Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశం అతి గొప్ప ప్రజాస్వామ్యమని గొప్పలు చెప్పుకుని దాని గొప్పదనం గూర్చి టీవీలలో, సభలలో ఉపన్యాసాలు దంచుకు నేందుకు మాత్రమే పనికి రావడం ఈ వ్యవస్థ చేసుకున్న దురదష్టం. మనదేశ ఎన్నికల క్రతువు నోటు చుట్టూ తిరగడం, రాజకీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన ధనాన్ని , పెద్ద మొత్తాలలో సంపన్నులు, కార్పొరేట్ల నుంచి ధనాన్ని స్వీకరించి దానికి బాండ్ల పధకం కింద మసి పూసి మారేడుకాయ చేయడం ఈ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిందో తెలుపకనే తెలుపుతోంది. అవినీతి మకిలంతో కొట్టుకుపోతున్న ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి సుప్రీం కోర్టు సదరు దాతలను వారు ఇచ్చిన గుప్త ధనాలను జనావళికి తెలియజేయాల్సిందేనన్న ఇటీవలి తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో భూరి విరాళాలను బాండ్ల రూపంలో చూపించుదామన్న రాజకీయ పార్టీలు, నాయకుల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. భూరి మొత్తాలలో విరాళాల సేకరణ అవినీతికి మార్గం తెరిచినట్టవుతుందన్న సంతానం కమిటీ నివేదికను, రాజ్యంగ సమీక్షా సంఘం ఇచ్చిన నివేదికను పార్టీలు, ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసి అడ్డదారులలో పెద్ద మొత్తాలలో నల్ల ధనం కుబేరుల నుంచి సొమ్ములు స్వీకరించి వాటిని తెల్లధనం చేయడానికి బాండ్ల ప్రతిపాదన బయటకు తేవడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించడం కాక మరొకటి కాదని తేటతెల్ల మవుతోంది. కార్పొరేట్ సంస్థలలో వారి నికర లాభంలో 7.5శాతం దాకా విరాళాలు ఇవ్వచ్చునన్న పరిమితిని ఎత్తివేసి, కంపెనీలు ఏ పార్టీకి విరాళం ఇచ్చింది తమ సంస్థ ఖాతాలో పేరు ప్రస్తావించక్కర్లేదన్న వెసులుబాటు చేయడం అడ్డదారులలో రాజకీయ పార్టీలు ధనం సంపాదించడానికే తప్ప మరొకటి కాదన్న కఠోర సత్యాన్ని తెలుపుతోంది. 2019లో ఎస్బీఐ జారీ చేసిన బాండ్ల విలువ 1716 కోట్లకు విస్తరించడం ఈ అక్రమ ధన విష ఊడలు ఎంతవరకు పాకిపోయాయో చెప్పకనే చెబుతోంది. నల్ల ధనాన్ని భూరి విరాళాలుగా ఇచ్చిన కార్పొరెట్ సంస్థలు నల్ల ధన కుబేరులు సదరు రాజకీయ పక్షాలను తమ గుప్పెట్లో వుంచుకొని కీలుబొమ్మల్లా ఆడించడం ఆఖరుకు రాజ్యాంగ చట్ట సవరణలు వారికి అనుకూలంగా చేయాల్సిందిగా పట్టుపడడం ఈ రాజకీయ నాయకులు ధన, పదవీ కాంక్షతో వారు చెప్పింది చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికైనా పార్టీలు, ప్రభుత్వాలు ఈ అడ్డగోలు ధన సమీకరణను ఆపి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిద్దాం.
- సి. కనకదుర్గ,
సెల్: 7674887456