Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నిరుద్యోగం 6.1శాతం అని ఇప్పుడు అధికారికంగా ప్రకటించబడింది. ఈ విషయాన్ని, ఇదే సంవత్సరం జనవరిలో 'బిజినెస్ స్టాండర్డ్' పత్రిక ప్రచురించింది. అప్పటి ఈ వివరాలన్నీ అధికారిక మైనవి కావని వివరణ ఇచ్చేందుకు నిటి అయోగ్ ప్రయత్నించి భంగపడింది. అదే నిటి అయోగ్ ఇప్పుడు నిరుద్యోగం 6.1శాతంగా ఉన్నదని, దేశ స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) వృద్ధి 5.8గా నమోదవుతుందని అధికారికంగా ప్రకటించింది. ఒక పత్రిక ప్రకటించిన గణాంకాలను ప్రభుత్వం ప్రకటించకపోవడం, దాచి పెట్టడం ఎన్నికల దృష్ట్యానే అన్నది స్పష్టమైంది. అయితే నెలలు నిండిన గర్భంలా వాస్తవాలు బయట పడ్డాయి. దీనితో పాటు, జీడీపీని లెక్కించే విధానాన్ని మార్చినా దాని తిరోగమన వృద్ధి దానంతటదే బయటపడింది. గత రెండేండ్లుగా వృద్ధి క్షీణిస్తున్నా పక్కనే ఉన్న చైనా వృద్ధి కన్నా మెరుగ్గానే ఉందని ఇన్నాళ్ళూ సాకులు వెతికే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా పోయింది. అమెరికాతో వాణిజ్య ఇరకాటాలు ఎదుర్కొంటూనే చైనా జీడీపీ వద్ధి సాధిస్తున్నది. గత ఆరు నెలలుగా ఎన్నికలు, ఎన్నికల నియమావళి, కోడ్ తదితర అంశాలతో మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థంభించింది. ఆర్థికాభివద్దికీ ఉపాధి కీలకమైనదన్న వాస్తవాలు తెలిశాయి, కాబట్టి, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు త్వరగా చేపట్టాలి.
స్థూల జాతీయ ఉత్పత్తి పెరగాలన్నా, నిరుద్యోగ శాతం తగ్గాలన్నా ఒకటే మందు. అందరికీ ఉపాధి కల్పించడం. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం నిరుద్యోగ శాతం 6.1 అనగా మొత్తం జనాభా 130 కోట్లు అన్నప్పుడు అందులో 18ఏండ్ల లోపు వయసున్న పిల్లలు, 60ఏండ్లు పైబడి లేదా పదవీ విరమణ పొందినవారు, వీరందరిని తీసేస్తే దాదాపు 80 కోట్ల (65శాతం యువత దేశంలో ఉన్నదని ప్రధాని పదే పదే చెబుతుంటారు కూడా) మంది ఉపాధికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ 80 కోట్ల మందిలో 6.1 శాతం లెక్కించినపుడు దాదాపు ఐదు కోట్లమందికి ఈరోజు ఉపాధి లేదన్నమాట. స్థూల జాతీయ ఉత్పత్తి తగ్గడానికి కారణం కేవలం ఉపాధిలేమి మాత్రమే కారణం కాదు. ఉన్న ఉపాధిలో స్థిరీకరణ లేకపోవడం. అనగా జీతభత్యాలలో స్టెబిలిటీ లేకపోవడం, లేదా అండర్ ఎంప్లాయిమెంట్ (స్థాయికి లేదా శక్తికి తగ్గ పని లేకపోవడం వల్ల అవసరమైనంత ఆర్జించ లేకపోవడం) అని చెప్పవచ్చు. లెక్కించబడుతున్న ఈ గణాంకాలలో గ్రామీణ నిరుద్యోగితను సరిగ్గా తీసుకోవడం లేదని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయం దాని ఆధారిత రంగాల్లో అండర్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ. ఉపాధి స్థిరీకరణ సాధించాలి అంటే- ఈరోజు 96 శాతం ప్రయివేట్, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉపాధి లభిస్తున్న చోట స్థిరీకరణ కోసం ప్రత్యేకమైన యంత్రాంగం ఏర్పాటు అవసరం. ప్రభుత్వం ఆ దిశగా దృష్టి పెట్టాలి. ఉద్యోగ కల్పన అనగా కొన్ని కంపెనీలు నెలకొల్పేందుకు అనుమతులిచ్చీ లేదా కొన్ని వ్యాపారాలు మొదలైన తరువాత లభించే ఉపాధిని లెక్కేసి చెప్పడం కాదు. ఏ రంగమైనా లేదా ఏ వ్యక్తుల ద్వారానైనా ఉపాధి కల్పించ బడుతున్నప్పుడు ఆ వృత్తి నైపుణ్యానికీ జీత భత్యాలకూ శాస్త్రీయత ఉండాలి. అనగా నైపుణ్యానికి తగిన పని, పనికి దగ్గ ప్రతిఫలం దక్కాలి. ఈ విషయంపై ఇదివరకు దృష్టి పెట్టలేదు, ఇప్పుడా అవసరం ఉంది. లేదంటే పాత ఫలితాలే పునరావత మవుతాయి. వృత్తుల్లో శాస్త్రీయమైన స్థిరత్వం అభివృద్ది చెందిన దేశాల్లో కళ్ళకు కట్టిన వాస్తవం.
రెపోరేటు తగ్గింపు
సర్వరోగ నివారిణి కాదు
2019 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వరుసగా మూడవ సారి, రేపో రేట్ని పావు శాతం తగ్గిస్తూ 5.75గా ప్రకటించింది. 2015 సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు రెండు శాతం తక్కువ. అనగా 2015లో 7.75శాతం ఉంది. గత తొమ్మిదేండ్లలో ఇదే కనిష్టం. దీని సారాంశం ఏంటంటే డిమానిటైజేషన్(నవంబరు 2016) కన్నా ముందు, ఆ తరువాత కాలానికి రెండు శాతం పరపతి సమీక్షలో తగ్గింది. రేపో రేటును బ్యాంకు రేటు అని కూడా అంటారు. అనగా ఇతర వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపైన విధించే వడ్డీ రేటు అన్నమాట. రివర్స్ రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర దాచుకున్న లేదా నిలువ ఉంచిన డబ్బుపైన ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు ఇప్పుడు 5.5గా ప్రకటించింది ఆర్బీఐ. ప్రస్తుత ద్రవ్యోల్బణం 2.94 దగ్గర ఉన్నది. అనగా ధరల పెరుగుదల ఎక్కువగా లేనట్టే ఇది సూచిస్తుంది. కానీ నిజమైన మార్కెట్ చూసినప్పుడు ఈరోజు టమాట ధర 60 రూపాయలకు కిలో. మిగతా చిల్లర వర్తక ధరలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. అయినప్పటికీ ద్రవ్యోల్బణం తక్కువగా చూపిస్తున్నది. ఇందుకు కారణం ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విధానంలో లోపం, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ప్రతిబింబం (రిఫ్లెక్షన్) తక్కువన్నమాట. ద్రవ్యోల్బణం తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్లో కొనుగోళ్ళు అమ్మకాలు చురుగ్గా ఉండాలి. కానీ వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉన్నది. జీడీపీ వృద్ధిలో తగ్గుదల, నిరుద్యోగం పెరగడం, ఇండిస్టియల్ గ్రోత్ 8.6శాతం దగ్గరే తచ్చాడుతుండడం, ఎగుమతుల మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాల వల్ల దేశీయ మార్కెట్, ముఖ్యంగా వాహన, వస్త్ర రంగాలు, రియల్ ఎస్టేట్, గహౌపకరణాల ఉత్పత్తులన్నిటికీ గిరాకీ స్తంభించింది వీటన్నింటికీ మద్దతు లభించాలంటే ప్రజల దగ్గర కొనుగోలుశక్తి ఉండాలి. ఆ కొనుగోలు శక్తి రావాలంటే ప్రజలకు సంపద అందుబాటులో ఉండాలి, అందుకోసమని రెపో రేటు తగ్గించడం ద్వారా రుణాలు చౌకగా మారి, మార్కెట్లోకి డబ్బు పంపింగ్ చేయబడి (పెట్టుబడులు, రుణాల ద్వారా), కొనుగోలుశక్తి పెరుగుతుందని ఆర్థిక వర్గాల అంచనా. అందుకోసమే ఈ చర్యలు తీసుకున్నారు. తగ్గిన ఈ రేట్లను బాంకులు ఖాతాదారులకూ బదలాయించినప్పుడే ఇది సాధ్యమౌతుంది. ఉదాహరణకు: తీసుకున్న రుణానికి గాను నెలకు ఇరవై వేలు కిస్తు చెల్లిస్తున్న ఒక ఖాతాదారుకు తగ్గించిన వడ్డీరేటుద్వారా తాను చెల్లించే వడ్డీలో ఓ నాలుగు వందలు తగ్గినప్పుడు సదరు రూపాయలను ఇతర వస్తువుల కొనుగోలుకు ఉపయోగిస్తాడు, కాబట్టి ఇతర వ్యాపారాలు కూడా కదలాడుతాయి. ఆ విధంగా కోట్లాది కస్టమర్లకు లాభం చేకూరి మార్కెట్లు కళకళలాడతాయన్నది అంచనా. ఇక్కడ ఒక తిరకాసు వున్నది, బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో సింహ భాగం కంపెనీలూ బడా పెట్టుబడి దారులదే. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల వేల కోట్ల రూపాయల లబ్ది వారికే ఉంటుంది. ఈ యజమానులు కూడా మిగిలిన సొమ్మును మరిన్ని పెట్టుబడులుగా మారుస్తారని, తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించమంటారు ఆర్థిక నిపుణులైన కీన్స్ నుంచి శక్తికాంత్ దాస్ వరకూను. ఈ లెక్కలన్నీ పేపరుపై పులులే. అయితే ఈ సాంకేతిక లెక్కల వల్ల మాత్రమే కొనుగోలుశక్తి పెరిగే అవకాశం తక్కువ. అమెరికాలో రెపో రేటును జీరో దగ్గర మెయింటెయిన్ చేసినప్పుడు కూడా నిరుద్యోగ శాతం ఏడుగా 2008లో నమోదైంది.
ఉపాధి స్థిరత్వం అత్యవసరం
నిలకడ, స్థిరత్వంతో కూడిన ఉపాధి నిరంతర కొనుగోలుశక్తిగా మారి మార్కెట్లను ఎల్లప్పుడూ ఊపు మీద ఉంచుతాయి. ఉపాధి స్థిరత్వాన్ని సాధించాలంటే వ్యవసాయ రంగాన్నీ, సంఘటిత రంగాలను బలపర్చే దిశగా పని చేయాలి. వ్యవసాయ రంగ ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని మరోసారి హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి. దాని కోసం రైతులకిచ్చే అన్ని చేయూతల్లో గిట్టుబాటు ధర ఇవ్వడమే అంతిమ చర్య. అది కాదని వ్యవసాయ పెట్టుబడికి కొన్ని రూపాయలిచ్చి చేతులు దులుపుకుంటే ఉపయోగం లేదు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ, నిటి అయోగ్ మాజీ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా నుంచి అనేకులు పాడుతున్నది ఒకటే పాట ''ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటు పరం చేయడం''. ఇలా చేయడం వల్ల గోడ దెబ్బా చెంప దెబ్బా... రెండూ తగులుతాయే కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే, స్థిరత్వంతో కూడిన వేతానాలిచ్చి మార్కెట్లను ఆదుకోవటంతో పాటు గడించిన లాభాలను ప్రభుత్వ పెట్టుబడులుగా ఉపయోగ పడేందుకు సహకరిస్తున్నది ఈ పి.ఎస్.యూలే. ఇదివరకే ప్రయివేటీకరించబడిన పి.ఎస్.యూల వల్ల ఏ రకమైన ఉపయోగాలు జరిగాయో ప్రభుత్వం వివరించకుండా మళ్ళీ అదే ప్రయత్నం చేయడం నిష్ప్రయోజనం. రెపోరేటు తగ్గడంపై బడా పెట్టుబడి వర్గాలూ హర్షం వ్యక్తం చేశాయి, ఎందుకంటే రుణాలు చౌకగా వస్తాయని. అయితే ఇప్పటి వరకు బ్యాంకులు దాదాపు తొంబై లక్షల కోట్లు రుణాలివ్వగా అందులో పన్నెండున్నర లక్షల కోట్లు మొండిబాకీలయ్యాయి, అనగా 15శాతం. నిజానికి మూడు శాతానికి మించిన మొండి బాకీల వ్యవస్థ బలహీనమైనది. రేటు తగ్గినప్పుడు రుణాలు పెరగటంతో పాటు రానిబాకీలూ, ముఖ్యంగా కార్పొరేట్లవి, పెరుగుతున్నాయి. గత ప్రభుత్వం తెచ్చిన ఇన్సాల్వెన్సీ బాంక్రప్టసీ కోడ్ ఆధారంగా మొండి బాకీదార్ల కంపెనీలను ప్రొవిజన్లను మినహాయించుకుని చౌకగా వేరే కంపెనీ సొంతం చేసుకునే అవకాశం దొరికింది. వెరసి పెరిగిన రానిబాకీలకు ప్రొవిజన్ల ఏర్పాటు కోసం ఉపయోగపడేదీ నిజాయితీగా ఉంటూ బ్యాంకుకు ఒక్క పైసా ఎగ్గొట్టని మధ్యతరగతి జనాల డబ్బులేనన్నమాట! రానిబాకీల కోసం ప్రొవిజన్స్ పెంచుకుంటూ పోవటం, ఐబీసీ క్రింద కంపెనీలను చౌకగా అమ్మేయడం వల్లనే బ్యంకు ఖాతాదారు లకు డిపాజిట్లపై రాబడి తగ్గింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజల్లో పొదుపు కాన్సెప్ట్ సన్నగిల్లుతుంది. గత సంవత్సరం 31శాతంగా దేశీయ పొదుపు ఇప్పుడు 24శాతం ఉన్నది. ఉపాధి కల్పనతో పాటు ఆర్థిక వ్యవస్థలోనూ స్థిరత్వం లోపిస్తే దాని పర్యావసానాలు తీవ్ర ప్రతికూలంగా ఉంటాయి.
రాజకీయ కర్తవ్యం ఆర్థికం కావాలి
ఏ దేశంలోనైనా ఎన్నికలు కొన్ని భావోద్వేగాలపై ఆధారపడి జరగ వచ్చు కానీ తదనంతరం ఆర్థిక అంశాలపై ఎన్నుకోబడిన వారు ద ష్టి పెట్టాలి. కానీ కేంద్రంలో అధికారానికొచ్చిన పెద్దలు అలా కనిపించటం లేదు. హౌం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమితాషా మొదటి మాట ''మాకు దేశ భద్రతా, సరిహద్దులు ముఖ్యం'', కిషన్రెడ్డి మొదటి మాట ''ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారింది'' రాజనాథ్ ''సియాచిన్ సురక్ష...'' గిరిరాజ్ కిషోర్ మరో వివాదాస్పద వ్యాఖ్య..! సరిహద్దులూ.. భద్రతా... ఇవన్నీ ప్రధానమే, కానీ ఇప్పుడవి ఏమైనా ప్రమాదంలో ఉన్నాయా? అనవసరమైన స్టేట్మెంట్లతోనే అవి ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది ఆర్థిక వ్యవస్థ. గత ఇరవై ఏండ్లలో అపారమైన అభివద్ది సాధించిన సాఫ్ట్వేర్ రంగం ఇప్పుడు అత్యంత ఒడిదుడుకుల రంగంగా తయారైంది. అమెరికా, ఇరాన్, వెనెజులా, చైనా దేశాల మధ్య తలెత్తిన వ్యాపార అనిశ్చితి కారణంగా అభివద్ది చెందిన దేశాల అంక్షలతో చమురు ధరలు పెరిగి దేశీయ మార్కెట్లు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఇట్టాంటి ధీర్ఘకాలిక పర్యావసానాలను ఎదుర్కోవాలంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో స్థిరత్వం అత్యవసరం. దానిని సాధించాలంటే మానవ వనరులను సరైన విధంగా వినియోగంలో పెట్టడం కోసం ప్రత్యేక శాఖలను ఏర్పాటు చేసి మారిన జీవన విధానాలకు సరితూగే కొత్త ఉపాధి మార్గాలను అన్వేషించాలి. ఇంటర్నెట్ ఆగమనంతో ఎన్నో కొత్త ఉపాధులేర్పడతాయని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడున్న ప్రాధాన్యతా రంగాలలో మిగులుగా ఉన్న మానవ వనరులను సాఫ్ట్వేర్, సాంస్క తిక, టూరిజం వంటి అనేక రంగాలను విస్తరింపజేయడం ద్వారా వినియోగించవచ్చు. ఆ దిశగా దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016