Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్న (12.6.2019) ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'వామపక్షాల భావ దారిద్య్రం' అన్న ఎ కృష్ణారావు వ్యాసం చదివాక కొందరు మేధావులమనుకునే వారిప్పుడు ఎదుర్కొంటున్న దిశా రాహిత్యం స్పష్టంగా కనపడింది.
''ప్రపంచంలో కమ్యూనిస్టు వ్యవస్థలు పతనమైన తర్వాత పశ్చిమ నాగరికతకు, ఇస్లాంకు సమాన శత్రువు లేకుండా పోయిందని, ఆ తర్వాత నుంచి పశ్చిమ దేశాలకూ, ఇస్లామిక్ నాగరికతకూ మధ్య సంఘర్షణ మొదలైందని'' అన్న అమెరికన్ రాజకీయ అధ్యయన వేత్త శామ్యూల్ హాటింగ్టన్ను వ్యాసం మొదట్లోనే ఉల్లేఖించారు. ఇక ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలను (మత) నాగరికతల మధ్య ఘర్షణలుగా సూత్రీకరించారు. హిందూ నాగరికత (?), క్రైస్తవ నాగరికత(?) కలిసి ఇస్లామిక్ నాగరికత మీద యుద్ధం చేస్తున్నాయన్న సిద్ధాంతాన్ని (దీన్ని న్యాయంగా సిద్ధాంతం అనకూడదు. మతిలేని రాద్ధాంతం అని అనొచ్చేమో) ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా కేరళలో క్రైస్తవులు మోడీ వైపు ఎక్కువగా మొగ్గు చూపారన్న నిర్థారణకు, క్రైస్తవుడైన జగన్కు మోడీ ఆశీస్సులందించారన్న అభిప్రాయానికి ఆయన వచ్చారు.
ఇస్లామిక్ ఉగ్రవాదమే ప్రపంచానికి శత్రువు అని అమెరికా చేస్తున్న ప్రచారాన్ని, మనదేశంలో సంఘ పరివార్ శక్తులు చేస్తున్న ప్రచారాన్ని కృష్ణారావు తలకెత్తుకున్నట్టు కనపడుతోంది. ఆనాడు ఇరాక్ మీద, లెబనాన్, సిరియాల మీద దాడులు, తాజాగా ఇరాన్ మీద అమెరికా విరుచుకుపడుతుండడాన్ని కృష్ణారావు సమర్థిస్తున్నారా? సామ్రాజ్యవాదం - వందేండ్ల క్రితం బ్రిటిష్, ఫ్రెంచి, జపనీస్ సామ్రాజ్యవాదం అని, రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదం గాని - ప్రపంచాధిపత్యం కోసం అర్రులు చాస్తూనే ఉంటోంది. ఎక్కడెక్కడి సహజ వనరులనూ, మార్కెట్లనూ, ఆర్థిక వ్యవస్థలనూ తన అధీనంలోకి తెచ్చుకుని కొల్లగొట్టాలనేదే సామ్రాజ్యవాదం లక్షణం. ఇంతవరకూ అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచంలో ఏ దేశానికైనా ఏదైనా ఉపకారం చేసినట్టు ఎక్కడా ఒక్క దాఖలా కూడా లేదు. భారత - అమెరికా వ్యూహాత్మక మైత్రీ కుదరక ముందు పాకిస్థాన్లో తనకు అనుకూలంగా వ్యవహరించే సైనిక ప్రభుత్వాలనే బలపరిచింది. అఫ్ఘనిస్థాన్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద ముఠాలను, ఒసామా బిన్ లాడెన్తో సహా ప్రోత్సహించి, ఆయుధాలు, డబ్బు, మద్దతు సమకూర్చింది అమెరికా. కృష్ణారావు ప్రవచించిన ఇస్లామిక్ ఉగ్రవాదానికి సృష్టికర్త, పోషకుడు అమెరికాయే. ఇప్పుడూ ఆ ఉగ్రవాద సంస్థలకు అమెరికా అండ కొనసాగుతున్నది.
అమెరికాతో భారతదేశ ప్రభుత్వం వ్యూహాత్మక మైత్రీ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది అనకొండకు, ఆవుకు మధ్య మైత్రిలాంటిదని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీస్తుందని కమ్యూనిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా వాజ్పేయి హయాంలో వేడెక్కిన మైత్రీవాంఛ మోడీ కాలానికి ఘనీభవించింది. ఇది ఎంతదాక పోయిందో ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించినప్పుడు బయటపడింది. ఇరాన్-భారత్ ప్రజల మధ్య మైత్రి వేల సంవత్సరాల నాటిది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు పుట్టకమునుపే ఉంది. దానిని మోడీ అమెరికా ఆదేశాల మేరకు కాలదన్నాడు. ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు నిలిపేశాడు. ట్రంప్ కన్నెర్ర చేయగానే మోడీ జీహుజూర్..! అని తన లొంగుబాటును ప్రదర్శించాడు. మన భారత దేశ స్వతంత్రతను దెబ్బతీశాడు. దాదాపు లక్ష కోట్ల రక్షణ పరికరాలను ఏటా మన దేశం అమెరికా నుండి కొంటున్నది. వ్యూహాత్మక మైత్రి అమెరికాకు లాభం. కానీ ఇండియాపై మాత్రం అమెరికా రోజుకో ఆంక్ష విధిస్తున్నది. దాని ముందు 56 అంగుళాల ఛాతి గల ప్రధాని జావగారిపోతున్నారు. ఇది(కృష్ణారావు) క్రైస్తవ- హిందూ నాగరికతల జాయింట్ యాక్షన్ పర్యవసానం! సామాన్య ప్రజలకు ఇది అర్థమయ్యేలా చెప్పడంలో కమ్యూనిస్టులు వైఫల్యం చెంది ఉండవచ్చు. కానీ కృష్ణారావు వంటి మేధావులైన వారికి కూడా (మాబోటి భావ దారిద్య్రం గలవారు) చెప్పవలసిన అవసరం ఉందా? కళ్లెదురుగా దేశానికి ఇంత అన్యాయం జరుగుతున్నా దానిని ఏదో రకంగా సమర్థించే వాదనలు చేయడమేనా మేధోశక్తి సంపన్నుల పని?
మత ప్రాతిపదికన నాగరికతలను నిర్వచించడం ఏ విధంగా సమర్థనీయం? ఒక్కో కాలంలో ఒక్కొక్క ప్రదేశంలో నిర్దిష్టమైన నాగరికతను అక్కడి ప్రజలు రూపొందించు కుంటారు. క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ్దం ప్రపంచంలో పలు దేశాలకు విస్తరించిన మతాలు. మతం పేరు చెప్పుకుని ఆయా దేశాల పాలకులు ప్రజలను ఉసిగొల్పి సాగించిన యుద్ధాలు చరిత్రలో ఉన్నాయి. కానీ మత నాగరికత(?)ల మధ్య యుద్ధాలు ఎప్పుడూ జరగలేదు. ఇప్పటివరకూ జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు పెట్టుబడిదారీ దేశాలు తమ మధ్య మార్కెట్ల పునర్విభజన సామరస్యంగా చేసుకోలేక ఆధిపత్యం కోసం సాగించినవే. కోట్లాది మంది సామాన్యులను బలితీసుకున్న యుద్ధాలు అవి. ఇటీవల సిరియాలో జరిగిన యుద్ధంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన 2,75,000మంది పౌరులు ముస్లింలే కదా? ఉగ్రవాదానికి రక్తదాహమే తప్ప మతం ఉండదు. అది హిందూ, ముస్లిం, క్రైస్తవ- ఏ మతపు ముసుగు వేసుకున్నా సరే, ఉగ్రవాదం మతం కాదు, కాజాలదు.
భారతదేశ నాగరికత ఏమిటి! కృష్ణారావు నిర్వచనం ప్రకారం ఇది హిందూ నాగరికత! ఆయన కలం నుంచి ఆరెస్సెస్ సిద్ధాంతం పొంగి ప్రవహించింది! ఇదే విషాదం. మన దేశంలో బౌద్ధ్దం, జైనం, సిక్కు, శైవం, వైష్ణవం, శాక్తేయం, సూఫీ, దిన్-ఎ-ఇలాహి, బహాయి-ఇలా పలు మతాలు పుట్టాయి, విస్తరించాయి. వీటికి తోడు ప్రజలు ఇస్లాం మతాన్ని, క్రైస్తవ మతాన్నీ వెయ్యి సంవత్సరాల కంటే మునుపే స్వీకరించారు. ఇన్ని మతాలకు తోడు అదనంగా చార్వాకం, లోకాయతం వంటి నాస్తిక దర్శనాలూ ఉన్నాయి. ఇంత బహుముఖమైన విశ్వాసాలూ, సిద్ధాంతాలూ, వైవిధ్యమూ ఉన్న మన దేశ బహుళ వ్యవస్థను ''హిందూ'' మత నాగరికత అని వాస్తవ విరుద్ధ్దంగా చిత్రీకరించడం ఈ దేశానికీ, ఇక్కడి సమ్మిశ్రిత నాగరికతకూ ద్రోహం చేయడమే.
మొత్తం మీద మోడీ గెలుపును, హిందూత్వ సిద్ధాంతాన్ని, మన దేశానికి ప్రాణాంతకమైన అమెరికా- భారత్ వ్యూహాత్మక మైత్రిని కృష్ణారావు మేథోవంతంగా(?) శామ్యూల్ హాంటింగ్టన్ పేరు చెప్పి సమర్థించేశారు. మరి వామపక్షాల భావ దారిద్య్రం గురించి ఎందుకు రాశారు? మోడీ 'హిందూత్వ' ప్రాజెక్టును గాని, అమెరికాతో వ్యూహాత్మక మైత్రిని గాని ఎదిరించి, ప్రాణాలను బలిపెట్టి మరి పోరాడినదీ, పోరాడుతున్నదీ వామపక్షాలే కదా! కాంగ్రెస్ గాని, ప్రాంతీయ పార్టీలు కాని ఈ అంశాలపై ఏనాడూ నోరుమెదపవు. కనుక నిజమైన సవాలు వామపక్షాల నుంచే. ఈ సవాలు ఎన్నికలలో కనపడకపోవచ్చు. కాని ప్రజా ఉద్యమాల రూపంలో నిత్యం కనబడుతూనే వుంటుంది. అందుకే వామపక్షాలపై ఈ ప్రేమ(!)
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఇటీవల ఖరారు చేసిన నివేదికలో ధైర్యంగా, బహిరంగంగా చేసుకున్న ఆత్మవిమర్శలోని అంశాలనే కృష్ణారావు వీలైన, అవసరమైన మేరకు వక్రీకరించి రాశారు. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశాన్ని గట్టిగా సమర్థించి నిలబడినందువలన హిందువులు దూరమైనారన్న నిర్థారణకు సీపీఐ(ఎం) రాలేదు. అది కృష్ణారావు స్వంత కవిత్వం. ఓట్లు వచ్చినా, రాకపోయినా, కమ్యూనిస్టులకు మతం మీద విశ్వాసం ఉన్నా లేకపోయినా, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం, భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన సమాన హక్కు కోసం సీపీఐ(ఎం), వామ పక్షాలు దృఢంగా నిలబడ్డాయి. రాజ్యాంగాన్ని, సుప్రీం తీర్పును, మహిళల హక్కులను అపహాస్యం చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ శబరిమల విషయంలో అవకాశవాదంగా వ్యవహరించాయి. కాని సీపీఐ(ఎం) సూత్రబద్ధ్ద వైఖరి కృష్ణారావుకి విడ్డూరంగా కనపడింది! ఏమిటీి విడ్డూరం!
హంతకులకు, పన్ను ఎగవేతదార్లకు, నేరగాళ్లకు, ఉగ్రవాదులకు పార్టీ టిక్కెట్లిచ్చి గెలిపించుకున్న బీజేపీని శ్లాఘిస్తున్న కృష్ణారావుకి కమ్యూనిస్టుల 'క్రమశిక్షణా రాహిత్యం' పెద్ద సమస్యగా కనపడడం విడ్డూరం గాక ఇంకేమిటి?
మార్క్స్ సమకాలీకుడు ప్రౌధన్ మార్క్సిజాన్ని విమర్శిస్తూ, ఇది 'దరిద్రపు సిద్ధాంతం' (ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ) అన్న పుస్తకం రాశారు. దానికి మార్క్స్ సమాధానంగా సిద్ధాంతపు దరిద్రం (పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ) అన్న పుస్తకం రాశాడు. కృష్ణారావు గారు వామపక్షాల భావదారిద్య్రం గురించి అనవసరంగా బాధపడనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నలువైపులా తీవ్రమైన సంక్షోభం ఆవరించడంతో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థే దిక్కుతోచని స్థితిలో పడింది. దీని నుంచి బైటపడటం ఎలాగో దారి చూపే మేధావి ఒక్కడూ వారికి కానరావడం లేదు. భావ దారిద్య్రం పెట్టుబడిదారీ మేధావులను భూతంలా వెన్నాడుతున్నది.
నేటి సమాజంలో మతంలో మానవత్వం ఉందని నమ్మేవారు అత్యధికులు. వారు సైతం ఈ పెట్టుబడిదారీ దోపిడీ ఎంత అమానుషంగా పేదరికాన్ని పెంచుతోందో, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందో, తమ దోపిడీకి దాడులకు 'మతం' ముసుగును ఏ విధంగా వాడుతున్నదో చూస్తూ విస్తుబోతున్నారు. వాటికన్ సిటీిలో పోప్తో బాటు మరికొందరు ఈ సంక్షోభ పరిష్కారం గురించి మార్క్స్ ఏం చెప్పాడోనని ఆసక్తిగా 'పెట్టుబడి' గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది కేంద్రాలలో కార్ల్మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలు జరిగాయి. కొన్ని కోట్ల మంది ప్రజానీకం మార్క్సిజం ప్రపంచ గతిని మార్చగలిగే దిశా నిర్దేశం చేయగల సిద్ధాంతం అని గుర్తిస్తున్నారు.
కమ్యూనిస్టులు ఈ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. ప్రాణాలర్పించారు. ఆరెస్సెస్ జాతీయోద్యమానికే దూరం. బీజేపీ తొలి ప్రధాని ఏకంగా బ్రిటిష్ వారికి క్షమాపణ పత్రం రాసిచ్చాడు. సావర్కర్ కూడా జైలు నుంచి క్షమాపణ లేఖ పంపాడు.
దేశ సమైక్యతకు, ఖలిస్తాన్ ఉగ్రవాదం నుంచి సవాలు ఎదురైతే దానిని ఎదిరించి 300మంది కమ్యూనిస్టులు బలిదానం చేశారు. గూర్ఖాల్యాండ్ విచ్ఛిన్న ఉద్యమాన్ని నిలువరించడానికి కమ్యూనిస్టులే 200మంది ప్రాణాలు బలిపెట్టారు. ఇక్కడ ఖలిస్తాన్ వాదులతోను, అక్కడ గూర్ఖాల్యాండ్ వాదులతోను చెయ్యి కలిపింది ఆరెస్సెస్.
కమ్యూనిస్టులకు చేతకానివి చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సినవీ చాలా ఉన్నాయి. ప్రజలను ఎందుకు ప్రభావితం చేయవలసినంతగా చేయలేకపోతున్నాయో నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోడానికి కమ్యూనిస్టులు సిద్ధంగానే ఉన్నారు. కాని చరిత్రను వక్రీకరించడం, ప్రజలమధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, బూటకపు దేశభక్తి నినాదాలతో జనాల్ని మోసగిస్తూనే మరోవైపు మైనారిటీలను, దళితులను, మహిళలను చిన్నచూపు చూసి, అభద్రత వైపు నెట్టడం, కార్పొరేట్లకు, అమెరికాకు ఊడిగం చేస్తూ దేశ స్వాతంత్య్రాన్ని తాకట్టు పెట్టడం, ఇవేవీ కమ్యూనిస్టులకు చేతకావు. అవి చేతకావని కమ్యూనిస్టులు గర్వంగా చెప్పగలరు. కుహనా దేశభక్తి ముసుగులో తమ విద్వేషపూరిత, తిరోగమన విధానాలను అమలు చేస్తున్న సంఘపరివార్ శక్తులు ప్రజలను తాత్కాలికంగా వంచించి ఎన్నికలలో విజయాలు సాధించవచ్చు. కాని ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవ డానికి, ఈ ప్రజా వ్యతిరేక శక్తులకు బుద్ధి చెప్పడానికి ఎంతో కాలం పట్టదు. ఏ ఎండకా గొడుగు పట్టే మేధావులు తమ దిశారాహిత్యాన్ని ఇప్పటికైనా గ్రహించడం మంచిది.
- ఎం.వి.ఎస్. శర్మ