి? అవన్నీ అపోహలేనని, ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉన్నాయని ఓ నాలుగు లైన్ల ప్రకటన జారీ చేసి ఎన్నికల సంఘం ఈ ప్రశ్నలన్నింటినీ చాపకిందకు నెట్టేసింది.
ఈ ప్రశ్నలన్నీ భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కర్తవ్యంతో ముడిపడి ఉన్న ప్రశ్నలు. ఎన్నికల యంత్రాలు టాంపరింగ్కు వీలుకాదన్న ఒకే ఒక్క అంశంపై మొత్తం ఎన్నికల వ్యవస్థ ఆధారపడి నడుస్తోంది. ఇప్పటికే వీటిని టాంపరింగ్ చేయవచ్చని అనేకమంది టెక్నోక్రాట్లు అభిప్రాయపడుతున్నారు. టెక్ ఫర్ ఆల్ సంస్థ ఈ విషయాన్ని నిరూపించటానికి సిద్ధంగా ఉన్నామని సవాలు కూడా విసిరింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోయినా, తప్పుడు సమాచారంతో సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించినా ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్ధకంగానే మిగులుతుంది. ఎన్నికల వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది. ఎన్నికల వ్యవస్థను అజమాయిషీ చేసేది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం విశ్వసనీయత ప్రశ్నార్థకం కావటం అంటే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం కావటమే. కనీసం రాజ్యాంగ పరిమితులకు లోబడైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల సంఘం పనితీరులో సంస్కరణలు, జవాబుదారీ విధానం కోసం పోరాటం అవసరం. ఈ పోరాటం కూడా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం సాగే పోరాటంలో అంతర్భాగంగా ఉండాలి.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037