Authorization
Mon Jan 19, 2015 06:51 pm
(నిన్నటి సంచిక తరువాయి)
తరతరాలుగా చైనా గురించి రాజకీయ పండితులు, ఆర్థికవేత్తలు చేసిన విశ్లేషణలు, చెప్పిన జోస్యాలను చైనా ఎలా వమ్ము చేసిందో, అవెలా తప్పో, చైనా సాధించిన విజయాలను పేర్కొంటూ ఆ విశ్లేషణ సాగింది. దానిలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. కమ్యూనిజం అంటే ఎక్కడైనా ఒకటే అని అమెరికా విదేశాంగ విధానంలో పేర్కొన్నారు. ఆచరణలో వేర్వేరు అని సోవియట్, చైనాల అనుభవం తెలిపింది. నిక్సన్ చైనాతో సాధారణ సంబంధాలను నెలకొల్పుకొనే వరకు రెండు దేశాలను ఒకే శత్రుశిబిరంలో ఉంచారు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత చైనాకంటే సహజవనరులు ఎక్కువగా వున్న ఆఫ్రికన్ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అమెరికా ఆర్ధికవేత్త జోస్యం చెప్పారు. ఆ విషయంలో పప్పులో కాలేశారు. 1960లో కాంగోలో తలసరి జీడీపీ 220 డాలర్లు వుండేది, అది నైజీరియా, చైనాలకు రెట్టింపు.2017నాటికి చైనా తలసరి జీడీపీ 9000 డాలర్లకు అంటే నైజీరియా జీడీపీకి నాలుగు రెట్లు, కాంగోకు 19రెట్లు ఎక్కువ. చైనా 1978లో నవీకరణ కార్యక్రమం చేపట్టిన తరువాత మానవజాతి చరిత్రలో అత్యంత వేగమైన అభివృద్ధిని నిలకడగా సాధించటమేగాక 85కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడవేసింది.
ఆసియన్ టైగర్లని చెప్పిన జపాన్, తైవాన్, దక్షిణ కొరియా తదితర దేశాల మాదిరి అభివృద్ధి సాధించిన తరువాత మరింత ప్రజాస్వామికంగా తయారవుతుందని చెప్పారు. అది కూడా జరగలేదు.1989 నుంచి 1991 మధ్య కమ్యూనిస్టు దేశాలలో ప్రజాస్వామిక గాలి వీచింది, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. కొంతమంది అయితే చరిత్ర ముగిసింది అని చెప్పారు. (ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే సోషలిజాన్ని వదులు కోవటం, చరిత్ర ముగిసింది అంటే కమ్యూనిస్టు చరిత్ర అని అర్థం) అయితే అది తూర్పు ఐరోపాలో, ఇతర చోట్ల జరిగింది తప్ప చైనాలో కాదు. దీర్ఘకాలం అభివృద్ధితో పాటు పార్టీ అదుపు కూడా కొనసాగింది. చైనాను ప్రపంచ వాణిజ్య సంస్థలో చేర్చితే అది కూడా పశ్చిమ దేశాల పెట్టుబడిదారీ ప్రజాస్వామిక వ్యవస్థల మాదిరి తయారవుతుందనే భావన 1989 నుంచి డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాలలో ఉంది. అది కూడా జరగలేదు. చరిత్రలో అతి పెద్ద సంపద బదిలీ జరిగింది అని జాతీయ భద్రతా సంస్థ డైరెక్టర్ జనరల్ కెయిత్ అలెగ్జాండర్ 2012లోనే చెప్పారు. చైనా గురించి ఎంతోమంది ఎందుకిలా చెప్పారంటే విధాన నిర్ణేతలు, మేథావులు సాధారణ సూత్రీకరణలు చెప్పారు కానీ చైనా పురాతన కాలంలోనూ నూతన ఆవిష్కరణలు చేసింది. ఆధునిక కాలంలోనూ దారిద్య్రం నుంచి బయటపడి ఒక ఆధునిక దేశంగా మారింది. 1949 తరువాత కమ్యూనిస్టు నాయకత్వంలో ఒక గ్రామీణ దేశంగా వున్నదానిని ప్రపంచంలో అత్యంత ఆధునిక నిఘావేసే దేశాలతో సమంగా తయారైంది.
అమెరికా, చైనా నేతలకు మౌలికమైన తేడాలున్నాయి. అమెరికన్ల విషయానికి వస్తే జ్ఞాపకాలు స్వల్పకాలంలోనే అంతరిస్తాయి, కేంద్రీకరణలో నిలకడ వుండదు. ఒక సంక్షోభం నుంచి మరో సంక్షోభానికి ఎదురుచూస్తున్నట్టు ఉంటుంది. వాషింగ్టన్లో బడ్జెట్ను ఆమోదించటం, దాని మీద కేంద్రీకరించటమే ఒక వీరోచిత చర్యగా చూస్తారు. అదే చైనా విషయానికి వస్తే దీనికి భిన్నంగా జ్ఞాపకాలు దీర్ఘకాలం వుంటాయి, కేంద్రీకరణ నిరంతరం కొనసాగుతుంది. ప్రభుత్వ పథకాలు దీర్ఘకాలానికి రూపొందిస్తారు. కృత్రిమ మేథస్సు, ఇతర సాంకేతిక పరిజ్ఞానాలు చైనాలో సంవత్సరాల తరబడి పని చేస్తాయి. చైనా మిలిటరీ నవీకరణ 1990 దశకంలో ప్రారంభమైంది. ఒక విమానవాహక యుద్ధనౌకను తయారు చేయటానికి చైనాకు ఎంత కాలం పడుతుందని ఒక నౌకాదళ అధికారిని అడిగితే సమీప భవిష్యత్లో అని చెప్పారు. దాని అర్థం 2050 కొంత కాలం ముందు అని, ఆ జోస్యం కూడా తప్పింది. (1985లో ఆస్ట్రేలియా పాతబడిన ఒక యుద్ధనౌకను తుక్కు కింద మార్చేందుకు చైనాకు విక్రయించింది. అలాంటి వాటిలో అన్ని కీలక విభాగాలను పునరుద్ధరించటానికి వీల్లేని విధంగా పనికి రాకుండా చేసి ఇస్తారు. చైనా దానిని అలాగే వుంచి ఏ భాగానికి ఆ భాగాన్ని విడదీసి తన శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పరిశీలనకు అప్పగించింది. దాన్నే తన ప్రయోగాలకు వాడుకుంది. తరువాత రష్యా నుంచి మరో మూడు పాత యుద్ధనౌకలను కొనుగోలు చేసింది. వాటిని తుక్కుకింద మార్చకుండా ఒక దానిని విలాస హౌటల్గానూ, మరొక దానిని సందర్శకులకు ఇతివృత్త పార్కుగా మార్చింది. మూడోదానికి మరమ్మతులు చేసి 2012లో తన తొలి విమాన వాహక యుద్ధనౌకగా మిలిటరీకి అప్పగించింది. 2030 నాటికి అందుబాటులోకి వచ్చే దశలవారీ కనీసం అరడజను నౌకలను నిర్మిస్తోంది.) అమెరికా ప్రపంచ నాయకత్వం అనేది నడుస్తున్న చరిత్ర, అదే చైనా విషయానికి వస్తే 1840దశకం నాటి నల్లమందు యుద్ధాలకు ముందు అదొక పెద్ద శక్తి. వందేండ్ల అవమానాల తరువాత తిరిగి అది ఒక శక్తిగా తయారవుతోంది. అనేక విధాలుగా అసాధారణంగా అది పెరుగుతోంది. చైనా గురించి చేసిన సాధారణ సూత్రీకరణలు, జోస్యాల గురించి వివరించిన దాని కంటే ఎంతో అస్పష్టంగా వున్నాయి.
ఇండోచైనా, ఆగేయ ఆసియాలో వియత్నాంపై భ్రాంతి పూర్వకమైన అంచనా కారణంగా అమెరికా 58వేల మంది సైనికులను బలి ఇచ్చుకోవాల్సి వచ్చిందంటూ ఒక విశ్లేషకుడు తాజాగా రాశాడు. 1965 జూన్ 9న అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ వియత్నాం మీదకు సైన్యాన్ని పంపుతున్నట్టు ప్రకటించిన రోజును గుర్తు చేస్తూ అమెరికా నాయకత్వ అంచనాలు ఎలా తప్పాయో, దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో ఆ విశ్లేషణలో పేర్కొన్నారు. అమెరికా సైనికుల మరణాల గురించి తప్ప వారు వియత్నాంలో చేసిన దారుణాలు, మారణకాండ ప్రస్తావన లేదు. వియత్నాం మన చేతుల నుంచి పోతే కంబోడియా పోతుంది, థారులాండ్ పోతుంది, మలేసియా పోతుంది, ఇండోనేషియా పోతుంది, ఫిలిప్పీన్స్ పోతుంది అంటూ సెనెటర్ గాలే మెక్గీ చెప్పారు. ఇలాంటి భ్రాంతికి అధ్యక్షుడు ఐసెన్ హౌవర్ గురయ్యాడు. ఉత్తర వియత్నాం కమ్యూనిస్టు దేశంగా ఉన్నందున దాన్ని అరికట్టి దక్షిణ వియత్నాంను కమ్యూనిస్టు ప్రభావంలోకి పోకుండా చూడాలనే ఎత్తుగడతో ముందుకు తెచ్చిన ఉన్మాదమది. వియత్నాంను అదుపు చేయకపోతే తమ దేశాలు కూడా కమ్యూనిజంలోకి పోతాయని భయపడి వియత్నాం పై యుద్ధానికి జత కలుస్తాయని అమెరికా భావించింది. అయితే దానికి విరుద్ధంగా జరిగిందని, అమెరికా మాత్రం 58వేల మంది సైనికులను బలిపెట్టాల్సి వచ్చిందన్నది విశ్లేషకుడి సారాంశం.
ప్రపంచ పరిణామాల గురించి తమ నేతలు, విధాన నిర్ణేతలు చేసిన అనేక ఊహాగానాలు, సిద్ధాంతాలు విఫలమయ్యాయని చెప్పే వారు అమెరికాలోనే పెరగటం ఇటీవలి కాలంలో ఊపందుకుంటున్న పరిణామం. అందుకే యుద్ధాలకు పాల్పడినప్పటికీ తమ సైనికులను అక్కడికి పంపకూడదని, ఒక ప్రాణం పోయినా సమాజంలో తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని సామ్రాజ్యవాదులు భయపడుతున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా యుద్ధాలు చేయాలని చూస్తున్నారు. అమెరికా నేతల గురించి యువతలో నమ్మకం లేకపోవటం, మీడియాలో ఇలాంటి చర్చ జరగటానికి సంబంధం ఉంది. ఏది ముందు, ఏది వెనుక అనే చర్చ కంటే జరుగుతున్న పరిణామాలు పురోగామి శక్తులకు ఎంతో విశ్వాసాన్ని కలిగించేవి అనటంలో సందేహం లేదు. రానున్న రోజుల్లో ఇవి ఏ రూపం తీసుకుంటాయని జోస్యం చెప్పలేం గాని సోషలిజం, కమ్యూనిజాల మీద విశ్వాసం తగ్గుతున్న రోజుల్లో ఇవి ఆశారేఖలు అనటం నిస్సందేహం. అమెరికా విశ్వవిద్యాలయాల్లో వున్న పురోగామి, వామపక్ష ప్రభావాన్ని చూసిన కారణంగానే మన దేశంలోని కాషాయదళాలు జేఎన్యూ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటివాటి మీద తప్పుడు ప్రచారాలు చేయటంతో పాటు వామపక్ష భావజాలాన్ని అడ్డుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని గ్రహించాలి. పెట్టుబడిదారీ వ్యవస్ధ వైఫల్యం చెందుతున్న పూర్వరంగంలో అమెరికా సామ్రాజ్యవాదులకే వామపక్ష భావజాల వ్యాప్తిని అరికట్టటం సాధ్యం కాలేదు. అలాంటిది మన దేశంలో కాషాయదళాల వల్ల అవుతుందా? అమెరికాలో కమ్యూనిస్టులం అని చెప్పుకుని పని చేసే పరిస్థితుల్లేని రోజుల నుంచి అవును మేం సోషలిస్టులం, కమ్యూనిస్టులం అని చెప్పుకునే వారు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజా లోక్సభ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు తీవ్రమైన ఎదురుదెబ్బలు తగలవచ్చు. వివిధ కారణాలతో తాత్కాలికంగా కమ్యూనిస్టులకు ఓటు వేయకపోవచ్చుగానీ అమెరికా సమాజంలో మాదిరి మన దేశంలోని కష్టజీవుల్లో కమ్యూనిస్టు వ్యతిరేకత లేదు. వారి త్యాగాలను మరచిపోలేదు. జనంలో పోయిన పునాదిని తిరిగి పొందటం ఎలా అన్నదే అభ్యుదయ వాదులు, కమ్యూనిస్టుల ముందున్న సవాలు! చచ్చిన చేపలు ఏటి వాలున కొట్టుకుపోతాయి, బతికి వున్న చేపలు ఎదురీదుతాయి. కమ్యూనిస్టులూ అంతే!!
సెల్: 8331013288
ఎం. కోటేశ్వరరావు