Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ట్రంప్ యంత్రాంగం మేథావులకు తీవ్ర వ్యతిరేకి, చాలా వ్యతిరేకి, విశ్వవిద్యాలయాల వంటి వాటిని ఉదారవాద ప్రచార యంత్రాలుగా పిలుస్తున్నారు. కాబట్టి అది జాత్యహంకారి మాత్రమే కాదు, మేథావుల మీద దాడి వంటిది కూడా అని భావిస్తా' ఇది ఒక విద్యార్థి అభిప్రాయం. 'నావరకైతే చైనా ప్రభుత్వం నిజాయితీ కలిగినదా లేనిదా అనే గుర్తింపు ఎంతుందో తెలియదు, కానీ ట్రంప్ సర్కార్ నిజాయితీ లేనిదని మాత్రం కచ్చితంగా తెలుసు, కాబట్టి అతన్ని నేను నమ్మను, అందువలన నేను నా స్వతంత్ర పరిశోధన చేస్తాను' అనేది మరొక విద్యార్థిని చెప్పిన మాట. అమెరికా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక చర్చలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ ధోరణి గురించి ఒక కమ్యూనిస్టు వ్యతిరేక వెబ్సైట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక క్లుప్త వ్యాఖ్యానాన్ని ప్రచురించింది. ఈ కేంద్రాల ప్రమాదం గురించి ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోవటం లేదని నిష్టూరాలాడింది.
పూర్వరంగం ఏమిటంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో దాదాపు వంద చోట్ల చైనా ప్రభుత్వం లేదా సంస్థల నుంచి పొందే నిధులతో నడిచే కన్ఫ్యూసియస్ కేంద్రాలు నడుస్తున్నాయి. వాటిని మూసివేయాలని కోరుతూ 2014లో కొంతమంది ప్రొఫెసర్లు ఒక నివేదిక విడుదల చేశారు. గతేడాది సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే మాట్లాడుతూ కన్ఫ్యూసియస్ సంస్థల కార్యకలాపాల మీద దర్యాప్తు జరుపుతున్నామని, వాటిని నిఘానిమిత్తం వినియోగిస్తున్నట్టు గూఢచారులు హెచ్చరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా 13 విశ్వవిద్యాలయాల్లోని కేంద్రాల గురించి పెంటగన్ (అమెరికా రక్షణశాఖ కార్యాలయం) చేసిన పరిశోధనలో ఆందోళన వ్యక్తం చేసినట్టు వాషింగ్టన్ ఫ్రీ బీకన్ అనే పత్రం పేర్కొన్నది. ఈ అధ్యయన కేంద్రాలు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని సీఐఏ పేర్కొన్నది. అమెరికా-చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు నేపధ్యంతో పాటు విశ్వవిద్యాలయాల సంస్కరణల గురించి అధ్యయనం చేస్తున్న ఒక మితవాద బృందానికి చెందిన మీడియా డైరెక్టర్ కాబోట్ ఫిలిప్స్ ఇటీవల మేరీలాండ్ విశ్వవిద్యాలయ సందర్శన చేశారు. అక్కడ మీరు కన్ఫ్యూసియస్ కేంద్రాలను నడిపే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నా లేక కాపిటలిస్టు ట్రంప్లో ఎవరిని ఎక్కువగా నమ్ముతారు అని ప్రశ్నించగా విద్యార్థులు చెప్పిన సమాధానాలను పైన చూశారు. కనీసం ఒక విషయంలో అయినా ట్రంప్ కంటే చైనా చెప్పేదాన్నే నమ్ముతామన్నది వారి భావం అని తేలిందని, దీన్ని గమనించే అమెరికా గూఢచారశాఖ గేరు మార్చిందని సదరు వెబ్సైట్ వ్యాఖ్యాత పేర్కొన్నారు. దానిలో భాగంగానే దేవుడిని నమ్మని, అణచివేత వ్యవస్ధ కలిగిన, విఫలమైన చైనా గురించి ఆందోళన కలిగించే, తీవ్ర, కఠోర సత్యాలను జనానికి అందిస్తున్నట్టు కూడా తెలిపారు.
కన్ఫ్యూసియస్ సంస్థ పురోగామి విద్యావ్యవస్థ కారణంగా విద్యార్థులు సోషలిజం, కమ్యూనిజాల, ప్రపంచ హేతువాద భావాల ఛాంపియన్లుగా తయారవుతున్నారు. అది చివరికి అమెరికా వ్యతిరేక, సామాజిక న్యాయ పోరాట యోధులనే నూతనజాతిని తయారు చేస్తున్నది. ఈ రోజుల్లో కాలేజీ విద్యార్థులు ట్రంప్, అతని ప్రభుత్వ యంత్రాంగానికి వ్యతిరేకమైన ధోరణులకు దగ్గర అవుతున్నారు. అనేక మంది విద్యార్థులు ట్రంప్ సర్కార్ కంటే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్నే ఎక్కువగా నమ్ముతున్నారనే విస్తుగొలిపే అంశాన్ని ఎవరైనా చూడవచ్చు అని బ్లేజ్ అనే ఒక స్థానిక పత్రిక పేర్కొన్న అంశాన్ని వెబ్సైట్ విశ్లేషణ ఉటంకించింది. అనేక అంశాలపై ట్రంప్ ప్రభుత్వం, అమెరికా గూఢచార సంస్థలు చెబుతున్న దాని కంటే చైనా ప్రభుత్వం చెబుతున్నవాటికే మద్దతు పలుకుతామన్నది సాధారణంగా వెల్లడైన సమాధానం కావటంతో సదరు కాబోట్ ఫిలిప్స్ బుర్ర తిరిగి చైనాలో మానవహక్కులు లేవని, మతవిశ్వాసాల కారణంగా మిలియన్ల మందిని అణచివేస్తున్నారంటూ ఆ విద్యార్థులకు చెప్పి ఇప్పుడు చెప్పండీ..! చైనా గురించి అని అడిగాడు. వెంటనే ఒక విద్యార్థి చైనాను నమ్ముతున్నానని నేను చెప్పలేదు అనగా, మేథావులకు ట్రంప్ వ్యతిరేకం అని వ్యాఖ్యానించిన విద్యార్థిని ఒక్క క్షణం ఆలోచించి నేను కచ్చితంగా చెప్పలేను అన్నది, మరొకరు ఇది చాల కష్టమైన ప్రశ్న, దానికి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు, అది నూటికి నూరుశాతం కరెక్టని చెప్పలేను అన్నారు. చైనా భాష, సంస్కృతిని, కన్ఫ్యూసియస్ భావజాలాన్ని పెంపొందించే పేరుతో కమ్యూనిస్టు పార్టీ ప్రచార కేంద్రాలుగా వినియోగించుకుంటున్నారని కాబోట్ ఫిలిప్స్ ఆరోపించాడు. గత పన్నెండేండ్లుగా నడుస్తున్న ఈ కేంద్రాలలో మొత్తం 35వేలమంది విద్యను అభ్యసించారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో తొమ్మిది లక్షల 20వేలమంది పాల్గొన్నారని 2018లో నార్త్ కరోలినా కేంద్రం వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
అమెరికా సమాజం తమ నాయకత్వాన్ని విశ్వసించటం లేదన్నది స్పష్టం, అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, చైనా వంటి వాటి గురించి ఏకపక్ష సమాచారం మాత్రమే యువతరానికి అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా పాలకవర్గం పూనుకుంది అన్నది కూడా సుస్పష్టం. చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వ అణచివేత గురించి యువతకు వివరిస్తే వారి వైఖరి మారుతుందని ఫిలిప్స్ చెప్పటాన్ని బట్టి రానున్న రోజుల్లో మరో మారు పెద్ద ఎత్తున చైనా, కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరతీయనున్నారు.
' రెడ్ మే' పేరుతో అమెరికాలోని సియాటెల్ నగరంలో 2017 నుంచి ప్రతి ఏటా మే నెలంతా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 'పెట్టుబడిదారీ విధానం నుంచి కొన్ని రోజులు సెలవు' పేరుతో ఇవి జరుగుతున్నాయి. బహిరంగ స్థలాల్లో జరిగే ఈ కార్యక్రమాలకు ఎవరైనా హాజరుకావచ్చు. విద్యాసంస్థలు లేదా సభల్లో చెప్పేదానికి అతీతంగా ఇక్కడ అవగాహన చేసుకోవటానికి అవకాశం ఉంటుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ విద్యార్థుల పత్రిక ది డైలీ పేర్కొన్నది. అలాంటి ఒక కార్యక్రమంలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్ మాట్లాడుతూ మానవాళి విముక్తికి మార్క్సిస్టు భావజాలాన్ని వినియోగించటాన్ని పొగిడినట్టు ఆ పత్రిక పేర్కొన్నది. అలీస్ వెయిన్బౌమ్ అనే ప్రొఫెసర్ మాట్లాడుతూ 'ఇండ్లలో భోజనం చేసే సమయంలో దొర్లే మాటల్లో సోషలిజం లేదా కమ్యూనిజం అనేవి చెడ్డ పదాలు, ఇలాంటి కార్యక్రమాలలో పొల్గ్గొన్నపుడు వ్యక్తులు ప్రత్యేకించి కాలేజీ విద్యార్థులు వామపక్ష భావజాలం మీద ఉన్న నిందల గురించి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రెడ్ మే కార్యక్రమాలు ఒక రాజకీయ సిద్ధాంతం మీద ఒకే వైఖరికి కట్టుబడి ఉండటం లేదు. ప్రస్తుత మన పరిస్థితి గురించి ఎల్లలు లేని చర్చలకు అవకాశం ఇస్తున్నాయి. అనేక మంది పండితులు ఈ భావజాలాలను వర్తమాన పరిస్థితులకు వర్తింప చేస్తూ ఆలోచిస్తున్నారు. వారిలో పండితులే కాదు, కార్యకర్తలుగా పని చేసే పండితులు కూడా ఈ విద్వత్సభలో ఉన్నారు. ఈ సంస్థ పరిధిలకు మించి వారంతా పని చేస్తున్నారు, మానవాళి విముక్తికి వివిధ మార్గాలలో భాగంగా మార్క్సిస్టు భావజాలాన్ని కూడా ఒక మార్గంగా వినియోగిస్తున్నారు' అని చెప్పారు. ఆమె స్త్రీవాదం, నల్లజాతీయుల అధ్యయనం, మార్క్సిస్టు సిద్ధాంతం, అట్లాంటిక్ ప్రాంత వర్తమాన సాహిత్యం, సంస్కృతి, పునరుత్పత్తి సంస్కృతి, రాజకీయాల వంటి అంశాల మీద బోధన చేస్తున్నారు. ఆమె పుట్టుక శ్వేతజాతిలో అయినప్పటికీ జాత్యహంకార సమస్యల గురించి రచనలు చేశారు.
రెడ్ మే కార్యక్రమాలకు హాజరైన మైక్ కార్లసన్ ఇలా చెప్పాడు. 'దీనికి సంబంధించి ఒక గొప్ప విషయం ఏమంటే వామపక్ష భావజాలంలో ఒకదానికొకటి విడిగావుండే అనేక అంశాలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి భిన్నమైన ఆలోచనలను ఇక్కడ వ్యక్తీకరించవచ్చు, ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. అది తమ స్వంత విషయం కావచ్చు లేదా ఒక ప్రాజెక్టు ఏదైనా కావచ్చు అన్నాడు. 'కమ్యూనిస్టు పరిధి వెలుపల (కమింగ్ అవుట్ కమ్యూనిస్టు)' అనే అంశంమీద చర్చలో అతను పాల్గొన్నాడు. ఈ కార్యక్రమాలలో మార్క్సిస్టు సిద్ధాంతాల నుంచి కార్పొరేట్లు సోషలిజానికి ఎలా పునాది వేస్తున్నాయి అనే అంశాల వరకు అనేక చర్చలు జరుగుతాయి. తమ కార్యక్రమాలు వివిధ ఆలోచనలకు ఎదురవుతున్న సవాళ్లు, అభివృద్ధి చేయటం తప్ప హాజరైన వారి బుర్రల్లో బలవంతంగా ఎక్కించటం లేదా వున్న వాటిని తొలగించటం కాదని రెడ్మే కార్యక్రమాల ప్రారంభ నిర్వాహకులలో ఒకరైన ఫిలిప్ హౌల్స్టెట్టర్ అన్నారు. ఏడాదికి ఒక నెల పెట్టుబడిదారీ విధానం నుంచి సెలవు తీసుకుందాం, ఒక నెల పాటు కమ్యూనిస్టుగా వుందాం, భిన్నంగా ఆలోచిద్దాం, మిమ్మల్నెవరూ మార్చేందుకు ప్రయత్నించరు అన్నారు.
కమ్యూనిజం గురించి అమెరికన్లను భయపెట్టేందుకు అక్కడి పాలకవర్గం అనుసరించని తప్పుడు ఎత్తుగడలు, ప్రచారాలు లేవు. అవే ఇప్పుడు వారి నోళ్లు మూతపడేట్టు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విశ్లేషణ ప్రారంభంలోనే అమెరికా యువత ట్రంప్ ప్రభుత్వ మాటలు, చేతలను విశ్వసించటం లేదు అని చెప్పుకున్నాము, అంటే విశ్వసనీయత సమస్యను ఎదుర్కొంటున్నది. 'దశాబ్దాల తరబడి చైనా గురించి అబద్ధాలు చెప్పిన వారు మనకు ఇప్పుడు ఏదోఒకటి చెప్పాలి' అనే శీర్షికతో అమెరికాకు చెందిన అట్లాంటిక్ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ ప్రచురించింది. తియన్మెన్ స్క్వేర్ ఘటనలకు మూడు దశాబ్దాలు నిండిన సందర్భంగా దాన్ని రాశారు.
(మిగతా రేపటి సంచికలో)
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288