Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్థూల జాతీయోత్పత్తికి చెందిన అధికారిక డాటా ఇటీవలే విడుదలైంది. 2018-19 సంవత్సర నాల్గవ త్రైమాసికం (జనవరి-మార్చి)లో వృద్ధిరేటు అంతకు ముందు సంవత్సర(2017-18) నాలుగవ త్రైమాసికంతో పోల్చినప్పుడు 5.8శాతంగా ఉంది. గత ఐదేండ్లలో ఇదే అత్యంత కనిష్ట త్రైమాసిక వృద్ధిరేటు. అయితే భారతదేశం చైనాతో పోటీపడటాన్ని గురించి మాత్రమే మీడియా తన దృష్టిని కేంద్రీకరించింది. వాస్తవం ఏమంటే ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగావున్న భారతదేశం స్థానాన్ని చైనా ఆక్రమించింది. అయితే ఈ పనికిమాలిన చర్చ కొనసాగుతుండగా ప్రభుత్వం మరో లెక్క విడుదల చేసింది. 2018-19లో నిరుద్యోగం రేటు 6.1శాతం అని అధికారికంగా ప్రకటించింది. ఇది గత 45ఏండ్లలో అత్యంత గరిష్టం. అయితే ఈ నిరుద్యోగం రేటు గత 45ఏండ్లలో అత్యంత గరిష్టం అనే వాస్తవాన్ని నిరుద్యోగాన్ని లెక్కగట్టే విధానం మారిందనే వాదనతో ప్రభుత్వం అంగీకరించటం లేదు. అయితే నిరుద్యోగం రేటు అత్యంత ఆందోళనకరంగా ఉందన్న వాస్తవాన్ని సందేహిం చటం సాధ్యపడదు.
ఎన్ఎస్ఎస్ఓ రూపొందించిన నిరుద్యోగం డాటా కొంత కాలంగా ప్రభుత్వం వద్ద ఉంది. కానీ ఎన్నికలకు ముందు ఈ డాటాను బయటకు రాకుండా ప్రభుత్వం ఆపింది. ఈ కాలంలో నిరద్యోగం డాటా లీకైంది. అయితే అది ఎంతవరకు వాస్తవమో నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. ప్రభుత్వం నిరుద్యోగం డాటాను విడుదల చేసింది. అంతకుముందు లీకైన డాటా వాస్తవమేనని తేలింది. నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రమయిందనే విషయం అధికారికంగా నిర్ధారించబడింది.
నిరుద్యోగం రేటు చాలా ఎక్కువగా ఉండటానికి కారణం వృద్ధి మందగించటం కాదు. త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి అంచనాలు ప్రధానంగా కార్పొరేట్ డాటా ఆధారంగానే తయారవుతాయి. అయితే నిరుద్యోగం అంచనాలు కార్పొరేట్ రంగంపై ఆధారపడినవారికంటే మరింత విస్తృతంగా వివిధ వర్గాల ప్రజల, కుటుంబాల అనుభవం ఆధారంగా తయారవుతాయి. ముఖ్యంగా ఈ అంచనాలు మధ్య, చిన్నతరహా పరిశ్రమల రంగాల స్థితిగతులను ప్రతిబింబిస్తాయి. వ్యవసాయం తరువాత ఈ రంగాలలోనే అత్యధికంగా ఉపాధి కల్పన జరుగుతుంది. స్థూల జాతీయోత్పత్తి డాటాలో ప్రతిబింబించిన వృద్ధి మందగమనం కార్పొరేట్, మధ్య, చిన్న తరహా పరిశ్రమలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీని పర్యవసానంగా ఇప్పటికే తీవ్రస్థాయిలో వున్న నిరుద్యోగం రేటు రాబోయే నెలల్లో మరింతగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే భారత ఆర్థిక వ్యవస్థ స్తంభిస్తోంది.
ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచటానికి నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థలోగల ప్రభుత్వం ఆధీనంలో చాలా తక్కువ సాధనాలుంటాయి. ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రభుత్వం ఉపయోగించగలిగే సాధనం పేరు ద్రవ్య విధానం. కానీ ఇప్పటికే వడ్డీరేటు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. వడ్డీ రేటు మరింతగా తగ్గితే ప్రపంచ ద్రవ్య పెట్టుబడికి గమ్యస్థానంగా ఉండే ఆకర్షణను భారతదేశం కోల్పోతుంది. అటువంటి పరిస్థితులలో విదేశీ మారకపు చెల్లింపుల శేషంలో ఏర్పడే కరెంటు ఖాతా లోటును పూడ్చటం కష్టమౌతుంది.
'క్యాష్ రిజర్వ్ నిష్పత్తి'ని తగ్గించటంవంటి ఇతర ద్రవ్య సాధనాలను రిజర్వ్ బ్యాంక్ మానెటరీ పాలసీ కమిటీ ఎటూ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ద్రవ్యత్వం(లిక్విడిటి) కొరత వల్ల వ్యయం నియంత్రించబడుతుందనటానికి ఎటువంటి ఆధారమూ లేదు. కాబట్టి బ్యాంకులలో లిక్విడిటీని పెంచే చర్యలవల్ల ఆర్థిక వ్యవస్థ ఉత్తేజం పొందదు.
సమిష్టి డిమాండ్ను విస్తృత పరచటానికి విత్త విధానాన్ని ఉపయోగించటమే సరియైన మార్గం. అయితే నయా ఉదారవాద పాలనలో పెట్టుబడిదారులపై మరిన్ని పన్నులు విధించటమనే కార్యక్రమం ఉండదు. కార్మికులు తమ ఆదాయాలను ఎటూ ఖర్చుపెడతారు కాబట్టి వారిపై అదనంగా పన్ను విధిస్తే సమిష్టి డిమాండ్లో పెరుగుదల ఏమీవుండదు. కాబట్టి ఈ సందర్భంగా విత్త విధానాన్ని వాడటమంటే ఆచరణలో విత్త లోటును పెంచటమే అవుతుంది. అయితే ఆదాయ అసమానతలను పెంచటం తప్ప ఆర్థిక వ్యవస్థపై మరేవిధమైన దుష్ప్రభావం చూపని విత్తలోటు విస్తృతి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ఆమోదయోగ్యం కాదు. దానితో భారతదేశానికి వున్న క్రెడిట్ రేటింగ్ స్థాయి తగ్గించబడుతుంది. అప్పుడు విదేశీ మారక చెల్లింపుల శేషంలో ఏర్పడే కరెంటు ఖాతా లోటును పూడ్చ టానికి అవసరమయ్యే ద్రవ్య ప్రవాహాలు దేశంలోకి రావు.
ఈమధ్యనే నిటి అయోగ్ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాజీవ్ కుమార్ జర్నలిస్టులతో మాట్లాడినదానినిబట్టి చూస్తే ఈ పరిస్థితులలో ఆర్థిక వ్యవస్థను మోడీ ప్రభుత్వం మరింతగా ప్రయివేటీకరిస్తుంది. అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించబోతోంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించి మాంద్యాన్ని అరికట్టాలని, కరెంటుఖాతా లోటును పూడ్చాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆర్థిక వ్యవస్థ 'ఆయువు'ను విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటంగా పరిణమించే ఈ చర్యల దీర్ఘకాలిక ప్రభావాన్ని పక్కనబెట్టి చూసినా ఎంత పెట్టుబడిని ఇవి ఆకర్షిస్తాయనే విషయం పట్ల స్పష్టత లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నూతన పెట్టుబడుల స్థాయి చాలా తక్కువగా ఉంది. ఆ పెట్టుబడిలో భారతదేశం వాటా చాలా పెద్ద ఎత్తున ఉంటుందనటానికి ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు. ప్రభుత్వరంగ ఆస్తులను కొనటానికి పెట్టుబడులు రావటానికి సంబంధించి షరతులు మరింత సరళంగా ఉండేలా చేయ టానికి కొనుగోలుదారులు మరి కొంత కాలం ఆగుతారు. కాబ ట్టి మోడీ ప్రభుత్వ వ్యూహం అంతగా పనిచేయక పోవచ్చు.
కార్పొరేట్ రంగంలో చాలామంది దీనిని చక్రీయ మందగమనంగా భావిస్తున్నారు. అంటే ఇది తన గమనంలో స్వయంచాలకంగా తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుందని అర్థం. అయితే ఈ ఆశావహ దృక్పథానికి ఆధారం ఏదీ లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొనటంతో ఎగుమతులు తగ్గినందువల్ల వృద్ధి రేటు మందగించింది. సమిష్టి డిమాండ్లోని ఇతర అంశాలు మందగించటం వెనుక నిస్సందేహంగా స్వతంత్ర కారణాలు ఉన్నప్పటికీ ఎగుమతులు తగ్గటం కారణంగా దేశీయ వినిమయం, దేశంలో పెట్టే పెట్టుబడులు కూడా ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయి. అయితే ఎగుమతులు బహిర్జాత అంశం. వాటి పెరుగుదల, తరుగుదల స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటును ప్రభావితం చేస్తుంది. స్తంభించిన ప్రపంచ మార్కెట్కు ఎగుమతులను పెంచటం సాధ్యపడనందున స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి ఒక బహిర్జాత ప్రేరకం అవసరమౌతుంది. అది కేవలం వ్యవసాయ రంగం నుంచే వస్తుంది.
ఒకవేళ మోడీ ప్రభుత్వం వ్యవసాయంరంగం వృద్ధిని ప్రోత్సహిస్తే దేశీయ స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు ప్రత్యక్షంగాను, పారిశ్రామిక డిమాండ్ను ప్రేరేపించటం ద్వారా పరోక్షంగాను పెరుగుతుంది. అంతేకాకుండా ఉపాధి స్థితి గణనీయంగా మారుతుంది. వ్యవసాయోత్పత్తి పెరిగితే ఉద్యోగ కల్పన నేరుగా పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగటంవల్ల ఇతర రంగాలలో ఉత్పత్తి అయ్యే సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. దీనితో ఎక్కువగా ఉద్యోగ కల్పన చేయగల చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి మెరుగుపడుతుంది.
కాబట్టి మాంద్యాన్ని తిప్పికొట్టాలనే వ్యూహం ప్రభుత్వానికి ఉంటే అది వ్యవసాయరంగాభివృద్ధిని ప్రోత్సహించాలి. ఇది కేవలం మాంద్యాన్ని అరికట్టే వ్యూహం మాత్రమే కాదు. మోడీ అధికారంలోకి రాకముందటి 2013-14తో పోలిస్తే మోడీ పాలనలో నిజతలసరి వ్యవసాయాదాయం ఏమాత్రం పెరగలేదు. మాంద్యాన్ని నిలువరించటానికి వ్యవసాయాభి వృద్ధిని ప్రోత్సహించే వ్యూహాన్ని అమలుచేసినట్టయితే పరిస్థితి మారి ఉండేదే. కాబట్టి ఏ విధంగా ఆలోచించినా వ్యవసాయాభివృద్ధిని ప్రోత్సహించటమే నేడు సరియైన వ్యూహం. కానీ వర్తమానంలో నెలకొన్న మాంద్యాన్ని నిలువరించటానికి మోడీతో సాన్నిహిత్యం ఉన్నదని చెబుతున్న నిటి అయోగ్ కార్యనిర్వహణాధికారి ప్రకటించిన వ్యూహం నయాఉదారవాదాన్ని మరింత శక్తివంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా చెబుతోంది. నయా ఉదారవాద విధానాలను మరింత శక్తివంతంగా అమలు చేయటం వ్యవసాయాభివృద్ధిని ప్రోత్సహించటానికి అడ్డంకి కాదని, ఈ రెండింటిమధ్య ఘర్షణ ఉండదని ఎవరైనా అనుకోవచ్చు. నయా ఉదారవాదాన్ని మరింత శక్తివంతంగా అమలు చేయాలన్న మోడీనే 2022 సంవత్సరం కల్లా రైతుల ఆదాయాలు రెండింతలు చేయటం జరుగుతుందని కూడా అన్నాడు కదా? అయితే ఈ రెండు పరస్పర వ్యతిరేక వ్యూహాలు. నయా ఉదారవాద విధానాన్ని అమలుచేయటం రైతాంగ వ్యవసాయం సహా చిన్న ఉత్పత్తిని పిండుకోవటంగా ఉంటుంది. నయా ఉదారవాదాన్ని బలోపేతం చేయటమంటే వ్యవసాయ రంగంలోకి అంతర్జాతీయ అగ్రి వ్యాపార కార్పొరేట్ కంపెనీలను అనుమతించటమే. ఈ కంపెనీలు రైతాంగ వ్యవసాయాన్ని మరింతగా దిగజారుస్తాయి.
వ్యవసాయరంగంలో వృద్ధిని ప్రోత్సహించటానికి ముందుగా ఇతర విషయాలతోపాటు సబ్సిడీపై రుణ సదుపాయాన్ని అందించాలి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ధరలు రైతులకు లాభసాటిగా ఉండేలా చూడాలి. రైతుల ఉత్పత్తులకు లాభసాటి ధరలు ఉండేలా చూడటంతో పాటుగా ద్రవ్యోల్బణాన్ని పెంపొందించే అవకాశం లేకపోతే ఆహారంపై అధిక సబ్సిడీ ఇవ్వాలి. దీనితో నయా ఉదారవాద పాలకులు ఇష్టపడని విత్తలోటు పెరుగుతుంది. ఆ విధంగా ప్రాథమ్య రంగాలకు రుణ సౌకర్యాన్ని సబ్సిడీ వడ్డీరేటుకు అందించటాన్ని ప్రయివేటు బ్యాంకులు ముఖ్యంగా విదేశీ బ్యాంకులు వ్యతిరేకిస్తాయి. అందువల్ల బ్యాంకింగ్ రంగాన్ని ప్రయివేటీక రించే నయాఉదారవాద వ్యూహాన్ని వ్యవసాయానికి సబ్సిడీ రేటుపై రుణ సౌకర్యాన్ని కల్పించాలని భావించే ప్రభుత్వం విడనాడాలి. కాబట్టి వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా రైతాంగ వ్యవసాయాన్ని ప్రోత్సహించటానికి కావలసిన మౌలిక పూర్వా వసరాలు నయా ఉదారవాద పాలనలో నెరవేరవు. మోడీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా నయా ఉదారవాదాన్ని తీవ్రతరం చేస్తే వ్యవసాయాభివృద్ధి జరగదు. పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థ లో మందగమనం లేక మాంద్యం కూడా కొనసాగు తుంది.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
- ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999