Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2019-20 విద్యా సంవత్సరానికి బడి ఈడు పిల్లలను చదువు కోవడానికి సంసిద్ధం చేస్తూ, వారిని బడిలో చేర్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తూ జూన్ 4 నుంచి 12 వరకు ''ప్రొ|| జయశంకర్ బడి బాట'' కార్యక్రమం నిర్వహించాలనీ ప్రభుత్వ పాఠశాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఆవాస ప్రాంతాల్లో బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడం, నాణ్యమైన విద్య అందించడం, కమ్యూనిటీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేండ్లు నిండిన పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించడం, విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టార్ అప్లోడ్ చేయడం, క్రింది తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని పై తరగతిలో చేర్పించడం, బాలికా విద్యా ప్రాధాన్యత తెలియజేస్తూ, బాలికలు పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవడం, బడి బయట పిల్లల్ని గుర్తించి బడుల్లో చేర్పించడం విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం లాంటి లక్ష్యాలు నిర్దేశించి బడి బాట కార్యక్రమాన్ని విడుదల చేశారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రతీసారి క్రమం తప్పకుండా జరుగుతున్న ఓ తంతు ఈ బడి బాట ప్రారంభంలో స్థానిక మంత్రి లేదా స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాల లేదా డీఈఓ కార్యాలయానికి వెళ్లి జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించి ఫోటోకు ఫొజు ఇచ్చి వస్తున్న తంతూ మనం చూస్తున్నాం.
తెలంగాణ ఏర్పడిన 2014లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంత మంది అవసరమవుతారు. వాటిని ఎలా భర్తీ చేయాలి అని ప్రభుత్వం లెక్కలు ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం విద్యాశాఖలో ఉపాధ్యాయ పోస్టులు దాదాపు 24వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటిని మొత్తం భర్తీ చేసి ముందుగా విద్యాశాఖ బాగు చేసుకుందామనీ కేసీఆర్ మాట్లాడారు. కానీ 24 వేల ఖాళీలకు కేవలం 8వేల పోస్టులు మాత్రమే 2017 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 2018 ఫిబ్రవరిలో టీఆర్టీ నిర్వహించారు. ఇప్పటివరకూ నూతన ఉపాధ్యాయులకు పోస్టింగులు కేటాయించలేదు.
ఇక పాఠశాలల్లో ఏ ఒక్కటీ సమస్యల్లేకుండా లేవు. 10వేలకు పైగా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, ప్రహారీ గోడల్లేవ్. మంచి నీటి వసతి సరిగా లేదు. అదనపు గదులు లేక చెట్ల కింద చదువులు సాగిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ముగించిన తరువాత మంచినీళ్ల కోసం పాఠశాల చుట్టుప్రక్కల ఉన్న ఇండ్లకు చేతులు కడుక్కోవడానికి వెళ్తున్నారు. మంచినీళ్లు తాగితే ఎక్కడ మూత్రానికి పోవాల్సి వస్తుందోనని భయపడి అమ్మాయిలు నీళ్లు తాగడం బాగా తగ్గించారు. పాఠశాలల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు ఉన్నప్ప టికీ నీళ్ళు లేక నిరుపయోగంగా పడివున్నాయి.
పాఠ్య పుస్తకాలు, రెండు జతల బట్టలు ప్రతిసారీ విద్యార్థులకు అందజేస్తామనీ మంత్రులు హామీలు ఇస్తున్నారు. ప్రారంభంలో హడావిడిగా కొన్ని పాఠశాలలకు సరఫరా చేసి మిగతా వాటిని విద్యాసంవత్సరం ముగుస్తున్నా ఇవ్వడం లేదు. ఉపాధ్యాయులు ఇద్దరూ లేదా ముగ్గురు విద్యార్థుల కు ఒక పుస్తకాన్ని సర్దిపెట్టి చదువుకో మంటున్నారు.
పాఠశాల విద్యకు బడ్జెట్లో కేటాయింపులు ప్రతి సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నది. 2018-19 బడ్జెట్లో 10,830 కోట్లు కేటాయిస్తే 2019-20 బడ్జెట్లో 9,909 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్ కంటే ఈసారి తగ్గించింది. గతేడాది 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 5 నుంచి 6 వరకు స్టడీ అవర్స్ పెట్టింది. ఈ స్టడీ అవర్స్లో విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వడం కోసం ఉపాధ్యాయులు చందాల కోసం చుట్టుప్రక్క ఉండే ప్రయివేట్ దాతల దగ్గరికి వెళుతున్నారంటే బడ్జెట్ ఎంతుందో అర్థమవుతున్నది.
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో మళ్ళీ కళకళ లాడాలంటే పాఠశాల విద్యలో అనేక సంవత్సరాల నుంచి పాతుకు పోయిన సమస్యలు పరిష్కరించాలి. వెంటనే గత టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పోస్టింగులిచ్చి, ఖాళీల భర్తీ కోసం యుద్ధ ప్రాతి పదికన వెంటనే టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) ప్రకటించాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలి. ప్రభుత్వ పాఠశాలలపై పోయిన నమ్మకాన్ని ప్రజల్లో ప్రభుత్వం తన చర్యల ద్వారా కలిగించాలి. అలాంటప్పుడే తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే కూడా ప్రయోజకులు అవుతారన్న నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో తీసుకురావాలి.
- బోయిన్పల్లిరాము
సెల్ 9440758760